గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మా అయిదవ సంవత్సరం
మా అయిదవ సంవత్సరం
7 - 5 - 1930
మా పాఠకుల యాదరము వలనను, ప్రభుత్వానుగ్రహమువలనను మేము తిన్నగా నాల్గవ సంవత్సరమును దాటించితిమి ఈ సందర్భమున మేము నివేదించుకొనదలచిన విషయములు చాలాలేవు మా నాల్గవ సంవత్సరము హిందూస్థానమందేగాక, నిజాము రాష్ట్రమందు కూడ చాల ముఖ్యమైనది. ఈ సంవత్సరమందే మహాత్మా గాంధీగారు తమ యపూర్వ యుద్ధమును ప్రారంభించిరి. సర్వ ప్రపంచ దృక్పధమును మార్చివైచు నీ యుద్యమము ప్రపంచ మందద్వితీయమై యున్నది. ఈ మహోద్యమము మూలలందుండు మా నిజాము సోదరులను గూడ కొందరి నాకర్షించినది.
ఇట్లాకవంక బ్రిటిషు హిందూ స్థానములో తిరుగుబాటు జరుగుచుండ ఉపన్యాసములిచ్చుటకుగాని, యాందోళనము చేయుటకుగాని జనులు వెనుదీయక బ్రిటిషు ప్రభుత్వమును ముప్పతిప్పల పెట్టుచుండ మన నిజాము రాష్ట్రములో మా నాల్గవ సంవత్సరకాలమందు పోలీసు గష్తీ యొకటి బయలుదేరెను దాని వలన రాజకీయసభలుగాని, రాజకీయేతరములు కాని చేయుటకు వీలులేకపోయెను సర్వప్రపంచమందు సర్వహీనస్థితియందుండిన మన విద్యార్ధికి తోడుగా నీ యవసర నిర్బంధములు మా ప్రజలపాలిట సుందరకంకణములై పొటమించినవి, బ్రిటిషు ప్రభుత్వమువారి దాతృత్వ మెంతటిదో కాని యచ్చట చిన్న చిన్న బాలురుసు, స్త్రీలును, సభా వేదికలపై యెక్కి యిష్టము వచ్చినట్లు వాగుచుండ వారిజోలికి పోయిన పాపమునకు పోకపోయిరి కాని మా రాష్ట్రములో రాజకీయములననేమియో తెలియని యమాయక ప్రజలు కేవల విద్య సంబంధపు సభల చేసికొందుమనిన వానికై నెలలకొలది కార్యభారములు జరిపి.............వారినిగరానీలో సభలు............. వచ్చుచున్నవి. ............. వంక వాగ్బంధన విధానము ...............వృద్ధి నొందుచుండ నింకొ............పత్రికా ధ్వంసకము ప్రారంభమయ్యెను. సుమారు మూడు సంవత్సరములనుండి రైతుల పక్షముననే తన కలము నుపయోగించిన రయ్యతు పత్రికనోట నీరుపోయు వారైనను లేక దిక్కులేని చావు చచ్చెను పాపము 9 వారములైన సరిగా ప్రపంచ వెలుతురు చూడని (న్యూయీరా) పత్రిక పురిటిలోనే గంతుకొట్టెను ఇంక మా గోలకొండ, రహబరె దక్కన్, సుబెదక్కన్, పత్రికకు మందలింపుచే భీతి కలిగెను. మన రాష్ట్రములో పదియవ భాగమైన తిరువాన్కూరు సంస్థానములో సుమారు 600 పత్రికలున్నవి కాని మన రాష్ట్రములో 6 పత్రికలైనను సరిగా లేవు. మా రాష్ట్రమున దినపత్రికలు పత్రికలే కావు మా ఉర్దూ దినపత్రికలు పలుమారు సంపాదకీయములే వ్రాయవు మా ఉర్దూ పత్రికలకు సంవత్సరమున ఒక్కొక్క తంతి వార్తకూడ రాదు। బుల్లెటిన్ పత్రికను పట్టుకొని రాత్రి కూర్చుని దానిని అనుకూలమున్నంత వరకు తర్జుమా చేసికొని ప్రొద్దుననే అచొత్తి బయటపడునట్టివి మా దినపత్రికలు ఇక మా బుల్లెటిన్ కూడ విదేశ వార్తలను నిచ్చుటలో చాల యాలస్యము చేయుచున్నది ఈ పత్రిక లన్నింటిలో మన రాష్ట్రములోని జిల్లాలలో నేమి జరుగుచున్నదో తెలియనే తెలియదనవచ్చును. ఈ జిల్లాల వార్త లిచ్చుటలో మా గోలకొండయు, నిజాము విజయము తప్ప తక్కిన పత్రిక లిచ్చుటయే లేదనిన యతిశయోక్తి కాదు!!
ఇట్టి స్థితిలో యిట్టి యంధకారములో మేము తగుల్కొనియున్నాము. ఇక మా యాంధ్రుల సంగతి కొంత విచారింతము. ప్రస్తుత రాజకీయ హద్దులను బట్టియు, మా రాష్ట్ర భూగోళమునుబట్టి యేమి మద్రాసు భూగోళమునుబట్టి యేమి నిజాము రాష్ట్రము వేరు, మద్రాసు రాజధాని వేరు కావున ఉభయ ప్రభుత్వములు బ్రిటిషు ఆంధ్రులను నిజాము ఆంధ్రులనుండి విడదీసి యున్నారు. అయినను నీ యుభయాంధ్రులలో సామీప్యసారూప్యములు లేకపోలేదు. 64 లక్షల సోదరులను దక్షిణ ఆఫ్రికాకు పోయిన కూలీలనుగా తక్కిన యాంధ్రులు చూడజాలరుగదా! అయినను అటులే చూచుచున్నట్లు మాకు గోచరించుచున్నది.
ఈ రాష్ట్రములో తెలంగానా మరట్వాడ ముఖ్య రాజ్య విభాగములు, అందు తెలంగానాలు 64 లక్షలు యాంధ్రులు, మరాట్వాడాలు 32 లక్షల మహా రాష్ట్రులును గలరు మహారాష్ట్రుల సంఖ్య తెలుగు వారలు సగమే యుండినను బ్రిటిషు రాజ్య మహారాష్ట్రులు - అనగా బొంబాయి రాజధానిలో మహారాష్ట్రులు తమ సోదరుల యెడ అత్యంత సానుభూతి చూపుచున్నారు పత్రికలందేమి, గ్రంథములందేమి, సభలందేమి, సర్వ విధములవారు తమ ప్రాంతములలో తమ సోదరుల విషయమై శ్రద్ధ పుచ్చుకొనుచున్నారు. ఈ శ్రద్ధ కొంచము శ్రుతి మించినదిగా కూడ నున్నది. కావుననే కొందరు మా రాష్ట్రమునుండి 'షేరు బదల్' అయిరి కొన్ని మహారాష్ట్ర పత్రికలు రాష్ట్రములోనికి రాకుండ నిషేధింపబడెను కొన్ని మహారాష్ట్ర గ్రంధములు కూడ నిషేధింపబడెను.
ఇది యిట్లుండ మా మద్రాసు రాజధానిలోని యాంధ్ర సోదరులు మాకేమి చేసిరని ప్రశ్నించుచున్నారు. అచ్చట పత్రిక లిక్కడి వార్తలనే ప్రకటించుట లేదు. నిజాము రాష్ట్రపుటాంధ్రులకు బ్రిటీషు రాష్ట్రపు జనులకు కాంగ్రెసు యెట్లో అట్లు ప్రధానమైన ప్రధమాంధ్ర మహాసభ జరుగగా దాని వార్తయైన యచటి పత్రికలు ప్రకటింపకపోయెను. ఇక ముఖ్యోపన్యాసములలో తీర్మానములు అచ్చువేయు దాతలెవరు? మొత్తము పై మాయనుభవమున మహారాష్ట్రులలో నుండునంతటి ప్రేమ మా యాంధ్రులలో లేదు
ఇక మా రాష్ట్రములోని యాంధ్రుల స్థితిని విచారింతము. మీ సోదర రైతులను పాటకపు జనులను వర్తకులును - అనగా ఆంధ్రులందరు యవాచ్యహీనస్థితులు నుండినందులకు వర్తక రైతు సంఘములే తార్కాణము. ఈ సంఘముల ముఖ్యోద్దేశము ప్రజలు తమపై యన్యాయమైనట్టి దౌర్జన్యము లెవ్వరును చేయకుండుటకై యాత్మ సంరక్షణము చేసికొనుట అనగా వీరికింతవరకు కష్టములే కలుగుచున్నవని దీని భావము.
నిజాము రాష్ట్రము ఏ శతాబ్దములో వృద్ధికి రావలయునో యెన్నడు సర్వసంస్థానములందు నిజాముగా యుత్కృష్టమైనదని యనిపించు కొనునో, మా జ్యోతిష గణితములో నగోచరముగా నున్నది మేము మాత్రము మా శక్తి కొలది ప్రజా సేవ చేయుచుందుము. కాని ప్రజలు మాత్రము, తమ ధర్మము నెరవేర్చుట లేదు మేము పైన వర్ణించిన నీసమగ్రపు ఉర్దూ దిన పత్రికలకు ద్రవ్యము హెచ్చుగా నిచ్చికొనుటలో గౌరవము అని భావించు సోదరులనేకు లున్నారు వారందరి దృక్పధము మారినట్లైన నిజమైన పత్రికలేవియో బయట పడును. కుక్క కూనలలో మంచివేవి యని పరీక్షించుటకై వాని నన్నింటిని బావిలో వేయుదురు. అని పనికి రానివి యడుగునకు పోవ... మం... చివి యీదుకొని వచ్చును ఇటులే మా రాష్ట్రములోని సర్వ పత్రికల చందాదారులను పత్రికలను పరీక్షింపవలెను.
ఈ సంవత్సరము మేము.............లో నొక ముఖ్యముగు..........చేయుచున్నాము ప్రజల యొక్క అభివృద్ధి తృప్తికరముగా నుండుట పత్రిక యొక్క పరిమాణమును పెద్దగా చేసి 12 పుటల నుండి 16 పుటల వరకు ప్రతి తడవ యిచ్చివేయుచున్నా...ము ఈ సైజులో ప్రచురించుట యుండుననగా పూర్వము సైజుకన్న రెండు వేలు పెద్దదిగా చేయుట యని పాఠకులకు నివేదింపనవసరము లేదు
ఇంత వరకు మాయందు అభిమానముంచి మాకు తోడ్పడిన సోదరులకు అందు ముఖ్యముగా మా రాజపోషకులకు, పోషకునికి, అభిమానులకు, విలేకరులకు మేము కృతజ్ఞతా వందనము అర్పించుచున్నాము. పత్రిక చిన్నది. కార్యము పెద్దది. మా రాష్ట్ర సోదరుల అభిప్రాయమును గాని, వ్యాసములు గాని, ప్రచురించుటలో, మేము స్థల సంకోచముచేత అనేక మారులు ఆలస్యము చేయుటయో, లేక ప్రచురింపకపోవుటయో కావించి యుందుము. ఈ లోపములను మన్నించి యందరును మాకు దోడ్పడుదురని ప్రార్థించుచున్నాము.