పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవగాహనలో స్పష్టత రావలసి ఉంది.

కొందరి దృష్టిలో భాష అవసరం సాహిత్యం వరకే. చాలామంది రచయితలు ఇంతవరకే అలోచిస్తున్నారు. పాలకవర్గాలు అంటే రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లొ ఈ విషయంపై మాట్లాడరు. ఇంతకాలంగా ప్రభుత్వాల, మేధావుల పట్టనితనం వల్లా, స్వార్ధపూరిత విధానాల వల్ల, ఇప్పుడు విద్యా పాలనారంగాలు బాగా కలుషితమైపోయాయి. మాతృభాష ఎంతవరకు తమ అవసరాలకు పనికొస్తుందో అంతవరకు వాడుకొని వదిలేయడం ఒక అలవాటైపోయింది. ప్రభుత్వ నేతల్లో ఎవ్వరికీ తెలుగును పోటా పోటీగా అభివృద్ధి చేద్దామనే సంకల్పమే లేదు. పొరుగు రాష్ట్రాలను చూచి గాని, ఇతర దేశాలను చూఛిగాని నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకొంటున్నారు!

ఇలాంటి పరిస్థితుల్లో ఆ భాషోద్యమకారులే కాదు, చైతన్యం కలిగిన ప్రజలు ముందుకు రావాలి. ప్రజాస్వామ్యం గురించీ రాజ్యాంగం గురించీ ప్రాథమిక హక్కుల గురించీ మాట్లాడే సంస్థలు, సామాజిక కార్యకర్తలు, ఈ పరిస్థితినెందుకు పట్టించుకోరో అర్థం కాదు! ప్రజల ప్రాణం వంటి భాషయొక్క ప్రజాస్వామిక అవసరాలను గుర్తించరా? విద్య, పాలనారంగాళ్లో మాతృభాషను కాపాడుకోవడంతో ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉందనీ, ఇదెంత మాత్రం కేవలం సాహిత్యాంశం కాదనీ అందరూ గుర్తించాలి.

తెలుగు వారందరూ తమ రోజువారీ వ్యవహారాలను తెలుగులో జరుపుకోగలగడంతో పాటు, తామొక భాషాజాతిగా అన్ని రంగాల్లో వికసిస్తూ దేశంలోనూ ప్రపంచంలోనూ పోటీకి నిలబడగల అభివృద్ధి చెందిన జాతిగా బలపడాలి. ఇందుకోసం తెలుగు భాషోద్యమ సమాఖ్య “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” సందర్భంగా ఒక ఆశయ ప్రకటనను ముందుకు తెస్తున్నది. దీనిని ఈ సంచికలో ఇస్తున్నాము. పరిశీలించండి. ఇది కేవలం సమాఖ్య సంస్థకు సంబంధించిన కార్యక్రమం కాదు; అందరికీ సంబంధించిన పిలుపు- ప్రజలందరికీ పిలుపు.

ఇందులో వివరించిన 5 సూత్రాల్లో ఎవరికి వీలైన రంగాల్లో వారు వ్యక్తులు గానూ, సమూహాలుగానూ, సంఘాలుగానూ ముందుకు సాగి చైతన్యంతో కృషిచేయాలని కోరుతున్నాం.

భాషను రక్షించుకోవడమంటే ప్రజలను రక్షించుకోవడం... వారి ఆత్మగౌరవాన్ని వారి వారసత్వ సంపదను, బ్రతుకుల్ని అవసరాలను, భవిష్యత్తునూ పదిలపరుచుకోవడం... వారి మానవ హక్కుల్నీ శక్తినీ గౌరవించడం... వారి స్వాతంత్య్రాన్ని కాపాడడం. ఈ అవగాహనతో ముందుకు సాగాలి తప్ప ఇదేదో సాహిత్యానికి, సంగీతానికి, పాండిత్యానికీ సంబంధించిన అంశంగా చూడకూడదు. సొంత భాషతో సాధించేదే అభివృద్ధి అవుతుంది... పరాయిభాషలకు దాసులమై, మనను మనమే మోసగించుకోవడంతో కాదు.

తెలుగు భాషోద్యమ సమాఖ్య మన ముందుకు తెచ్చిన ఈ ఆశయప్రకటననూ 5 సూత్రాలనూ అందరూ సొంతం చేసుకోండి. దీన్ని అందరి కార్యక్రమంగా తీసుకోండి.

తేదీ : 28-02-2021 "సామల రమేష్ బాబు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఈ మార్చి-2021

6