Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/దేశ భాషలు - కచ్చేరీల వ్యవస్థ

వికీసోర్స్ నుండి


దేశ భాషలు – కచ్చేరీల వ్యవస్థ

21-2-1931

ప్రధమ ఆంధ్ర మహాసభలో గత వత్సరము చేయబడిన తీర్మానములలో 17 వ తీర్మానమిట్లున్నది

"గ్రామస్థులకు అనుకూలముగా నుండుటకై మున్సిఫి అదాలతులలోను, సబ్ రిజిస్ట్రారు కచ్చేరీలలోను వృవహారమంతయు ఇంగ్లీషు ఇలాకాలో వలె జనుల దేశభాషయందే జరుపుట అత్యవసరమని ఈ మహాసభ వారు ప్రభుత్వము వారికి సూచించుచున్నారు"

పై తీర్మానము ననుసరించి కేంద్ర సంఘ సభ్యులును మహబూబు నగరము జిల్లా వాస్తవ్యులును నగు శ్రీయుత ఎం. నారాయణరావు గారు (హైకోర్టు వకీలు) న్యాయ శాఖాధికారులతో నుత్తర ప్రత్యుత్తరములు జరిపి దేశ భాషల ప్రాముఖ్యతను సూచించిరి. "న్యాయ స్థానముల వ్యవస్థ యందు తక్షణమే మార్పు అవసరము" అను విషయమును గురించి “మన్షూర్” పత్రికలో శ్రీ నారాయణ రావుగారు వ్రాసియుండిరి

న్యాయ స్థానముల వ్యవస్థతో అమీరుల కింత సంబంధము గలదో నంతకంటే నెక్కువ సంబంధము బీదలకును, గొంగళ్ళను కప్పుకొను తెగలవారికిని గలదు ధనవంతులకంటె నెక్కువగా బీదసాదల హక్కులు సంరక్షింపబడుట ఆత్యవసరము మన న్యాయ స్థానముల ప్రస్తుత వ్యవస్థ యందనేక లోపములుండుటం బట్టి ఈ విషయమున ఫలవంతముగ లేదు. జనులకు న్యాయము ప్రసాదింబడుటలో లోపభూయిష్ఠమైన వ్యవస్థ తన పర్యవసానమును గలిగించుచున్నది. ప్రస్తుతము ప్రతి దినము అదాలతులలోని పనులయందు ముఖ్యముగా గనబడు లోపమును గురించి మాత్రమే విచారింతము దీనిని నివారించుటకు న్యాయశాఖ యొక్క ఉన్నతాధికారులును, ప్రభుత్వము వారును ప్రయత్నించెదరుగాక!

మన న్యాయ స్థానములలో వ్యవహరింపబడు భాష ఉర్దూయై యున్నది. జన సామాన్యము వాడుకొను భాషలు మహారాష్ట్రము, కన్నడము, తెలుగు, సాక్షులు తమ సాక్ష్యమును గూడ స్వభాషయందే నొసగుచున్నారు నిందితులు గూడ సహృదయాంతర్గత భావములను తమ మాతృ భాషయందే వెల్లడి చేయుచున్నారు సాక్షుల యొక్కయు, నిందితుల యొక్కయు భావములను సరిగా తేటపరచునట్టి మార్గమున నేడవి గ్రంధస్థ మొనరింపబడుటయే సరియైన న్యాయపద్ధతి యగును ఇట్టి రికార్డు పైననే న్యాయ పరిశీలన జరుగవలెను కాని దురదృష్టవశమున న్యాయ శాఖలో పనిచేయు అధికారులు దేశ భాషలందు ప్రవేశము గలవారు కారు సాక్షులకు, నిందితులకు అదాలతు భాష తెలియదు. వీరిరువురి మధ్య అనగా అధికార వర్గము సాక్షులు నిందితుల పరస్పర భావములను వెల్లడించుటకు భాషాంతరీకరణము చేయువారు కావలసివచ్చు చున్నది ఈ కార్యము సులభమైనదిగను, అంత ముఖ్యమైనది గానిదిగను తలపడుచుండుట గూడ దురదృష్టమే పరస్పర భావ ప్రకటన కార్యము కఠినమైన భాషాంతరీకరణ కార్యభారము అసాధారణమైన ప్రజ్ఞతో గూడికొనినదై యున్నది తర్జుమా చేయుటకు నియమింపబడు ఉద్యోగులు ఉభయ భాషా ప్రవీణులై యుండుటవసరమై యుండును. కాని అమలు తద్విరుద్ధమై యుండుట మనము చూచుచున్నాము. ఈ పద్ధతి నిర్మూలింపబడుటత్యావశ్యకము నిందితుల వాఙ్మూలములు వారి మాతృ భాషయందే గ్రంధస్థ మొనరింపబడుటయే ముఖ్యమైన పని ఇట్లే చేయవలెనని నియమముండినప్పటికిని మిసళ్ళు జూచినచో నూటికొక నిందితుని వాఙ్మూలమైనను మాతృ భాషలో రికార్డు చేయబడుచున్నదా యను సందేహము గలుగును భాషాంతరీకరణ మొనర్చువారు గూడ అంత విశ్వాసపాత్రులును, ఉభయ భాషా ప్రావీణులునుగను లేకుండుటచే వారు చెప్పు దాని పైన సంపూర్ణ విశ్వాసముంచుటకు వీలు లేదు. కనుక వీనిపై నాధారపడియుండు తీర్పులు న్యాయ పధమున నుండకపోవుట గూడ కొన్ని సమయములందు సంభవించును. మనరాష్ట్రములోని ఉన్నత న్యాయ సభ యొక్క ప్రధాన న్యాయాధీశులు అనేక పర్యాయములు గష్తీల ద్వారాను, ఆహకాయుల మూలమునను నిందితుల యొక్క వాఙ్మూలములను వారి మాతృభాష యందే రికార్డుచేయవలెనని నియమ మేర్పరచియున్నారు ఇట్లు జరుపుటకు వీలులేనిచో భాషాంతరీకరణ మొనర్చుటలో చాలా జాగ్రత్త వహింపవలెనని హెచ్చరించియున్నారు. ఈ విషయమునందెంత వరకు శ్రద్ధవహింపబడుచున్నదో సృష్టమే. అదాలతులతో సంబంధము గల వారందరునునైక కంఠముతో నీ విషయమున అదాలతు పని, వ్యవస్థ ప్రయోజనకారిగా లేదని చెప్పగలరు. ఈ విషయము ముఖ్యమైనదని వాదించుటకు మేము వెనుదీయము కాని ఇంతకంటె నెక్కువ లోపము గనబడుచున్నందున "ఉత్తముండకంటె అత్తముండమేలు" అని మాత్రము చెప్పవలసి వచ్చుచున్నది

మనరాష్ట్రములోని దివానీ భాగమునందు గౌరవన్యాయాధిపతులకు మూడవ దర్జా అధికారములు గలవు. మున్సిపులకు ఫౌజ్దారీలో జిల్లామెజిస్ట్రేటు యొక్కయు, దివానీలో 1000 రూ. అభియోగములను విచారించు అధికారములు గలవు. బ్రిటిషు ఇండియా కంటె ఈ విషయమున మనమెంతో ముందున్నాము మన తాలూకాలలో నుండు ప్రతి యొక్కనికిని అన్నిటికంటె నెక్కువయైన న్యాయస్థానము నుండి న్యాయము బడయు సౌకర్యమున్నది కానినిట్లు నిర్భయముగా చెప్పుటకు హృదయకంపముగలుగుచున్నది. ఏలననగా మనము నిజమైన న్యాయమును బడయుట లేదు. ఇందుకు ముఖ్యమైన కారణమునరయుదము గొప్ప అధికారములు గల మన మున్సిఫి మెజిస్ట్రేటుల వద్ద వాఙ్మూలముల నిచ్చు సాక్షులలోను, కక్షదారులలోను నెక్కువ భాగము అదాలతీ భాష దెలిసిన వారు కారు న్యాయస్థానము (అదాలత్ )నకు దేశభాషల పరిచయము లేదు భాషాంతరీకరణమొనర్చు ఉద్యోగులు నియమింపబడియుండరు. కనుక తీర్పు చెప్పువారు తమకు తెలియని భాషలో జరుగు వ్యవహారమును నెట్లు పరిశీలించగలరు? ఈ పరిస్థితులలో “దుబాసి" (తర్జుమాపనిచేయువారు) సామాన్యముగా అదాలత్ చప్రాసీయో లేక హాజరున్న వారిలో నెవరోయైయుండిన ముఖ్యమైనట్టియు, బాధ్యతాయుతమైనట్టియు కార్యభారమును నిర్వహించి న్యాయస్థానమునకు న్యాయపరిశీలన కార్యమునందు తోడ్పడుదురు. తర్జుమాయైనను మక్కికిమక్కిగాని వాడక మాటలలోగాని జరుగదు. కొన్ని వేళలందు వీరు చెప్పునదొకటి వారు చెప్పునది మరి యొకటియై యుండును కనుక సరియైన న్యాయమును బడయుట మిక్కిలి దుస్తరమగుట సంభవించును, కనుక ఉన్నత న్యాయశాఖాధికారులీ విషయమున శ్రద్ధవహించి ఈ లోపమును తొలగించుటకు కృషి సలిపెదరని నమ్ముచునియ్యది వారి విద్యుక్త ధర్మమని హెచ్చరించుచున్నాము

ఈ విషయమును అధికార వర్గము ఒక్క జవాబుతో తెల్పివేసెదరని మాకు తెలియును ప్రస్తుత మెట్టి యేర్పాటు చేయుటకు "గుంజాయిషు" లేదని చెప్పుటయే వారి జవాబై యుండును న్యాయము ప్రసాదింపబడుటలో నీజావాబు తృప్తికరమైనదిగా జాలదని ప్రపంచమంతకును విదితమైయున్నది కనుక అధికార వర్గము జనసామాన్యము యొక్క అవసరమును ప్రజాభిప్రాయమును చేయూతగాగొని ప్రభుత్వము నీ విషయమున బలవంతపెట్టవలెను న్యాయశాఖా వ్యవస్థయందు విస్పష్టముగా గానవచ్చుచున్న నీ కళంకమును దొలగించుటకు కృషిసలుపవలెను జనులు సరియైన న్యాయమును బడయవలెననుటయే మా దృష్టియందున్న విషయము. వ్యవస్థను విమర్శించి కళంకములను ఆక్షేపణ పూర్వకముగా జూపించవలెననెడి యుద్దేశ్యమే మాత్రముగాదు. ప్రజాభిప్రాయముతో బాటు అధికార వర్గము యొక్క సహాయముతో ప్రభుత్వము వారి దృష్టినిప్పట్ల నాకర్షించుటయే మాయాశయము. కనుక లక్షల కొలది రూప్యములు రాష్ట్రతర ప్రాంతములకై వినియోగింప బడుటయు రాష్ట్రయుల యోగక్షేమమున కత్యంతవసరమైన వ్యయమునకై గుంజాయిషు లేదనుటయు సరియైన పద్ధతిగాజాలదు కనుక ప్రభుత్వమువారీ విషయమున శ్రద్ధవహించెదరుగాత