గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఫాదరీల దౌర్జన్యము
ఫాదిరిల దౌర్జన్యము
23 - 3 - 1929
నిజామాబాదు జిల్లాలోని ఆర్మూరు తాలూకాయందు ఇబ్రాహీం పట్టణము, వేశకొండ మున్నగు గ్రామముల ప్రజలు మహాఘనత వహించిన నిజాము ప్రభుత్వము వారి ప్రభుత్వసభ (బాబెహూకూమతు) పేర పంపుకొనిన యొక సంఘ విజ్ఞప్తి మా కార్యస్థానమునకు వచ్చినందున దానిని వేరొక తావున ప్రకటించి యున్నాము
ఈ విజ్ఞప్తిలో క్రైస్తవ మత బోధకులు గ్రామస్థులను తిప్పలు బెట్టు చున్నట్టును, వారి మత కట్టుల నాచరించుట యందాటంకములు కలిగించు చున్నట్టును, స్త్రీలు నీరు తెచ్చుకొనుచుండ వారిని బుద్ధి పూర్వకముగా నంటుకొని వారి నపవిత్రపరచుచుండే నట్టును, బలవంతపెట్టి జనులవద్ద నుండి చందాలు వసూలు చేయుచుండి నట్లును ఇంకెన్నెన్ని యో అవాచ్యములగు పనులు జరుపుచున్నట్టును తెలియు చున్నది ప్రభుత్వము వారికి పంపుకొనబడిన ఈ విజ్ఞప్తియందు అబద్ధము లుండగూడదు ఇందలి యంశములను కొంత అతిశయోక్తులుగా దలచినను, యదార్థముగా నిర్ణీతమగు భాగము కూడ చాల భయంకరమును, మతసహిష్ణుతకు భిన్నమును, క్రైస్తవ మతబోధకులందు కనబడు ఉత్తమ సాత్త్విక వర్తనమునకు విరుద్ధముగను ఉన్నది విజ్ఞప్తిలో చెప్పబడిన చర్యలు ఇతర మతస్థుల వలన తరచుగా జరిగియుండుట వినుచున్నాము. కాని క్రైస్తవ మతబోధకులిట్టి పద్ధతులు తమ మత వ్యాప్తికై యవలంబించుట విని యుండలేదు. అధమ పక్షమున ఈ రాష్ట్రమున నీ సంగతులు అకృత పూర్వములు. ఇట్టి స్థితిలో నేటి కాలమున, ఇరువదవ శతాబ్దమున నిజాము రాష్ట్రములో క్రైస్తవ మత బోధకులు ఈ నవీన మార్గము నవలంబించుటకు కారణము సూక్ష్మముగా నాలోచింపదగి యున్నది. పై గ్రామముల ప్రజలు క్రింది యుద్యోగస్తుల ----- నీదౌర్జన్యముల గూర్చి మొఱపెట్టుకొనిన మీదట కొంత చర్యను పోలిన అధికారులు జరిపి తరువాత ఉపేక్షవహించిరని విజ్ఞప్తివలన తెలియుచున్నది ఇట్టి విచారణ మేమి' ఇటీవల మహాఘనత వహించిన మన ప్రభువుగారు ఒక ఫర్మాణ జారీ చేసియుండిరి దానిలో క్రింది యధికారులు గ్రామములలోని మత కక్షలలో ఏదో యొకవైపుచేరి రెండవ పక్షము వారికి అన్యాయము కలుగచేయు చున్నట్టు సూచన చేయబడినది. ఆది మహమ్మదీయ యధికారుల విషయమేమో యని తలంచితిమి. ప్రభుత్వాధికారులలో చాల మంది దాదాపుగా నందరును మహుమ్మదీయులేయగుటవలన - హిందూ మహమ్మదీయ మతముల వారికి కక్షలు వచ్చినప్పుడు అధికారులు మహుమ్మదీయుల పక్షము వహించుచు హిందూ ప్రజల కన్యాయము చేసియుండుటను మన ప్రభువుగారు ఫర్మానులో సూచించి యుందురనుట నిశ్చయము, కాని ఆర్మూరు తాలూకాలోని పైసంగతులకు అట్టికారణము కూడ కనుపడదు.
ఎట్లయిననేమి, విజ్ఞప్తిలోని వార్తలు సత్యములే యైనచో - అవి కొంతవరకైన సత్యములే యైయుండవచ్చును ప్రభుత్వాధికారులు తక్షణమే విచారించి ప్రజలకు నెమ్మది కలిగించుట యవసరము. హిందూ ప్రజలు ఈ రాష్ట్రమున సంఖ్యలో అందరిని మించినవారము, ప్రభుత్వాధికారమునందు ప్రాముఖ్యతలేని కారణముననో మరే దౌర్బల్యము వలననో, ఎప్పుడు నిస్సహాయత్వమును ప్రకటించుకొనుట సంభవించు చున్నది. ఇది చాల సంతాపకరము .
పోలీసుమంత్రి గారగు కర్నలు ట్రెంచిగారు ఆంగ్లులు. క్రైస్తవ మతస్థులు సర్వసమత్వమును కోరు స్వభావము కలవారు. ప్రభుత్వ సభలో మెంబరులు. ప్రస్తుత విజ్ఞప్తిలోని చిక్కులను తొలగించి జనులందు నమ్మకమును, నెమ్మదిని వ్యాపింపజేసి, పరమతస్థుల దుండగములను అణుగునట్లొనర్చుట వారి విధియైయున్నది తక్షణమే ప్రభుత్వమువారు తమ విధిని నెరవేర్చుదురు గాక!