Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/దరిద్ర నారాయణుడు

వికీసోర్స్ నుండి


ఆంధ్ర మహాసభలు

4-7-1931

గత సంచికయందు ఆంధ్ర రాష్ట్రీయ మహాసభాధ్యక్షులగు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రారంభోపన్యాసమును విమర్శించుచు ప్రత్యేకాంధ్ర నిర్మాణావశ్యకత యెంతవరకు గలదో నిరూపించి యుంటిమి. ఇక ఆంధ్ర మహాసభయం దేమి తీర్మానింప బడినదో చూతము అధ్యక్షులగు వరహాగిరి వేంకట జోగయ్య పంతులుగారు ఆంధ్ర దేశమును ప్రత్యేక రాష్ట్రముగ నొనరింపవలయుననియు, ఇందుకుగాను ఆంధ్రదేశమున కన్ని విధముల అర్హత గలదనియు, నొక్కి వక్కాణించి యున్నారు. ఇట్టి ప్రాముఖ్యమగు విషయమున ఏ బుద్ధిమంతునికైనను భేదాభిప్రాయముండదని చెప్పగలము. ఆంధ్ర మహాసభ యొక్క తొమ్మిదవ తీర్మానము ఇట్లు గలదు ..

"స్వరాజ్య నిర్మాణమునకు భాషాప్రయుక్త రాష్ట్రము లావశ్యకముగాని రాబోవు రాజకీయ సంప్రదింపులలోను, రాజ్యాంగ నిర్మాణము నందును, ఆంధ్ర దేశమును ప్రత్యేక రాష్ట్రముగ నిర్మించు నేర్పాట్లు గావింపవలెనని యీ సభవారు మహాత్మాగాంధీ గారికి విన్నవించు చున్నారు.”

ఈ తీర్మాన మెంతయు సమంజసమై యున్నది. రౌండు టేబిలు మహాసభలు గాంధీ మహాత్ముడొకడే కాంగ్రెసు ప్రతినిధిగా వెడలు చున్నాడు గాన ఇట్లు తీర్మానింపబడినది మహాత్ముడు భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనసూత్రమును అంగీకరించియున్నాడు. అందువలననే కాంగ్రెసు సంస్థలు యీ విధానము ననుసరించి నెలకొల్పబడినవి

ఆంధ్ర మహాసభయందు గావింపబడిన తీర్మానములలో ముఖ్యమైనది మరియొకటి గలదు. ముందు ఆంధ్ర మహాసభను ఆంధ్ర రాష్ట్రీయ సభతో గాక ప్రత్యేకముగ జరుపవలయునను తీర్మానము.ఇందువలన ఆంధ్రోద్యమ ప్రచారము తీవ్రముగ జరుగ గలదని తలంచ వచ్చును ఈ రెండు మహాసభలొకసారి జరుపబడు చుండుటచే ఆంధ్ర మహాసభ ప్రాముఖ్యత తగ్గిపోవు చున్నది. ఎల్లరి దృష్టిని రాష్ట్రీయ సభయే ఆకర్షించు చున్నది స్థాయి సంఘసభ లపుడపుడు జరుగనందున దేశములో చలన మెంతమాత్రము లేకున్నది. ఇకనైనసు తీర్మానానుసారము స్థాయి సంఘము వారు ప్రతి మాసము గూడి అంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు గాను తీవ్రమైన ప్రచారము చేయవలయును

ఇంతియే గాక గుంటూరునందు మరికొన్ని మహాసభలు జరిగినవి. వీనిలో హిందీ మహాసభకు ధర్మ వీర వామన రామచంద్రనాయకుగా రధ్యక్షత వహించిరి. వీరు రాష్ట్ర భాషయగు హిందీ యావశ్యకత నిరూపించుచు భావగర్భితమైన యుపన్యాస మొసగిరి హిందీ భాషకు రాష్ట్ర భాషయగుట కన్ని విధముల అర్హతగలదని తెలిపిరి వీరు సూచించినటుల విద్యాశాఖవారు ప్రతి పాఠశాలలో హిందీ బోధించుట కేర్పాట్లు గావించెదరని కోరుచున్నాము.



దరిద్రనారాయణుడు

3 - 10 - 1931

దరిద్రనారాయణుడగు గాంధీమహాత్ముడు భారతదేశమున యవతరించి నిన్నటికి 62 సంవత్సరములు గడిచెను. ఈ మహాత్ముని దివ్యనామముతెలియని వ్యక్తి లేడనిన అతిశయోక్తి కానేరదు. గాంధీ మహాత్ముడు కోట్లకొలది బీదలకు సేవ జేయుటకును, వారిని యుద్ధరించుటకును యవతరించెను. తన యుద్దేశమును నెరవేర్చుటకై నేటికిని అహోరాత్రులు కృషి సలుపుచున్నాడు. మహాత్మునికి ప్రేమ, సత్యము, అహింస యను మూడు గుణములు మూలాధారములు అహింసయే విజయాస్త్రము ప్రేమవలననే శత్రువులను కూడ లోబరుచుకొన గలుగుచున్నాడు. భారతదేశములోని కోట్లకొలది బీదల దుస్థితి గాంచి సహించ లేక తాను గూడ ఐచ్చిక దారిద్ర్యమును స్వీకరించెను. వారిని యుద్ధరించుటకై రాట్న పరిశ్రమ లేవనెత్తెను రాట్నమే బీదలకు భుక్తి నొసగునని ప్రపంచమునకు చాటెను ఇది యొక పిచ్చి యని పలువురు పరిహసించసాగిరి నేడయ్యదియే సుదర్శనచక్రముగా మారినది విదేశ వస్త్రములను భారతదేశమున దిగుమతి కాకుండ జేయుచున్నది నిరుద్యోగులకు పని గల్పించినది. భారతీయులకు స్వదేశీపై ప్రేమ గలిగించినది. మహాత్ముడి రాట్నమును ప్రజల హర్నిశములు ద్రిప్పవలయునని కోరుచున్నాడు ఖద్దరే సర్వదా ధరించవలెనని హెచ్చరించుచున్నాడు ఖద్దరువలన భారతీయులలో కలిగిన నూతనోత్తేజము గత సత్యాగ్రహ సమరమున ప్రపంచమునకై విదితమైనది బ్రిటిషు ప్రభుత్వము వారిని భయకంపితుల గావించినది. నిర్బంధప్రయోగములన్నియు వ్యర్థమైనవి సత్యము, అహింసపై ఆధారపడినచో జయము తప్పక చేకూరునను విశ్వాసము ప్రజలలో యుద్భవించినది వేయేల ఖద్దరువలన భారతదేశమున నూతనశకము ప్రారంభమయ్యెను. ఈ శకమునకు మూలపురుషుడు గాంధీ మహాత్ముడు. ఈయన బోధించుచున్నది ఖద్దరు మంత్రము. ఈ మూడక్షరములు జపించిన