గోలకొండ పత్రిక సంపాదకీయాలు/నిజాం రాష్ట్ర గ్రంథాలయములు
నిజాం రాష్ట్ర గ్రంథాలయములు
23 - 1 - 1929
కొంత కాలము క్రింద రహెబరె దక్కన్ సంపాదకులు నిజాం రాష్ట్రములోని గ్రంథాలయములపై రాజద్రోహపు స్థలములని ఘోరమగు నిందను ఘోరతరమగునట్టి యుద్ధముచే మోపియుండిరి. కేంద్ర సంఘ కార్యదర్శిగారు వారికి నేరము నిరూపింపుమని జవాబు వ్రాయగా జవాబులేదు మరియు పండిత కేశవరావుగారు కూడ రహెబరె దక్కన్కు జాబు వ్రాసి యే కారణముతో నట్లు వ్రాసిరో తెలుపుమనగా నా జాబునే ప్రకటింపక పోయిరి ఇట్టి చర్యకలవారు జవాబేమియ్యగలరు. ఈ రెంటిని బట్టి వీరు శుద్ధాబద్ధమును బల్కినారని తేలినది కాని అంతటితో గ్రంథాలయముల కర్తవ్యము తీరలేదు ప్రతి గ్రంథాలయ సభ్యులును సమావేశమై యీ రహెబరు యొక్క రోత వ్రాతలను ఖండించి తీర్మానములు చేసి మాకును ఆ పత్రికకు కేంద్ర సంఘ కార్యదర్శిగారికిని నితర పత్రికలకును పంపుదురు గాక! చేయమని మేమప్పుడే సూచించి యుంటిమి కాని యేలనో యింకను నెవ్వరును నట్లు చేయలేదు. ఇట్టి నిందారోపణమును జేయు పత్రికను నందరు నిరసింతురుగాక!