గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల సన్మాన సభ
ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల సన్మాన సభ
3-12-1927
మొన్నటి దినమున మన పురోద్యానములోని టౌనుహాలు మందిరమునందు గత వత్సరమున ఉస్మానియా విశ్వవిద్యాలయము నందు పట్ట పరీక్షలందు ఉత్తీర్ణులైన యౌవనులకు విశ్వవిద్యాలయము నందు పట్ట పరీక్షలందు ఉత్తీర్ణులైన యౌవనులకు విశ్వవిద్యాలయ పక్షమున గౌరవించుటకును, పట్టము లొసగుటకును సభ సమావేశమయ్యెను ఇట్టి సభ సంవత్సరమున కొకమారు ప్రతి విశ్వవిద్యాలయ పక్షమునను జరుపబడుచుండును. దీనిని ఇంగ్లీషున “కాన్వొకేషను సభ” యని పేర్కొనెదరు మన విశ్వవిద్యాలయ పక్షమున జరిగిన ఈ సభ మూడవది.
విశ్వవిద్యాలయ చాన్సెలరులగు శ్రీ రాజా రాజాయాస్, రాజా సర్ కిషన్ ప్రసాద్ బహద్దురు యమీసుస్సల్తసతు గారు గంభీరమగు నొక ఉపన్యాసమును చదివిరి వీని అచ్చు ప్రతులు సభాసదులకు పంచి పెట్టబడినవి. ఈ ఉపన్యాసమునందు మహా ఘనత వహించిన మన ప్రభువుగారి యౌదార్యమును, నవాబ్ హైదర్ నవాజు జంగుగారి సామర్థ్య విశేషములు పొగడబడినవి. మన విశ్వ విద్యాలయము యొక్క ప్రత్యేక లక్షణము ఉర్దూ భాషను విజ్ఞాన సాధనముగా నుపయోగించుట యని చూసిపి ఇంత మాత్రమున విజ్ఞాన సోపానముల దాటితిమనుకొనుట పొరపాటనియు, ముందు పొందవలసిన అభివృద్ధి ఎంతేని కలదనియు వచించిరి విద్యావంతులకు జీవనాధారములు కల్పించవలసిన విషయము ముఖ్యమనియు మన విశ్వవిద్యాలయమున సాంకేతిక విద్యలకు మంచి స్థానము ఒసగబడవలయు ననియు హిందూదేశము యొక్క రాజకీయ, ఆర్థికాభివృద్ధి, దేశములందు మత విద్వేషములును, హ్రస్వ దృష్టులును సమసి పోయిననే కాని ప్రాప్తించజాలదనియు నిర్ణయించిరి. సహకార విద్యాశాఖ, బోధనాభ్యసన శాఖ, ఫ్రెంచి, జర్మనీ మున్నగు ముఖ్య పాశ్చాత్య భాషల శాఖ, పరిశోధన శాఖ ఏర్పరుపబడవలయునని సెలవిచ్చిరి. ఇపుడు భాషాంతరీకరణ శాఖవారు పఠనీయ గ్రంధములను కొన్నిటిని ఇంగ్లీషునుండి ఉర్దూలోనికి వ్రాసి పెట్టినంత మాత్రమున చాలదనియు, విశ్వవిద్యాలయపట్టభద్రులు వాఙ్మయమున ఉత్తమ గ్రంధముల ప్రవేశపెట్టి విజ్ఞాన సంపదను వృద్ధివరచుట తమ ధర్మముగా తలంచవలయుననియు హెచ్చరించిరి. తుదకు పట్టభద్రులను సంబోధించి చెప్పిన వచనములలో మూడే ముఖ్య విషయములు
1 నౌకరి వృత్తిపైన ఆధారపడి యుండక ఇతర వృత్తుల నవలంబింపుడు
2 శారీరక స్థితిని బాగుచేసుకొనుడు.
3 స్వయం సహాయ సూత్రము నమ్ముడు. అనునవియే ఆ ముఖ్య విషయములు
ఈ మహోపన్యాసములోని ప్రధాన సూత్రమొకటి ప్రభుత్వమువారును, దేశీయులును జ్ఞప్తియందు వుంచుకొనదగియున్నది అదేదన
"...కాని ఏ దేశము నందైనను విద్యాభివృద్ధి కేవలము ప్రభుత్వము యొక్క ప్రయత్న మాత్రమున జరుగలేదు యూరోపు ఖండములోని విశ్వవిద్యాలయముల మాట చెప్పవలసిన పనిలేదు. బ్రిటిషు హిందూ దేశములోని ప్రభుత్వమువారి విశ్వవిద్యాలయములకు కూడ ఎన్నోయో విరాళములు గొప్ప గొప్పవి లభించినవి"
ఈ సూత్రమును మహా ఘనత వహించిన మన ప్రభుత్వము యొక్క విద్యాశాఖవారి దృష్టిని ఆకర్షింపదగినది గడచిన 50 సంవత్సరములలో విద్యాశాఖవారు చేసిన పని దేశమునందు నూటిలో ముగ్గురుకంటే నెక్కువ మందికి వ్రాయను, చదవను నేర్పుటకంటె ఎక్కువగ లేదు. నూటికి 97 మంది నిరక్షరులై యజ్ఞాన దశయందున్నారు వీరికి విద్య లభించి మానవ నామమునకు అర్హులు కావలయునన్నచో ప్రజా సహాయము లేకుండ సంభవించదు ప్రజా సహాయమునకు ఆటంకములగు విద్యా శాఖవారి శాసనములను ప్రభుత్వము వారు రద్దుపరచినగాని ప్రజా సహాయము లభింపదని మా అనుమానము విద్యాశాఖవారు ఇపుడైనను తమ పొరపాటుకు శ్రద్ధ వహించెదరా?