పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140. పోలవరం, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి పథకాలు కాకుండా 39 పథకాలు పూర్తికావలసి ఉన్నాయి. ఇందులో 11 పథకాలు నిర్మాణ చివరిదశలో ఉన్నాయి. ఇవి 2014-15 లో పూర్తికానున్నాయి. వీటి ద్వారా 2,03,628 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానున్నది. మరియు 35,990 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది.

141. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తించి భారతప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఒక జాతీయస్థాయి ప్రాజెక్టుగా ప్రకటించింది. అంతేకాక, సాగునీటిప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు అభివృద్ధి, నియంత్రణ మొత్తం కేంద్రప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటుందని ప్రకటించింది.

142. భారీ, మధ్యతరహా నీటిపారుదల రంగాలకు ఆవల ముఖ్యంగా దుర్భిక్షపీడిత ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధిలోనూ, జీవనోపాధులకల్పనలోనూ చిన్నతరహా నీటిపారుదల ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద కొత్త నీటివనరులు కల్పించడం, మరియు చెఱువులు, కుంటల పునరుద్ధరణ చేపట్టడం జరుగుతున్నది. మైక్రో ఇరిగేషన్ ద్వారా అవసరమైన చోట పొలాలకు నీరందించడం మాలక్ష్యం.

143. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలపమెంట్ కార్పొరేషన్ 1,151 పథకాల కింద 7 లక్షల ఎకరాల ఆయకట్టును పరిరక్షిస్తున్నది. నాబార్డ్, ఎ.ఐ.బి.పి.మరియు రాష్ట్ర ప్రణాళికా నిధుల కింద రూ. 581 కోట్ల అంచనా వ్యయంతో 1.45 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పన కోసం 89 పథకాలు నిర్మాణంలో ఉన్నాయి. 14,800 ఎకరాల ఆయకట్టు కోసం 16 కొత్త పథకాలు మంజూరు కాబడ్డాయి.

44