తెలుగువారి జానపద కళారూపాలు/బతకమ్మ, బతకమ్మ, ఉయ్యాలో

వికీసోర్స్ నుండి

బతకమ్మ, బతకమ్మ, ఉయ్యాలో


పూర్వం చోళ దేశంలో ధర్మాంగదుడనే రాజుకి ఎన్నో నోముల అనంతరం తన అర్థాంగికి శ్రీలక్ష్మి జన్మించగా ఆమెకు ఎన్నో గండాలు వచ్చినప్పటికి బ్రతికి నందువల్ల "బతుకమ్మ" అని పేరు పెట్టటం జరిగిందని జన శృతి వుందని జన ప్రియగారు ఒక వ్వాసంలో తెలియజేశారు.

ఈ నాటికీ తెలంగాణా ప్రాంతాల్లో బతకమ్మ అని వారి వారి బిడ్డలకు పేర్లు పెట్టుకోవడం కనబడుతుంది. ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, లక్ష్మీ పార్వతుల పూజలు చేయడమే, కన్నె పడుచులు నోచుకోవడం వల్ల కోరుకున్న వరుడు లభిస్తాడని నమ్మకం. ఈ బతుకమ్మ పండుగ కరీంనగర్, మహబూబు నగర్, వరంగల్ జిల్లాలో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది.

ఎక్కడా లేక పోయినా!:

ఆంధ్రదేశంలో ఎక్కడా ప్రచారంలో లేక పోయినా ఒక్క తెలంగాణాలో మాత్రమే విశేష ప్రచారాన్ని పొందిన బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహార్నవమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగ జరుగుతుంది.

దీనిలో భాగంగా మొదటి ఎనిమిది రోజులూ, పెళ్ళికాని ఆడపిల్లలు ఆడుకుంటారు. దీనిని బొడ్డెమ్మ అంటారు. తొమ్మిదవ రోజున మాత్రం చద్దుల బతకమ్మ అంటారు.

బతకమ్మ పండుగ ఆశ్వయుజ మాసంలో రావడం వల్ల వర్ష ఋతువుతో విండిన చెరువులు, తొణికస లాడుతూ వుంటాయి. పండి ఒరిగిన జొన్న చేలూ, పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా వుంటుంది. ఈ పండుగ రోజుల్లో పుట్ట మన్నుతో ఒక బొమ్మను చేసి, బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్టించి దాని పైన, ఒక కలశాన్ని వుంచి, కలశంపైన పశుపు ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ, పసుపుతోనూ అలంకరిస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చేయక పోయినా, గ్రామానికి ఒక గృహంలో చేసినా సరి పోతుందని వారి అభిప్రాయం.

బొడ్డెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో వున్న ఆడపిల్లలందరూ అక్కడ గుమి కూడుతారు. ఈ వినోదాన్ని చూడడానికి పెద్ద లందరూ వస్తారు. ఇలా ఎనిమిది రోజులూ కన్నె పడచులు ఆడుకుంటారు.

తరువాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి, పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి గోరు వెచ్చని జీడిగింజల నూనెతో తలంటి పోసుకుని నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసిన ఇంట్లో చాపు వేసి బతకమ్మలను పేర్చి గుమ్మడి పూవు అండాశయాన్ని తుంచి పసిడి గౌరమ్మగా పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మను చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే వుంచుతారు.

సాయంత్రం పిన్నలు, పెద్దలు, నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు, వివిధ అలంకారాలను అలంకరించుకుని బతకమ్మలను చేత బట్టుకుని చెరువు కట్టకో, కాలువ గట్టుకో దేవాలయానికో వెళ్ళి బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్న వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.

ఆ దృశ్యాన్ని గ్రామస్తులందరూ చూచి ఆనందిస్తూ వుంటారు. మగపిల్లలు కొయ్య గొట్టాలలో, కాగితపు అంచులను కన్నెపిల్లల పైనా స్త్రీల పైనా ప్రయోగిస్తారు.

బతకమ్మ పాటలు, ఒకో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతం లోనూ, ఉయ్యాలో అని, కోల్ కోల్ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు పాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల స్తోత్రాలేగాక, అనేక పౌరాణిక గాథలైన, శశి రేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతా దేవి వనవాసము మొదలైనవే గాక, సారంగధర, బాలనాగమ్మకు సంబంధించిన పాటలు కూడా పాడుతూ వుంటారు. బతుకమ్మ పండగ వస్తూందంటే తెలంగాణా పల్లెల్లో నూతన వుత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడ పిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు అత్తగారి ఇంటి నుంచి కాగితపు పూలతో చేసిన బతకమ్మను వాయినంగా పంపుతారు. అత్తగారింట్లో వుండే ప్రతి ఆడపిల్లా ఎప్పుడు కన్న వారింటికి వెళ్ళాలా? కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తూందా? తనను తీసుకు వెళ్ళడానికి అన్న ఇంకా రాలేదే అన్న బాధను వ్వక్త పరుస్తారు.

ఉదాహరణకు పండుగ వస్తుందంటే, ప్రియుని రాకకై ఎదురు చూసే ప్రియు రాండ్లు పాడుకునే పాట__

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నానోము పండింది ఉయ్యాలో
నీనోము పండిందా ఉయ్యాలో
మావారు వచ్చిరి ఉయ్యాలో
మీవారు వచ్చిరా ఉయ్యాలో

బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాట

ఒక్కొక్క వువ్వేసి చంద మామ
ఒక జాము అయే చంద మామ

రెండేసి పువ్వు తీసి ॥చంద మామ॥
రెండు జాము లాయె ॥చంద మామ॥

ఈ విధంగా ఎన్నో పాటలు పాడుతారు. తొమ్మిదవ నాడు బొడ్డెమ్మ చర్చించి కలశంలో, ఆవాడ పిల్లలు ప్రతిదినం చెచ్చి పోసే బియ్యం పరమాన్నం వండి పంచి పెట్టి ఒక బావి దరి చేరి

బొడ్డెమ్మ బొడ్డెమ్మ.... బిడ్డలెందారే
బవిల పడ్డ వారికి ......వారిద్దరమ్మా
చెర్ల బడ్డవికి ..... .. చేరిద్దరమ్మా
కుంట్ల బడ్డ వారుకి.. కోరుద్దరమ్మ
నిద్రపో బొడ్డేమ .... .. నిద్రబోవమ్మ
నిద్రకు నూరేండ్లు...... నీకి వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి....... నిండ నూరేంళ్ళు

అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు. బొడ్డెమ్మ పండుగలో పాడబడే పాటలు ఇంకా కొన్ని వందలున్నట్లు బి. రామరాజుగారు తమ జానపద గేయ సాహిత్యంలో తెలియచేసారు.