కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/మన ముసల్మానులు భారతీయులు కారా ?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

7. మన ముసల్మానులు భారతీయులు కారా?.

మన తెలుగు దేశంలో మహమ్మదీయులను 'తురక' లని వ్యవహ రించడం అలవాటు అయింది. ఎవరు మీరని వారిని అడిగితే మేము 'తురక'లమంటారు గాని నిజంగా వీరు తురుష్క దేశాన్నుంచి వచ్చిన విజాతీయులు కారు. ఒక్క ఆంధ్ర దేశంలోనే కాదు; యావద్భారత దేశంలో ఉన్న ముసల్మానులలో నూటికి తొంభై మంది పూర్వము హిందువులలోనుంచి మహమ్మదీయ మతంలో కలిసిన వారి సంతతి వారే. నూటికి పదిమంది మాత్రమే అరబ్బీ తురుష్క దేశాలనుంచీ, పారశీక ఆఫ్ఘనిస్థానాలనుంచీ వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకొని ‘షేకు ' లనే ఈ దేశపు మహమ్మదీయులతో సంబంధ బాంధవ్యాలు చేసిన వారి సంతతి వాళ్లు. ఈ ముసల్మానులు హిందూప్రజల లాగనే గ్రామాలలో వ్యవ సాయము, ఇతర వృత్తులు చేసుకుంటూ జీవనం చేస్తూ వున్నందువల్ల అరబ్బీ తురుష్క పారశీక మతాచారాలు క్రమక్రమంగా సడలిపోయి హిందూ దేశ ప్రజల ఆచారాలే వారికికూడాఅలవడినవి. ఇస్లాము మతంలో కుల భేదాలకు తావులేక పోయినా మన దేశంలో వున్న మహమ్మదీయులలో వడ్లగింజలలో వున్నన్ని భేదాలు ఏర్పడినవి. హిందువులలోనుంచి మహమ్మదీయమతం అవలంబించిన వారు వేరు వేరు కులాచారాలు అవలంబించి వేరు వేరు తెగలుగా ఏర్పడ్డారు. ఇస్లాము ధర్మాన్ని బట్టి మహమ్మదీయు లందరూ ఏకపంక్తిని భోజనము చేయవలసి యున్నా మన ముసల్మానులలో భోజన ప్రతిభోజనాల విషయంలోనూ, వివాహాల విషయంలోనూ నిషిద్ధాలు ఏర్పడినవి. వంగరాష్ట్రం జనసంఖ్యలో నూటికి యాభై మంది మహమ్మ దీయులే. వీరిలో నూటికి 34 మంది వ్యవసాయికులు. వీరందరూ హిందువులలోనుంచి మహమ్మదీయు లైనవారే. ఘూర్జర రాష్ట్రంలోని ఖోజాలు, మెమనులు, బోరాలు హిందువుల సంతతివారే. వీరిప్పటికీ మన ఆచార వ్యవహారాలనే అవలంబించి యున్నారు. వేషభాషలలో ఘూర్జర దేశంలో నున్న హిందువులకూ వీరికీ తేడా లేదు. రాజపుత్ర స్థానంలోని ముసల్మాను లందరూ మొగలాయి చక్రవర్తుల కాలంలో మహమ్మదీయులైన రాజపుత్రుల సంతతివారే. తక్కినవారిలో చాలా మంది మియోలు వీరుకూడా హిందువులలోనుంచి ముసల్మాను లైన వారే. పశ్చిమోత్తర పరగణాలలో నున్న ముసల్మానులలో కూడా విజాతీయరక్తము బహుస్వల్పముగా నున్నది. దక్షిణ హిందూస్థానంలో మలబారులోని మాపలాలు క్రీస్తుశకము ఎనిమిదవశతాబ్దములో అరబ్బీదేశాన్నుంచి మనదేశంతో వర్తకవ్యాపారం చేస్తూవచ్చిన అరబ్బీదేశీయులకును, మలబారు హిందువులలోని కిందితరగతుల స్త్రీలకును పుట్టినవారేగాని విజాతీయులుగారు.

మహమ్మదీయులు ప్రబలంగా నున్న పంజాబురాష్ట్రంలో కూడా నూటికి 16 వంతులు మాత్రమే పఠాను బెలూచీ మొగలు వగైరా విజాతీయులు సంతతి వారనిన్నీ, మిగతా 84 వంతులూ హిందువులలోనుంచి మహమ్మదీయులైనవారి సంతతి వారే ననిన్నీ 1901 వ సంవత్సరపు జనాభాలెక్క వల్ల తేలినది. 1901 లో పంజాబులోనున్న మహమ్మదీయులు 1, 4, 40, 122 మందిలో జాటులనే తెగవారు 20 లక్షలు; రాజపుత్రులు ఆరెయినులు 10 లక్షలు; జోలా, అవాను , గుజారు, ముచీ, కుంహరు తర్ఖాను, తేలీలు ఒక్కొక్క తెగవారు ఏడులక్షల యాబైవేల మందిమొదలు 10 లక్షల దాకా వున్నారు. వీరందరు హిందువుల సంతతివారే.

మనదేశపు ముసల్మానులలో హిందువుల లాగనే ఒకరితో ఒకరికి సంబంధబాంధవ్యములు లేని షియాలు, సున్నీలు అనే రెండు పెద్దతెగలు నున్నవి. వీరుగాక ప్రత్యేక తెగలుగా నున్న సయ్యదులు, షేకులు, పఠానులు, మొగలులు, మొహమ్మదీయులు, రాజపుత్రులు, జాటులు, గుజారులు, మియోలు, డిష్కానీలు, మోసలాలు మొదలైన వారున్నారు. ఈ ముసల్మానులలో మెమను, బోరా, ఖోజా, జూలా, ధానియా, ఘోసీ, కుంజెరు, మనిహరు, కసాయీలు మొద లైనవారు హిందువులలాగనే ప్రత్యేక కులాచారాలనే అవలంబించి యున్నారు.

హిందూముసల్మానుల 'భారతీయ ' సభ్యత

భారతదేశంలో హిందూముసల్మానుల చిరకాల సాహచర్యం వల్ల ఈ యుభయుల వేషభాషలూ, అచారాలూ విడదీయ లేనంతటి విధంగా కలిసిపోయి కేవలమూ మహమ్మదీయుల దనిగాని, హిందువుల దనిగాని చెప్పడానికి వీలులెని విధమైన 'భారతీయ ' సభ్యత యొకటి యేర్పడి యున్నది. ఈ చిరకాల సాహచర్యమువల్ల ఉభయులు వేషభాషలలో, మతాచార వ్యవహారాలలో, సంగీత సాహిత్యములలో, శిల్పములో, రుచులలో, తుదకు స్వభావములలో కూడా మార్పులు కలిగినవి. దీనిని గుఱించి హిందువులు, మహమ్మదీయులు, విదేశీయులు పాశ్వాత్యులు కూడా అనేక గ్రంధాలలో వ్రాసియున్నారు. ఇలాంటి రచన లన్నియు సేకరించి శ్రీ రవీంద్రనారాయణఘోష్ గారు 1911 వ సంవత్సరంలో కలకత్తానుంచి ప్రకటింపబడే 'డాన్ సొసైటీవారి మాసపత్రికలో అయిదు గొప్పవ్యాసాలను వ్రాశారు.

'హిందీ ' ల నే ము స ల్మా ను లు

అనేకభాషలయం దపారమైన పాండిత్యము సంపాదించి అరబ్బీ నాగరికతను గుఱించి ఫ్రెంచిభాషలో లెబా న్ గారు వ్రాసిన గ్రంధాన్ని ఉర్దూభాష లోనికి అనువదించి, చెన్నపురి విశ్వవిద్యాలయంలో సంస్కృతపరీక్షకుడుగా కూడా పనిచేసి, 1911 లో దివంతగులైన సయ్యద్ ఆలీ బిల్ గ్రామీగారు శికందరాబాదులో ఉపన్యసిస్తూ ఇలాగ చెప్పారు:-

"హిందూదేశపు ముసల్మానులమైన మనము తురుష్కదేశ మందున్న, ఇతర మహమ్మదీయ రాజ్యాలయందున్నూగల ముసల్మానులందరూ మనలను ముసల్మాను లనక 'హిందీ ' లని వ్యవహరించేటంతగా భారతీయ సభ్యతలో లీనమైనాము. ఈ 'హిందీ ' అనే శబ్దము వినడానికి 'హిందూ ' అనే శబ్దానికి భిన్నంగ అ కనబడుతూ వున్నా దీని అర్ధం హిందువు లనియే సుమండీ! ఇంతేకాదు. భారతదేశపు ముసల్మానుల మగుటవల్ల మనము మధ్యఆశియా దేశము లందలి అనాగరికమూకలకన్ననూ తురుష్క పారశీక దేశములందలి ముసల్మానులకన్ననూ, మనను 'హిందువు ' లని పిలిచే జాతులవా రందరికన్ననూకూడా, సాంఘికంగానూ బుద్దిబలంలోనూ శ్రేష్ఠులముగా నున్నాము. పారశీక దేశములోని పూర్వనాగరికతయైన 'నస్సానియనుల ' సభ్యతయున్నూ, సాహిత్యమున్నూ అక్కడికి వచ్చిన ఇస్లాములో గొప్పమార్పును కలిగించి జలాలుద్దీన్ రూమీ, ఉమర్ ఖయ్యాముల వంటి మహాకవులను సృష్టించినట్లే మనదేశంలో హిందువుల పూర్వనాగరికత తత్వవేదాంతములు భారతీయముసల్మానులను సృష్టించినవి. వివిధదేశములందలి పూర్వనాగరికతలు ఇస్లాములో కలిగించిన మార్పులు పరిశోధింపతగిన విషయము."

దు స్తు లు

ఉత్తర హిందూస్థానంలో హిందువులు, మహమ్మదీయులూ, ధరించే దుస్తులూ, నివసించే ఇళ్లూ ఒకే మాదిరిగా నుంటవి. బయటకు పోయేటప్పుడు హిందువులైనా మహమ్మదీయులైనా పాయిజామాలూ, పగ్రీలూ వేసుకుంటారు. ఇళ్లలో - ముఖ్యముగా గ్రామాలలో - ధోవతీ, ఉత్తరీయమూ ధరిస్తారు. అనేక ప్రాంతాలలో అంగీయాయున్నూ, ఘోషాకోసం మేలిముసుగుగా వేసుకొనేజలతారు వోణీ, కుచ్చెళ్లపోసికట్టిన పమిటి పావడాను, రవికనూ ఈ వుభయమతములవారి స్త్రీలూ భేధమేమీ లేకుండా ధరిస్తారు.

శి ల్ప ము

ఉత్తరహిందూస్థానములో మతాలకు సంబంధించిన మసీదులూ, దేవాలయాలూ గాక లౌకికజీవితానికి సంబంధించిన రాజనగరులు, బాటసారుల కోసం కట్టిన సరాయిలు, వీధిలోకి కట్టిన ఇళ్ళు వాకిళ్ళు, స్నానఘట్టాలూ, రాజపుత్రస్థానంలోను మధ్యరాష్ట్రంలోనూ అయోధ్య ఆగ్రా రాష్ట్రాలలోనూ పంజాబులోను గల గొప్ప నగరా లన్నింటి లోనూ హిందూమహమ్మదీయుల రుచులు రెండూ కనపడే శిల్పాన్ని

మన మహమ్మదీయులు భారతీయులు కారా?

ప్రదర్శిస్తున్నవి గాని కేవలము ఒక్కరికే చెందినట్టి శిల్పమని చెప్పడానికి వీలైనవి కావు. హిందువుల కట్టడాలపైన గల గాలిగుమ్మటములు, వికసించినపుష్పముల వంటి స్వరూపములు, అష్టభుజముల కట్టడములు, స్తూపీలు, బురుజులు, గోడలపైన కిటికీలపైన చెక్కిన శిల్పమూ మహమ్మదీయుల శిల్పమే! మహమ్మదీయుల కట్టడములలో అందంగా చెక్కిన రాతిపోటీపలకలు, ముందుకు చొచ్చుకుని వచ్చే మంటపములు, నలుపలకల స్తంభములు, అడ్డముగా నేసే తనాబీలు, బల్లపరుపు కప్పులు, అతిసున్నితంగానూ, చిత్రవిచిత్రంగానూ చెక్కిన నగిషీలూ కేవలమూ హిందువుల శిల్పమే!! ఇలాగ ఈదేశంలో ఈ హిందూ మహమ్మదీయుల శిల్పాలు రెండూ లీన మైనట్లు మహానగరాలన్నింటిలోనూ నిదర్శనాలు కనబడుతున్నవి.

చి త్ర లే ఖ న ము

శిల్పములోలాగనే చిత్రలేఖనములోకూడా హిందూమహమ్మదీయ నైపుణ్యములు మేళవించిన లక్షణాలు కనబడుతున్నవి. చక్రవర్తులు, నవాబులు ఈకళను పోషించడంపోయి, ఇవి క్షీణించినప్పటికీ దీని యందలి సామాన్యలక్షణాలు మాత్రం పోలేదు. పారశీకసాహిత్యములోని శృంగారకావ్యముల కధలును భారతదేశ జనసామాన్యానికి అనుశ్రుతంగా సంక్రమించివచ్చిన కధలను భారతదేశ హిందూమహమ్మదీయ ప్రజాజీవనమును మన దేశపుచిత్తరువులలో చిత్రింపబడి యున్నవి.

మనుష్యులనూ మృగాలనూ చిత్రించకూడ దని ఖురాను నిషేధించినందువల్ల మతావేశంగల ముసల్మానులు కొందరు ఈకళను పోషించక పోయినప్పటికీ, మొగలాయి చక్రవర్తులున్నూ, వారిఆశ్రితులైన నవాబులున్నూ దీనిని ప్రొత్సహిస్తూనే వుండేవారు.

మహమ్మదీయుల కాలంనాటి నుంచీకూడా చక్కని చిన్న చిత్రాలను చిత్రించే ఒక కొత్తపద్ధతి హిందూమహమ్మదీయ చిత్రకారులలో వ్యాపించింది. ఈ యుభయమతముల కళోపాసకులూ ఒండొరులను గురుశిష్యులుగా స్వీకరించడానికి యెలాంటి అభ్యంతరమూ వుండేది కాదు.

సం గీ త ము

భారతదేశంలో సజీవమైయున్న లలితకళలళో సంగీత మొకటి. దీని చరిత్రను చూస్తే హిందూ మహమ్మదీయ సభ్యతలూ ఏరీతిగా మేళవించినదీ తెలుస్తుంది. ఉత్తర హిందూస్థానంలో జంత్రగాత్రముల సంగీతవిద్య వంశపారంపర్యముగా గాయకులుగా నున్న హిందూ మహమ్మదీయ కుటుంబములలో స్ధిరంగా నెలకొని యున్నది. ఈ ఉభయ మతముల గాయకులూ ఒకేవిధమైన సంగీతవిద్యను అభ్యసిస్తున్నారు. ఒకే పాటలను పాడతారు ఒకేవిధమైన జంత్రములను వాయిస్తారు. ఒకేవిధమైన రాగములను అలాపన చేస్తారు. ఈ సంగీతవిద్య పూర్వకాలంనాటి హైందవ సంగీతశాస్త్ర విధానమును పారశీక ఫణితులతొ మేళవించి నిర్మించిన ఒక అపూర్వమైన సంగీతసంప్రదాయముగా నున్నది.

ఢిల్లీలో ఖిల్జీతొగ్లకు చక్రవర్తుల ఆస్థానవిద్వాంసుడుగా నుండిన అమీర్ ఖుస్రూ ఈ యపూర్వమైన సంగీతసంప్రదాయానికి మూలపురుషుడని అంటారు. ఇప్పుడు వాడుకలో నున్న రాగముల పేర్లూ, రాగీణుల పేర్లూ కూడా హిందూమహమ్మదీయ సమ్మేళనానికి నిదర్శనములుగా నున్నవి. 'ఇమాన్ కల్యాణి ' అనే రాగంలో 'ఇమాన్ ' అనే పారశీక పదమున్నూ, 'కల్యాణి ' అనే సంస్కృత పదమున్నూకలిసి ఏకసమాసమైనవి.

హిందూమహమ్మదీయ గాయకులు ఒండొరులకు గురుశిష్యులుగా వుండేవారు. ఇలాగే హిందూ మహమ్మదీయరాజులు ఉభయ మతముల గాయకులనూ పోషించేవారు. ఇప్పటికీకూడా ఉత్తరహిందూస్థానములో ఒకే తివాచీపైన హిందూమహమ్మదీయ గాయకులు తమ వీణలను, తంబురాలను వుంచుకుని సంగీతము పాడతారు. హిందూ మహమ్మదీయులు ఒండొరుల కచ్చేరీలలో మృదంగములను తబలాలను వాయిస్తారు. అన్నింటికంటె అపూర్వమైన సంగతి యేమిటంటే, ఈ హిందూ మహమ్మదీయ గాయకులు పాడే పాటలలో రాధాకృష్ణ శృంగార గీతములు, రామభజన కీర్తనలు, శివతత్త్వములు, మహమ్మదీయ సూఫీగీతములు, అల్లా నుద్భోదించే తరంగాలూ ఎట్టి మతభేదమూ లేకుండా పాడతారు.

పా ట లు, ప దా లు

సంగీత విద్యలోలాగనే ప్రజలు పాడుకునే సామాన్యమైన గాలిపాటలలోనూ పదాలలోనూ హిందూమహమ్మదీయ జనసామాన్యము ఇప్పటికీ ఒకే విధమైన పాటలూ, పదాలూ పాడతారు. ఉత్తర హిందూస్థానంలో హిందూ మహమ్మదీయుల పండుగలలోనూ, బాలబాలికల పుట్టినరోజుపండుగలలోనూ, పెళ్లిళ్లలోనూ స్త్రీలు ఒకేవిధమైనపాటలు పాడతారు. పిండి విసిరేటప్పుడు, బరువులు మోసేటప్పుడు, పడవలు లాగేటప్పుడు, ఇళ్ళ డాబాలమీద సున్నమునకు జిగి రావడానికి కొట్టేటప్పుడు, ఇంకా నలుగురు కలిసి కాయకష్టం చేసే అన్ని సందర్భాలలోనూకూడా మన దంఫుళ్ళపాటలు, రోకంటిపాటలు, పడవపాటల లాంటి పాటలనే అక్కడ కూడా పాడుతూ వుంటారు. ఇందులో హిందూ మహమ్మదీయ భేదము లేనే లేదు.

బీహారు పరగణాలలోనూ ఉత్తర హిందూస్థానములో అనేక ప్రాంతాలలోనూ ముసల్మానుల ఇళ్లల్లో పాడే జోలపాటలు 'నంద్ లాల్ ' అని శ్రీకృష్ణున్ని ఉద్దేశించి వ్రాయబడిన హిందువుల పాటలే! కృష్ణుని శ్యామ లవర్ణమునే 'శాన్ వాల్య ' అనే పదముగా మార్చి పాడుతూవున్నట్లు పరిశోధకులు కనిపెట్టినారు. *ఇలాగే బీహారు లోనూ ఉత్తరదేశ పరగణాలలోనూ మహమ్మదీయ స్త్రీలు పాడే పెళ్ళిపాటలు కూడా హిందువులవే. ఉదాహరణానికి ఈ క్రిందిపాటచూడండి.

అల్బెలీ జచ్చా మన్ కరే నంద్ లాల్ సే
సోహగన్ జచ్చా మన్ కరా నంద్ లాల్ సే
అల్బేలీ నీ ముఝే దర్ ద్ దియా
శాన్ వాల్యానే ముఝే దర్ ద్ దియా.

---అనగా, "నందలాలే తన కడుపున పుట్టాలని తల్లి మనసారా కోరింది. ఆనంద భరితురాలైన ఆ తల్లి నందలాలే తన కడుపున పుట్టాలని కోరింది. మా అబ్బాయి నన్ను బాధలు పెట్టాడు, నీల(మేఘ)శ్యాముడు నన్ను బాధలు పెట్టాడు" అని యీపాట తాత్పర్యము, ఈపాటలో "నంద్ లాల్, శాన్ వాల్యా" అనే మాటలు శ్రీకృష్ణుని ఉద్దేశించినవే నని ఒక మహమ్మదీయ గ్రంధకర్త వ్రాసియున్నాడు. (1910- వసం॥ 'మోడరన్ బీహార్ ' 8 వ పుటలో బ్యారిష్టరు ముజ్రుల్ హక్కుగారి వ్యాసం చూడండి)

ఉత్తర హిందూస్థానంలో పంజాబురాష్ట్రంలో వివిధగ్రామాలలో హిందూ మహమ్మదీయ ప్రజలు పాడేపాటలలోని కధలలోకూడా తేడాలు లేవు. ఇలాగ హిందువులు మహమ్మదీయ కధలనూ, మహమ్మదీయులు హిందువుల కధలనూ, పాటలుగానూ, కలాపములుగానూ, వీధినాటకములుగానూ, పాడుకొంటున్నారు.

భాష - సాహిత్యము

వంగరాష్ట్రంలో మహమ్మదీయు లందరూ బంగాళీభాషనే మాట్లాడుతారు. ఇలాగే పంజాబులోని పంజాబీని, సింధులో సింధీ భాషనూ, ఇతర ప్రాంతాలలో ఆయారాష్ట్ర భాషలనూ, మాట్లాడుతారు. ఉత్తర హిందూస్థానంలో విద్యావంతులైన హిందువులూ, మహమ్మదీయులూకూడా మాట్లాడేటప్పుడుగాని, పద్యగద్య రూపంగా గ్రంధాలు వ్రాసేటప్పుడుగాని, ఉర్దూభాషనే వాడతారు. ఈ ఉర్దూ భాష వ్యాకరణము మన దేశభాషల సంప్రదాయానికి చెందినదే. అందులోని శబ్దాలు మాత్రం ఎక్కువగా ఫారసీ భాషలోనివి. ఈ ఉర్దూభాషలో ఉత్తమ గ్రంధాలు రచించిన వారిలో హిందువులూ, మహమ్మదీయులూ కూడా సమానంగా వున్నారు. హిందువులలో ఉర్దూభాషలో సుప్రసిధ్దమైన కవి దయాశంకర్ నశీం, వచనంలో పేరొందిన గ్రంధకర్త పండిత రతన్ నాధ్.

ఇంతేకాదు, పారశీకభాషలో నుంచి మన దేశభాషలలోనికికూడా చక్కని పదాలు చాలా వచ్చి కలిసినవి. మన దేశభాషలలో పాండి త్యము సంపాదించిన మహమ్మదీయులు కూడా చాలామంది వున్నారు. తరువాత కొంతకాలానికి తులసీదాసు సుప్రసిద్ధమైన తన రామాయణాన్ని రచించిన అవధి-హిందీబాషలలో క్రీ.శ.1540 లోనే మలీకు మహమ్మదు అనే ముసల్మానుకవి 'పద్మావతి ' అనే చక్కని కావ్యాన్ని రచించాడు. ఇందులో భూలోకసుందరియైన పద్మావతి, ఆమెభర్త రతన్ సింగుల ప్రణయగాధ, అల్లావుద్దీన్ చక్రవర్తి చిత్తూరు దుర్గాన్నిముట్టడించగా పురుషులు వీరస్వర్గాన్ని అలంకరించడము, రాజపుత్రస్త్రీలు జోహారుచేయడము మొదలైన అంశాలను ఎంతో రసవంతంగా ఈ ముసల్మానుకవి వర్ణించాడు.

జీవాత్మ, పరమాత్మకోసం వెదుక్కునే అంతరార్ధాన్ని కూడా ఆ కావ్యంలో స్ఫురింపజేయడంవల్ల ఈ కవికి హిందువుల సంగతి ఎంతబాగా తెలుసునో, వారియం దెంత స్నేహభావ మున్నదో కనబడుతూవుంది.

హిందీభాషలో ఉత్తమగ్రంధాలను రచించిన ముసల్మానులలో అక్బరుచక్రవర్తి సభలోని నవరత్నాలలో ఒకడైన అబ్దుల్ రహీముఖానుఖానన్, తాను హిందీలో కవిత్వంచెప్పడమే గాక, హిందీ సాహిత్యానికి పోషకుడుగా కూడా ప్రసిద్ధి కెక్కినాడు. అతడు రాధాకృష్ణ శృంగార గీతముల నెన్నోరచించాడు.

బంగాళీభాషలో కవిత్వం చెప్పిన మహమ్మదీయులు చాలా మంది వున్నారు. మలీకుమహమ్మదుగారి 'పద్మావతి 'ని అల్వాల్ అనే కవి బెంగాళీభాషలోకి చక్కగా అనువదించాడు. వంగరాష్ట్రాన్ని పరిపాలించిన మహమ్మదీయనవాబులు చాలామంది బంగాళీ సాహిత్యాన్ని బాగా ఆదరించారు. చైతన్యస్వామి ప్రచారంచేసిన వైష్ణవమతము కొంతమంది మహమ్మదీయులను ఆకర్షించినది. ఆకాలంలో వైష్ణవమతంలో కలిసిన ముసల్మానులలో హరిదాసు ఒకరు. అలాంటి వారిలో కొంతమంది రాధాకృష్ణులను గురించీ, చైతన్యస్వాములనుగురించీ పదాలూ, పాటలూ రచించారు. దినేకచంద్రసేను, అబ్దుల్ కరీము. వ్రజసుందర సన్యాల్ గార్లు చేసిన కృషివల్ల బంగాళీభాషలో ఈ విధంగా వైష్ణవ గ్రంథాలను రచించిన ముసల్మాను వైష్ణవకవుల పేర్లు 24 దాకా బయటపడినవి. ఈ కవులలో సయ్యద్ మర్తుజాగరి వైష్ణవగీతము లతిరమణీయంగా నున్నవని తెలిసినవారంటున్నారు.

ఇలాగ ఈ ప్రాంతాలలొ హిందువులకూ మహమ్మదీయులకూ కూడా బంగాళీభాష మాతృభాషగా నుండడమేగాక ఉభయులకూ భారతీయ సాహిత్య సంప్రదాయములే ప్రీతికరంగా నుంటున్నవని స్పష్టంగా కనబడుతూవుంది.

పంజాబులోను, అయోధ్య ఆగ్రారాష్ట్రాలలోనూ చాలాకాలం నుంచి ఉర్దూభాషా, పారశీకభాషా విద్యాధికుల యాదరణకు పాత్రములై ఉంటున్నవి. వీరికి భారతీయసాహిత్య సంప్రదాయాల కంటే పారశీకసాహిత్య సంప్రదాయాలే ఎక్కువ ఆదరణ పాత్రంగ నుంటూ వున్నవి. అందువల్ల యీ ప్రాంతాలలో సామాన్యజనులలో మహమ్మదీయులలాగనే హిందువులలోకూడా హైందవపురాణ కధలకన్నా, భారతీయసాహిత్య విషయాలకన్నా "యూసఫ్ - జులేఖా", "షిరీన్ - ఫరీద్", "గులేబకావలి", "లైలామజ్నూన్" మొదలైన పారశీక కావ్యకధలే ఎక్కువ బాగాతెలుసును. ఇటీవల కొంతకాలం క్రిందట ఆప్రాంతాల హిందువులు తమ మతానికీ, పూర్వ నాగరికతకూ, విజ్ఞానానికీ సంబంధించిన సాహిత్యంకూడా బాగా తెలుసుకోవడం అవసరమనే ప్రచారంకూడా చేయవలసి వచ్చింది.

వా ణి జ్య ము - ప రి శ్ర మ లు

ప్రజల వేషభాషలలో లాగనే వాణిజ్యవ్యాపారములలోను, పరిశ్రమలలోను, వృత్తులలోనూ కూడా హిందూమహమ్మదీయ సమ్మేళనము కనబడుతూ వుంది. హిందువులు అతిపవిత్రంగా నెంచి అన్ని శుభకార్యాలలోనూ మడిబట్టగా ధరించే కాశీపట్టు తాపితాలు నేసేవాళ్లు మహమ్మదీయ నేతగాళ్లే! ఈ తాపితాలను అందులోను నేతలొనే కనబడే పట్టుజలతారు డోరియాలు, పువ్వులు, చిత్రములు కేవలమూ హిందువుల యాచారమునకు సంబంధించిన నమోనాలే. దీనిని మహమ్మదీయులు నేయడమూ, హిందువులు ధరించడమూ చూడగా నొకరి ఆచారవ్యవహారాల నొక రెంతచక్కగా గ్రహించి అందు కనుగుణ్యముగా కావలసిన వస్తుసామగ్రి నెంత శ్రద్దతో తయారు చేయగలరో తెలుస్తుంది.

ఇలాగే పూజలలో ఉపయోగిందే శ్రీయంత్రమును స్ఫటికముపయిన చెక్కే శిల్పులు మహమ్మదీయు పనివాళ్ళే, మంత్రశాస్త్రమునకు సంబంధించిన యంత్ర తంత్రములలో ఒక్క బీజాక్షరము గాని, భుజముగాని తప్పురాకుండా చెక్కవలెనంటే ఎంత శ్రద్ధాశక్తులతో ఆపని చెయ్యాలో ఊహింపవచ్చును.

హిందూ మహమ్మదీయులు ఇళ్లలో నుపయోగించే హుక్కాలు, పాన్ దానులు, అత్తరుదానులు, తివాచీలు, ఇంకను గొప్పవాళ్లు వుపయోగించే వివిధములైన వస్తువులూ, హిందూ మహమ్మదీయ పారిశ్రామికులు ఎలాటి మతభేదమూ లేకుండా తయారు చేస్తారు. ఇత్తడి సామానుల మీదా, రాగిసామానులమీదా, లక్కతో నగిషీపనిచేసే కులవృత్తిమహమ్మదీయులది. అయితే జయపురంలో హిందూ పారిశ్రామికులీ పనిని నేర్చుకొనిఈ వస్తువులను తయారుచేయడం ప్రారంభించి ఈసామానులమీద హిందువుల పురాణకధలను గూర్చిన చిత్రములూ, మత సంబంధమైన ఇతరనమోనాలు, బొమ్మలు చెక్కేవారు. ఇది చూసి ఈ జయపుర హిందూపారిశ్రామికుల లాగనే మహమ్మదీయ పారిశ్రామికులు కూడా ఈ బొమ్మలను, నమోనాలను వెయ్యడం ప్రారంభించారు. లుంగీలూ, పగ్రీలనే తలపాగాలూ చేసే వృత్తిలో హిందువులూ, మహమ్మదీయులూ కూడా నున్నారు. అనేక గృహపరిశ్రమలలలో ఒక వస్తువును కొంతవరకూ ఒకజాతి పనివాడూ, తక్కిన భాగమును రెండవజాతి పనివాడూ చేయడము కూడా కద్దు. కీన్కాబు , జరీ,పట్టు, బుటేదారీ పరిశ్రమలో మతలబును తయారుచేసే పనివాళ్లందరూ హిందువులే. కీన్కాబు కార్ఖానాలన్నీ హిందువులవే. కాశీలో కీన్కాబు నమోనాలు తయారు చేసేవారందరూ మహమ్మదీయులు. నేతగాళ్లలో హిందువులూ, మహమ్మదీయులు కూడా వున్నారు. వీటిని విక్రయించే వర్తకులందరూ హిందువులే. హిందూ రాజ్యాలైన రాజపుత్ర స్థానంలోని సంస్థానాలలో రాళ్లను చెక్కే శిల్పులందరూ మహమ్మదీయులే.

మ త ము

మతవిషయంలో కూడా హిందూమహమ్మదీయ సమ్మేళనకు నిదర్శనాలు కనబడుతున్నవి. హిందూదేశంలో జన్మించిన వాళ్లందరికీ సాకారేశ్వరా రాధనమున్నూ, కర్మకాండయున్నూ సామాన్యధర్మములుగా నుంటున్నవి. హిందూదేశంలోని మహమ్మదీయులలో చాలామంది హిందువులుగా నుండినవాళ్లే. ఇంతేగాక ఈ దేశంలోకి మహమ్మదీయమతం సూటిగా అరబ్బీదేశంలోనుంచిగాక మధ్యమజిలీయైన పారశీక దేశంలోనుంఛి వచ్చినందువల్ల పారశీకదేశంలోని కొంతమార్పుచెంది యిక్కడికి వచ్చినది. ఇలాగ కొంతమార్పుచెందివచ్చిన యీ మహమ్మదీయమతము ఈ దేశంలోని హిందువుల వైదికమతధర్మాలతో ఏడుశతాబ్దాలు సహవాసం చేసింది. అందువల్ల యీ మహమ్మదీయమతము ఆచారాలలోను, కర్మకాండలోను ఇక్కడ చిత్రవిచిత్రాలైన మార్పులను జెంది ఇతర దేశాలలో నున్న ఇస్లాము మతధర్మాలకు చాలా విషయాలలో భిన్నంగా పరిణమించియున్నది. ఈపరివర్తన మెంతవరకూ జరిగిన దనగా ఉత్తర హిందూస్థానములోని జనసామాన్యము ఈ ప్రకరంగా మార్పుచెందిన ఇస్లాము మతము యొక్క ఆరాధనలనందున్నూ, ఉత్సవములందున్నూ, పండుగులలోనూ పాల్గొనడానికి గాని, మహమ్మదీయల పవిత్రస్థలాలకు తీర్దయాత్రలకు పోవడానికిగాని హిందువులకు ఎలాంటి సంకోచమూలేకుండా హిందువులందరూ అలా చేస్తున్నారు. హిందువుల లాగనే మహమ్మదీయులలొ సామాన్యజనులుకూడా పాల్గొంటూ వారి యాత్రాస్థలాలకు పోతున్నారు.

పీ ర్లు - మొ క్కు బ డు లు

హిందూ మతధర్మాల సాహచర్యంవల్ల మార్పుచెందిన ఇస్లామును గురించి ప్రాచ్యపాశ్చాత్య గ్రంధకర్తలనేకులు పరిశోధనలు చేసి వాసియున్నారు. ఈమార్పు ముఖ్యముగా పీరు లనబడు మహమ్మ

మన ముసల్మానులు భారతీయులు కారా?

దీయ మహాత్ముల పవిత్రస్థలములలో జరిగే మొక్కుబడులలోనూ, పూజలలోనూ, ఉత్సవాలలోనూ, సంతలలోనూ, బాగా కనబడుతూ ఉంది. ఈ పీరుల యారాధనము హిందూదేశపు సరిహద్దులు దాటిన తరువాత యింక యే మహమ్మదీయ రాజ్యంలోనూ లేదు. ఇది హిందువులలో పూర్వం బౌద్ధ బోధిసత్వులకూ, జైనతీర్ధులకూ, వైష్ణవఆళ్వరులకూ, జైనభక్తులకూ జరిగే ఆరాధనలు, అర్చనలు, మహోత్సవములు వంటివే.

హిందువులు ముప్పైమూడుకోట్ల దేవతలను ఆరాధిస్తూ వారికి మొక్కుకుంటూ ఉన్నట్లే మహమ్మదీయులైన హిందువులకు కూడా ఒక విధమైన ఆరాధనలు, అర్చకులు, మొక్కుబళ్లు, ఉత్సావాలూ అవసరమైన ఈ పీరుల ఆరాధన బయలుదేరింది. ఈ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు పీరులకు మొక్కు కోవడమూ, సామాన్యజనులు తమ యిష్టసిద్ధులు చేయవలసిందని పీరులకు మొక్కుకోవడమూకూడా ప్రబలింది. హిందువుల దేవతలలాగనే మహమ్మదీయుల పీరులుకూడా మంచి చెడుగులను కారణభూతము లైనట్లే ప్రజలు విశ్వసించి అందుకనుగుణముగా వారి నర్చించడం ప్రారంభమైనది. దీనితోపాటు వ్యాజ్యములు గెల్పించమని మొక్కులు, ప్రయాణంలో కార్యసాఫల్యం చేయమని మొక్కులు, తాయత్తులు, శకునములు, దీవనలు మొదలైన హిందూ ఆచారాలన్నిఈ మహమ్మదీయులలోకూడా ప్రబలమైనవి. ఇలాంటి పీరులను కొలిచే మహమ్మదీయజనసామాన్యము, తొడి హిందువులను చూసి గ్రామదేవతలకు మొక్కుకొవడమూ, గొట్టాలమ్మా, మహమ్మారీ మొదలైన క్షుద్ర దేవతలను కొలిచే బీద హిందువులు మహమ్మదీయ సోదరుల పీరులకు మొక్కుకోవడమూ, ఫకీరుల దీవనలూ, పైగంబరుల ఆశీర్వాదములూ పొందడమూ ఒక వింత సంగతి కాదు.

పండుగలు - పర్వములు

భారత దేశమున మహమ్మదీయులు తమ మతానికి సంబంధించిన ఉత్సవాలు జరపడంలోకూడా అనేక హిందూసంప్రదాయాలను అవ లంబించారు. అరబ్బీదేశంలోని ఇస్లాములో ఎట్టి సాకారదేవతార్చనముగాని, మేళతాళములు నృత్యగీత వాద్యములుగాని లేక ఆనంద రహితమైన మానసికారాధన ప్రార్ధనలు మాత్రమే వుండేవి. మనదేశానికి వచ్చిన మహమ్మదీయులు చిరకాలమునుంచి హిందూసంప్రదాయాలకు అలవాటుపడి తాము జీవించే దేశంలోని ప్రకృతిదృశాలకూ, జంతువులకూ, భూసారముపైన ఆధారపడే పాడిపంటలకూ సంబంధించి, ఇంద్రియములకూ మనోభావములకూ రుచించే ఆచార వ్యవహారములు, కర్మకాండలకు అలవాటుపడిన ప్రజలకు ఈ ఆనందరహితమైన వీరమహమ్మదీయ మతాచార ధర్మములు రుచించలేదు. అందువల్ల మన ముసల్మానులు తమ మనోభావాలకు వాంఛలకు అనుగుణములైన పండుగలు పర్వములు, ఉత్సవములు ఊరేగింపులు, అర్చనలు, ఆరాధనలూ కల్పించు కొన్నారు. హిందువుల గంగాపూజలకు బదులుగా మహమ్మదీయులు భాడ్ నే (భాద్రపద) మాసమున 'క్వాజాఖజిర్ ' పండుగను చేయడం ప్రారంభించారు. పూర్వకాలంనాటి మహమ్మదీయ మతయుద్దానికి సంబంధించిన మొహరంపర్వదినములందు మహమ్మదీయులు చేయు ప్రార్ధనాదికములూ, ఉత్సవములూ భారతదేశమందు నూతనరూపం దాల్చినవి. దానిని హిందువుల పండుగలాగ మార్చి, హిందువులు అవలంబించే అనేక ఆచారాలూ, కర్మకాండలూ మన ముసల్మానులు ఈ మొహరంలో అవలంబిస్తున్నారు.

ప్రా చ్య పా శ్చా త్య గ్రం ధ క ర్త ల సా క్ష్య ము

ప్యారిస్ లో ప్రాచ్యదేశ భాషల పండితుడుగా నుండిన మా.గార్సిన్ డీ టాసీ (M. Garcin de Tassy) గారు భారతదేశమునందలి హిందూస్థానీ పారశీక సాహిత్యము తరచి హిందూదేశములో మహమ్మదీయ మతము పొందిన మార్పులను గురించి 1831 లో ఒక గొప్పవ్యాసాన్ని వ్రాసి ప్రకటించారు. కాజీం ఆలీ జవాన్ సాహేబు గారు హిందూస్థానీలో "బారామాష్" (పన్నెండు నెలలు) అనే గ్రంధంలోనుంచీ షేర్ ఆలీ ఆఫ్ గన్ సాహేబుగారు రచించిన హిందూ స్థానచరిత్రలోనుంచీ, ఇంకనూ ఇతర ముసల్మానుగ్రంధకర్తల ఉద్గ్రంథాలలోనుంచీ ఈ టాసీగారు తాను వ్రాసిన సంగతులన్నీ గ్రహించినందువల్ల ఈ విషయంలో ఇది చాలా ప్రమాణగ్రంధంగా వుంది. ఇలాగే మా.గస్టవు లీ బాన్ అనే ఇంకొక ఫ్రెంచిగ్రంధకర్త కూడా 'భారతదేశమునందలి నాగరికతలు ' అనే గ్రంధంలో హిందూ దేశంలో మహమ్మదీయ మతాచారాలు పొందిన మార్పులను గురించి చక్కగా వివరించి యున్నారు.

విదేశీయులే గాక భారతీయులు కూడా - అందులో సుప్రసిద్ధ విద్వాంసులైన మహమ్మదీయ ప్రముఖులు కూడా ఈ విషయాన్ని గురించివ్రాసియున్నారు. యూసఫ్ ఆలీ ఎం.ఏ., ఎల్, బి.,ఐ.సి.ఎస్. గారు 'భా రతదేశ ప్రజల జీవనము, వృత్తులు ' అనే గ్రంధంలో ఈ విషయాన్ని బాగా చర్చించి హిందువులు తమ పితృ దేవతలకు పిండములు పెట్టుతూవుంటే హిందూదేశంలోని మహమ్మదీయులు 'షిర్నీ ' యనే ఆచారాన్ని అవలంబించి యున్నారనిన్నీ, గ్రామాలలోని జులహా తేలీ మహమ్మదీయులు హిందువులలాగనే మశూఛికాలు రాకుండా గ్రామదేవతలకు మొక్కుతున్నారనిన్నీ, హిందువులు కాశీ రామేశ్వరాలకు పోయినట్లే మహమ్మదీయులు ఘాజీమియాన్ గోరీ దగ్గరికి యాత్రకు పోతునారనిన్నీ, పాంచన్ పీరులనుగురించి పాటలు పాడతారనిన్నీ, 1910 లో వ్రాసియున్నారు.

డబ్లియు క్రూక్ (Crooke) అనే ఐ.సి.యస్. ఉద్యోగి The North Western Provinces of India అనే గ్రంధములో ఇలాగ వ్రాశారు.

"ఎట్టి కళంకముగాని, కల్మషముగాని, అనాచారములు గాని, మూఢ విశ్వాసములుగాని లేక ఖురాను షరీఫులో సూత్రప్రాయంగా నిర్వచింపబడిన ఇస్లాము సిద్ధాంతాలను అవలంబించే మహమ్మదీయులు ఈ భారతదేశంలో బహు కొద్దిమంది మాత్రమే వున్నారు. ఇలాంటి కఠిననియమాల మతాన్ని అనుష్థించే వారిలో వాహాబీలు, లేక అహల్-ల్-హాదీ లనువారు మాత్రమే యున్నారు. విగ్రహరాధనకు దగ్గర సంబంధంగల ఆచారాలనూ, ఉత్సవాలనూ, వీరుల గోరీలదగ్గిర మొక్కులనూ వీరు అంగీకరింపక అట్టి ఆచారాలను అవలంబించే ముసల్మానులను "ముష్రకులు" - అనగా భగవంతునితో ఇంకొక వ్యక్తిని కలిపేవారని వ్యవహరిస్తున్నారు. పొగచుట్ట తాగడమును, తావళము తిప్పడమును కూడా వీరుసహించరు."

పూర్వకాలం కంటె తరవాత కాలంనాటి మహమ్మదీయమతము హిందూమతా చారాలపట్ల చాలా సహనం చూపిస్తూవచ్చిందని పైన చెప్పిన డబ్లియు. క్రూకు గారు, పశ్చిమోత్తర పరగణాలను గూర్చి 1897 లో ప్రకటించిన గ్రంధంలోనే వ్రాసినారు.

ముసల్మానులూ, హిందువులూ కలిసి వీరులను ఆరాధించే పద్దతులూ, వారి గౌరవార్థము చేసే ఉత్సవాలూ, పీరుల గోరీలదగ్గిరకి తీర్ధయాత్రలు చేసేటప్పుడు అవలంబించే పద్ధతులూ, వర్ణించాలంటే ఒక పెద్దగ్రంధం అవుతుంది.

ఆం ధ్ర ము స ల్మా ను లు

మన తెలుగు దేశంలో మహమ్మదీయుల ఇళ్ళలో చెసే జాతికర్మలు, వివాహాదిశుభకార్యాలలోను, పండుగలు పబ్బాలలోను అవలంబించే ఆచారాలు మన ఆచారాలకు చాలా సన్నిహితంగా వుండడం అందరికీ తెలుసును. పెళ్ళిళ్ళలో పెళ్ళికూతురుకు పసుపు నలుగు పెట్టడం దగ్గిర నుంచీ పెళ్ళికుమారుడిని మల్లెపువ్వుల జాలరుతొ గుర్రం మీద కత్తితో ఊరేగించడం వరకూ మన క్షత్రియకులాచారాలే ముసల్మానులలోకూడా కనబడుతున్నది. మహమ్మదీయులలో చచ్చిపోయినప్పుడు చేసే అపకర్మలు కూడా చాలావరకూ హిందువులు చేసే టటువంటివే వున్నవి. వారి "ఫాతెహాఁ" మన స్వర్గపాధేయమునకు చాలా సన్నిహితంగా వుంది. ఆఖరికి ఒకవిధమైన తద్దినాలుకూడా వాళ్ళు పెడుతున్నారు. ఇంక మంచిరోజు లనీ, వర్జమనీ, వారమనీ వాళ్ళలోకూడా చాలా పట్టింపులు వున్నవి. ఎన్నికబుర్లు చెప్పినా పక్క ఇంటి హిందువు పాటించే శకునాలను ఇరుగుపొరుగుకీ మహమ్మదీయుడు పాటించకుండా వుండలేక పోతున్నారు. ఇప్పటి గ్రామాదులలో హిందువులూ, మహమ్మదీయులూ అన్యోన్యంగా వుంటూ వరసపెట్టి పిలుచుకుంటూ భారతభూమి కడుపున పుట్టిన అన్నదమ్ముల లాగనూ, అక్కచెల్లెళ్ళ లాగనూ జీవిస్తున్నారు. ఇదంతా మనకు అనుభవైక్యవేద్యమేకదా!

8. చెన్నపట్నం గవర్నరు దుర్గతి

ఇంగ్లీషువా రీ దేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చేటప్పటికి విజయనగర సామ్రాజ్యం విచ్చిన్నం అయినా చెన్నపట్నం సముద్రతీర ప్రాంతాలన్నీ ఆ చక్రవర్తుల వంశీకులైన చంద్రగిరిరాజుల పరిపాలనలోనే వుండేది. ఆరాజుగారి కింది అధికారిని ఆశ్రయించి ఇంగ్లీషు వారు 1689 లో పట్టాపొంది చెన్నపట్టణం దగ్గిర కోట కట్టుకుని అక్కడ వర్తకం చేసుకుంటూవుండగా దేశమంతా గోలకొండ నవాబుల వశమైంది. తరువాత 1687 లో మొగలాయి చక్రవర్తియైన ఔరంగజేబు గోలకొండను జయించగా యీ ప్రాంతాలన్నీ ఆయన తాబేదారుడైన కర్నాటకనవాబు పరిపాలనకిందకి వచ్చినవి. ఇంగ్లీషు వారు ఏయెండకు ఆగొడుగు పట్టుతూ మొదట చంద్రగిరి రాజులను, తరువాత గోలకొండ నవాబులనూ అటుతరువాత కర్నాటక నవాబునూ ఆశ్రయిస్తూ కాలక్షేపం చేసేవారు.

ఆ ర్కా టు న వా బు

ఇలాగ ఉండగా దేశంలొ అంత:కలహాలు కలిగి ఇంగ్లీషువారు బలవంతులై మనరాజులను, నవాబులను బంతులాడించినట్లు ఆడించి రాజ్యాధికారాలను చేజిక్కించుకోవడానికి అవకాశాలు కలిగినవి. కర్నాటక నవాబు అన్వరుద్దీను 1749 లో చనిపోగా అతని కుమారుడైన మహమ్మదాలీ నవాబు అయినాడు. పూర్వపు నవాబుగారి అన్నకుమారుడి అల్లుడైన చందాసాహేబు ఈకర్నాటక రాజ్యసింహాసనాన్ని