గోలకొండ పత్రిక సంపాదకీయాలు/విజయనగర షష్ఠి శతాభోత్సవము
విజయనగర షష్ఠి శతాబ్దోత్సవము
23 - 4 - 1936
విజయనగర సామ్రాజ్యము (Empire) అసామాన్యమైనదై యుండెను. వింధ్యాద్రి నుండి కన్యాకుమారి వరకు వ్యాపించి యుండినట్టిది అట్లుండినను మన రాష్ట్ర చరిత్రకారులగు సయ్యద్ హాషమీ గారు దీనిని "రెజ్వాడ" సంస్థానముగా పేర్కొనినారు ఆ చర్చ యిప్పుడెందుకు లెండు ఇప్పుడు చెప్పబోయిన దేమన ఇంతలో అనగా డిసెంబరు మాసములో కర్ణాటకులు విజయనగరసామ్రాజ్య స్థాపన కాలము ఈ సంవత్సరములో ఆరు శతాబ్దములు ముగియు చుండుటచేత గొప్ప యుత్సవము హంపీలో చేయనున్నారు
కాని ఆంధ్రులు మాత్రము ఏమియు ఆ విషయమై ఆలోచించునట్లు లేదు. కర్ణాటకులీ పనికయి రెండు సంవత్సరముల నుండి ప్రయత్నములు చేయుచున్నారు. కర్ణాటకుల కన్న హెచ్చుగా ఆంధ్రులకీ విషయమున శ్రద్ధాభక్తులు ఉండవలసి యుండెను ఆంధ్ర చారిత్రక పరిశోధన సంఘము వారీ విషయమున శ్రద్ధ చూపవలెను. కాకతీయ సంచికలో అలసి సొలసి నిద్రపోవుట హాస్యాస్పద మగును
ఇప్పటికయినను మించినది లేదు ఇంకను ఏడెనిమిది నెలల అవకాశమున్నది తగిన సన్నాహములు చేసిన చాల గొప్ప పని చేసినవారు కానుందురని హెచ్చరించుచున్నాము.