పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15. అధ్యక్షా! ఈ సందర్భంగా నేను అసలు మూలధన వ్యయం అనే భావనపై మళ్ళీ ఆలోచించవలసిన అవసరం ఉందని గౌరవ సభకు తెలియచేస్తున్నాను. మన రాష్ట్ర ప్రజలు వారి జీవన అవకాశాలను మెరుగు పరచటం కోసం వారిపైన వినియోగించే ప్రతి ఒక్క పైసా కూడా మానవ వనరుల పెంపుదలను ఉద్దేశించి పెడుతున్న పెట్టుబడే అని విన్నవించు కుంటున్నాను. ఈ వార్షిక బడ్జెటు ప్రధాన విషయం మరియు మన మేనిఫెస్టో తాలూకు సారాంశం ఇదే. ఇందువలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలోనూ మరియు వారి ముందు చూపులోనూ నమ్మకం కనబరుస్తున్నారు. కాబట్టి మనం మానవ వనరుల అభివృద్ధి ప్రాధాన్యతలను ‘అమ్మఒడి', 'జగనన్న విద్యాదీవెన', 'జగనన్న వసతిదీవెన’ పథకాల ద్వారా మరింత బలంగా నొక్కిచెప్పాము. పిల్లలు మరింత చక్కగా చదువుకోవటానికి అనువుగా ఉండే వాతావరణం కల్పించడం కోసం, పాఠశాలల్లో తొమ్మిది మౌలిక అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం 'మనబడి నాడు-నేడు' పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల సదుపాయాలను బలోపేతం చేస్తున్నది. అలాగే, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ వైద్య సంస్థల మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలలో అన్నిటికన్నా ముందు ఉన్నది.

16. అధ్యక్షా! ఇప్పుడు నేను వివిధ రంగాల వారీగా చేపట్టిన బడ్జెటు కేటాయింపులను వివరించబోతున్నాను.

మానవ వనరుల అభివృద్ధి

17. ఒక ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చడానికి పౌరులందరికీ ఒక ఉత్పాదకశీల జీవితాన్ని సమకూర్చుకోవటానికి మానవ వనరుల అభివృద్ధిలో పెట్టే పెట్టుబడులు అత్యంత కీలకం. విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం, ఆర్థికాభివృద్ధి రంగాలలో పెట్టే పెట్టుబడుల ద్వారా మన మానవ వనరులు మరింత తొందరగా మరింత శ్రేష్ఠంగా అభివృద్ధి చెందుతాయి.

7