పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కడివెడు నీళ్ళను బట్టుకొని నడికప్పలమీఁదికెక్కి తమయిల్లంటుకొను వఱలును నుండి నీళ్లకుండ నఖ్కడనే దిగవిడిచి రోదనముచేయుచు దిగుచుండిరి. మఱికొందరు తమ యిండ్లలోని సామానులు కాలిపోవునను భయముచేత వెలుపలికిఁ దెచ్చి వీధిలోఁ బెట్టుచుండిరి. వారొక వస్తువును దెచ్చి రెండవ వస్తువు కొరకు వెళ్ళునప్పటికి పరోపకారపారీణులయిన మహాత్ములు కొందఱు చూచువారు లేక వీధిలో పడియున్న వస్తువులను దీసి తమయింట జాగ్రత్త చేసికొనుచుండిరి.

ఇట్లు కుమ్మరపేట పరసురామప్రీతి యగుచుండఁ సత్రపు బ్రాహ్మణుఁడు సుబ్రహ్మణ్యమును దూరముగా నున్న యొక చెట్టు నీడకుఁదీసికొని వచ్చి యిండ్లు కాలుటనుగుఱించి ప్రసంగింప నారంభించెను.

సత్ర - ఈ ప్రకారముగా రెండు జాములవేళ ఇండ్లెందుకు కాలినవో కారణము మీకుఁదెలిసినదా?


సుబ్ర - కమ్మరావములు కాల్చునప్పుడు ప్రమాదవశమున నిప్పంటుకొని తాటాకులయిండ్లు గనుక కాలియుండవచ్చును. లేదా యెవ్వరయినను పోట్లాడి యిండ్లకు నిప్పు పెట్టియుందురు.
సత్ర-మీరు చెప్పిన రెండుకారణములను సరియయినవి కావు. ఈ గ్రామమున కేదో క్రొత్తగా నొక గ్రహము వచ్చి యీ ప్రకారము గా తగుల బెట్టునదికాని వేఱుకాదు.

సుబ్ర - నీవు నాతోనే యిప్పుడిక్కడకు వచ్చితివిగదా? ఎవ్వరిని అడిగి తెలుసుకోకుండ గ్రహమే యిండ్లు తగులబెట్టినదని నీవెట్లు రూఢిగా జెప్పఁగలవు?

సత్ర - మా గ్రామము సంగతి నాకుఁ దెలియదా? ఈ గ్రామమేటేట వేసవికాలములో నాలుగుసారులు తగులుపడును. ప్రతి పర్యా