పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి
బడ్జెట్ సమర్పిస్తున్న సందర్భంగా 20 ఆగష్టు, 2014 న గౌరవనీయ ఆర్థికశాఖామాత్యులు
శ్రీ యనమల రామకృష్ణుడుగారి ప్రసంగ పాఠం

గౌరవనీయులైన అధ్యక్షా! మరియు సభ్యులారా !

తమ అనుమతితో 2014-15 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించనున్నాను.

నా బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించేముందు మహాత్మాగాంధీ కలలు గన్న ఆదర్శసమాజాన్ని ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆయన దృష్టిలో ఆదర్శసమాజమనేది కులరహిత, వర్గరహిత సమాజం. అక్కడ సమాంతర విభేదాలే తప్ప నిచ్చెన మెట్ల విభేదాలుండవు. ఎక్కువ తక్కువ వ్యత్యాసాలుండవు. 2014-15 సంవత్సరానికి నేను సమర్పిస్తున్న బడ్జెట్ అటువంటి న్యాయబద్ధ మానవీయ గతిశీల సమాజాన్ని సాధించే దిశగా వేస్తున్న ముందడుగుగా విన్నవించుకుంటున్నాను.

2. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది తొలి బడ్జెట్. దాదాపు పదేళ్ల కాల వ్యవధి తర్వాత మరలా బడ్జెట్ ను సమర్పించే అవకాశం నాకు లభించింది. ఈ మధ్యకాలమంతా పాలనావ్యవస్థ కుంటుబడడం, స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం, అభివృద్ధి గురించిన ప్రణాళికలు లేకపోవడం, అవినీతి ప్రబలడం గౌరవ సభ్యులకు తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా నిరంతర ఆందోళనతో, సమ్మెలతో పౌరజీవనం అతలాకుతలమైనది. తర్వాత రాష్ట్రం విభజించబడ్డ తీరుతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారయ్యింది.