పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేలయింది. దొరల అభిమానానికి పాత్రుడయ్యాడు. అందువల్ల ఒంగోలు, మునగాల, కొండపల్లి కసుబాలలో ఉండే సైనిక దళాలకు జీతాలు బట్వాడా చేసే స్థాయికి ఎదిగాడు ఎంతో నమ్మకమైన వ్యక్తికి మాత్రమే వేలకు వేల వరహాలు ఇచ్చి బట్వాడా చేసే అవకాశం ఉండేది. ప్రతి పనీలోనూ నమ్మకంగా ఉండేవాడు. పని చిన్నదా పెద్దదా అని కాకుండా, యిచ్చిన పని నమ్మకంగా చేసేవాడు. అదే అతన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది.

ఈ నేపథ్యంలో బొర్రయ్య మాధవాయపాలెంలో ఉన్న డెంటుదొర దగ్గర రైటరుగా కుదిరాడు. ప్రతిభవున్నవాడు కేవలం రైటరుగా పనిచేయడం అన్న నారాయణప్పకు నచ్చలేదు. అందువల్ల మళ్ళీ పియర్స్‌ దొరవద్ద హెడ్‌ రైటర్‌గా నియమించే ఏర్పాటు చేశాడు. ఇదే బొర్రయ్య జీవితంలో పెద్ద మలుపు. ఒక ఏడాది తిరిగేలోగా కల్నల్‌ మెకంజీ బొర్రయ్య పనితీరు గమనించి తన కొలువులో హెడ్‌ ఇంటర్‌ ప్రెటర్‌గాను, ట్రాన్స్‌ లేటర్‌గా (అనువాదకుడి గా) తీసుకున్నాడు. అంతే బొర్రయ్య జీవితకాలం మెకంజీ దగ్గరే వివిధ హోదాల్లో పనిచేశాడు. మెకంజీతోపాటు బొర్రయ్య హైదరాబాదు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ భారతీయ భాషల్లో పరిచయం లేని సర్వే ఇంజనీర్లకు కుడి భుజమయి మన దేశీయ విజ్ఞానం గొప్పదనాన్ని ప్రదర్శించేవాడు. అదే బొర్రయ్యను శాసన లివి పరిష్కరించే విధంగా తీర్చిదిద్దింది. ఈ కాలంలోనే ప్రాచీన నాణాల సేకరణ, ప్రాచీన తాళపత్ర గ్రంథాల సేకరణ, భారతీయ భాషా విజ్ఞాన సంపద గుది కూర్చిన గ్రంథాలు సేకరించి ఒక సంస్థ ఏర్పాటు చేసే స్థాయి కలిగించాడు. ఈ కాలంలోనే మెకంజీ నేతృత్వంలో నేర్చుకున్న గణితశాస్త్రం, రేఖాశాస్త్రం, భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం మొదలయిన వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అభ్యసించి ఆచరణలో పెట్టాడు. ఈ శిక్షణలోనే వివిధ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. అంతకుముందే మెకంజీ సేకరించిన తమిళ, కన్నడ, సంస్కృత శాసనాలను చదివి విపుల వ్యాఖ్యానాలు తయారు చేశాడు. ఈ అధ్యయనంలోనే భూగోళ పటాలు తయారు చేసే పద్దతి నేర్చుకుని అది కార్య రూపంలో చూపాడు. దీనికి ఓ కారణం ఉంది. హైదరాబాదు నుంచి మద్రాసుకు మెకంజీతో పాటు కాలినడకన బయలు దేరవలసి వచ్చింది. ఈ పర్యటనవల్ల దేశీయ పటాలు తయారు చేసే అవకాశం అనుభవం కలిగింది. మెకంజీ తన జ్జాన సంపత్తి అంతా బొర్రయ్యకున్న అపార మేధాసంపత్తిని జోడించి దక్షిణ భారతదేశ నిర్మాణ పట రచనకు పురికొలిపింది.

బొర్రయ్యకు మరో ప్రత్యక్ష అనుభవం కలిగింది. 1779లో రంగపట్టణం ముట్టడి సమయంలో దారి పొదవునా కలిగిన అనుభవాలు సన్నివేశాలు వివరణాత్మకంగా ఒక డైరీ రాశాడు. అన్నీ పద్యరూంలోనే రూపొందించాడు. 1777 మే 4వ తేదీనాడు టిప్పు రాజధాని అయిన శ్రీరంగ పట్టణం పతనాన్ని బొర్రయ్య స్పయంగా చూశాడు. శ్రీరంగ పట్టణం ముట్టడిని ఆనాటి బీభత్స దృశ్యాలన్నింటినీ పద్యాలతో ఆవేశపూరితంగా వర్ణించాడు. బ్రిటీషు వారు టిప్పుసుల్తాన్‌ మృతదేహం కళ్ళారా చూచేవరకూ శ్రీరంగ పట్టణం తమ వశమయిందని నమ్మలేకపోయారు. రెపరెపలాడే బ్రిటీష్‌ పతాకం జాక్‌ కోట బురుజుల మీద ఎగరటాన్ని కవితగా వర్ణించాడు. బొర్రయ్య రచనల్లో ఇది చెప్పుకోదగినది. 1799 నాటికి అచ్చయింది. సర్‌ ఆర్దర్‌ వెల్లస్లీ 1800లో ధుండే అనే మహారాష్ట్ర నాయకునితో చేసిన పోరాటాన్ని ఒక కావ్యంగా రాశాడు. బొర్రయ్య రచనల్లో శ్రీరంగ చరిత్రము, శ్రీరంగరాజా వంశావళి, యాదవరాజ వంశావళి, కాంచీపుర మహత్యము, నూరు శ్లోకాలున్న సత్పురుష వర్ణనము అనే సంస్కృత శతకం మొదలయినవి ముఖ్యంగా కన్పీస్తున్నాయి.

బొర్రయ్య పర్యటించే ప్రతిచోట ప్రాచీన నాణాలు సేకరించేవాడు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన శాసనాల ప్రతిబింబాలు తీసి అవనరమైనచోట అనువదించి మెకంజీకి యిచ్చేవాడు. శ్రీరంగపట్టణం ముట్టడి తర్వాత ఒక హళె కన్నడ శాసనాన్ని చదివి అప్పటికప్పుడు అర్ధం చెప్పాడు. బొర్రయ్య భాషా నైపుణ్యం ప్రశంసిస్తూ మెకంజీ అ శాసన శిలకింద బొర్రయ్య పేరు చెక్కించి రాయల్‌ ఏషియాటిక్‌ సొసైటీకి పంపాడు.

నిజాము రాజ్యాల దేశపటం తయారు చేసి మద్రాసుకు సమర్పించిన ఘనత బొర్రయ్యకే దక్కుతుంది. బొర్రయ్య శ్రమకు మెచ్చి రెండువందల వరహాలు పారితోషికంగా యిచ్చాడు. ఈ ప్రోత్సాహం వల్ల బొరయ్య తన కింద మరి కొంతమందిని తయారుచేసి విషయ సేకరణ ఎలా చేయాలో నేర్పించాడు. వివిధ ప్రాంతాలకు పంపి, వారు చేసేపని విధానం నేర్పించాడు. వీరి సేకరణలో దేశ చరిత్రలు, స్థానిక చరిత్రలు, భూగోళం, వైద్యం, సాహిత్యం , రసాయనిక శాస్త్రం, 'ప్రాబీన శాసనాలు నాణాలు, ప్రాచీన వస్తువులు, బొమ్మలు హస్తకళలకు సంబంధించిన ఆకృతులెన్నో సేకరించారు. బొర్రయ్యకు సహకరించన వారిలో పురిగడ్డ మల్లయ, నారాయణరావు, ఆనందరావు, నిట్టల నాయిని, వెంకట్రావు మొదలయిన వారున్నారు. వీరు ఏరోజుకారోజు తమ దిన చర్యను అంచె టపాల ద్వారా బొర్రయ్యకు చేరవేసేవారు. వీరందరి కృషి వల్ల దక్షిణ భారతదేశంలోని ప్రతిగ్రామ చరిత్ర మత సంబంధమైన దేవాలయాలు, ఆశ్రమాలు, మశీదులు, శిల్పకళా నైపుణ్యం ప్రదర్శించే కట్టడాలు, తాళపత్ర గ్రంథాలు మొదలయినవి ఉన్నాయి.

మెకంజీ సంపుటాల్లో తెలుగు(ఆంధ్ర) భాషకు సంబంధించిన సంపుటాలు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారు నిడదవోలు వెంకటరావు, ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ, పర్యవేక్షణలో ఎత్తి రాయించారు. ఈ సంపుటాలు కొన్ని తెలుగు విశ్వ విద్యాలయంవారి గ్రంథాలయంలో కూడా ఉన్నాయి. ఈ సంపుటాల్లో గ్రామ వృత్తాంతాల చరిత్రలేకాకుండా స్థానిక ప్రభువుల, దేశ పాలకుల వంశ వృతాంతాలు, శ్వేత మహాత్యాలు, నదులు, చెరువులు, దారులు, మొదలయిన వివరాలు ఉన్నాయి. బొర్రయ్య తనతోపాటు తన తమ్ముళ్ళయిన వెంకటలక్ష్మయ్య, రామస్వామినీ మెకంజీ వద్ద కొలువులో చేర్పించాడు. బొర్రయ్య మెకంజీ కొలువులో పని చేసింది కేవలం అరు సంవత్సరాలు మాత్రమే. ఒక జీవితకాల కృషి చేశాడు.' కాని 1803లో తన 26 వ యేట సన్నిపాతంవల్ల మరణించాడు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

33