గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మన రాష్ట్ర మందలి కాగిత పరిశ్రమ
మన రాష్ట్రమందలి కాగిత పరిశ్రమ
27 - 4 - 1932
ఇంతవరకును మనరాష్ట్రములో కాగితముల పరిశ్రమలు పూర్తిగా లేవని భావింప జనదు. మనరాష్ట్రములో నేటికిని రెండుమూడు తావులందు కాగితములు తయారు చేయబడుచున్నవి. ఔరంగాబాదు నగరమునకు 10 మైళ్ళ దూరములో ఎల్లోరా గుహల సమీపమందు ఒక గ్రామము "కాగజ్పూర్ " అని అన్నది. దాని పేరును బట్టయే దాని సంగతి తెలియును. కాగజ్ అనుఫార్సీ పదము నుండియే మన తెలుగులో కాగితము లేక కాగిదము అని యేర్పడినవి సంస్కృతమందు పత్రము అని యందురు. పత్రమనగా ఆరు. ప్రాచీన కాలము నుండి మొన్న మొన్నటివరకు మన పూర్వులు దక్షిణమున తాటి యాకులపైనను, ఉత్తరమున భూర్జపత్రములపైనను వ్రాయుచుండిరి. అందుచేతనే పూర్వవాసనా విశేషముచేత నేటికిని కాగిదములను సంస్కృతములో పత్రములని యందురు
కాని కాలము మారినది పాశ్చాత్య దేశములో అచ్చు పనులు వృద్ధియైన కొలదియు, గ్రంథములసంఖ్య హెచ్చైనకొలదియు, కాగిదముల యవసరము విశేషమయ్యెను. అందుచేత పాశ్చాత్య దేశములలో కాగిదముల యంత్రాలయములు వేలకొలది గలవు
మన హిందూస్థానములో బెంగాలులోను మద్రాసు రాజధానిలోను మొత్తముపై మూడే కాగితముల యంత్రాలయము లుండినట్లు కనబడుచున్నది. అందుచేత మన దేశములో నీ పరిశ్రమ యొక్క యవసరము చాలగలదు. ఈ యంశమును దృష్టి యందుంచుకొనియే మన రాష్ట్ర ప్రభుత్వము వారు మన రాష్ట్రములో నీ పరిశ్రమను స్థాపించవచ్చునా లేదా స్థాపించిన లాభముండునా లేదా యను విషయములను నిర్ణయించుటకై కొందరి శాస్త్రజ్ఞులను నియమించిరి వారు తమ పరిశోధనా ఫలితముగా నొక నివేదికను సిద్ధము జేసిరి అట్టి నివేదిక యొకటి యా యభిప్రాయార్థమై మాకు ప్రకటనశాఖ ద్వారా పంపబడినది
ఈ నివేదికలో హిందూస్థానములో ప్రతి సంవత్సరము 1 లక్ష టన్నుల తూకముగల కాగితము బయటినుండి దిగుమితి యగుచున్నదనియు నిప్పుడుండు హిందూస్థానపు యంత్రాలయములలో 45 వేల టన్నుల కాగితమే తయారగుచున్నదనియు, తెలిపినారు. మన రాష్ట్రములో ప్రతి సంవత్సరము 1600 టన్నుల కాగితము దిగుమతి యగుచున్నదని 1335-1340 ఫసలీల లెక్కల నుండి చూపించినారు.
ఈ కారణములచేత మన రాష్ట్రములో కాగితపరిశ్రమ యవసరమని తోచినది. దీనికి తగిన స్థలము తగిన ధనము తగిన యితర సౌకర్యములన్నియు గావలసి యున్నది కాగితము సిద్ధము జేయుటకు బొంగులు (వెదురు లేక గోవా కట్టెయని కొందరందురు) ఆదిలాబాదు జిల్లాలో విశేషముగా కలదు. ఈ జిల్లాలో నేలబొగ్గుగనుల సామీప్యమునుబట్టి బొంగుల సమృద్ధినిబట్టి నీటి వసతినిబట్టి, కూలీల యవసరమునుబట్టి మంచెరియాలయును సిరిపురమును చాలా తగిన స్థలములనియు నీరెంటిలో సిరిపురమే పైచేయి యగుననియు నివేదికలో నిర్ణయించినారు.
నివేదికలో సంవత్సరమునకు 5000 టన్నుల కాగిదమును తయారుచేయుట కంచనా వేయబడినను 10 వేల టన్నులవరకును తయారు చేయుటలో నిబ్బంది యుండదని చూపియున్నారు. 5000 టన్నులు సిద్ధమైనను మన రాష్ట్రముయొక్క అవసరములు పోగా బ్రిటిషు హిందూస్థానమునకు 3000 టన్నులకు పైగా ఎగుమతి జేయవచ్చును.
ఈ యంత్రాలయమునకై 50 లక్షల ధనము అవసరమని నివేదికలో చూపియున్నారు. ఇట్లు ఖర్చు పెట్టి స్థాపించిన దానిలో ప్రతి టన్ను కాగితములకై 366 రూపాయలు ఖర్చగునని యంచనా వేసినారు ఇపుడు మార్కెట్లో ఒక టన్ను కాగితములు 500 రూపాయలప్రకార మమ్ముదురనియు ఈ లెక్క ప్రకారము ప్రతి టన్ను పై రూ. 134 లాభము దొరుకుననియు యీ ప్రకారము లెక్కించిన నూటికి రూ. 5-11-0 ప్రకారము లాభము కలుగగలదనియు జూపినారు. ఇది మంచి లాభమే
ఇంతవరకు వేదికలోని ముఖ్యాంశములను జూపినారు ఇక నీ యంత్ర స్థాపన యవసరమా లేదా యను విషయమాలోచింతము. మన రాష్ట్రములోనికి వచ్చు కాగితములకై ప్రతి సంవత్సరము మనము 6 లక్షలకన్న హెచ్చుగా ఖర్చు పెట్టుచున్నాము మరియు ప్రభుత్వమువారే బహుళ యీ మొత్తములో నాల్గవ మొత్తము ఖర్చు పెట్టుచుండవచ్చును మన రాష్ట్రములో నీ పరిశ్రమకయి కావలసినన్ని సౌర్యములుండినపుడెందులకు దీనిని ప్రారంభింపకూడదు. ఈ కార్యమును ధనికులెవ్వరయిన చేయుదురేమోయని ప్రభుత్వమువారూరకుండిన లాభములేదు ధనికులెవ్వరును క్రొత్తక్రొత్త మార్గములలో లక్షలు వ్యయము చేయుటకై సంసిద్ధులుగా నుండరు ప్రభుత్వమువారే దీనిని స్థాపించవలయును లేదా ప్రభుత్వమువారు హెచ్చుభారము వహించి మిగత భారమునకై వాటాల పద్ధతిపయి ప్రజలను భాగస్థులను జేర్చుకొనవచ్చును. మొత్తముపై ప్రభుత్వము వారే యీ కార్యాలయమును స్థాపించుట సమంజసము దానికి అనుకూలమైన సమయముకూడ నిదే సమయము!