తెలుగువారి జానపద కళారూపాలు/భజనలు, రామ భజనలు

వికీసోర్స్ నుండి

భజనలు, రామ భజనలు


ఒక నాడు పల్లె ప్రజలను భక్తితో ఆనంద పారవశ్యంలో ముంచిన భజనలు, ఆంధ్ర ప్రజా జీవితంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించు కున్నాయి. భజించటం, కీర్తించటం, స్తుతించటం వేదకాలం నాటి నుంచి ఈ నాటికి వరకూ పరిపాటైపోయింది.

ఎన్నో భజనలు, ఎందరో భక్తులు:

కష్టదశలో నున్న మానవులు భగవంతుని స్తోత్రం చేస్తారు. కొందరు వ్వక్తిగతంగా భజన చేస్తే మరికొందరు సమిష్టిగా చేస్తారు. కొందరు భగవంతుని స్తుతిస్తూ పాడతారు. మరి కొందరు ఆడతారు. ఇంకా కొందరు కూటంగా చేరి భజనలు చేస్తారు. భజనలను భక్తి పారవశ్యంతో చేస్తారు, అందరూ సమిష్టిగా పాడుతారు. లయబద్ధంగా తాళాలను మ్రోగిస్తారు. మరికొందరు చెక్క భజనలు చేస్తారు. కొందరు ఒక బృందంగా చేరి కోలాటాలు వేస్తారు. మరి కొందరు కూర్చునే హరిభజనలు చేస్తారు. ఇంకా కొందరు జయదేవుని అష్టపదులను పురంధరదాసు కీర్తనలను, తుంగదుర్తి కృష్ణదాసు కీర్తనలనూ, నారాయణ తీర్థుల తరంగాలనూ, అన్నమాచార్య గేయాలను చిరుతలతోనూ చెక్కలతోనూ, తాళాలతోనూ, తంబురాలు పుచ్చుకునీ కాళ్ళకు గజ్జెలు కట్టుకునీ పారవశ్యంతో భజనలు చేస్తారు.

ఉదాహరణలు:

హరిలో రంగ హరి, హరిలో రంగ హరి
కృష్ణమ్మా, గోపాల బాల కృష్ణమ్మా

భజ గోవిందా, గోపాల బాల కృష్ణమ్మా
కాళ్ళకు జగ్గెలు కట్టి వేళ్ళకుంగ్రాలు పెట్టి
పిల్లంగోరు చేతికి ఇచ్చి... ఫింఛము పట్టెద
కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మ ॥

అంటూ విందులు వేసి తన్మయులౌతారు. ఎంతెందుకు

పది కొంపలు లేని పల్లెనైనను రామ
భజన మందిర ముండు వరలు గాత
రామ నామము భవస్తామ భంజనదివ్య
తారక నామమి దనరు గాత,

అని పానుగంటి వారి రచన పాదుకలో దశరధుని నోటి వెంట పలికించడాన్ని బట్టి ఆంధ్రదేశంలో రామ మందిరం లేని గ్రామం లేదు. అలాగే శివాలయాది విష్ట్వాలయాలు.

భజనల కోలాహలం:

పల్లెప్రజలు వారి వారి వ్వవసాయపు పనులు చూసుకుంటూ, విరామ సమయాల్లో యువకులు, వృద్ధులు భజనలు చేస్తూ వుంటారు. శక్తివంతులైన యువకులు నృత్యంతో కూడిన శావమూళ్ళ భజనలు అంటే తాళాల భజనలు, చెక్క భజనలు చేస్తే వృద్ధులు కూర్చుని చేతాళలతోనూ, చిరుతలతోనూ హరిభజనలు, పండరి భజనలు చేస్తారు. మరికొందరు కోలాటపు చిరుతలతో కోలాట నృత్యాలు భక్తి భావంతో చేస్తారు. శ్రీరామ నవమికి, దసరా పండగకు, భజన బృందంలో వున్న వారందరూ వివిధ పాత్రలు విభజించుకుని భజన పద్ధతిలోనే నాటకాలను ప్రదర్శిస్తారు. మధ్య మధ్య పద్యాలతో, పాటలతో, సామెతలతో సున్నితమైన హాస్యంతో తెల్లవార్లూ గ్రామస్థుల్ని ఆనంద పరుస్తారు.

కొన్ని బృందాలలో అందరూ ఒకే విధమైన రంగు పంచలు కట్టి, అలాగే నడుంకు కట్టులు కట్టి వలయాకారంగా తిరుగుతూ, ఎగురుతూ గెంతుతూ భజనలు చేస్తూ వుంటే చూపరులు తన్మయులౌతారు.

సుందరమైన అందాల భజనలు:

అందరూ కలిసి చేసే భజనలు ఎంతో సుందరంగా వుంటాయి. భజన బృందాల నృత్యం ఎంతో కష్టమైనది. వ్యాయామ ప్రదర్శన లాంటిది. అవేశ పరమైనది. మూర్తీ భవించిన భక్తి తన్మయత్వంతో కూడినది. ప్రతి బృందంలోను ఇరవై ముప్పై మంది వరకూ సమ సంఖ్య లోనే వుంటారు. అందరూ లయ తప్పకుండా ఒకే శ్రుతిలో తన్మయులై పాట పాడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో నృత్యం చేస్తూ వుంటే ప్రేక్షకులందరూ ఆనంద పరవశులై పోతారు.

అలాగే భక్తి భావంతో కొంత మంది ఉపవాస విధానాలతో రాత్రి తెల్లవార్లూ జాగారం చేస్తూ తరంగ నృత్యాలు చేస్తారు. ముఖ్యంగా రామదాసు కీర్తనలూ, ఎడ్ల రామదాసు కీర్తనలూ, తూము నరసింహదాసు, అల్లూరి వెంకటాద్రి స్వామి, నిష్టల ప్రకాశరావు, ఆదిభట్ల నారాయణ దాసు మొదలైన గేయ కర్తల పాటల్ని భజన పరులంతా ఆలపించే వారు. ఈ భజన బృందాలు ఒక్కొక్క గ్రామంలో పోటీలు పడి రెండు బృందాలుగా ఒకరిని మించి మరొకరు గ్రామ పెద్ద బజారులో ఉధృతంగా భజనలు చేస్తారు.

భజనల్లో భక్తి:

భజన పాటల్లో, భగవంతుణ్ణి ప్రార్థించటం, వేడుకోవటం, కష్టాలు చెప్పు కోవటం, కృతజ్ఞతా భావం ప్రకటించడం, స్తుతించటం, శ్లాఘించటం, వర్ణించటం, భక్తి ఆవేశంలో రామదాసులా తిట్టటం __ కోర్కెలు నెరవేరిన భక్తులు ఆయా భజన పాటల్ని, సులభమైన శైలిలో, అందరికీ అర్థమయ్యే భాషలో వినిపిస్తూ వుండీ, పండితులూ, పామరులూ, అందరూ ఆ భజనలకు హాజరై ఆనందించి, తద్వారా ముక్తి మార్గాన్ని వెతుక్కుంటారు.

కొంత మంది వార్ధక్య దశలో, జీవితం మీద విరక్తి భావంతో, భగవందుని పాద సన్నిధిని చేరు కోవాలనే తాపత్రయంతో,వ్వక్తి గతంగా, తులసీ దాసులా, త్యాగరాజులా, పురంధర దాసులా భక్త తుకారాంలా, భక్త జయదేవుడుగా, నామ దేవుడుగా, మీరా బాయి, సక్కుబాయి, ఆండాళ్ళు, రామ కృష్ణ పరమ హంసలా ఒక రేమిటి... అందరూ తన్మయత్వ గీతాలాలాపించి పల్లె ప్రజలను తన్మయుల్ని చేసి, వారిలో అంతరాత్మ ప్రభోధం కలిగించారు.

ఉదాహరణకు ఒక పాట:

ముఖ్యంగా అన్ని భజన పాటల్లోనూ తెలుగు నాట రామునికి సంబంధించిన పాటల్నే ఎక్కువగా పాడుతారు. అందుకు కారణం శ్రీరాముడు తమ స్వంత దైవమనీ భావిసారు. శ్రీరాముని మీద ముఖ్యంగా భద్రాది రామదాసు వ్రాసినవీ, పాడినవీ ఎన్నో ఉన్నాయి.

అదిగో భద్రాద్రి:

తరాళ రాగం, ఆదితాళం.

ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండి॥
ముదముతొ సీతరామ ముదిత లక్ష్మణులు
కలిసి కొలువగా రఘుపతి యుండెడి ॥ఇదిగో॥
చారు వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో
సుందరమై యుండెడి ॥ఇదిగో॥
అనుపమానమై అతి సుందరమై
దనరు చక్రముగ ధగ ధగ మెరిసెడి ॥ఇదిగో॥
కలియుగమందున నిల వైకుంఠము
నలరుచున్నది, నయముగ మ్రొక్కెడి ॥ఇదిగో॥
శ్రీ కరముగను రామ దాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువునివాసము॥ఇదిగో॥