పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభిప్రాయము

[ప్రఖ్యాత చరిత్రవేత్తలగు మహోపాధ్యాయ, కళాప్రపూర్ణ, స్వర్గీయ, చిలుకూరి నారాయణరావుపంతులుగారు, యం.ఏ., పి.హెచ్.డి., యల్.టి. అనంతపురం, గారిచే ది 14-10-50 న ఆర్యవిజ్ఞానగ్రంథములమీద చేయబడినసమీక్ష.]

ఇంతవరకును భారతదేశ చరిత్ర నిర్మాణము పాశ్చాత్యుల వ్రాతల కనుకరణముగా మాత్రముండి అదియే మన విద్యాలయములలో విద్యార్థులకు బోధింపబదుచుండుట చేతను, చరిత్రను బోధించు ఉపాధ్యాయులు చరిత్రను గ్రుడ్డిపాఠముగా బోధించుచుండుట చేతను, తాము బోధించు విషయములనుగూర్చి తగిన విమర్శ లేక గతానుగతికముగా చరిత్ర విద్యాబోధ సాగుచుండుట చేతను సత్యమైన దేశచరిత్ర మనకింకను లభింపలేదు. ఇంగ్లీషు డిగ్రీలను సంపాదించిన విద్యాధికులు తగిన పరిశీలన లేక వ్రాసిన పాఠ్యచరిత్ర గ్రంథములే ఉపాధ్యాయులకాశ్రయము లగుచున్నవి. భారతదేశ చరిత్రనుగూర్చిన పరిశోధనలలో విద్యాధికులైనవారు వ్రాసిన వ్రాతలలో పరస్పరపొందిక కానవచ్చుట లేదు. ఇది యిట్లుండగా చరిత్ర నిర్మాణమునకు వలయు మూలగ్రంథములు, శాసనాదికములుగాక అనాదిగా సంప్రదాయసిద్ధముగా వచ్చుచున్న పురాణములమీది దృష్టిని పాశ్చాత్యులు గర్హించి యుండుటచే వానిపై మనవారికిని ప్రమాణదృష్టి తప్పినది. అయినను ప్రాచీన గ్రంథముల నామూలాగ్రముగా పరిశోధించి అందలి సత్యములకును యితరాధారములకును సమన్వయమును కల్పించి సిద్ధాంతముల నేర్పరుపగల ధీశాలులు ఆంగ్ల విద్యాధికులు కానివారు దేశమున లేకపోలేదు. అట్టి వారిలో ఆంధ్రులలో అగ్రస్థానమును వహింపగలవారు బెజవాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కోట వెంకటాచలం పంతులుగారు. వీరితో నాకు మూడేండ్ల నుండియు దగ్గర పరిచయమేగాక స్నేహముకూడ నేర్పడినది. భారతీయ విజ్ఞానము, భారతీయులచరిత్ర, భారతీయుల సాంప్రదాయములనుగురించిన సత్యములను లోకమున కెరుకచేయ వీరు చేయుచున్న కృషి అపారము, అగాధమునైనది. పౌరాణిక విజ్ఞానమునంతటిని అవలోడనముచేసి మనకు పాఠకులకు సులభముగా అవగాహన మగునట్లు శ్రీ వెంకటాచలంగారు వ్రాసిన 'కలిశకవి జ్ఞానము' మూడుభాగములు 'ఆంధ్రు లెవరు?' 'ఆర్యుల ధ్రువనివాసఖండనము' 'మానవసృష్టి విజ్ఞానము' మొదలయిన