పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106. 18.8 శాతం మాత్రమే గల జాతీయ సగటు గ్రాస్ ఎన్‌రోలమెంట్ నిష్పత్తి కన్నా రాష్ట్రం ఎక్కువ నిష్పత్తిని అనగా 21.6 శాతం నిష్పత్తిని నమోదుచేసింది. 13వ పంచవర్ష ప్రణాళిక అంతానికి దీనిని 32శాతానికి పెంచాలని భారతప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతర శిక్షాఅభియాన్ (రూసా) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళిక మొదలుకొని రూ. 22,855 కోట్ల ప్రణాళికా కేటాయింపులున్నాయి. ఇందులో భాగంగా 12వ పంచవర్ష ప్రణాళికా కాలానికి రూ.1600 కోట్ల మేరకు ఆర్థికసహాయానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తున్నది.

107. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇంగ్లీషు బోధనలో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యునికేషన్ స్కిల్స్ ను బోధించడం కూడా మొదలుపెట్టింది. రూసా పథకంలో భాగంగా రాష్ట్రంలో 2014-15 లో రూ. 12 కోట్ల అంచనా వ్యయంతో 4 మోడల్ డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం నెలకొల్పనుంది. రూ. 88.80 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రంలో 11 విద్యా సంస్థల్లో గుణాత్మక సాంకేతిక విద్యాభివృద్ధి కార్యక్రమాన్ని (టిఇక్యూఐపి-II) ప్రభుత్వం అమలుచేస్తున్నది. చిత్తూరు జిల్లాలో ఐఐఐటి ని మంజూరు చేయటమే కాక, పిపిపి పద్ధతి ద్వారా కాకినాడలో మరొక ఐఐఐటి ని నెలకొల్పడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

108. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం 2014 లో 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా భారతప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో ఎన్నో జాతీయస్థాయి సంస్థలు నెలకొల్పబడనున్నాయి.

35