తెలుగువారి జానపద కళారూపాలు/ఆయా జిల్లాలలో జానపద కళారూపాలు

వికీసోర్స్ నుండి

ఆయా జిల్లాలలో జానపద కళారూపాలు


అనంతపురం జిల్లా

పెనుగొండ:

ఒకప్పుడు విజయనగర రాజులు పరిపాలించిన ప్రదేశ మిది. ఇక్కడ నాటక దళాలతో పాటు ప్రాచీన జానపద కళారూపమైన బయలు నాటకాలు ప్రదర్శించ బడ్డాయి.


హిందూపురం:

అనంతపురం జిల్లా హిందూపూర్ తాలూకాలో ప్రతి గ్రామంలోను వీథి నాటక దళమో, తోలుబొమ్మలాట దళమో వుంది. బొమ్మలాట బృందంవారు లేపాక్షి రామాయణాన్ని, గరుడాచల యక్షగానాన్ని ప్రదర్శించేవారు.

కట్టె బొమ్మలు:

ఇక్కడ కొయ్యబొమ్మలాటలను ప్రదర్శించటం ఒక ప్రత్యేకత, ఈ బొమ్మలు ఆంధ్రదేశంలో మరెక్కడా కనిపించవు. ప్రక్క రాష్ట్రమైన కర్ణాటకలో వీటి ప్రభావం వుంది. బహుశా ఆ విధంగా ఈ కట్టె బొమ్మల కళాకారులు అటునుంచి ఇటు వచ్చి స్థిర పడి వుండవచ్చును.

ఈ కట్టె బొమ్మలు కళ్ళతోకూడ అభినయం చేయగలంతటి పనితనాన్ని నిపుణులైన గ్రామ వడ్రంగులు తయారు చేయ గలిగే వారు. అది ఖర్చుతో కూడుకున్న పని. ఈ కళారూపం చాల కాలం క్రితమే క్షీణించింది. నలభై సంవత్సరాల క్రితం కొంత మంది వద్ద విడి బొమ్మలుండేవి. అవి ఇప్పుడు వున్నాయే లేవో చెప్పలేము.

చిత్తూరు జిల్లా

కుప్పం:

వీథి నాటకాలను ప్రదర్శించడంలో రాయలసీమ చిత్తూరు జిల్లాలో కుప్పం తాలూకా కుప్పం పట్నానికి సమీపంలో వున్న కొత్త ఇండ్లు అనే గ్రామంలోని శ్రీకృష్ణదేవరాయ నాటక సమాజం చరిత్రాత్మకమైనది.

రాయలసీమలో వీధి నాటకాలను ప్రదర్శించడంలో ఈ నాటక సమాజం తప్పా ఇంత పేరు పొందిన నాటక సమాజం మరొకటి లేదు.

ఈ వీథి నాటక కళా కారులు ఈ వీథి నాటక కళను వంశ పారం పర్యంగా కాపాడుతూ వస్తున్నారు. వీరు భారత, రామాయణ, భాగవతాలను మూడింటినీ వివిధ ఘట్టాలుగా విభజించి ప్రదర్శిస్తారు.

పాండవ జననం నుంచీ దుర్వోధన వధ వరకూ భారతాన్ని, పాండవ జననం, లక్షాగృహ దహనం ఇలా వివిధ ఘట్టాలుగా ప్రదర్శిస్తారు.

ఇక భాగవతంలో 'శ్రీ కృష్ణ లీలలు (బాల్య క్రీడలు), వామన చరిత్ర, నరకాసుర వధ, అనే ఘట్టాలను మాత్రం ప్రదర్శిస్తారు.

వీరి పూర్వీకులు పై పురాణ గాథలన్నిటినీ సంపూర్ణంగా ప్రదర్శించేవారు. ఈనాటి కళా కారులు మాత్రం పైన ఉదహరించిన ఆయా ఘట్టాలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా వీరి భాగవతాలలో స్త్రీ పాత్రలన్నిటినీ పురుషులే ప్రదర్శిస్తారు. వారు అత్యద్భుతంగా అభినయిస్తారు. అది వారి ప్రత్యేకత.

ప్రసిద్ధ నటులు:

ఈ సమాజంలో అనేక మంది ప్రసిద్ధ నటులున్నారు. వారిలో నలబై అయిదు సంవత్సరాల వయసు కలిగిన సముద్రాల కె. వెంకటేశ్వర్లు స్త్రీ పాత్రలను అందులో ముఖ్యంగా నాయికా పాత్రలను అభినయించటంలో సుప్రసిద్ధుడు. అప్పుడప్పుడు శ్రీ కృష్ణ పాత్రనూ, సూత్రధారుని పాత్రనూ అవసరాన్ని బట్తి నటిస్తారు.

ముఖ్యంగా ద్రౌపదిపాత్ర పోషణలో ఎన్నోచోట్ల ప్రశంసలందుకోవడమే కాక ఘన బహుమతుల్ని కూడ అండుకున్నారు. అంతేకాక, హార్మోనియం వాయించడంలోనూ, మృదంగ వాయిద్యంలోను నిపుణులు.

సేదా పెద్దబ్బయ్య ఉద్దాత్తమైన పురుష పాత్రలను ధరిస్తారు. అవసరాన్ని బట్టి సుధేష్ణలాంటి స్త్రీ పాత్రలను కూడా ధరిస్తారు.

జి.మునిరత్నం ధీరోదాత్త పాత్రలను ప్రదర్శించడంలో ప్రసిద్ధుడు. హరి కథలను చెప్పడం లోనూ, సంగీతంలోనూ, హార్మోనియం, ఫిడేలు లాంటి వాయిద్యాలను వాయించడంలోనూ నిపుణులు.

మాస్టరు జి.యం. భాగవతులు హార్మోనియం వాయించడంలో ప్రసిద్ధుడు. ఎంతో మందికి హర్మోనియం వాయిద్యాన్ని నేర్పారు. హరి కథలు చెప్పడంలో నేర్పరి. పాత్రలను పాత్రోచితంగా నటించగల సమర్థుడు. సంగీత సాహిత్యాలలో మంచి అభినివేశం కలవారు.

ఏబై సంవత్సరాల వయసు గల కోమటి రామ చంద్రయ్య సంగీత సాహిత్యాలలోనూ పాత్రోచిత నటనలోనూ అనుభవజ్ఞుడైన నటుడు.

ఇంకా డి. రామకృష్ణయ్య అన్ని రకాల పురుష పాత్రలనూ సమర్థవంతంగా పోషిస్తున్నారు.

టి.ఎన్. లోక నాథం విభిన్న మనస్తత్వాలు గల స్త్రీ పురుష పాత్రలను ధరించటంలోనూ, సూత్ర ధారి పాత్రను నిర్వహించడంలోనూ సమర్థుడు.

ఎస్.ఎం. శేషప్ప వివిధ స్త్రీ పురుష పాత్రలను సమర్థవంతంగా నటించడమే కాక, గంభీరమైన కంఠస్వరం గల నటుడు.

సి.ఎస్. రంగ స్వామి స్త్రీ పురుష పాత్రలను ధరించడంలో మేటి. వి.ముని వెంకటప్ప స్త్రీ పాత్రల్నీ, హాస్య పాత్రల్నీ చక్కగా పోషిస్తాడు. ఈ సమాజంలో మరెందరో సహాయ నటులు ఆయా పాత్రలను పోషిస్తూ హంగుదారులుగా వారి నాటక సమాజాన్ని మకుటాయమానంగా నిర్వహిస్తున్నారు.

కర్నూలు జిల్లా


ఈ జిల్లాలో ఒకప్పుడు పోతకమూరి భాగవతులు ప్రసిద్దంగా వీథి నాటకాలను ఆడారు. కోటకొండ కపట్రాల గ్రామాలలో చల్లావారు కూచిపూడి పద్దతిలో బనగానపల్లి నవాబుల ఆవరణలో రాయలసీమలో భాగవత కళను ప్రచారం చేశారు. మరెన్నో బయలు నాటకాలు దళాలు పని చేశాయి.

నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో యానాది జాతి వారెక్కువ. వారిలో ఎంతో మంది ఉత్తమ కళాకారులు వుద్భవించారు. పాటలు పాడటం నృత్యాలు చేయడం, పౌరాణిక గాథలకు సంబందించిన అనేక భాగవత నాటకాలను వీథి నాటకాలుగా ప్రదర్శించారు.

గుంటూరు జిల్లా

ఒకప్పుడు ఈ జిల్లాలో కీలుబొమ్మలాటలవారు విరివిగా వుండే వారు. వేట పాలెంలో వీధి నాటక కళాకారులైన గట్టి వెంకట శివయ్య, గూరాబత్తుని వెంకటేశ్వర రావు. పి. మాణిక్యం, పాలగారి వెంకటేశ్వరరెడ్డి, యం. ఆంజనేయశర్మ మొదలైన వారుండేవారు. గుట్టి వెంకటశివయ్య బుర్రకథ దళంగానూ, దొడ్డారపు వెంకటస్వామి మేనల్లుడు యల్లమంద జంగం కథకుడు గానూ, తమ్మారపు వెంకట స్వామి వీథి నాటకాలను ఆడేవారు. దొడ్డారపు వెంకట స్వామి ఆ రోజుల్లో గొప్ప జంగం కథా గాయకుడుగా వెలుగొందాడు.

కృష్ణా జిల్లా

కూచిపూడి భాగవతుల యక్షగానాలు, వీథి నాటకాలు ప్రదర్శించారు. ఎంతో మంది పగటి వేషధారులుండేవారు. అలాగే గడ్డిపాడులో ఎంతోమంది పగటి వేషధారు లుండే వారు. ఒకప్పుడు ఎన్నో జంగాల బుర్రకథ దళాలు, గొల్ల భాగవతులు, మాల భాగవతులు, సంగెగెడ్డలో ఎంతో మంది దేవదాసీ కళాకారిణులు వుండేవారు.

మహాబూబ్‌నగర్ జిల్లా

వుప్పేరు, ఇది గద్వాలకు దగ్గరలో నున్న చిన్న గ్రామం. ఇక్కడ "బయలు నాటకాలకు" కోలాట సమాజాలకు ప్రసిద్ధి.

బయలు నాటకాలు "నెక్కటపల్లి" గిట్టూరు మొదలైన చోట్ల "కట్టెల కోలాటం", చెక్క భజన సమాజా లున్నాయి. పెద బసవయ్య, వడ్ల వెంకటరామయ్య పేరు పొందిన కళాకారులు.

జడచర్ల దగ్గరలో వున్న అచ్చంపేటలోనూ, అమరబాద్‌లోనూ, చెంచుల నృత్యదళా లున్నాయి. కోలాట దళాలు విరివిగా పని చేశాయి.

సినిపూర్ లో హరికథలు చెప్పేవారున్నారు. మెయిన్ పేట, పుట్లూ గ్రామల్లో బుర్రకథ దళాలు పని చేశాయి.

చెంగోల్, గోనెల్లి, మిట్టా బాసపల్లె, కోటబాసిపల్లి, అలంపూరు, అగ్ నూరు, మంచాపూర్, పెద్ది మాల్, కందనెల్లి, బొప్పారం గ్రామాల్లో చిరుతల భజన, కోలాట దళాలు పని చేసాయి.

పెడమాల్, గోవిందరావుపేట గ్రామాల్లో బుర్రకథ దళాలు, చెంగోల్ అల్లి పూర్, అగ్ నూర్, కొత్త బాస పల్లి, కందనెర్లి, పెడమాల్, బొప్పారం గ్రామాల్లొ భాగవత దళాలు, శంకరరెడ్డిపల్లె, మంతనగౌడ, తట్టిపల్లి మొదలైన గ్రామాలలో లంబాడినృత్య దళాలు పనిచేశాయి.

వనపర్తిలో సంగీత శాఖలతోపాటు దగ్గరలో వున్న గోపాల పేటలో తోలుబొమ్మలాట వారున్నారు. వనం శేషాచార్యులు, పాపయ్య, టి.గోపాల్ -శ్రీమతి రాధమ్మ - వెంకట రామారావు మొదలైన కళాకారులుపనిచేశారు.

జడచర్లలో భారత సంగీత నాటక కళాశాల నడిచింది. దగ్గరలోనున్న కలువకుర్తిలో భజన సమా‌వేశాలు పనిచేశాయి. అచ్చంపేటలోనూ, అమరాబాద్‌లోను చెంచుల నృత్య దళాలు పనిచేశాయి.

హైదరాబాదు

1956ప్రాంతంలో గిరిజన నృత్యశాఖను గోపాల్‌రాజ్‌భట్ స్థాపించారు. ఈ సంస్థలో అధ్యక్షులుగా కాళోజీ నారాయణరావు పనిచేశారు.

ఏభై సంవత్సరాల క్రితం గగన మహల్ రోడ్‌లో ఒక యక్షగాన బృందముండేది. అలాగే గౌలిగూడాలో శ్రీరామారావు ఆధ్వర్యంలో చిరుతల రామాయణ దళం పనిచేస్తూ వుండేది.

నాంపల్లిలో ఒక కోలాట బృందం, ఒక ఒగ్గుకథ బృందం వుండేది. ఆ బృందంలో కందస్వామి, రఘు, రాఘవులు ముఖ్య కళాకారులుగా పనిచేసేవారు.

హైదరాబాదు జిల్లా

హయత్‌నగర్ లో లోగడ చిరుతల రామాయణం జడకోపు కోలాట సమాజాలు పనిచేశాయి.

ఈ సమాజంలో పుఱ్ఱా సత్తెయ్య, యస్. వెంకటాద్రి, హనుమంతయ్య, రత్నమాచారి, వెంకోబారావు, ఏ.రాజయ్య, ఆకుల వీరయ్య, జనగామ శంకరప్ప, తిరుపతి మొదలైన వారు పనిచేశారు.

నెత్నూర్, రాజలూరు, తిమ్మాపూరు మొదలైన ఇబ్రహీం పట్నం చుట్టు ప్రక్కలున్న పై గ్రామాల్లో యక్షగాన, భజన సమాజాలు పనిచేశాయి.

మేడిచల్ చుట్టుప్రక్కల గ్రామాలైన రాంపల్లి, ఆలియాబాద్, తురకవల్లి, మరపల్లి, దుండిగల్ మొదలైన గ్రామాల్లో బుర్రకథ దళాలు పనిచేశాయి. 'రాంపల్లి', 'మేడిచల్', 'పుదూర్', 'యంజాల్, అలియాబాద్', 'యాదరమ్', 'యద్గరపల్లె' 'కసకొసైగూడ', 'వడ్డిమఱ్ఱి' , 'దుండిగల్', మొదలైన చోట్ల 'చిరుతల భజన' కోలాట దళాలు పని చేశాయి.

మేడ్చల్ లో 1952 లో బాలశంకర సమాజం ఏర్పడింది. 'రాంపల్లి', 'అరయా బాద్', 'తురకపల్లి', 'మరపల్లి', 'దుండిగాల్', మొదలైన గ్రామాల్లో బుర్రకథ దళాలు పని చేశాయి.

'రాంపల్లి', 'మేడ్చల్', 'పుదూరు', 'యంజార్', 'అలియాబాద్', 'తురక పల్లి', 'మరపల్లి', 'దుండిగాల్', మొదలైన గ్రామాల్లో భజన సమాజాలు విరివిగా పని చేశాయి. అలాగే షాబాదులో బుర్రకథ దళాలు పని చేశాయి.

'బూరుగు పల్లి', 'దుగ్గన చెరువు', 'బన్త్వారం', 'అమరవాది', 'కొల్లాపూర్', 'కోమశెట్టి పల్లె', 'బీల్ కాల్', 'బుద్రారం పల్లి' గ్రామాల్లో భజన సమాజాలు పని చేశాయి.

ఇబ్రహీంపట్నం:

ఇక్కడ శంకర నారాయణ భజన మండలి, ఓంకార భజన నాటక సమాజాలు పని చేశాయి.

చుట్టు ప్రక్కల గ్రామాలైన 'మహాసురం', ' నెత్నూరు', 'రాచలూరు', 'తిమ్మాపూరు' మొదలైన గ్రామాల్లో యక్షగాన భజన సమాజాలు వున్నాయి. ఈ సమా జాల్లో బి. రంగా రెడ్డి, ఘటం సత్యనారాయణ, మల్లా రెడ్డి, బుగ్గా రామదాసు, చంద్రశేఖర శర్మ మొదలైన వారు పని చేసారు.

పెడమాల్, గోవిందరావు పేట గ్రామాల్లో బుర్ర కథ దళాలూ, చెంగోల్, అల్లిపూర్_అగ్ నూర్_కొత్త బాసపల్లె_కంద నెర్లి, పెడమాల్, బొబ్బారం గ్రామాల్లో భాగవత దళాలున్నాయి.

శంకరరెడ్డి పల్లి, మంతన గౌడ, తట్టి పల్లి మొదలైన చోట్ల లంబాడి నృత్య దళాలు పని చేశాయి.

రాంపల్లి, దుల్ పల్లె, అలియాబాద్, తురకపల్లి, యద్గపల్లె-భుమర పల్లి, దుండిగాల్ మొదలైన చోట్ల బుర్రకథ దళాలు పని చేశాయి.

అలాగే రాంపల్లె, దుల్ పల్లె, మేడ్ చల్, పౌదూర్, యంజాల్, అలియా బాద్, యాదరం, యద్గరపల్లె, కీసర కొసహైగుడ, వడ్డెమర్రి, దుండిగాల్ మొదలైన గ్రామాలలో భజన సమాజాలు పని చేశాయి.

చుట్టు ప్రక్కల గ్రామాలైన మెయిన్ పేట, పొట్లూరు గ్రామాలలో బుర్ర కథ దళాలు, శిరిపూర్ గ్రామంలో హరిదాసులూ, హరికథా గానం చేసే వారూ వుండే వారు.

తాండూరు చుట్టు ప్రక్కల గ్రామాలైన చెంగోలి, గోనెల్లి, మిట్టబాస పల్లి, కోడబాస పల్లి, అల్లాపూర్, మంతన గూడ, అగ్నూర్, గోవింద రావు పేట, మంబాపూర్, రుక్మాపూర్, పెద్ది మాలకండ నెల్లి, బ్రిధారమ్, బొబ్బారం మొదలైన పల్లెలలో చిరుతల భజన, కోలాట దళాలు పని చేశాయి.

బుద్దారం, పెద్దమాల్, గోవింద రావు పేటలలో బుర్ర కథ దళాలు పని చేశాయి. చెంగోల్, అల్లాపూర్, మంతన గౌడ, అగ్నూర్, కోటాబాసపల్లి, దందనెల్లి, పెడమాల్, బొబ్బారం గ్రామాలలో భాగవత దళాలు పని చేశాయి.

అలాగే షంకర్. రెడ్డి పల్లె, మంతన గౌడ, తట్టెపల్లి, పసహాపూర్ తండా, జైరాం తండా మొదలైన గ్రామాల్లో లంబాడీ నృత్యకారులున్నారు.

మెదక్ జిల్లా

మెదక్ జిల్లాలో భాగవత దళాలూ, చిరతల రామాయణం ప్రదర్శించే సమాజాలు, కోలాటం మొదలైన జానపద కళారూపాలను ప్రదర్శించే బృందాలు విరివిగా వున్నాయి.

సంగారెడ్డి లో జడకోపు కోలాట సమాజాలు, వీథి భాగవత దళాలు విరివిగా వున్నాయి. సదాశివ పేటలో భాగవత దళాలను పడిగి నారాయణ, మారేపల్లి యజ్ఞ నారాయణ మొదలైన కళాకారులు నిర్మాణాయుతంగా నడుపుతున్నారు. శ్రీ గోవింద దాసు ఆధ్వరంలో మూడు చిరుతల భజన సమాజాలు నడిచాయి. మారేపల్లి, సూరారం, నందికుండి, నిజాంపూర్, వెంకటపూర్, తంగదంపల్లె మొదలైన గ్రామాల్లో కూడ చిరుతల రామాయణం భజన సమాజాలు నడిచాయి. ఈ సమాజాల్లో రామకృష్ణ, శంకర రావు, నరసింహా రెడ్డి మొదలైన కళాకారులు పని చేశారు.

జహీరా బాదు తాలూకా బిలాల్ పూర్ లో ఒక బుర్ర కథ దళం పని చేసింది. కోహిర్, ముగుదం పల్లి, అజాద్ గంజ్, దిగ్వాల్, రంజోల్, చీరిక మొదలైన గ్రామాల్లో వీథి భాగవత దళాలు, తోలు బొమ్మల దళాలు సమర్థ వంతంగా పని చేశాయి.

బిలాల్ పూర్, కోహిర్, రంజోల్ మొదలైన గ్రామాలలో చిరుతల భజన సమాజాలు నడిచాయి.

మీర్జాపూర్ దగ్గర నున్న రామ గుండం, చిటికుర్తి గ్రామాల్లో భజన సమాజాలు నడిచాయి. వామన పల్లి, సిద్దపూర్, దోనపల్లి, మొదలైన గ్రామాల్లో లంబాడి నృత్య దళాలు పని చేశాయి.

జోగి పేటకు దగ్గరలో నున్న కనకం పల్లె, పెదపూర్, తికమల్ , రామన్న పేట గ్రామాల్లో భాగవత దళాలు పని చేశాయి.

కనకం పల్లి, పెదపూర్ గ్రామాలలో చిరుతల కోలాటం సమాజాలు నడిచాయి. వాసుదేవ, ఆదెప్ప మొదలైన వారు పని చేశారు.

నిజామాబాద్ జిల్లా

నిజామాబాదుకు నలభై మైళ్ళ దూరంలో వున్న బన్స్ వాడలో భీమశాస్త్రి హరికథ చెప్పడంలో ప్రసిద్ది వహించారు. అచ్చం పేటలో శ్రీనివాస రావు కోలాట సమాజాన్ని రైతు నగర్లో పొట్లూరి వీర భద్రం, రంగ నాయకులు, ఒక భాగవత సమాజాన్ని నడిపారు.

బిరకూర్, మొహద్ నగరాల్లో భజన పార్టీలు పని చేశాయి. బిరకూర్, పిట్లాం గ్రామాల్లో బుర్ర కథ దశాలు పని చేశాయి. దుకి, తడికేల్, తిరుమల పూరుల్లో కూడ వీథి భాగవత సమాజాలు పని చేశాయి. బోధన్ కు దగ్గరలో నున్న రుద్రూరు, జహదిమలపూర్ లో, భజన పార్తీలు భాగవత సమాజాలూ పనిచేస్తూ వున్నాయి. ఈ సంస్థల్లో కాశీనాద్, వెంకటేశ్వర్లు, జైపాల్, కోటయ్య, వీరేశం, శ్రిమతి వీరేశ్వరం మొదలైన నటీమనటులు పనిచేశారు.

అదిలాబాదు జిల్లా

అదిలాబాద్ జిల్లాలో యప్పలగూడ, బాందా, కప్పరాళ్ళ మొదలైన ప్రదేశాల్లో యక్షగానాలను ప్రదర్శించే సమాజాలు పని చేశాయి. అదిలాబాద్ తాలూకా పంకిడి గ్రామంలో ఒక డప్పుల నృత్య బృందముంది.

మధోల్ చుట్టు పట్ల గ్రామాలైన భాయనాపి, కొత్త గని, మీర్జాపూరు, తిమ్మాపూర్, దిగమ, సుంకలి, మహాజం, చుండి, కోమరి మంజరి, బాసార్ మొదలైన గ్రామాలలో యక్షగాన బృందాలు పనిచేశాయి.

ఘనపురం తాలూకా కన్నపూర్, దస్తురాబాద్, కాలీ మడుగు, ఇందనపల్లి, రామోజీ పేట మొదలైన ప్రాంతాల్లో యక్షగాన దళాలు పని చేశాయి. వడ్ల నరసింహులు, నరసింహయ్య, గోవింద రావు, వెంకటరెడ్డి మొదలైన కళాకారులు ఈ దళాల్లో పనిచేశారు.

లక్సెట్టి పేట తాలూకా మున్నూరు, పొట్టాయి పల్లె, రాయం పేట, దౌడ పల్లె మొదలైన చోట్ల వీథి నాటక సమాజాలు పనిచేశాయి. రాయం పేటలో ఒక బుర్రకథ దళం కూడ వుండేది.

బన్నూర్ ప్రాంతంలో కొత్త పల్లె, నీలవాయి గ్రామాలలో వీధి భాగవత దళాలూ, వేమన పల్లె, నీనాల్, భీమవరం, మిట్ట పల్లె, అదిల్ పేట, సిర్వా అమద్ మొదలైన గ్రామాలలో యక్షగాన దళాలు పనిచేశాయి.

ఈ దళాలలో చిక్కిపల్లి కృష్ణయ్య, సాంబయ్య, బన్ రెడ్డి మొదలైన వారు పనిచేశారు.

నిర్మల్ హస్త కళలకు ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడ చిరుతల రామాయణం ప్రదర్శించే జానపద కోలాట సమాజం పనిచేసింది. ఇది తెలంగాణాలో ఒక ప్రత్యేకమైన కళా రూపం.

కరీంనగర్ జిల్లా

కరీంనగర్ జిల్లాలో నుస్తురాపూర్, జాగిర్ల, మొగిలి పాలెం, గంగిపల్లి, మాన కొండూరు, గోపాల రావు పల్లె, వెదురు గట్ట మొదలైన గ్రామాలలో యక్ష గాన దళాలు, తోలు బొమ్మల ఆటలు ఆడే దళాలు పనిచేశాయి.

హుజూరాబాద్ కు దగ్గరలో నున్న తాటికంటి మొదలైన చోట్ల వీధి నాటక దళాలు పనిచేశాయి. హుజూరాబాదుకు ఆరు మైళ్ళ దూరంలో వున్న మాణిక్యాపూర్ లో విప్ర వినోదులు ఒకప్పుడు ముప్పై కుటుంబాల వారున్నారు. పదిహేను మైళ్ళ దూరంలో వున్న వల్లభాపురంలో సాధనాసూరులు పద్మసాలి కుటుంబానికి చెందిన వారున్నారు. ఈ తాలూకాలో ప్రతి గ్రామంలోనూ చిరుతల రామాయణం కళారూపం బహుళ ప్రచారంలో వుంది.

జగిత్యాలకు గద్దరలో నున్న భీమారం, బల్ల కోడూరు, కొండపల్లి, రాయికాల్, భాల్ గడ, దుల్యాల్, కోడూరు పల్లి మొదలైన చోట్ల యక్షగాన దళాలు పనిచేశాయి. బుగ్గారం గ్రామం లోనూ చిరుతల రామాయణం కోలాటం దళాలు విరివిగా వున్నాయి ఒకనాడు.

పైన ఉదహరించిన కళారూపాల్లో వెంకట రెడ్డి, దావూరి వెంకటాచారి, శంకరయ్య, మనోహారాచార్య, లక్ష్మికాంత శాస్త్రి, పేట కాంతయ్య, చంద్రమౌళి శాస్త్రి, అనంతయ్య మొదలైన కళాకారులు పని చేశారు.

ముట్టుపల్లి తాలూకాలో అనేక గ్రామాల్లో భాగవత దళాలు పని చేశాయి. ఇటికాల్, నత్తారం, తక్కెడపల్లి, శ్రీకొండ, శ్రీపురం, మానపల్లె, వెల్లుట్ల, మన్నెగూడెం మొదలైన గ్రామాల్లో భాగవత దళాలు పనిచేశాయి.

శిరిసిల్ల తాలూకా బూరుగు పల్లి, హనుమాజి పేట, నూకలదుఱ్ఱి గ్రామాల్లో యక్షగాన దళాలు పనిచేశాయి. సుల్తానాబాదుకు దగ్గరలో కూచిపూడి అనే గ్రామం వుంది. ఇక్కడ కూడ కూచిపూడి నృత్యముంది.

కరీంనగర్ జిల్లాలో యక్షగానం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. శ్రీ గజవెల్లు వెంకట నర్సు, తీగల గుట్టపల్లి బృందం ఈ ప్రాచీన కళారూపాన్ని ప్రదర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఒగ్గు కథ బాగా చెప్పే వారిలొ మొదటి శ్రేణికి చెందిన వారు శ్రీ మిద్దె రాహులు. హనుమాజి పేటకు చెందిన రాములు పది హేను సంవత్సరాల నుండి తన బృందంతో ఒగ్గు కథలు చెపుతున్నారు. సారంగధర, గంగా గౌరి సంవాదం, నల్ల పోచమ్మ, అమెరికా రాజు కథ, కాంభోజ రాజు కథ, భక్త మార్కండేయ కథ, మాంధాత, సిరిదేవి, పెద్దమ్మ రాలు, రామాయణ భారత కథలను ఒగ్గు కథలుగా చెప్పారు.

మిద్దె రాములుతో ప్రభుత్వం, వయోజన విద్య, కుటుంబ నియంత్రణ మొదలైన కథలను ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక ఢిల్లీ, బొంబాయి లాంటి ప్రదేశాల్లో ప్రదర్శన లిప్పించింది. కొత్తపల్లి రాజమల్లయ్య, మాట్ల మల్లేశం మొదలైన వారు కూడా ఒగ్గు కథలను చెపుతూ వుండేవారు.

కరీంనగర్ జిల్లాలో బుర్రకథలు చెప్పే బృందాలలో ముఖ్యమైనది మాన కొండూరు వామన మూర్తి బృందం. ఇందిరా గాంధి స్మారక అవార్డును కూడ అందుకున్న దళం. అలాగే గట్టు దుద్దెనపల్లి వెదురు గట్టలో కూడా బుర్రకథ దళాలు పనిచేశాయి.

ముఖ్యంగా గణపతి నవరాత్రి ఉత్సవాలలోనూ, దసరా వుత్సవాలలోనూ, కోలాటం వేయటం ఆనవాయితీ, కొండాయిపల్లె బృందం కృష్ణ లీలలు ప్రదర్శిస్తుంది. ఇంకా రాచపల్లి, వెల్లుల్ల, పెంబట్ల, కోనాపూరు, కొండన్న పల్లె గ్రామాలకు చెందిన బృందాలు కూడ కోలాటాన్ని ప్రదర్శించారు.

విశాఖపట్నం జిల్లా

విశాఖ జిల్లా మాడుగులకు రెండు మైళ్ళ దూరంలో వున్న గుట్టాల పేట, హుకుంపేట గ్రామాల్లో అడవి జాతులకు సంబంధించిన ప్రజ అనే నృత్యాన్ని చేస్తూ వుంటారు.

అంపోలు _ఆడ్దవరం:

శ్రీకాకుళానికి నాలుగు మైళ్ళ దూరంలో ఈ రెండు గ్రామాలూ వున్నాయి. ఇక్కడ రంజకవరు అనే బుంజ వాయిద్య బృందాలు వుండేవి. ఈ వాయిద్యాలు శివ పార్వతుల కళ్యాణ సమయాలలో ఉపయోగిస్తారు. వీటి ధ్వని బ్రహ్మాండ మైనది. దీనిని ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణ జాతికి చెందిన వారు వాయిస్తూ వుంటారు. వీరు పుష్య మాసంలో ఆయా గ్రామాల వెళ్ళి వస్తూ వుంటారు. బుంజ కథను మరోచోట ప్రస్తావించటం జరిగింది.

బుంజ వాయిద్య కళాకారులు వి. ఆంజనేయులు, జంగం సత్య నారాయణ, మిరియాల కోటి లింగం, యస్.యస్. అప్పయ్య మొదలైన వారు.

విశాఖపట్టణం

విశాఖ పట్టణంలో ఎన్నో బుర్రకథ దళాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి కళామతల్లి బుర్రకథ బృందం, రామజోగి పేట, కొమరశ్రీ బుర్ర కథ దళం. వెంగళ రావు పేట, భవానీ బుర్ర కథ బృందం, కుమ్మరి వీధి కనక మహాలక్ష్మి బుర్రకథ దళం, న్యూ కాలనీ, అభ్యుదయ బుర్రకథ బృందం, సీతమ్మ పేట విశ్వేశ్వర బుర్రకథ దళం. ఇసుకతోట, నాయుడు మాస్టరు బుర్రకథ దళం, అనకాపల్లి శ్రీనివాసా బుర్రకథ దళం పని చేశాయి.

శ్రీ అప్పలదాసు ఇసుక తోట చుక్కాకుల సూరి బృందం, యస్, కోట మొదలైన బృందాలు జముకుల కథలు చెప్పాయి.

విజయనగరం:

అభ్యుదయ కళామండలి విజయనగరం కుమ్మరి మాష్టారు డి. ఎ. నారాయణ బుర్రకథలను జానపద కళారూపాలను ప్రదర్శించారు. సంపత్కుమారు బృందం ఆంధ్రజాలరి తోపాటు జానపద కళారూపాలను ప్రదర్శించారు. ఇంకా రాఘవ కుమార్, కొంగలి సత్యనారాయణ మ్నూర్తి, రావు పట్నాయక్ బుర్రకథ దళం, గుండ్రా పద్మ నాభ వారు, రవి కుమార్ దళం _ సూర్య ప్రకాశ్ బృందం పని చేశాయి.

యండమూరి అమ్మాణి బృందం, సామ వేదం కోటేశ్వర రావు భాగవతార్, కొలచల ఇందిరా బాల మొదలైన వారు హరి కథలు చెప్పటంలో ప్రసిద్ధి చెందారు.

శ్రీకాకుళం జిల్లా

ఈ జిల్లాలో ఈ ద్రింది దళాలు బుర్రకథ దళాలుగా వర్థిల్లాయి. లలితకళా సమితి బృందం శ్రీకాకుళం అంపోలు లక్ష్మయ్య బృందం, పొందూరు రమణ శ్రీ బుర్ర కథ దళం, చీపురుపల్లి శ్రీనివాస కథా బృందం నరసన్నపేట.

తూర్పు వీధి భాగవత బృందాలు:

కానేటి అప్పారావు నర్సీ పట్నం, కొచ్చెర్ల బ్రహ్మానందం లక్కవరపు పేట, ఆవల గాంధీ బృందం శ్రీ రాంపురం, రావుల వలస.

తూర్పు గోదావరి జిల్లా

ఈ జిల్లాలో పగటి వేష ధారులు, కోల సంబరం, వీర నాట్యం, తప్పెటగుళ్ళు మొదలైన కళారూపాలున్నాయి. కాకినాడ, మాధవపట్నం, సర్పవరం మొదలైన చోట్ల తోలు బొమ్మలాటల బృందాలున్నాయి. యం.వి.రమణ మూర్తి, కృష్ణమూర్తి తోలుబొమ్మలాటలో ప్రసిద్ధులు.

రాజమండ్రిలో వున్న విభూతి భవానీ లింగం పగటి వేషాలను ధరించటంలో ప్రసిద్దులు. వీరికి ప్రత్యేక బృందముంది. తూర్పు గోదావరి జిల్లా పగటి వేషధారుల సంఘాన్ని నడుపుతున్నారు.

అలాగే గజపతి నగరంలో తప్పెట గుళ్ళు బృందాలు, ద్రాక్షారామలో ఋంజ వాద్యకుల బృందముంది.

మరికొందరు కళాకారులు

ఎందరో ఈ కళారంగానికి సేవ చేశారు. వారిలో మరి కొందరని ఇక్కడ ఉదహరిస్తున్నాను. కరుమజ్జ అప్పారావు విజయనగరం, కత్తి సాములో ఆరితేరిన వారు. నెల్లూరు జిల్లాకు చెందిన కె. కళాధర్, మూకాభినయం చేసే కళాకారుడు.

డాక్టర్ చిగిచర్ల కృష్ణా రెడ్డి అనంతపురం జిల్లా, సుబ్బారావు పేట. చెక్క భజన, జానపద నృత్య కళ, గ్రామీణ సంస్కృతి, ధర్మవరం తాలూకా, జానపద గేయాలు, గ్రంథాల రచయిత, తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళల శాఖలో పని చేస్తున్నారు.

అమ్మళ్ళ చిన్న గోపీనాథ్ అనంత పురం జిల్లా, అప్పరాచ్చెరువు జానపద నృత్య కళాకారుడు.

జుజ్జవరపు బసవయ్య కృష్ణా జిల్లా ఉంగుటూరు డప్పు వాయిద్యంలో నిపుణులు.

బొంతల కోటి జగన్నాథ భాగవతారు విజయనగరం జిల్లా, చింతాడ: తూర్పు వీథి భాగవత కళా కారుడు మోమట పల్లి.

పోలాప్రగడ జానార్థన రావు మూకాభినయ నటుడు. సికింద్రాబాదు, తారనాక, కరణం తిప్ప రాజు బి.ఎ. , బి.యిడి. హిందూపురం. యక్షగాన కళా కారుడు.

డి.దేవవ్రత్, హనుమకొండ, జానపద కళా కారుడు, కోరాడ పోతప్పడు,శ్రీకాకుళం జిల్లా షేరుమహమ్మదు పురం, తప్పెటగుళ్ళు కళాకారుడు. మానా ప్రగడ నరసింహ మూర్తి, హైదరాబాదు, జానపద లలిత గీలాల గాయకుడు, కురవ నాగన్న అనంతపురం, గొరవయ్యల నృత్య కళాకారుడు.

విభూతి భవానీ లింగం, పగటి వేష ధారుల్లో అగ్రగణ్యుడు. వీరిని గురించి ఇదివరకే వివరించటం జరిగింది. కనక దండు మల్లయ్య తాళ్ళపాక గ్రామం, చెక్క భజనలో నిపుణులు; కలిమి శెట్టి మునెయ్య ప్రొద్దుటూరు: జానపద కళాకారుడు, కలిమి శెట్టి రామ శేషయ్య జానపద కళాకారుడు అనంతపురం.

జి.వీణాదేవి, చిత్రకళలో ప్రజ్ఞాశాలి. మల్లేశ్వరం బెంగళూరు గిత్తా వెంకటేశ్వర రావు, బండారు లంక, గరగ నృత్యంలో నిపుణులు. చింతా వెంకటేశ్వర్లు వెలపల్లి, వీర నాట్య బృందాన్ని నడుపుతున్నారు. వీరిని గురించి నీర నాట్యంలో ఉదహరించ బడింది. తిరుపతి శేషయ్య గెట్టెపల్లి, యక్ష గాన కళాకారుడు కింతాడ

సన్యాసిరావు భాగవతర్, శిల్పకళలో ప్రావీణ్యుడు. తూర్పు గోదావరి, పెద్దాపురం, సుక్క సత్తెయ్య, ఒగ్గు కథలో నిష్ణాతుడు. ఒగ్గు కథా వివరణలో వీరిని గూర్చి వివరాలు ఇవ్వబడ్డాయి. దికొండ సారంగ పాణి, హనుమ కొండ _జానపద సంగీత కళాకారుడు. ఏ. సుబ్బయ్య నాయుడు, కుప్పం మండలం, కొత్త ఇండ్లు గ్రామం. వీథి నాటకంలో ప్రసిద్ధులు. పిల్లి సుబ్బారావు, గరగ నృత్య కళాకారుడు, కొత్తపేట. సౌమిత్రి జమిస్తాన్ పూర్, జానపద కళాకారుడు. హరియపురాజు హృషీకేశవ రావు,. కడప జానపద కళాకారుడు.

జానపద కళారూపాలు

ప్రజానాట్యమండలి

ప్రగతిశీల దృక్పథం