Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ప్రజాప్రబోధము

వికీసోర్స్ నుండి




ప్రజా ప్రబోధము

1-2-1928

మన ప్రధానమంత్రి గారగు మహారాజా బహద్దరు గారు గత వారమున చేసిన పర్యటన సందర్భమున జిల్లాలోని ప్రజలు వారి కర్పించిన వినతి పత్రములును, విజ్ఞాపనములును, మన రాష్ట్రమున ప్రజలందు క్రమముగా కలుగుచున్న ప్రబోధమునకు నిదర్శనమై ఒప్పారుచున్నది గుల్బర్గా నగరమున న్యాయవాదులు, వర్తకులు, విద్యాశాఖాధికారులు, హిందూ ప్రజలు, మిల్లులవారు వేర్వేరుగా వినతి పత్రములను అర్పించుకొనిరి అట్లే ఉస్మానాబాదు ప్రజలును సర్వతో ముఖముగ నొక వినతి పత్రమును ప్రధానమంత్రి గారి కొసగి తమ కష్ట నిష్ఠురములను ప్రభుత్వమున కెరుక పరచిరి.

ఈ పర్యటనమున ప్రజలు వినతిపత్రముల ద్వారా తమ యాశయముల ప్రభుత్వము వారికి తెలుపుట ముఖ్యముగ వెనుకబడియున్న మన రాష్ట్ర ప్రజల విషయమున ఒక నూతన పద్ధతి యని చెప్పవచ్చును. మన చుట్టుపట్టుల నున్న బ్రిటిషు ఇండియాలోను, నాగరికములగు ఇతర దేశీయ సంస్థానము లందును, ప్రజలు తమ కోర్కెలను, అవసరములను ప్రభుత్వము వారికి ముఖాముఖిగా తెలియజేసి వారి వలన ప్రత్యుత్తరముల బడయుటకు శ్రేష్ఠములగు పద్ధతులు కలవు సభలలో ప్రతినిధులు ప్రభుత్వము వారిని ప్రశ్నలు అడిగి వెంటనే వారి యుత్తరములను బడయు విధానమున్నది. కాని మన శాసన సభ యింకను అట్టి సంస్కార మొందనందున, మనము ప్రజా పక్షమున కష్ట నిష్ఠురములను పత్రికలందు వ్రాసికొని సంతసించుట తప్ప మన మొరలను ప్రభుత్వము వారికి తెలుపుకొనుటకును వీలు లేక యున్నది ప్రభుత్వము వారేమి సెలవిచ్చెదరో తెలిసికొనుటకును వీలులేక యున్నది ప్రభుత్వము వారేదేని సంస్కరణ మొనర్చినచో మన కోర్కెకు, విజ్ఞాపనమునకు ప్రత్యుత్తరము వచ్చినదని సంతసింప వలసినదే కాని, ప్రభుత్వోద్దేశములను తెలిసికొనుటకు ఎట్టి సాధనము మన చేతులలో లేనందున, దయామయులగు ప్రభుత్వము వారి సానుభూత వాక్యములను వినజాలకుంటిమి ఇట్టి లోపమును ఒక విధముగ తొలగించుటకు వినతి పత్రములు అర్పించి ప్రత్యుత్తరము బడయు నీ నూతన పద్ధతి చాల మంచిదని మా తలంపు. ఈ పద్ధతినే, ప్రతి జిల్లా ప్రజలను ప్రతి తాలూకా ప్రజలను, ప్రధానమంత్రిగారు గాని శాఖ మంత్రులు గాని తమ ప్రాంతములకు దయచేసినప్పుడు అవలంబించు చుండినచో చాల ఉపయోగకారి కాగలదు.

మన ప్రధానమంత్రిగారి యెదుట చెప్పుకొనబడిన ప్రజావసరములను మూడు విధములుగ భాగింపవచ్చును 1. స్థానికావసరములు 2. ప్రత్యేక సంఘ అవసరములు 3. ప్రజావసరములు

మొదటి వానిలో రోడ్లు, నీటి వసతులు వెలుతురు మున్నగువాని యేర్పాటులు చేరియున్నవి ఇవి ఆ ఆ స్థలము వారికే సంబంధించి యుండును కనుక ఇవి అన్నిటికంటె ముఖ్యములు, సులభముగా తీర్పదిగినవియు. రెండవవానిలో, ప్రజలలోని ఒక ప్రత్యేక సంఘమునకు మాత్రము సంబంధించిన విషయములు గలపు గుల్బర్గాలోని హిందూ ప్రజలు హిందువులకు గల కష్ట నిష్ఠురములను, అవసరములను తెలుపుకొని యున్నారు. తాము ప్రజా సమూహములలో నూటికి 53 మంది చొప్పునగల గొప్ప సంఘమై యుండినను, తమకు గొప్ప యుద్యోగములు లభింపకుండుట, మునుపు దొరకుచుండినవియు తక్కువ యగుట, తమ మత విషయక కార్యములకు ఆటంకములు కలుగుచుండుట, తమ తమ సంబంధ సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వము వారి మత శాఖ (ఉమూరే మజహబి) లో ఒక హిందూ అధికారి నియోగింప వలయుననుట ఇటీవల నాశనము చేయబడిన దేవాలయములను బాగుచేయ వలయుననుట మున్నగునవి మనవి చేసికొనియున్నారు. ఇట్లు తమ కోరికలను ప్రభుత్వము వారికి మనవి చేసికొనుటలో హిందువులు మంచి మార్గము నవలంబించిరి. అడిగిన గాని అమ్మ కూడపెట్టదు కదా! ప్రభుత్వమువారును వాని విషయమున ఎంత త్వరగా శ్రద్ధ వహించిన అంత మంచిదని మా యభిప్రాయము.

మూడవ వానిలో మన రాష్ట్రములోని అన్ని తెగలవారికిని, అధికారులందరికిని, సంబంధించిన విషయములు కలవు. 1. లోకల్ ఫండు సభలలోని సభా సదులను ప్రజలు ఎన్నుకొను పద్ధతి ప్రవేశపెట్టవలయుననుట ఇంతవరకు నీ సభలలో ప్రభుత్వ నియోజితులేయున్నారు ప్రారంభదశలో ఇది అవసరమయినను నేడు అట్టి యవసరము లేదనవచ్చును గత నలువది వత్సరముల నుండి యీ సభలలో అధికారేతర సభాసదులను కూడ ప్రభుత్వాధికారులు ఏర్పరచుచున్నారు. కాని యింత మాత్రము చాలదు. ఈ తాతల నాటి పద్ధతిని వదలి యిప్పుడు నాగరిక రాష్ట్రములలోనున్న పద్ధతిని ప్రవేశపెట్టవలయునని ప్రజల కోర్కె 2 పెద్ద బస్తీలలో మజ్లీ సె సఫాయీ (మునిసిపాలిటీ) లను స్థాపించవలయుననునది ఇప్పుడిట్టి మజ్లిసు హైద్రాబాదునందు మాత్రము కలదు. అదియు సంపూర్ణ దశలో లేదు అస్వతంత్ర స్థితిలోనున్నది దానిని గూర్చి చిత్తు శాసనము గడచిన 30 ఏండ్ల నుండి మన శాసన నిర్మాణ సభలోపడి యున్నది బ్రిటిషు ఇండియాలో 5 వేల జన సంఖ్య కంటే మించిన ప్రతి బస్తీ యందు ఇట్టి సంఘములున్నవి కనుక మనవారును అట్లు చేయించవలయునని ప్రార్థించుచున్నారు 3. శాసన నిర్మాణ సభా సంస్కరణము అనగా దీనిలో ఇప్పుడున్నట్టు గాక ప్రజాప్రతినిధులను ఏర్పరుపవలయుననియు, ప్రజాశయములు ఈ విషయమును ఇదివరకే మహా ఘనత వహించిన మన ప్రభుత్వము వారు ఏడేండ్ల నుండి ఆలోచించుచున్నారు. ఉత్తమ పరిపాలనమునకును నిదర్శనములగు నీ సంస్కారములను ప్రభుత్వమువారు త్వరలో ప్రసాదించగలరని మా యభిప్రాయము 4 విద్యా విషయములు ఖాన్గీ పాఠశాలల విషయమున చేయబడిన నిర్బంధ శాసనమును రద్దుచేయుట, ప్రారంభ విద్య, మాధ్యమిక విద్య విద్యార్ధి యొక్క మాతృభాషలోనే గరుపబడవలయుననుట, ప్రారంభ విద్య ప్రజా స్వాధీనముచేసి ప్రభుత్వమువారు సహాయము మాత్ర మొసగుట మంచిదనుట మున్నగునవి సూచింపబడినవి

ఇట్లు ప్రజలు ప్రభుత్వమువారి ముఖాముఖిగా అడుగ గలుగుట నూతనమైన ప్రజా ప్రబోధముగ భావించుచు దీనికి కారకులగు వారిని మేము మనఃపూర్వకముగ నభినందించుచున్నాము.