ధారావాహిక
ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి 98481 23655
పడమటి గాలితోనివురు తొలగిన
తెలుగు భాషా సాహిత్య సంపద
మన పల్లెలు ఒకనాటి రోజులలో నీటికి, కూటికి కటకటలాడేవి. సరైన బాటలేదు. విద్యవైద్యం సున్నా. ఊరిలో ఎక్కడ బావి తవ్వినాఉప్పునీరే. అందుకే చెరువు మీద ఆధారపడేవారు. మహా అయితే ఊరికి దూరంగా ఎక్కడో మంచినీరు పడే బావి ఉండేది. బావుల్లో దిగుడు బావి, గిలకల బావి, చేద బావులు ఉండేవి. మంచినీటి బావుల తవ్వకానికి, నిర్మాణానికి ఎవరో దాత ముందుకు వస్తే ఒక చిన్న శిలాఫలకం బావికే అమర్చేవారు. ఏ గ్రామానికి సరయిన దారి డొంక లేకపోయినా దేవాలయం మాత్రం ఉండేది. అదీ చాలా ఎత్తుగా, దానికి ఆనుకునే ఒక చెరువు. ఆచెరువునీరే తాగునీటికి ఇతర అవసరాలకు ఉపయోగం. దేవాలయ నిర్మాణం. చెరువు తవ్వకం ఆవూరి జమిందారో, ఆప్రాంతపు రాజో, మోతుబరి రైతులో నిర్మిస్తే వారి పేర ఓ శిలాఫలకం ఉండేది. ఐతే ప్రతిగ్రామానికీ ఓ చరిత్ర దాని వెనుక ఓ గాధ. అన్నీ పరంపరీణంగా చెప్పుకోవడమే తప్ప ఎక్కడా గ్రంథస్థమైన దాఖలాలు లేవు. గ్రామ చరిత్ర, ప్రాంతీయ చరిత్ర లిఖించి భద్రపరచిన నాధుడే లేడు. ఆ పరిస్థితిలో ఓక ప్రాంతానికే పరిమితం కాకుండా దక్షిణ భారతదేశచరిత్ర, ప్రజల ఆచారాలు, పండుగలు, పంటలు, అలవాట్లు, జాతరలు, తిరునాళ్ళు మొదలయినవన్నీ గ్రంథస్థం చేసి భవితకు భద్రం చేసిన ఘనత కల్నల్ కాలిన్ మెకంజీ (Colonel Colin Mackenzie 1754-1821} కే దక్కుతుంది.
మెకంజీ జీవిత చారిత్రక కథనం: స్కాట్లాండ్కి పడమరగా లూయి ద్వీపంలో స్టోర్నవే గ్రామంలో బార్బరా, మర్షోన్ మెకంజీల రెండొ సంతానం కల్నల్ కాలిన్ మెకంజీ. మే 8వ తేదీ 1754లో జన్మించాడు. తండ్రి స్టోర్నవే గ్రామంలో తొలి పోస్ట్ మాస్టర్ గా పనిచేసేవాడు. అదే గ్రామంలో ఉన్న పాఠశాలలోనే మెకంజీ విద్యాభ్యాసం చేశాడు. అక్షరాభ్యాసం చేయించిన తొలిగురువు అలెగ్జాండర్ అండర్సన్ ఆవూరికే తొలి ఉపాధ్యాయుడు. బాల్యం నుంచి చదువుల్లో చురుకుగా ఉండేవాడు మెకంజీ. దానికితోడు పరిసరాల విజ్ఞానం, పరిసర ప్రాంతాల విషయ సేకరణ బాల్యంలోనే ప్రారంభించాడు. కేవలం కుతూహలం కొద్ది తన స్వంత లూయీస్
ద్వీపం నుంచి పరిసర ద్వీపాలకు వెళ్ళి ఆయా చరిత్రలు, ప్రాంతీయ గాధలు సేకరించేవాడు. లూయిస్ ద్వీపానికి ఆరోజుల్లో లార్డ్ ఫ్రాన్సిస్ రాజు. ఆ వంశీకులను నేపియర్ ప్రభువులని పిలిచేవాళ్లు. వీళ్ళకి మూల పురుషుడు జాన్ నేపియర్ (John Napaier-1550) ఈయన భౌతిక శాస్త్రం (Physics), గణిత శాస్త్రం, ఖగోళ శ్యాస్తాలలో పండితుడు. నేపియర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లాగర్ధమ్స్ కనుగొన్న మేధావి. వీరి ఐదవ తరంలోని ఫ్రాన్సిస్ ప్రభువు తమ పూర్వీకుల చరిత్రను గ్రంథస్థం చేయాలని సంకల్పించాడు. దీనికి మెకంకీ సమర్ధుడని భావించాడు. అప్పటికే మెకంజీ స్టోర్నవే ప్రాంతానికి కంట్రోలర్ గా నిమితుడయ్యాడు. తన ఉద్యోగంతోపాటు నేపియర్ చరిత్రను వెలికి తీసేపని కూడా చేపట్టాడు మెకంజీ. బాల్యంలో పడిన పునాది భవితను భద్రం చేస్తుందన్నట్లు మెకంజీ జీవిత చక్రం చారిత్రక
సత్యాన్వేషణకు దారి దీసింది.
ఫ్రాన్సిన్ ప్రేరణతో, మెకంజీ గణిత శాస్త్రంపై మక్కువ పెంచుకున్నాడు. ఇదే సమయంలో భారతీయ గణిత శాస్త్రం, హిందువుల సంఖ్యావాచకాల సంబంధం, దశాంకం మొదలయిన గణిత శాస్త్ర విషయాలు పరిశోధించే అవకాశం ఏర్పడింది.
లార్డ్ ఫ్రాన్సిస్ ప్రోత్సాహంతో మెకంజీ భారతదేశం పర్యటించే అవకాశం కలిగింది. దానికో కారణం కూడా ఉంది. ఫ్రాన్సీస్ ప్రభువు కూతురు హెస్తర్ (Hesther) భర్త శామ్యూల్ జాన్స్టన్ (Samuel Johnston) తమిళనాడులోని మధురలో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్నాడు. అందువల్ల మెకంజీ భారతదేశానికి వచ్చే అవకాశం సుగమం అయింది. దీనికి తోడు భారతదేశంలోని సైనిక శాఖలో సైనికోద్యోగి(cadet) గా ఒక ఖాళీ రావడం అది మెకంజీకి ఇవ్వడం చకచకా జరిగాయి. 1783 సెప్టెంబర్ 2న మెకంజీ భారత ఉద్యోగిగా అడుగు పెట్టాడు. అంతే మరణించేవరకూ తిరిగి తన మాతృదేశం చూడనేలేదు.
అప్పటికే ఫ్రాన్సిస్ కుమార్తె అయిన హెస్తర్ మధురలో తన ఇంటిని పండిత కేంద్రంగా రూపొందించింది. గణితశాస్త్రంలో ఉద్దండ పండితులయిన వారికి ఉద్యోగం యిచ్చి గణితశాస్త్రం పై భారతదేశ భాషల్లో ఉన్న గ్రంథాలన్నీ సేకరించింది. అందువల్ల మెకంజీ భారతదేశానికి ఉద్యోగిగా రావడం జాన్స్టోన్ దంపతుల ఇంట్లోనే అతిథిగా ఉండే అవకాశం ఏర్పడింది. పైగా భారతీయ పండితులలో చర్చలవల్ల దేశ చరిత్రను, ఆయా ప్రాంతాల చారిత్రక గాధలను తెలుసుకునే అవకాశం కలిగింది. మెకంజీకి పటాలంలో ఉద్యోగం. ప్రవృత్తిరీత్యా జాస్టన్ ఇంట్లో పండితులతో పరిచయం. ఆ పై లిఖిత ప్రతులపై చర్చ. ఈ నేపథ్యంలో లిఖిత ప్రతులు, ఆయా దేశీయ చరిత్రలపై ఒక సాధికారిక ప్రాజెక్ట్ నిర్వహించాలనే
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021
26