పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పుస్తక సమీక్ష

రామోజీరావు ఎక్స్‌రే!

వెల : రు. 300/- రచయిత: గోవిందరాజు చక్రధర్‌ ప్రచురణ : మీడియాహౌస్‌ పబ్లికేషన్స్‌ ప్రతులకు: నవోధయబుక్‌హౌస్‌ హైదరాబాదు. లేదా- మీడియాహౌస్‌పబ్లికేషన్స్‌: 98498 70250 ళు గూగూల్‌పే/ ఫోన్‌పే



మనకు బాగా తెలిసిన వారిదే అయినా ఎక్స్‌రే అనగానే ఎలా ఉందో ఏముందో చూడాలనిపిస్తుంది. సాధారణ చూపుకు అందని లోలోపలి భాగాలను సైతం ఎక్స్‌రే పట్టి చూపుతుంది. అందుకే ఫొటో కన్నా ఎక్స్‌రే ఎక్కువ ఆసక్తి కలిగిస్తుంది.

రామోజీ రావు ఉన్నది ఉన్నట్టు” అన్న శీర్షికే ఈ రచన రామోజీరావు జీవితం గురించిన ఎక్స్‌రే అని చెప్పకనే చెపుతోంది, పాఠకుడిలో ఆసక్తిని కలిగిస్తున్నది. ఇవాల్టి యువతకు రామోజీరావు పేరు మాత్రమే తెలిసి ఉండవచ్చు కానీ 40, 50 ఏళ్ల వయసు పైబడిన తెలుగు వారందరికీ రామోజీ రావు గురించి క్రొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదనిపిస్తుంది. ప్రియా పచ్చళ్లు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ఈనాడు పత్రిక, ప్రతిఘటన, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలు నిర్మించిన ఉషాకిరణ్‌ మూవీస్‌, తెలుగుదేశం పార్టీతో, యన్‌టిఆర్‌తో, చంద్రబాబునాయుడుతో రామోజీ సంబంధం, ఈటివి, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఇలా రామోజీరావు, ఆయన వర్తక వాణిజ్యాలు, రాజకీయాలు గురించి వాటిల్లో ఆయన పోకడలు గురించి అంతో ఇంతో తెలియని తెలుగు వారు లేరు అనడం అతిశయోక్తి కాదు. ఇలా అందరికీ తెలిసిన విషయాన్ని రాసి, అందరితో చదివించాలి. నిజమని ఒప్పించాలి. నిజంగా ఇది కఠిన కార్యమే. తెలుగు రాజకీయాల్లోను, జర్నలిజంలోను రామోజీరావు నిర్వహించిన పాత్రపట్ల ప్రశంసలు, విమర్శలు రెండూ ఉన్నాయి.'ప్రశంసలకే ప్రాధాన్యత ఇస్తూ రాస్తే అది పొగడ్తల కవిత్వమై రామోజీ, ఆయన బంధుమిత్రులకే పరిమితమవుతుంది. పూర్తిగా విమర్శలకే ప్రాధాన్యత ఇస్తే అది తిట్టు కవితలా రామోజీ వ్యతిరేకులకు మాత్రమే పరిమితమవుతుంది. కనుక ఏ ఒక్క కోణంలో రామోజీ గురించి రాసినా అది “ఉన్నది ఉన్నట్టు కాజాలదు. రాసిన వాటికి తగిన సాక్ష్యాధారాలు లేకుండా రాస్తే అస్సలు విలువే ఉండదు. కనుక ఉన్నది ఉన్నట్టు రాయాలి, రాసిన దాన్ని పాఠకుడితో పూర్తిగా ఇష్టపడి చదివించాలి. ఇది మరింత కష్టం. సాధారణ జర్నలిస్టుగా పత్రికారంగ ప్రస్తానం ప్రారంభించి, జర్నలిజం కళాశాలకు ప్రిన్సిపాల్‌ గా పనిచేసిన గోవిందరాజు చక్రథర్‌ అనుభవం ఆయన ఎంచుకున్న కఠిన కార్యాన్ని సులభతరం చేసింది. అందుకే షర్రసోపేతమైన విందు భోజనం లాంటి ఈరచనను ఎలా చదివి ఆస్వాదించాలో విషయ సూచిక స్థానంలో ఇలా చదవండి., అంటూ ప్రణాళికను కూడా అందించారు. దాన్నీ చూసి పాఠకుడు తన అభిరుచికి తగిన అంశాన్నీ ఎంచుకుని పుస్తకాన్ని చదవడం మొదలెట్టి పూర్తి చేయవచ్చు.

రామోజీరావుకు యన్‌టిఆర్‌తో సన్నిహిత సంబంధం ఉందని, ఈనాడు వల్లే యన్టీఆర్‌ అధికారంలోకి వచ్చారని అందరూ అనుకుంటారు. అలాంటి యన్‌టిఆర్‌తో రామోజీకి ఎందుకు చెడింది, రామోజీ చంద్రబాబును ఎందుకు చేరదీశారు? రాష్ట్ర ప్రయోజనాలా, రామోజీ ప్రయోజనాలా? ప్రముఖ వత్రికా రచయిత, ఈనాడు తొలినాటి సంపాదకులు ఎబికె ప్రసాద్‌ వెల్లడించిన సత్యాలను పేజి 261లో పెయిడ్‌ జర్నలిజానికి రామోజీ శ్రీకారం శీర్షికన చూడవచ్చు.

యన్‌టిఆర్‌ని పదవీచ్యుతుణ్ణి చేసిన కుట్రకు హైదరాబాద్‌లోని వైైస్రాయ్‌ హూటల్‌ కేంద్రబిందువు అయిందని అందరూ అనుకుంటారు. నిజానికి యన్టీఆర్‌ను గద్దె దింపాలనే కుట్రకు విశాఖలోని డాల్ఫిన్‌ హోటల్‌లో రామోజీ చంద్రబాబులు శ్రీకారం చుట్టారనే సత్యాన్ని 244వ పేజీలో వెన్నుపోటు కుట్రకు విశాఖలోనే నాంది అనే శీర్షికన రామోజీ ఆప్తుడు, డాల్ఫిన్‌ హోటల్స్‌ పూర్వ యండి అప్పారావు అంతరంగంలో చూడవచ్చు.

వ్యాపార దక్షత, ఎత్తులు, జిత్తులు కారణంగానే పచ్చళ్ల వ్యాపారం నుండి చీటీల దాకా పత్రికల నుండి ఫిల్మ్‌సిటీ దాకా రామోజీరావు ఎదిగారని కొంతమంది అక్కసుతో, అసూయతో వ్వాఖ్యానిస్తుంటారు. నిజానిజాలు రామోజీ విజయం వెనుక శీర్షికన పేజి 59లో తెలుస్తాయి. తప్పులను దిద్దుకునే ఓరిమి, ముక్కుసూటితనం, రాజీలేని మనస్తత్వం, అసమాన జ్ఞాపకశక్తి, ధారణ, పర్ఫెక్షన్‌ పట్ల పట్టుదల, వివేచనాత్మక విశ్లేషణ సామర్ధ్యాలతో కూడిన ఆయన విలక్షణ వ్యక్తిత్వం, ఆర్ధిక క్రమశిక్షణ ఆయన విజయాలకు అసలు కారణం అని రాంభట్ల కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ, రావూరి భరద్వాజ, ఈనాడు డైరెక్టర్‌ ఐ.వెంకట్‌ వంటి ప్రముఖుల అభిప్రాయాల సారం. ప్రజాజీవితంలోని వ్యక్తుల అవినీతి, అక్రమాలను ఈనాడు పత్రిక ఈటీవీలు వేదికగా ఉతికి పారేయిస్తున్న రామోజీరావు ఆచరణ సొంత విషయాల్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం తెలుగు వారికి సహజం. ఎడిటర్‌ పై రామోజీ రూ. కోటి దావా శీర్షికన 315 పేజిలోని కథనం కొంత సందేహ నివృత్తి చేయగలదు. ప్రతిష్టాత్మకమైన రామోజీ ఫిల్మ్‌ సిటీ కోసం గ్రామకంఠాలు, ఎసైన్ట్‌ భూములు, సమరయోధుల భూములను సైతం అక్రమంగా ఆరగించి, రెండు గ్రామాల మద్య రోడ్డును కూడా కబ్జా చేశారని దస్తావేజులతో సహా లభించిన సాక్ష్యాధారాలను బట్టి నిజాన్ని నిర్ధారించుకున్న తరువాతే ఆంధ్రభూమి సంపాదకులు యం.వి.ఆర్‌. శాస్త్రి దీనికి సంబంధించిన వార్తను ప్రచురించారు. దీనిపై వ్రభుత్వ చర్యలు ఏమిటి? అని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును మీడియా ప్రశ్నిస్తే అది ప్రయివేటు భూమి అక్కడ నిర్మాణాలు చేపడితే తప్పేమిటి? అని ఎదురు దాడి చేశారాయన. అసత్యాలు ప్రచురించి తన పరువు తీశారంటూ ఆంధ్రభూమి యజమానులకు, సంపాదకులకు నోటీసులు ఇచ్చిన రామోజీ కోటి రూపాయలకు కోర్టులో పరువు నష్టం దావా వేసి, కోర్టుకు వచ్చి ఓ సారి సాక్ష్యం కూడా చెప్పారు.కానీ ఆతరువాత దాన్ని పట్టించుకోలేదు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

47