గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఉర్దూ నిఘంటు
ఉర్దూ నిఘంటు
23-8-1930
మన ప్రభుత్వము వారు ఉస్మానియా విశ్వవిద్యాలయమునకై పడరాని పాట్లు పడుచున్నారు. ద్రవ్యమును ఉదారముగా ఖర్చు పెట్టుచున్నారు ఇంతకు పూర్వము తర్జుమా శాఖపై మన ప్రభుత్వము వారు వ్యయము చేసిన విషయము విమర్శించియుంటిమి ప్రకృతము ఉర్దూ నిఘంటువొకటి సిద్దము చేయుటకై మౌల్వీ అబ్దుల్హఖ్ గారిని వినియోగించి యున్నారని వినుటకు చాల సంతోషమైనది. మౌల్వీగారు ఉరుదూలో అపూర్వ పాండిత్య ప్రకర్షను కలవారని వినుచున్నాము అట్టివారిని నీయుత్తమ కార్యమునకై వినియోగించుట ప్రశంస నీయమే?
కాని ఒక్క విషయము మాత్రము విమర్శనీయము. మౌల్వీసాహెబు గారికి ప్రతి నెలకు 1000 రూపాయిల జీతముపై పది సంవత్సరముల వరకే పని యిచ్చియున్నారు అనగా వీరి పని పూర్తిచేయు వరకు రూ 1,20000 జీతము పొందుదురు.
ఇంతటి తోడనే పూర్తిగాదు ఇదంతయు సమగ్రమైన తర్వాత దీని అచ్చు వేయించవలెను ప్రభుత్వము వారి అచ్చు శ్రేష్ఠముగా నుండును వారి కాగితము ఉత్తమ గ్లేజు గలవిగా నుండుట కేమి సందేహము. ఇదంతయు పూర్తి అగువరకు 20 లేక 30 వేలు ఖర్చు అగును.
ఇన్ని రూపాయిలు ఖర్చుపెట్టి ఒక్క నిఘంటువును తయారుచేయుచున్న భాషయెంత ధన్యమైనదో యూహించుడు. ఆంధ్ర దేశమందు వేదము వేంకటరాయశాస్త్రి కన్న మించిన పండితుడు లేకుండెను. అట్టి వారిచే సూర్యరాయాంధ్ర నిఘంటు ప్రారంభము చేయించినప్పుడు వారికి నెలకు 250 రూపాయల కన్న నెక్కుడియ్యలేదు. కాని యీ ఉరుదూ నిఘంటువు చాల అదృష్టముతో గూడినట్టిది. ప్రభుత్వమింత ఖర్చు పెట్టుచున్నను ఉరుదూ తెనుగు నిఘంటుకు మాత్ర మొక్క పైసా కూడ యిచ్చుటకు బుద్ధి పుట్టలేదు. ఎవరి సహాయము లేకయె స్వయముగా ఏండ్ల పర్యంతము కష్టించి యుత్తమ పద్ధతిపై మనరాష్ట్ర నివాసి యగు కొండల్రావుగారు అను ఆంధ్రుడు ఉరుదూ తెనుగు నిఘంటువును వ్రాసి ముద్రించుటకై ప్రభుత్వ సహాయము కోరగా నతనికేమియు దొరకకపోయెను. బహుశః ఇది నిఘంటువు ఉరుదూ భాషకు లేక ఉరుదూ మాట్లాడు వారికి లాభకారి కాదేమో!
ఇంతియకాక మేము శ్రీమంతు రాజారాజేశ్వరరావు బహద్దురు దోమకొండ సంస్థానాధీశులు కేవలము నిఘంటువేకాక ఉర్దూ సర్వస్వమే(Encyclo Paedia) వ్రాసియున్నారు వారు వ్రాసి యుంచిన నిఘంటు గ్రంధము లొక రెండెడ్ల బండి మోతకు తక్కువ కావు అది మేముచూచి చాల ఆశ్చర్యపడి యున్నాము. మౌల్వీ గారికి పునః పరిశ్రమ లేకుండ శ్రీమంతు రాజాగారే వ్రాసి యున్నారు కావున ప్రభుత్వము వారు శ్రీరాజులుగారి యనుమతి పొంది వారి గ్రంధమును అవసరముండిన మౌల్వీ గారితో పరిశోధన చేయించి ముద్రించుట యుక్తముగా దోచుచున్నది. ప్రజల ద్రవ్యము విశేషముగా నీపద్ధతి వలన వ్యయము కాదు.