పురందరుండు వత్సాధీశునకు భావిశుభం బెఱింగించుట
మ. క్షితినాథోత్తమ చెప్పెదన్ వినుము సాకేతప్రభుండైన యా
కృతవర్ముం డను రాజుపుత్త్రి విలసద్రేఖాకలాపన్ మృగా
వతియన్ కన్యకఁ జెప్పనొప్పు దరుణీవర్యాలలామంబుతోఁ[1]
బ్రతిసేయన్ మఱి లేరు ముజ్జగములన్ రాజీవప్రత్యేక్షణల్. 153
ఉ. మోహరసాబ్ధికిం దరఁగ మోహనబాణుని యాజికేలి స
న్నాహము యౌవనోద్గమధనంబునకున్ నిధి లోకలోచనో
త్సాహనవాంకురంబునకు శంబరపూరము బంధురాగసం
దోహమహామహంబునకు దోహల మయ్యెలనాగ చూడఁగన్. 154
క. భూమి నలంబుస యను సుర
భామిని యుదయించి మనుజభామిని యగుచున్
భూమీశతిలక నీ కా
కామిని యికమీఁద భార్య గాఁగలదు సుమీ. 155
వ. ఆవృత్తాంతం బాకర్ణింపుము. 156
సీ. ఒక్కనాఁ డక్కరభోరువు పరమేష్ఠి
యోలగంబున కేఁగియున్న తఱిని
వాయువశంబున వనితాలలామకు
నూరుమూలము దాఁక చీర తొలఁగ
నచ్చట నున్నవా రందఱు వదనముల్
వాంచి నిల్చిరి ప్రత్యవాయభీతి
వారిలో నొక్కఁడు వసువు విధూముఁ డన్
వాఁ డింతిఁ జెఱవెట్టు వాంఛఁ జూచెఁ
- ↑ దరుణీవత్వాలలమంబుతో; దరుణిన్ వామాలలామంబుతో