Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/వరంగల్లు కళాశాల

వికీసోర్స్ నుండి


వరంగల్లు కళాశాల

30-7-1927

ఓరుగల్లు మున్నొకప్పుడు ఆంధ్ర దేశమునకు రాజధానిగ నుండెనని సర్వజనులకు తెలిసేయున్నది. కాల ప్రవాహమున ఎన్నియో మార్పులు జరుగుచున్నవి. భారతదేశ మంతటను కీర్తి బడిసిన కాకతి సామ్రాజ్య మస్తమించెను. వాటిగోలె నీ పట్టణము అంధకార బంధురమై యుండెను. దయామయులగు మన ప్రభుత్వమువారు వరంగల్లును ఆ ప్రాంతమునకు ప్రధాన స్థలముగ నేర్పరచి పూర్వ గౌరవమును నిలిపిరి. గత మూడు సంవత్సరముల క్రితము తెలంగాణమునకు ముఖ్య పట్టణమయ్యెను. ప్రాంతాధికారి నియమింపబడెను. కానీ కళాశాల లేని లోపముండెను. ఆంధ్రులు హైద్రాబాదుకు వచ్చియే ఉన్నతవిద్య పొందుచుండిరి. గత రెండు సంవత్సరముల క్రింద మహారాష్ట్ర ప్రాంతమున రెండు కళాశాలలు స్థాపింపబడగ ఆంధ్రుల కన్నులు దెరచిరి. ఓరుగల్లు నందొక కళాశాల స్థాపించుటకు ప్రయత్నించిరి. తత్ఫలితముగ నిపుడు కళాశాల యేర్పాటు గావింపబడినందులకు పౌరుల కృషియును, ప్రభుత్వము వారి ఆదరణయును, ప్రశంసనీయము. ఈ కళాశాల ఆంధ్రులు పౌర్వస్వత్యము బడయుటకు మార్గదర్శక మగుగాక . అయినను ఒక సంగతి వినుచున్నాము. ఇందు ఆంధ్రము సంస్కృతమునకు తావు ఒసంగబడలేదట. ఆంధ్ర భాషకు ముఖ్యస్థానమగు ఓరుగల్లునందే ఆంధ్రమునకు ప్రాముఖ్యము లేనిచో ఇంతకన్న వేరు దౌర్భాగ్యము వుండనేరదు. ఇది నిజమే అయినచో ఇట్టి లోపము ప్రభుత్వమువారు వెంటనే తీర్చెదరని నమ్ముచున్నాము.