ఆబ్రహాము లింకను చరిత్ర/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

చుండెను. మంటవేసి రాత్రియంతయు నాయదృష్టహీనునకు బరిచర్య లొనర్చుచు నాబియు నాతని స్నేహితుడును గడపిరి.

మఱునా డుదయమున మేల్కాంచి యా త్రాగుబోతెంత సంతసించి యుండునో మన మెఱుంగజాలము.

ఎనిమిదవ ప్రకరణము

ప్రవృద్ధి, ప్రకాశములు.

ఆబ్రహా మెప్పుడును దల్లి కెదురు సెప్పి యెఱుగడు. ఆ యమ చెప్పిన పనియంతయు జేయుచుండెను. తల్లికూడ నతని మాటయనిన మిక్కిలి యాదరించుచుండు. అతడు పరలోకప్రాప్తి జెందినతరువాత నంత గుణవంతు బుత్రు దా నెన్నడు జూడలేదని నుడువుచు నాపె పలుమాఱు విలపించుచుండును. దేశాధ్యక్షత కాత డియ్యకొనునపుడు దనమన మెట్లో భయ మందెననియు, నతని కా పదవి రాకున్న మేలగునని దా దలచుచుండుననియు జెప్పి పుత్రరత్నము గోలుపోయి బ్రతుకుటకంటె దన ధవునకు బూర్వమె దానేల భూలోకము విడువకుంటి నని దు:ఖించుచుండును.

తండ్రిమాత్ర మాబ్రహాము పై గొంచె మాగ్రహము గనుబఱచుచుండును. విద్య గడించుటకు గాలము దొఱకు నా యని వేచియుండి చిక్కిననిమిషమును విడువక యుపయోగించుకొనుచు దండ్రిపనుపు లంత శీఘ్రముగ జేయకుంట దండ్రి కంత సమ్మతముగా నుండదాయెను. అయిన నింతకంటె గొప్ప యాగ్రహకారణము మఱొం డుండెను. రాజకీయోపన్యాసములకును మతవిషయిక చర్చలకును నాబి పేరువడసెను. ఎచట నొక మొద్దు పడియుండిన దాని పై నెక్కి యుపన్యసించుట యతనికి సర్వసాధారణము. ప్రతి యాదివారమును సాయంకాలమున బురోహితులు నుడువునదెల్ల దా జక్కగ వినిచుండును. దానిని దన మనోపేటిక జేర్చి సంపూర్ణముగ జ్ఞాపక ముంచుకొని మఱునాడు పెద్ద మొద్దు నెక్కి కథనముసేయ మొద లిడును. అత డెప్పు డుపన్యసించుటకు బ్రారంబించునో యప్పడ చుట్టుప్రక్కలవా రందఱు దమ పనుల వదలుకొని విన వచ్చుచుందురు. ఏ పురోహితు డేమాటలతో నేవిధమున నేస్వనమున నాబ్రహాము నుడువు నామాటలతో నావిధమున నాస్వనమున నాబ్రహాము వినువారల వీనుల విందుసేయును. ఇట్టినడత పనుల కడ్డమువచ్చుటబట్టి థామసు కుమారుని గోపగించుచుండును. అయిన నిట్లు చేయగూడదని గట్టిగ నుత్తరువు సేయడాయెను. కొన్నిదినములమీద నాప్రాంతముల కొకయాచార్యుడు వింతవా డేతెంచెను. అత డుపన్యసించునపుడు బల్ల బద్ద లగునట్లు పిడికిటితో గొట్టు టతని కలవాటు. అతని మాటలు కేకలకు సమముగా నుండును; స్వనము పగిలి ముక్కుగుండ వచ్చిన ట్లుండును. ఈ వైపరీత్యములెల్ల జిన్నవారలకు హాస్యాస్పదము లయ్యె. ఆబ్రహా మవ్వాని నట్లె ప్రదర్శింప దొడగె. కొందఱు వయసుదీరిన వారు మతాచార్యుల నట్లవమానపఱచుట తగదని ఖండించినను వారుగూడ నాబ్రహాము ప్రతికల్పన గనినపుడు ప్రక్క లెగయ నవ్వుచుందురు. థామసునకుమాత్ర మిది మిక్కిలి దుర్భర మాయెను. తనకొమరుడు పలుమా ఱీవిధమున నితరుల బరిహసించుట కత డోర్వక పనిచెడునని తలంచి యిట్టి నడవడి మాని వేయవలసినదని యాబి కాజ్ఞ యొసగెను.

అయిన గొడుకు బుద్ధికుశలతకును, ఉపన్యాస శక్తికిని థామసు మనసున బహుసంతోషము నొందె ననుటకు సందియము లేదు. అతడు సంతసించినను సంతసింపకున్నను ఆబ్రహాము మాత్రము దన పురోభివృద్ధికి నవశ్యంబులయిన సాధనంబుల సేకరించెను. రాజకీయోద్యోగముల బ్రాముఖ్యత దెచ్చు సాధనముల గడించుట కీ యభ్యాసమునకంటె శ్రేష్ఠమైనది వేరొకటి లేదుగదా.

లింకనుల గుడిసెకు మైలున్నర దూరమున నివసించుచుండు నుడ్దను నతనివద్ద పలుమారు పనిసేయుట కాబ్రహాము నిండుమనమున బోవుచుండును. ఆ యజమానుడు రెండు వార్తాపత్రికల దెప్పించుచుండెను. అందొకటి మత్తుపదార్థముల ఖండన నిమిత్త మేర్పడినది. రెండవది రాజకీయ వ్యవహారములగుఱించినది నై యుండెను. రెండవదానికంటె నాబ్రహామునకు మొదటిదానియం దెక్కుడు గౌరవము. దాని జదివిచదివి తుట్టతుద కీ విషయమున మునిగిపోయి తా నొక పెద్ద యుపన్యాసమువ్రాసి యుడ్డుచేతి కిచ్చెను. అత డద్దాని జదివి పట్టరాని సంతోషమున నితరులకు జూపి యాబాలకు బొగడి దాని వార్తాపత్రికయందు బ్రచురింపించి యిరుగుపొరుగువా రందఱకు జదువ నంపెను. చదివినవారెల్ల నాపత్రిక యందలివిషయ మత్యుత్తమముగా వ్రాయబడినదని యెంచి, దాని వ్రాసిన యాబ్రహాముశక్తికి మెచ్చిరి. ఉడ్డుగా రతని జూచి "రాజకీయోపన్యాస మొండు వ్రాయ గల్గుదువే?" యనియె. "నే నిదివఱకు గొన్ని వాక్యములు వ్రాసి యుంచితిని. గొప్ప యుపన్యాసము వ్రాయ నైతిని. ఇప్పుడు ప్రయత్నించెద గాక," యని యాబ్రహాము ప్రత్యుత్తర మొసగి విషయ మేదియైన బాగుండు నని యడిగెను. ఉడ్డుగా రొక కొన్ని యంశంబుల సూచించిరి. ఒక్కవారము గడవకముందె యాబ్రహా ముపన్యాస మతని కందెను. ఏమి వ్రాసినదియు నతనికి సంపూర్ణముగ జ్ఞాపకము లేకున్నను దాని ముఖ్యాంశము లివియని చెప్పియున్నాడు: "బుద్ధి కుశలు లగు జనులకు నమెరికా ప్రభుత్వమే (అనగా ప్రజాప్రతినిధులచే బరిపాలన) తగును. ఇదిచక్కగ బ్రబలి యెల్లకాల ముండు గాత. దేశ మంతటను విద్యాదీపము వెలుగజేయుట గర్తవ్యము. రాజ్య నిబంధనలు గాపాడ బడవలసినది. రాజ్యైక్యము వృద్ధి చేయవలసినది చట్ట దిట్టములు చక్కగ బ్రయోగింప బడవలసినది. జనులవ్వాని గౌరవింపవలసినది."

ఉడ్డుగా రీ యుపన్యాసము జదివి మునుపటికంటె నెక్కుడు సంతృప్తి జెందిరి. ఎక్కు డాశ్చర్యాద్భుతములకును నిది యెడ మిచ్చెను. ఇప్పు డీ విషయమును బరిశీలించు మన యుపన్యాసము నూతనానందము గలుగజేయుచున్నది. ఆబ్రహాము దేశాధ్యక్షత వహించునెడ మొదటి యుపన్యాసమున నీవిషయములే నుడివి వాని నెల్ల దా నెరవేర్ప బ్రారంభించెను. అడవుల నిడుమల బడుచుండు బాలుడగు నీయుపన్యాసపు గర్త ముప్పదిమూడు సంవత్సరముల మీదట దేశాధ్యక్షత వహించి రాజ్యైక్యపు శత్రువులు రాజ్యనిబంధనల దుడిచివేసి, యైక్యము బోదోలి, చట్టదిట్టముల మట్టి గలుప జూచు చుండ దన ప్రథమోపన్యాసమున వారికి వ్యతిరిక్తముగ డా భాల్యమున వ్రాసిన విషయములె నుడువుటెంత చిత్రము ఆహా ఏమివింత

గీ. పురుషకారంబు దానెంత పొరవడినను
   దేవు డెప్పుడు దగురీతి దీర్చుచుండు.

ఈ రాజకీయోపన్యాసమునుగూడ నుడ్డుగారు పత్రిక యందు బ్రచురింపించుటకు బ్రయిత్నములు సేసిరి. ప్రిచ్చర్డను నొక న్యాయవాది యా దారిని బోవుచుండ నతని కా లిఖితవిషయము సూపిరి. అతడు దాని జదివి యుడ్డుగారిదేమో యని సందేహించి యాబిసృష్టి యని విని మనమున నలరి తమ పక్షపు బత్రికయందు ముద్రింపించుట కియ్యకొనెను. కొన్నిరోజులలో నా యుపన్యాసము పత్రికయందు జేరి యుడ్డుగారికి సంతృప్తియు, నాబికి సంతోషమును, ఇరుగు పొరుగువారల కానందమును గలిగించెను.

ఆబ్రహామున కాటలయం దభిరుచి బహుమెండు. వాక్చాతుర్యమున జనరంజకత్వము నొప్పు నత డవ్వానియందు మిక్కిలి పేరు వడసెను. అతను లేనియాటలన్నియు మంగళ సూత్రములులేని కన్యాదానములవలె నుండును. పదునెనిమిది సంవత్సరములవా డైనదాదిగ నతని కాయపుష్టి పేరొందిన దాయెను. రూపునందేగాక బలమునందుగూడ రాక్షసుని బోలియుండును. ముగ్గురుమనుష్యులు సాధారణముగ మోయ గల్గు బరువు నత డవలీలగ నెత్తివైచుచుండును. మల్లయుద్ధ మప్పటికాలమున గడుప్రియ మగు నాట. దానియందు నాబి బహు సమర్థుడు. తనతో నాడువారల నెల్లర సునాయాసముగ నోడించుచుండెను.

తొమ్మిదవ ప్రకరణము

తెప్పపై బ్రయాణము.

ఆకాలమున నమెరికాయందు బొగబండ్లుగాని, మంచి రాదారులుగాని లేవు. దట్టమగు నడవులచే నిండి చోరభయము గలిగించుచుండు ప్రదేశము లనేకము లుండెనని యిదివఱకే చెప్పబడియెను. నదులు దేశములకు మహోపకారులు. మఱి యేబాటలును లేనితరుణమున నివి రాకపోకల కుపకరణములుగ నుపయోగించుకొనబడుచు వచ్చుచున్నవి. పెద్దపెద్ద నదులపై నుండుపట్టణముల వ్యాపారము మెండుగ నుండుట పలుమాఱు తటస్థించుచున్నది. అమెరికాయందు నిట్టి పట్టణములు గొన్ని యప్పుడప్పుడ వృద్ధిజెందుచుండెను. అయిన నీటిమార్గమున వాని జేరుటకు దగిన సులభసాధనము లప్పుడు లేవు. ఇప్పటి నావికుల యదృష్ట మప్పటివారి కుండదాయెను. పడవ నిర్మించుట యనిన నాలుగు మొద్దు లొక్కటిగ గట్టుట. వీనిపై సరకుల నెక్కించుకొని ప్రవాహమున కెదురు బోవలసి యున్న దాళ్లచే మనుష్యుల నీడ్చికొని