పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్వేతపత్రాల విడుదల:

10. గత దశాబ్ద కాలంగా ఆర్థికపరంగానూ, అవకాశాల్లోనూ రాష్ట్రానికి సంభవించిన నష్టాన్ని ప్రజలు అవగాహన చేసుకోవడానికి వీలుగా ముఖ్య రంగాలకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, సాగునీరు, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి, ఆర్థిక వనరుల సమీకరణ మరియు నిర్వహణ, నైపుణ్యాభివృద్ధులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని, రాష్ట్ర విభజన ప్రభావాన్ని సామాజిక, ఆర్థిక సూచికల ప్రకారం ఈ శ్వేతపత్రాలు నిశితంగా పరిశీలించి వివరించాయి.

ప్రాధాన్యతల నిర్ధారణ:

11. ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నందున ప్రధానంగా ఐదు అంశాలకు సంబంధించి ప్రభుత్వం ముఖ్య ప్రకటనలు చేసింది. అవి రైతులకు ఋణభారం నుండి ఉపశమనం, డ్వాక్రా మహిళాసంఘాలను బలోపేతం చేయడం, పింఛను మొత్తాల పెంపుదల, ప్రయివేటు రంగం నెరవేర్చవలసిన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 2 రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా, గ్రామాలలో బెల్టుషాపుల మూసివేత మరియు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంపుదల. ఒక సమగ్ర అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయాలు కూడా అమలు జరుపబడుతున్నాయి.

12. అర్హతగల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్‌మెంటు సదుపాయాలు కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

5