పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపుటి:6 సంచిక : 5

అమ్మనుడి అక్టోబరు 2020

సంపాదక హృదయం

సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమస్య పరిష్కారమవుతుందా!


ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుపై కుప్పిగంతులు వేసిన రాష్ట్రప్రభుత్వం చివరకు సర్వోన్నత న్యాయస్థానాన్ని శరణుజొచ్చి, తన వాదనను వినిపించింది. తమది విధానపరమైన నిర్ణయం అనీ, ఆ హక్కు రాష్ట్రప్రభుత్వాలకు ఉందనీ నివేదించింది. సుమారొక పుష్కరకాలం కిందట తెలుగు భాషోద్యమ సమాఖ్య, ప్రాథమిక విద్యలో మాతృభాషా మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలంటూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసినపుడు ఇది ప్రభుత్వ విధాన నిర్ణయానికి సంబంధించినది గనుక మేము జోక్యం చేసుకోలేమంటూ దానిని కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆం. ప్ర. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశం మీదే ఆధారపడింది. తొలుత ప్రభుత్వ ఉత్తర్వుల్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కిన కక్షిదారుల వాదనలతోపాటు, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని వ్రాత పూర్వకంగా సర్వోన్నత న్యాయస్థానం తీసుకొంది. కేంద్రం సమగ్రమైన సమాధానాన్ని నివేదించింది. (ఆ వివరాలను వెనుక పుటలో చూడండి) అందులో - భాష విషయంలో నూతన జాతీయ విద్యావిధానాన్ని అంతకు పూర్వ విద్యావిధానాలతో పాటు యునెస్కో నిర్ణయాలను వివరించింది. రాజ్యాంగంలోని అంశాలను పేర్కొంది. విద్యాహక్కు చట్టం ఉండనే ఉంది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఏమని తీర్పు ఇస్తుందో చూడాలి.

విద్యకు సంబంధించి - రాజ్యాంగంలో ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నందున, ఎదురవుతున్న సమస్యల్ని రానున్న తీర్పు ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. అంతేగాదు. త్రిభాషా సూత్రం అమలులో వస్తున్న సమస్యలనూ, ఇండో ఆర్యన్ భాషలమూలాలతో ముడిపడివున్న భారతీయ భాషలవారు ద్రావిడ భాషల్ని మూడోభాషగానైనా అంగీకరించలేని నిజాన్ని ఎలా పరిష్కరిస్తారు. దేశమంతటికీ ఒక జాతీయ భాష ఉండాలనే వాదాన్ని ఏంచేస్తారు. భాషా రాష్ట్రాల ఏర్పాటు వల్ల రాష్ట్రాల్లో భాషాపరంగా తక్కువ సంఖ్యలో ఉన్న ప్రజల భాషాసమస్యనెలా పరిష్కరిస్తారు - ఇలాంటి పలు సమస్యల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు దారితీస్తుందా, ఇదంతా తేనెతుట్టెను కదిలించినట్లవుతుందా?

మాతృభాషోద్యమాలు ప్రపంచమంతటా తలెత్తుతున్నాయి. కొందరు అనుకొంటున్నట్లు ప్రపంచమంతా ఒకే భాషాధిపత్యానికి లొంగిపోక తప్పదన్నది భ్రమ. ప్రతి మాతృభాషా తన జాతీ భావోద్వేగాలకే కాదు, సంస్కృతికీ, బ్రతుకు తెరువుకూ స్వేచ్చకూ ముడి పెట్టుకొని ఉంటుంది. బహుభాషా జాతుల సమ్మేళనమైన మనదేశంలో పాలకవర్గాలు ఈ విషయంలో జాగరూకత వహించాలి.

ఇక్కడ తప్పనిసరిగా పరిశీలించవలసిన 'అసలు సంగతి'ని పక్కకు పెట్టకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలోకి మొత్తం విద్యను తేవాలన్న నిర్ణయాన్ని తీసుకోవడం ఒక్కసారిగా జరగలేదు. ఇంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం, దానికి ముందు పాలించిన కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలూ ఆ బాటనే నడిచాయి. కాకపోతే ఈ ప్రభుత్వం కొంచెం దూకుడుగా, పట్టుదలగా వ్యవహరించింది. ఇదే సమయంలో - భారతదేశంలో కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదో విధంగా ఈ ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. భాషారాజకీయాలతో నడిచే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ ఏదో ఒక స్థాయిలో ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంది. కర్నాటక ప్రభుత్వానికీ, ఆరాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యానికీ న్యాయస్థానాల్లో జరిగిన పోరాటం సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరమనే కారణంగా ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో కొంతపోరాడిందన్న సంగతిని మనం మరచిపోకూడదు. అయితే అది మాధ్యమాన్నెంచుకొనే స్వేచ్చ విద్యార్థికి ఉండాలన్న అంశానికి పరిమితం. అయినా ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం పంతానికి పోయి, సర్వోన్నత నాయస్థానాన్నాశ్రయించింది. అంతేకాదు, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారయితే, ఆంగ్ల మాధ్యమాన్ని దేశమంతా అనుసరించడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు ఇదంతా భాషల సమర్ధతకు సంబంధించిన విషయమేకాదు. అన్ని భాషలూ శక్తిమంతమైనవే. మనం | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి • అక్టోబరు-2020 |