శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్,
గౌరవనీయ ఆర్థిక శాఖామాత్యుల వారి ప్రసంగం
16 జూన్, 2020
గౌరవనీయ అధ్యక్షా! గౌరవ సభ్యులారా!
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెటును మీ అనుమతితో గౌరవ సభా సదుల ముందు ప్రతిపాదించబోతున్నాను.
1. వరుసగా రెండవ సంవత్సరం కూడా రాష్ట్ర వార్షిక బడ్జెటును ప్రతిపాదించే అవకాశాన్ని నాకు అందించిన గౌరవ సభాపతి వర్యులకు, సభా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాన్య ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డిగారికి, గౌరవ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
2. ఇప్పుడు ప్రపంచం అంతా కోవిడ్-19 అనే మహమ్మారితో కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇంతవరకు మనకు తెలిసిన జీవన వ్యవహారం ప్రపంచం అంతటా ఒక్కసారిగా ఆగిపోయింది. కోవిడ్-19 మహమ్మారితో సాగిస్తున్న సమరంలో మన ప్రభుత్వం ముందు వరుసలో నిలబడడమే కాక, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డిగారి సమర్థ నేతృత్వంలో పూర్తి అంకితభావంతో శాయశక్తులు ఒడ్డి పోరాడుతున్నది.
అన్నిటికన్నా ముందు ఈ సమరంలో ముందువరుసలో నిలబడి నిస్వార్థంగా విధి నిర్వహణ చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి, గ్రామ, వార్డు వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, పంచాయత్ రాజ్, మునిసిపల్ శాఖల సిబ్బందికి, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సిబ్బందికి, వారి కుటుంబాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.