పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిరిజనుల విద్య మరియు వైద్యం

మైదాన ప్రాంతంవారితో పోలిస్తే ఈ రాష్ట్రంలో గిరిజనుల అవసరాలు మరియు వారి జీవన విధానం పూర్తిగా వేరు. చిన్న చిన్న సమూహాలుగా అటవీ ప్రాంతాల్లో కొండల్లో నివసించే వీరిది ప్రత్యేక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపధ్యం. ప్రకృతే వీరికి పాఠశాల, వైద్యశాల. వందల సంవత్సరాలుగా అడవుల్లో కొండల్లో నివసిస్తున్న గిరిజనుల సంక్షేమం కాయితాల్లో కనిపిస్తోందేగానీ వారి జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. గిరిజనం బతుకుల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు గట్టి సంకల్పంతో ఉంది.

65. గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగు పరచడం కోసం ప్రభుత్వం పాడేరులో డా. వై.యస్.ఆర్. వైద్య కళాశాలను మంజూరు చేసింది. దీనితో పాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, శ్రీశైలంలో అదనంగా 6 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా ప్రతిపాదిస్తున్నాం. ఉన్నత విద్యను గిరిజన విద్యార్థులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సంస్కృతి, కళలు, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధనలు చేపట్టడానికి విజయనగరంలో నెలకొల్పుతున్న గిరిజన విశ్వవిద్యాలయం మరింత ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.


కాపు నేస్తం

66. కాపు సామాజిక వర్గ సంక్షేమం మన ప్రభుత్వ విధానాలలో ఒక ముఖ్యమైన ఉద్దేశ్యం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం స్పష్టమైన కేటాయింపులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర సాంఘిక ఆర్థికాభివృద్ధిలో కాపు సామాజిక వర్గం సముచితమైన పాత్ర నిర్వచించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. అదనంగా కాపు నేస్తం పథకం క్రింద సంవత్సరానికి రూ.15000/- చొప్పున 5 సంవత్సరాలదాకా ప్రతి కాపు మహిళకు జీవనోపాధి నిమిత్తమై రూ.350 కోట్లు బడ్జెట్ కేటాయించడమైనది.

27