పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధ్యమంగా వీటి వినియోగానికి సంబంధించి ప్రభుత్వ విధానాల అమలు చేయడంలో ఈ సంస్థ ప్రభుత్వానికి సహాయపడుతుంది. దీనికి దేశమంతటా ప్రాంతీయ భాషా బోధనా కేంద్రాలు ఉన్నై (రీల్వాసం). వీటిలో 15 భారతీయ భాషల్లో అనేక కోర్సులద్వారా ఆయా భాషలను బోధిస్తారు. ఈ మథ్యనే ఈ సంస్థకు క్లాసికల్‌ భాషల విశిష్ట కేంద్రాల నిర్వహణ బాధ్యతను కూడా అప్పగించారు. ఈ దేశంలోనూ విదేశాలలోనూ భారతీయ భాషల అభివృద్దికి సంబంధించిన అన్ని విషయాలపైన దీనిదే చివరిమాట...

అందువల్ల భాషా పరిశోధన తదితర అభివృద్ధి విభాగాలలో ముఖ్యమైన సహకార యోజనలను రూపొందించడానికీ అమలు చేయడంలో ఈ సంస్థకు ప్రత్యేక చట్టబద్ధత ఉంది. మరి అటువంటి సంస్థను కేంద్రం ఎందుకు భారతీయ భాషల విశ్వవిద్యాలయంగా మార్చాలని అనుకుంటోంది? కారణాలు అనేకం. అంటే విశ్వవిద్యాలయంగా మార్చితే ఇప్పుడున్న భారతీయ భాషల సంస్థ పనితీరు మెరుగుపడుతుందనా? లేక భాషాశాస్త్ర పరిశోధనలతోబాటు బొధన, డిగ్రీలను ప్రదానం చేసే సంస్థగా మార్చాలనుకొంటోందా? ఇప్పటికే దేశంలో ఎన్నో రకాల భాషా విశ్వవిద్యాలయాలు ఉన్నై వాటిలో కొన్ని మచ్చుకి: రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, పంజాబీ, ద్రావిడ విశ్వవిద్యాలయాలతోపాటు, కేంద ప్రభుత్వ పరిధిలో ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం, మహాత్మాగాందీ అంతర్జాతీయ హిందీ విశ్వవిద్యాలయం, ఇందిరాగాంధీ జాతీయ తెగల విశ్వవిద్యాలయం, గోవింద్‌గురు తెగల విశ్వవిద్యాలయం, మణిపూర్‌ తెగల విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర తెగల విశ్వవిద్యాలయం, తెలంగాణా తెగల విశ్వవిద్యాలయం, ఇంకాకొన్ని ఇలాంటివే భాషా సంస్కృతులే ప్రధానంగా ఏర్పడిన విశ్వవిద్యాలయాలు ఉన్నై.పరిశోధనా సంస్థలను విశ్వవిద్యాలయాలుగా మార్చితే పనితీరు మెరుగవుతుందను కోవడంలో ఔచిత్యం ఏమీలేదు. ఇప్పటికే భాషా సంస్కృతులకు అనేక విశ్వవిద్యాలయాలు ఉండగా మరో పరిశోధనా సంస్థను విశ్వవిద్యాలయంగా మార్చడం దేనికి సంకేతం? భారతీయ భాషా సంస్థను ఇదివరలో అంటే 2011 లో ఒకసారి ఇలానే విశ్వవిద్యాలయంగా మార్చడానికి ఒక 60 పుటలతో అన్ని హంగులూ ఆర్భాటాలతో ముసాయిదా ప్రతి తయారైంది. దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే సమయానికి ఆ పనికంతటికీ పూనుకొన్న కేంద్రప్రభుత్వ ఉన్నతవిద్వాశాఖ సెక్రటరీ మారడంతో అది మూలబడింది. ఇలా మళ్ళీ బల్లమీదకు రావడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే మనకు ఒక విషయం బోధపడుతోంది. భాభాసం కేంద్ర హిందీ సంస్థాన్‌, కేంద్ర ఇంగ్లీషూ విదేశీ భాషల సంస్ద, కేంద్ర సంస్కృత సంస్థలతోపాటు ఇతర భారతీయ భాషలలో పరిశోధనకోసం ప్రత్యేకంగా ఏర్పరిచిన సంస్థ. 1969లో పద్మశీ డా. దేవీప్రసన్న పట్టనాయక్‌ నిర్దేశకత్వంలో మొదలైంది. వందలాది పరిశోధకులతో కొంత కాలం సజావుగా నడిచి ఏర్పరచుకున్న లక్ష్యాలను నెరవేరుస్తూ సాగిన సంస్థ. అయితే గత రెండు దశాబ్దాలుగా రిటైరు అయిన ఉద్యోగుల స్థానాలను మళ్ళీ నింపక పోవడంతో ఈనాడు ఆ సంస్థలో పట్టుమని పది పదిహేను మంది పరిశోధకులు గూడా లేని పరిస్టితి. గడిచిన పదేళ్లలో అసలు నిర్దేశక నాయకత్వం లేకుండానే గడిచింది. ఇప్పటికీ ఆ సంస్టకు అవసరమైన భాషాశాస్త్రవేత్త నిర్దేశక నాయకత్వం లేకుండానే నడుస్తోంది. ఇలా పరిశోధకులను ఎంపికచేయకుండా, ఖాళీ పడిన స్థానాలను నింపకుండా రెండు దశాబ్దాలపాటు ఏ సంస్థ మాత్రం తనకు ఉద్దేశించిన లక్ష్యాలను సాధించుకొాంటూ పోగలదు. ఇలా కేంద్ర ప్రభుత్వరంగ సంన్ధ నిర్వీర్యం కావడానికి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వ లోపమే. అలా నిర్వీర్యం చేసిన సంస్థను మళ్లీ పునరుద్దరించేందుకు భారతీయ విశ్వవిద్యాలయంగా మార్చిడి అనే కొత్త ఆలోచనను బయటపెట్టింది.

అయితే ఈ అలోచనపై రెండు రకాల అభిప్రాయాలు ఏర్పడినై. ముఖ్యంగా, అ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగవర్గంలో ఎక్కువమంది ఈ మార్పును ఆహ్వానిస్తున్నారు. కారణం, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో నిద్రావస్థకు చేరిన తమ సంస్థకు కొత్త రక్తం ఎంతొ కొంత అందుతుందని నమ్మకం కలగడం. విశ్వవిద్యాలయంగా రూపొందితే కేంద్ర ప్రభుత్వ కట్టుబాట్ల నుంచి బైటపడి విశ్వవిద్యాలయాలకు ఉండే స్వయంప్రతిపత్తితో కొత్త ఊపిరి పీల్చుకోవచ్చనే అలోచన. ఇక రెండవ అభిప్రాయం, దేశమంతటా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలూ సంస్థలలో ఉన్న భాషాశాస్తజ్ఞుల అభిప్రాయం. వీరందరూ ఈ సంస్థను భాషాశాస్త్ర పరిశోధనలకు ఒక ఆర్థిక వనరుగానూ, సమాచార నిధిగానూ ఎన్నో అవకాశాలను అందించే కామధేనువుగా చూస్తున్నారు. ఒకవేళ ఇదేగనక విశ్వవిద్యాలయంగా రూపొందితే వారందరికీ వనరులనిధి దాదాపుగా అడుగంటినట్లే అని భావిస్తున్నారు. అయితే భారతీయ భాషల సంస్థను ఒక విశ్వవిద్యాలయంగా మార్చి దాన్ని ఒక గొప్ప అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థగా రూపాొందుతుందని అనుకోవటంకంటే దాన్ని ఇప్పుడు ఉన్న సంస్థగానే ఉంచి స్వతంత్ర ప్రతిపత్తిని గనక అందించగలిగితే దాంట్లో ఏర్పడిన వందలాది ఖాలీలను నింపుకొని గణనీయంగా గుణాత్మకమైన పరిశోధనల బాట పట్టవచ్చు. ఎన్నో జాతీయ పరిశోధనా సంస్థలు స్వయం ప్రతిపత్తితో తమ పరిశోధనలలో విజయాలను సాధించి అంతర్జాతీయ స్థాయిలో మన్ననలను పొందాయి. ఇప్పుడు భారతీయ భాషల సంస్థకు కూడా స్వయం ప్రతిపత్తె మందు. స్వయం ప్రతిపత్తితో కొత్త ఊపిరులతో కోల్పోయిన ప్రాభవాన్ని పొందడమేగాక మళ్లీ అంతర్జాతీయ స్థాయిని పొందే అవకాశం వస్తుంది.

విశ్వవిద్యాలయంగా మారితే పూర్వ ప్రాభవం రాదా? అంటే రావచ్చు. గుణాత్మకమైన పరిశోధనలు ఆ సంస్థలో ఉన్న ఉద్యోగవర్గంపై ఆధారపడివుంటాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పరిశోధనా సంస్థలు ఏవీ అభివృద్ధిపథంలో నడిచినట్లు దాఖలాలు లేవు. విద్యాసంస్థలు, పరిశోధనాసంస్థల అభివృద్ధి వాటి స్వయం ప్రతిపత్తిపై ఆధారపడివుంటుంది. చీటికిమాటికి అధికారుల చెవ్చుచేతలలో నడిచే నంస్ధలు అనేక రకాల సామాజిక రుగ్మతలకులోనుకాక తప్పదు. విద్యా-పరిశోధనా వ్యవస్థలు అధికార నియంత్రణ నుండి బైటవడాలి. న్యాయవ్యవస్థకు ఉన్న స్వయంప్రతిపత్తిలాగే విద్యావ్యవస్థ కూడా పూర్తిగా తనకు తానే ఒక స్వతంత్ర వ్యవస్థగా కొనసాగిన నాడే-మన విద్యా పరిశోధనా రంగాలు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిని సాంతం చేసుకోగలవు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

10