పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మైనారిటీల సంక్షేమం కోసం రూ.2,050.23 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

73. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం రూ.2,846.47 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం

74. ప్రభుత్వం తన ముందు ఉంచుకొనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కార్యాచరణను ఆ కార్యాచరణ విధానాలు నిర్దేశిస్తాయి. సమాజంలోని పౌరులకి ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత, ఆ సేవలను అందించే ఉపకరణాల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. కానీ, గ్రామస్థాయిలో అత్యవసర సేవల, పౌర సేవల నిర్వహణలో దశాబ్దాలుగా చెప్పలేని స్తబ్దత, జడత్వం గూడుకట్టుకొనిపోయాయి. ఈ స్తబ్దతను ఛేదించడం కోసం గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న మహాత్ముని దార్శనికతకు స్ఫూర్తిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పారు. ప్రభుత్వ సేవలను సాధారణ పౌరుడి ఇంటి గుమ్మం ముందుకు తీసుకుపోవడం ఈ సంస్థల ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వ పాలనను సుపరిపాలన మరియు సుసాధ్యం చేసే దిశగా ఈ సచివాలయాలు రూపుదిద్దుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష.

యువత సంక్షేమం - నైపుణ్యాభివృద్ధి కల్పన

భవిష్యత్తు తరాల అభివృద్ధి ప్రస్థానాన్ని నిర్దేశించే సృజనాత్మకత, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే పారిశ్రామికంగా అట్టడుగుకు చేరి ఒక దేశంగా పూర్తిగా వెనకబడే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వెయ్యి రేకులతో విచ్చుకోవడానికి ప్రభుత్వ ప్రయత్నాలు పునాది రాళ్లవుతాయనడంలో సందేహం లేదు. పారిశ్రామిక విప్లవంతోనే మానవ జాతి చరిత్ర కొత్త మలుపు తిరిగింది. ప్రజల సగటు ఆదాయం, జీవన ప్రమాణం అపూర్వమైన మార్పులను తీసుకువచ్చిన విప్లవమది. విభజన తరవాత ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు పరిశ్రమలకు ప్రాణం పోయడం అత్యవసరం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం కొత్త చరిత్రను లిఖిస్తోంది.

29