గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మన విద్యాశాఖ
మన విద్యాశాఖ
21 - 4 - 1928
1335 ఫసలి నివేదికయే మనకిప్పుడు లభ్యమైన నివేదిక. ఈ నివేదికలో మన విద్యాపరిస్థితులు కొంత చర్చింపబడినవి. దాని నుండి యనేకాంశములు మనము గమనింపవలసిన వున్నవి.
హిందూస్థానమందు ప్రతి రాష్ట్రములో విద్యా పరిస్థితులు దిన దినమభివృద్ధి చెందుచున్నవి. మన రాష్ట్రమందు కూడ నభివృద్ధియైనదనియు నివేదికా సంవత్సరములో 97 పాఠశాలలును, 14 వేల విద్యార్థుల సంఖ్యయు వృద్ధియయ్యెనని తెలుపుచు ప్లేగు కరువు వంటి కాలములో కూడ నింతవృద్ధియగుట చాల సంతోషమని నుండివినారు. కాని యధార్ద పరిస్థితులెట్టివో యించుక విమర్శింతము. మన సర్కారు వారు ఈ 1335 లో విద్యపై సుమారు 74 లక్షలు వ్యయపరచినారు అనగా మొత్తము ఆదాయములో సుమారు పదవ భాగము (నూటికి 10 వంతున) ఖర్చు అయ్యెను సాధారణముగా నిట్టి వ్యయము మరి యే రాష్ట్రమువారును జేయరని అందురు కాని యింత స్వదేశ సంస్థానములను బోల్చిచూచిన యీ యభిప్రాయమును సవరించుకొనవలసివచ్చును మైసూరు రాజ్యము వారు 61 లక్షల రూపాయలు (కల్దారు) కర్చు పెట్టుచున్నారు. అనగా ప్రతి మనుష్యునిపై వారు 1-0-8 ప్రకారము ఖర్చు చేయుచున్నారు మన రాష్ట్రములో 0-8-0 (ఎనిమిది అణాలు) మాత్రమే ప్రతి వానిపై వ్యయము చేయుదురు మరియు తిరువాన్కూరు సంస్థానములో 42 లక్షల రూపాయీలు విద్యకై వినియోగించి యున్నారు. అనగా సర్కారీ వసూలలో నూటికి 18 ప్రకారము వ్యయ పఱచినారు దీని వలన మన రాష్ట్రములో విద్యపై యింకను వ్యయ పఱచిన నష్టము లేదని విశదమగును. ఇంక విద్యావంతుల సంఖ్యలను గూర్చి కొంత చర్చింతము మన రాష్ట్రములో మొత్తముపై 4098 పాఠశాలలును 2 లక్షల 58 వేల విద్యార్థులును నున్నారని తెలుపబడినది. అనగా మొత్తముపై విద్యార్ధుల సంఖ్య 14 వేలు హెచ్చెనుగాని ఖాన్గీ పాఠశాలల వ్యవస్థ మాత్రము గమనింపదగి యున్నది. ఈ 1335 లోని తీరు నెలలోనే ఖాన్గీ పాఠశాలల చట్టము బయలు దేరెను. కావున దాని ఫలిత మేమన -
1334 ఫసలీలో | పాఠశాలలు | విద్యార్ధులు |
- | 4053 | 76654 ఉండిరి |
1335 ఫసలీలో | 1255 | 29626 ఉండిరి |
దీనిపై విమర్శన యవసరము లేదు. ఏది యెట్లున్నను మొత్తముపై మన విద్యా పరిస్థితులితర సంస్థానముల కన్న చాల వెనుకబడి యున్నవని సర్కారువారే యొప్పుకొనియుండిరి గత సంవత్సరము హైద్రాబాదు విద్యా మహాసభలో తమ యధ్యక్షోపన్యాసములో నవాబు జుల్ఘదర్జంగు బహాద్దరు గారు యిచ్చటను విద్యా ప్రాముఖ్యత నొప్పికొని శోకించి యుండిరి బరోడాలో నూటికి 14 గరు విద్యావంతులై యుండ మన రాష్ట్రములో నూటికి ముగ్గురు కూడ విద్యావంతులు లేరు. ఇక తిరువాన్కూరు స్థితి యెట్టిదో చూడుడు. అది మన రాష్ట్రములో పదియవ భాగము కన్న చిన్నది అచ్చట 583 పాఠశాలలున్నవి. సుమారు 53 లక్షల విద్యార్ధులున్నారు మన రాష్ట్రములో 15 చదరపు మైళ్ల కొక పాఠశాల యున్నది తిరువాన్కూరులో ప్రతి 25 మైలుకొక పాఠశాల యున్నది. లేక యిట్లు లెక్కించి చూడుడు తిరువాన్కూరులో ప్రతి వేయి మందికొక పాఠశాల యున్నది ఇచ్చట ప్రతి 3400 మందికొక పాఠశాల యున్నది. మైసూరు రాష్ట్రములో మొత్తము 8212 పాఠశాలలున్నవి 3 లక్షల 20 వేల విద్యార్థులిందు చదువుచున్నారు మైసూరు సహితము మన రాష్ట్రములో మూడవ భాగమున్నది. (29 వేల చదరపు మైళ్ల వైశాల్యము) మరియు దాని జనసంఖ్య సుమారు 60 లక్షలు కావున అచ్చట ప్రతి 750 మందికొక పాఠశాల యున్నది. అనగా పాఠశాల సంఖ్యలో తిరువాన్కూరు కన్నను మేలుగా నున్నది.
ఇట్లు మన రాష్ట్రముపై రాష్ట్రములతోపాటుగా ఖర్చు పెట్టనున్నను, నవే కేతర స్వదేశ సంస్థానములకన్న విశేషముగా వ్యయము చేయుచున్నను విద్యావంతుల సంఖ్య యేల హెచ్చుటలేదు ద్రవ్యమును సరియైన వితరణతో వ్యయము చేయుట లేదని దీనివలన విశదమగు చున్నది. హైద్రాబాదు రాష్ట్రములో ఐదేకళాశాలలున్నవి. దీనిలో నొకటి స్త్రీల కళాశాల, ఈ స్త్రీల కళాశాలలో 3 గురు విద్యార్ధినులు చదువు చున్నారు ఈ ఐదింటిపై 5 లక్షలు ఖర్చు పెట్టినారు. ఇందు చదువు విద్యార్థుల సంఖ్య 1000 వీరిపై యింతమొత్తము వ్యయమగు చున్నది. అనగా ప్రతి విద్యార్ధిపై 459 రూపాయలు ఖర్చగుచున్నది. కాని హైస్కూలులోని ప్రతి విద్యార్థిపై 11-6-2 మాత్రమే ఖర్చగుచున్నది అనగా ఒక కళాశాల విద్యార్థిని చదివించు ఖర్చులో 40 ప్రైమరీ విద్యార్ధులను చదివించ వచ్చును. ఇట్లు చూపించుటవలన ఉత్తమ విద్య (Higher education) కూడదని మా యభిప్రాయముకాదు దానితో పాటుగా ఖాన్గీ పాఠశాలలపై కోపగించుకొనునట్లు కాక ప్రైమరీ పారశాలలపై యెక్కుడు శ్రద్ధవహించి విద్యావ్యాపకము చేయవలెనని మేము హెచ్చరించుచున్నాము
ఈ రాష్ట్రములో వెలువడినట్లుగా స్త్రీవిద్య మరి ఎచ్చటను వెలువడియుండ లేదు. ఈ నివేదిక కాలమున చదువుచుండిన బాలికల సంఖ్య 34 వేలు మాత్రమే స్త్రీ విద్యను వృద్ధి పరచిననే కాని రాష్ట్రములో విద్యాపరిస్థితులు చక్కబడవు. ఇట్లుచేయవలయుననిన రాష్ట్రీయ భాషలగు తెనుగు, మరాఠీ, కన్నడములలోనే స్త్రీలకు బోధచేయవలెను ఇప్పుడు నగరమందుండు పాఠశాలలో సహితము బాలికలకు తమ తమ మాతృభాషలో విద్యనేర్చు, సరియైన నేర్పాటులు లేనప్పుడు జిల్లాలలో నెవరడుగుదురు ఎంతవరకు రాష్ట్రీయ భాషలకు ప్రాధాన్య మొసగరో యంతవరకు విద్యావంతుల సంఖ్య యిట్లే యుండును
ఈ సందర్భమున ప్రజలకు గూడా తమ కర్తవ్యమును సూచింపవలసి యున్నది రైతుల నుండి ప్రతి గ్రామమందును తమ పన్నులతో బాటుగా లోకల్పండు పన్ను అని రూపాయికి 1 అణా చొప్పున వసూలు చేయుదురు ఆ యణాలో 3 పైసాలు (నాల్గవ భాగము) విద్యకని సర్కారు వారు ఏర్పాటు చేసి యున్నారు ఈ ద్రవ్యమును ప్రతి గ్రామమందును సంపూర్ణముగా వినియోగించునట్లు రైతులు చూచుకొనవలయును
అడుగనిది అమ్మయైన పెట్టదు సర్కారు వారు తమ ప్రజలు వృద్ధికి రావలెననియే నిరంతరము తాము పాటుపడుచున్నామని చెప్పుచుందురు. అట్టిచో మన యభివృద్ధికి కారాణములగు విషయములందు మనమేల సర్కారు వారిదృష్టిని ప్రసరింప జేయకూడదు?