పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76. ఆర్థిక మరియు ప్రాంతీయ అభివృద్ధి ప్రయత్నాలకు వ్యూహాత్మక దృష్టిని తీసుకురావడానికి 'కాన్సెప్ట్' సిటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ 'కాన్సెప్ట్' సిటీలు ప్రభుత్వ తోడ్పాటుతో, ప్రైవేటు రంగం నేతృత్వంలో ఆర్థికాభివృద్ధికే ఒక ప్రత్యేకమైన మరియు సమగ్రమైన నమూనాలు అవుతాయని చెప్పవచ్చు. మొదటి దశలో ఒక్కొక్క కాన్సెప్ట్ నగరానికి 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం చొప్పున, మూడు కాన్సెప్ట్ నగరాలుగా అనంతపురం, తిరుపతి మరియు విశాఖపట్నంలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

77. 2021-22 సం॥లో పారిశ్రామిక మరియు మౌళిక సదుపాయాల అభివృద్ధికి 3,673 కోట్ల 34 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది 9వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'స్థితిస్థాపక మౌళిక సదుపాయాలను నిర్మించడం, సమగ్ర మరియు స్థిరమైన పారిశ్రామికీకరణ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం' లను సాధించడానికి సహాయపడుతుంది.

రవాణా మరియు రహదారి మౌళిక సదుపాయాలు

78. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD), పునరావాస మరియు పునర్నిర్మాణ ప్రణాళిక (R.R.PLAN), వామపక్ష ప్రభావిత ప్రాంతాలలో రహదారి అనుసంధాన ప్రాజెక్టులు (R.C.P.L.W.E), విదేశీ ఋణ సహాయ (E. A.P.) ప్రాజెక్టుల క్రింద గ్రామీణ రహదారులను బలోపేతం చేయడం, బి.టి. యేతర రహదారులను బి.టి. ప్రమాణాలకు తగ్గట్టుగా మెరుగుపరచడం, మండల ప్రధాన కార్యాలయాలను అనుసంధానించే సింగిల్ లేన్ రహదారులను డబుల్ లేన్ రహదారులగా వెడల్పు చేయడం మరియు వంతెనల నిర్మాణం వంటి పనులను ప్రభుత్వం చేపట్టింది. 'న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్' రుణ సహాయం ద్వారా 6,400 కోట్ల రూపాయలతో మా ప్రభుత్వం రెండు ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. 2021-22 సం॥లో రవాణా, రోడ్లు, భవనాల శాఖకు 7,594 కోట్ల 6 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడమైనది.

37