గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మన రాష్ట్ర పరిశ్రమలు
మన రాష్ట్ర పరిశ్రమలు
25 - 6 - 1932
బహు కాలమునుండి మన రాష్ట్రాభివృద్ధిని, తద్వారా ప్రజల యభివృద్ధిని గోరునట్టి పూజ్యులైన మ॥ఘ॥వ॥ మన ప్రభువుగారు మన రాష్ట్రములో పరిశ్రమ శాఖను నేర్పాటుచేసియున్నారు ఇదెంతయు సంతోషింపదగిన యంశము ఇంతియ గాక శ్రీ ప్రభువుగారు మూడు సంవత్సరముల క్రిందట పరిశ్రమాభివృద్ధి కని 1 కోటి రూప్యములను ప్రత్యేకించుట కాజ్ఞాపించిరి. ఈ యొక్క యంశమే మన యజమానులకు తమ ప్రియమైన ప్రజలందుగల ప్రేమను జాటుటకు తగియున్నది. ఆర్థికశాఖా మంత్రులగు సర్ హైదరు నవాజుజంగు నవాబుగారును తమ యపూర్వ శక్తి సామర్ధ్యములను ప్రకటించి పరిశ్రమల కింత గొప్ప మొత్తమును సంపాదించియుంచిరి కాలిన్సుగారును ఈ పరిశ్రమ శాఖాధ్యక్షులై తమ యావచ్ఛక్తిని వినియోగించి, యీ రాష్ట్రమందు దినదినము పరిశ్రమలే కాక వ్యాపారమును, సహకార సంఘములును, వ్యవసాయమును సత్వరాభివృద్ధి పొందుటకై చాల పాటుపడుచున్నారు.
మన రాష్ట్రములో ప్రాచీనమునుండి కొన్ని పరిశ్రమలు చాల యభివృద్ధిలో నున్నవి కేవలము నిజాము రాష్ట్రమందేకాక బ్రిటిషిండియాకును మన సరకులు దిగుమతి యగుచున్నవి. బీదరు, పెంబర్తి, ఔరంగాబాదు, ఒరంగల్, ఆలంపూరు, వంటి స్థలములు, లోహపు పనులకును, నేత పరిశ్రమలకును చాల ప్రసిద్ధి చెందినట్టివి. ఇప్పుడిప్పుడు గాజు పనులును, సబ్బు పనులును, మిల్లు బట్టలును, సిగరేట్లును, మన రాష్ట్రములో తయారగుచున్నవి. సిగరేట్లు కొరకై కొక క్రొత్త పొగాకు నిపుణుని పిలిపించియున్నారు. వ్యవసాయులకై జాతరలందేకాక ప్రతి సంవత్సరము రెండుమారులు జిల్లాలలో వ్యవసాయ ప్రదర్శనములు చేయుచున్నారు ఇన్ని సౌకర్యములుండియు ప్రజలు దీనివలన లాభము, పొందకుండిన అది ప్రజల తప్పే యనవలెను ప్రజలకు పరిశ్రమల విషయమై సహాయము కాని, సలహాలు కాని కావలసి యుండిన పరిశ్రమ శాఖాధ్యక్షులగు కాలిన్సుగారికి వ్రాసికొనిన వెంటనే వారికి తగు సహాయము చేయుచున్నారు
ప్రభుత్వము వారికిని నొక సూచన గావింపదలచుచున్నాము. మన రాష్ట్రములో సిద్ధమగు వస్తువులను మొదలు ప్రభుత్వ కార్యాలయములును, తర్వాత అధికారులును, కొనునట్లు ప్రోత్సాహము చేయవలెను. మన రాష్ట్రపు సబ్బులను మన రాష్ట్రమందలి వైద్యాలయము లన్నింటికి సబ్బులపై కరోడిగిరి హెచ్చుగా తగిలించిననేగాని మన సబ్బులు వృద్ధికి రావు. అదే ప్రకారము మన కచ్చేరీలకు కావలసిన "సాదర్ " మన రాష్ట్రములో తయారైనవే తీసికొనవలెను
రెండవ సూచన యేమన మన జనులు సాధారణముగా బీదవారగుట చేత పెద్ద పెద్ద కార్ఖానాలు పెట్టించిననవి కొలది మంది ధనికులకే పనికి వచ్చును కావున నట్టి వానికన్న విశేషముగా గృహ పరిశ్రమలకే సహాయము జేసిన బీదలకు చాల లాభము కలుగును. నేత మగ్గములలో డేనిష్ యంత్రము వంటి మంచి యంత్రములను నేతగాండ్ర కిచ్చి వారికాపని నేర్పించిన బాగుండును అదే విధముగా సర్. పి. సి. రాయిగారు “దేశీరంగ్" అను గ్రంథములో వ్రాసినట్లుగా స్వదేశీ రంగులను తయారుచేయుటకు జనులకు నేర్పవలెను
ఇప్పుడు నేయునట్టి తివాసీలు, జంపుఖానములు (పత్రంజీలు) మేలైనవి శీఘ్రముగా అగ్గువగా నేయు పరికరముల చూపించవలెను
ఇట్టివే తక్కువ ఖర్చుతో నెక్కువ లాభము కలిగి బీదవారు సహితము కొద్ది మొత్తముతో జీవించగలుగు పరిశ్రమలను వృద్ధి చేయుదురని గోరుచున్నాము.