Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఎనిమిదవ ప్రకరణము

అక్కడ దొంగలభయము బహువిస్తారము. మీ రేలాగుననయిన శ్రమచేసి చీఁకటిపడకముందే పెద్దాపురము చేరి యొకనాఁడక్కడనుండుడు. నేను మిక్కిలిడస్సియున్నాను గనుక మీతో నిప్పుడురాలేను. రేపటి దినమువచ్చి మిమ్ము గలిసికొనెదను.

అని రాజశేఖరుఁడుగారికి నమస్కారము చేసి, అందఱివద్దను సెలవుపుచ్చుకొని త్రోవలో భధ్రమని పలుమాఱుచెప్పి, రామరాజు తనదారినపోయెను. వంటలైన తరువాత భోజనములు చేసి వారందఱును బయలుదేరి యెండలో దేహములనిండను జెమ్మటపట్ట, అడుగడుగునకు ముంతెడునీళ్ళు త్రాగుచు నడుమ నడుమ వృక్షచ్చాయలను నిలుచుచు అడుగొకయానడగా నడచినాలుగు గడియల ప్రొద్దువేళ నల్లచెరువు చేరిరి. ఆచెరువుగట్టునకు క్రిందగానున్న యొక జువ్విచెట్టుమొదలనుతాటాకుపందిరిలో దేహమునిండ విభూతి పూసికొని కంఠమునను, చేతులను, శిరస్సునను రుద్రాక్షమాలలను ధరించుకొనిగూ రుచుండి వారిని చేసైగచేసి పిలిచి, దగ్గఱనున్న చాపమీఁద గూరుచుండనియోగించి యొక యోగి కుడి చేతిలోని తులసిపూసల తావళమును ద్రిప్పుచు నోటిలో నేనేమో జపించుకొనుచు నడుమనడుమనొక్కొక్కప్రశ్నవేయ నారంభించెను.

యోగి- మార్గస్తులారా! మీరు మిక్కిలి యెండబడి మార్గయానముచే బడలియున్నారు. కొంచెముసేపిక్కడ విశ్రమించి పొండి.సకుటంబముగా బయలుదేఱినట్లున్నది.మీరెక్కడకుఁబోయెదరు?

యోగి- అట్టి దూరదేశయాత్ర ధనవంతులకు కాని లభింపదు.త్రోవపొడుగునను సత్రములులేవు.మీరేమైన ధనమును సేకరించుకొని మఱి బయలుదేఱినారు కారా?