Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/బాలికల ఉన్నత పాఠశాల

వికీసోర్స్ నుండి


బాలికల ఉన్నత పాఠశాల

2 - 7 - 1932

శుక్రవారము నాడు రెడ్డి బోర్డింగులో బాలికల ఉన్నత పాఠశాల యొక్క బహుమాన ప్రధానోత్సవము జరిగేను ఆ సభకు వచ్చిన ప్రేక్షకులు అనేకులు స్థలము జాలక వాపసు పోవలసివచ్చి బాలికల విద్య యందిప్పుడు మన ఆంధ్రులందు గాఢమైన అభిమానము కలుగుచుండినందులకు చాల సంతోషము పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య కూడ రెండింతలైనది. ఈ పాఠశాలను నింతటి పట్టుదల తోడను, అభిమానము తోడను, శ్రద్ధతోడను దినదినాభివృద్ధి గావించినట్టి శ్రీయుతులు మాడపాటి హనుమంతరావు గారును, వడ్లకొండ నరసింహారావు గారును చాల ప్రశంసింపదగినవారు ఆంధ్రులందరును వీరు చేయుచున్న కృషికై గర్వించవలసినది. ఇట్టి యుద్యమము మహారాష్ట్రులందును లేదు. వారు బాలురకు వివేకవర్ధనీ సంస్థను నడిపించుచున్నను మన హనుమంతురావు గారు తదితరుల సహాయముచే నీ బాలికల సంస్థను నడిపించుట నంతకన్న హెచ్చైన పని.

కాని ఈ పాఠశాలకు ధనికుల యాదరణ లేదు ప్రభుత్వమువారి యాదరణ అంతకు తక్కువయ్యెను. ఉస్మానియా విద్యా పీఠము యొక్క ఉద్దేశములలో మొదటి యుద్దేశము జనుల మాతృ భాషలో విద్య నేర్పించుటయై యున్నది. అది యట్టిదనియే భావించి మాలవ్యా వంటి గొప్పవారు దానిని శ్లాఘించిరి మన బాలికల పాఠశాల పూర్తిగా మన విద్యా పీఠము యొక్క యాదర్శములనే అమలు నందుంచుచున్నవి మన ప్రభుత్వము వారు దీనినికముందైనను ఉస్మానియా విద్యా పీఠములో చేర్చికొని, దీనికి ద్రవ్య సహాయము చేసి తోడ్పడుదురని తలచుచున్నాము.

మొన్నటి సభను జయప్రదముగా జరుపుటకు కారకులైన అధ్య క్షురాలగు శ్రీరాణి కుముదినీ దేవీ గారిని, శ్రీ రాజా వేంకటరామరెడ్డి బహద్దరు గారిని, శ్రీ మాడపాటి హనుమంతరావు గారిని శ్రీ వడ్లకొండ నరసింహారావు గారిని, మేము మనఃపూర్వకముగా ప్రశంసించుచున్నాము