శివపురాణము/రుద్ర ఖండము/నందీశ్వర - భైరవావతారాలు

వికీసోర్స్ నుండి

నందీశ్వరావతారం

ఒకానొక కల్పకాలంలో శిలాదుడనే మహర్షి సత్తముడు సంతాన లేమితో శివారాధన చేసి మరణం లేని, శివుడంత కొడుకు కావాలని శివుని కోరుకున్నాడు. మానవరూపంలో పుట్టవలసిందిగా బ్రహ్మాదులు కోరినందున, నీకు బిడ్డగా జన్మిస్తానని అభయం ఇచ్చాడు శివుడు.

అటు తర్వాత శిలాదుడు యజ్ఞచేస్తూవున్న తరుణంలో, యజ్ఞ గుండంలోంచి శివలాంచనాలన్నీ పుణికి పుచ్చుకున్న ఓ బాలుడు ఉదయించి శిలాదునికి ముదముచేకూర్చాడు. అ ఆనందపారవశ్యంలో ఆయన 'నంది' అనే నామకరణం చేసి ముద్దుగా పెంచుకుంటూండగా, అతని జీవితం కేవలం ఒక్క సంవత్సరమే అని మైత్రావరుణులు ద్వారా తెల్సుకున్న శిలాదుడు దుఃఖితుడయ్యాడు.

నంది, శివారాధకుడినై చిరంజీవత్వం పొందుతానని తపస్సు చేయగా, శివుడు మెచ్చి ఇకపై నీవు నందివికావు - నందీశ్వరుడివి - నాతో సమానంగా నీకు కైలాసవాసానికి అర్హుడ్ని చేస్తూ నిన్నూ - నీ తండ్రినీ కూడా నా చెంత ఉంచుకోగలను అని అభయం ఇచ్చాడు. గణాధిపత్యం కూడా ఇచ్చి గౌరవించాడు.

సప్త మరుత్తులు తమకూతురైన 'సుయశ' నామధేయురాలైన కన్యతో నందికి పెళ్లి జరిపించగా, ఆనాటినుంచి తనుండే ప్రతిచోటా నందీశ్వరుడు ఉండి తీరాలని శాసించి శివుడు, నందికి అపరిమిత గౌరవం అనుగ్రహించాడు.

భైరవావతారం:

ఒకానొక కల్పకాలంలో పరబ్రహ్మ ఎవరనే విషయమై బ్రహ్మ,విష్ణువుల మధ్య వాగ్వాదం చెలరేగి శివమాయాప్రభావాన అది అనంతంగా కొనసాగింది.

ఇంతలో వారి మధ్యనుంచి ఓ జ్యోతి బయల్దేరి, బ్రహ్మాండంగా ప్రజ్వరిల్లసాగింది. ఆ వెలుగులో రుద్రమూర్తి బయల్వెడలినాడు.

బ్రహ్మ ఆ దృశ్యం చూసి, "ఇప్పటికే ఇక్కడ పరబ్రహ్మమెవరో తేలిక కొట్టుకుంటూంటే, నువ్వూ పోటీకి తయారయ్యావా!" అంటూ ఎగతాళి చేశాడు.

బ్రహ్మ అహంకారానికి రుద్రుడు కోపించి ఓ మహాభీకర రూపాన్ని సృష్టించాడు. అతడే భైరవుడు. 'ఆమర్దకుడు' అనే పేర వెలసే భైరవాకృతికే కాలభుడని, కాలరాజు అనీ పేర్లున్నాయి. అంతేకాక భక్తుల పాపాలను భక్షించడం వల్ల పాపక్షకుడనే పేర కూడా వర్ధిల్లుతున్నాడు. (కాశీ క్షేత్రానికి అధిపుడు)

కాలభైరవుడు రుద్రాజ్ఞప్రకారం బ్రహ్మ ఐదోముఖాన్ని త్రుంచాడు. సమయం చూసి, బ్రహ్మ స్త్రోత్రం చేసాడు. "తమరే పరబ్రహ్మ స్వరూపం" అని కీర్తించాడు. రుద్రుడు శాంతించాడు.

'బ్రహ్మహత్య' అనే కన్యను సృష్టించి, కాల భైరవుడి వెంట పంపాడు.

కాలభైరవుడైన వేళ..

కాలం ఎంతటి వారినైనా కడగండ్లపాలు చేయడం సహజం కదా! భైరవుడు బ్రహ్మ శిరస్సును త్రుంచి, విదిలించినా అది అతడి కొనగోటి నుంచి ఎంతకూ ఊడిపడలేదు. లోక సంచారంలో ఎవరి వల్లనైనా,ఈ కపాలానికి మోక్షమార్గం దొరుకుతుందేమో చుద్దామని అలాగే గోటికి అంటిన కపాలంతోనే ఊళ్ళు తిరగసాగాడు భైరవుడు.

కాశీలో అడుగిడగానే, అతడ్ని వెన్నంటిన బ్రహ్మహత్య పెద్దపెట్టున హాహాకారాలు చేస్తూ పాతాళానికి క్రుంగిపోయింది. భైరవుడి చేతినుండి ఆ కపాలం కూడా రాలిపోయింది. అక్కడ ఏర్పడినదే నేటి బ్రహ్మకపాల తీర్ధం! తదాదిగా కాలభైరవుడు కాశీవాసుడయ్యాడు.

శివసంకల్పరీత్యా, భైరవ జననం మార్గశిర కృష్ణపక్ష అష్టమియందు జరగడంతో అది పుణ్యతిథిగా పరిగణించారు. శివరాత్రితో సమానమైన ఉపవాస, జాగరణ ఫలాలను అందించే పర్వదినంగానూ కాలభైరవ జయంతిని కొందరు పాటిస్తారు.