ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/హిందూధర్మమా, బ్రాహ్మమతమా?

వికీసోర్స్ నుండి

16. హిందూధర్మమా, బ్రాహ్మమతమా ?

రామభజనసమాజము విడిచి పెట్టిన మొదటిదినములలో నాకు ప్రార్థనసమాజ మూలసిద్ధాంతములను గుఱించి యంతగఁ దెలియదు. హిందూసంఘదాస్య మొకింత తొలఁగించుకొని సంస్కరణాభిమానుల సహవాసభాగ్య మలవఱుచుకొనినచో, నేను పరిపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్ర్యముల ననుభవిం తు ననియు, నాకుఁబ్రియమగు క్రీస్తుసందేశములచొప్పున నప్పటినుండియు నడుచుకొనవచ్చు ననియు, నేను దలపోసితిని ! అంతియ కాని, ప్రార్థనసమాజాదర్శములకును క్రైస్తవమత విశ్వాసములకును, ఉత్తరదక్షిణ ధృవముల కుండెడియంతరము గల దని కలనైన నే ననుకొనలేదు ! అక్టోబరు 27 వ తేది సాయంకాలము, ప్రార్థనసమాజసభయందు వీరేశలింగముగారు "ఈశ్వరదత్తపుస్తకములను" గూర్చి యుపన్యాస మొసంగిరి. హిందూమతాభిప్రాయములనే యాయన నిరసించు నని నే నిదివఱ కెంచుచుంటిని. ఆయన నా కిష్టమగు బైబిలి, క్రైస్తవమతముల మీఁదఁగూడ నిపుడు దాడి వెడలుటకు మొదట మిగుల కంటగించితిని. కాని, అంతకంతకు నేను ప్రార్థన సమాజసిద్ధాంతముల కఱకుఁదనమున కభ్యాసపడితిని.

కొన్ని నెలలనుండి ప్రతి మాసారంభమునను, క్రీస్తు ప్రబోధించిన "ప్రభుప్రార్థన"ను నాదినచర్యపుస్తకమునఁ బూర్తిగా వ్రాయనభ్యాసపడితి నని యిదివఱకే చెప్పితిని. ఇపు డీనవంబరు మొదటి తేదీని లిఖింపఁబడిన ప్రార్థన మిటు లుండెను : - "భగవానుఁడా ! నీవు నానీతిప్రవర్తనమును గాపాడి, నాశీలపవిత్రతను సంరక్షించితివి. దేహమనశ్శక్తులందు వట్టిదుర్బలుఁడ నగునేను గతమాసమున నావర్తననైర్మల్యమును నీకృపాసాహాయ్యముననే నిలువఁబెట్టుకొనఁగల్గితిని." అక్టోబరు నెలలో నాకుఁ దటస్థించిన క్లిష్టశోధనము నా మతాభి ప్రాయములలోఁ గలిగిన కలవరమే. నాభక్తి కత్యంతావశ్యకము లని నే నదివఱకు నమ్మిన క్రైస్తవవైష్ణవసిద్ధాంత సాంప్రదాయములు అనగత్యములని నే నిపుడు విడనాడితిని. ప్రార్థనసమాజ మతసూత్రములే నా కింతటినుండి రుచికరము లయ్యెను. కావుననే నాదినచర్య పత్రములనుండి క్రైస్తవమతవాసనలు అప్పటినుండియు నదృశ్యమగుచున్నవి. ఈ నూతనసమాజాదర్శములు తగినంత దృఢముగ నుండెనో లేదో యిఁకఁ జూడవలసియున్నది.

విశాఘపట్టణవాస్తవ్యులగు మహామహోపాధ్యాయ పరవస్తు రంగాచార్యులుగారు రాజమంద్రి వచ్చి యుపన్యాసములు చేయ నున్నా రని మాపట్టణమునఁ గొంతకాలమునుండి వదంతులు గలవు. పాండిత్య వాగ్ధోరణులయందు ఆచార్యులవారు అసమానప్రతిభాన్వితులని జనూ నిశ్చితాభిప్రాయము. నవంబరు మూఁడవతేదీని విజయనగర మహారాజుగారి బాలికా పాఠశాలలో రంగాచార్యులవారు చేసిన యుపన్యాసము నేను వింటిని. హిందూదేశమునందు ప్రబలిన వివిధమతములనుగూర్చి వా రతిహృద్యముగఁ బ్రసంగించిరి. రంగాచార్యుల వారి యుపన్యాసము వినినవారలకు మతవిషయములనుగుఱించి మనస్సున గొప్పసంచలన ముద్భవించెను. మఱునాఁడే నామిత్రులగు రాజాకృష్ణారావుపంతులుగారితో కళాశాలలో మాటాడుచు, ప్రాచీన హిందూమతాదర్శము లున్నతమైన వయ్యును, గురువుల సంకుచిత భావములవలన మతమున కప్రతిష్ఠయు దేశమున కనర్థమును వాటిల్లుచున్న వని నేను నొక్కిచెప్పితిని. ఆయన నాకు పూర్తిగ సానుభూతిఁ జూపెను. హిందూమతసౌష్ఠవమును గాపాడవలె ననినచో, శంకరాచార్యులు మున్నగు పీఠాధికారుల నిరంకుశాధికారము నరికట్టి, శాస్త్రగ్రంథపరిశోధనము గావించి, అందలి యమూల్యసత్యములను ప్రజలకు బోధించుట విద్యాధికుల కర్తవ్యమని నాకుఁ దోఁచెను. ఇట్టి స్వచ్ఛందప్రచారకులలోఁ జేరుటకు నే నువ్విళు లూరితిని.

ఆనాఁడు సాయంకాలము రంగాచార్యులుగా రింకొక యుపన్యాస మొసంగిరి. ఇట్టియభిప్రాయమే ఆయనయు తన యుపన్యాసమున వ్యక్తపఱచిరి. మహారాష్ట్రపాఠశాలాధ్యక్షుఁడగు ముత్తుస్వామిశాస్త్రిగా రీసభలో, తన కిదివఱకుఁగల క్రైస్తవమతవిశ్వాసములను పరిత్యజించి, హిందూమతసీమకు పునరాగమముఁ జేయుచుంటి నని చెప్పివేసిరి ! నాసహాధ్యాయుఁ డొకఁ డంత లేచి, విద్యార్థులనీతి మతోద్ధరణమునకై పెద్దలు గట్టి కృషి సలుపవలె నని కోరెను. మఱునాఁటియుదయమున కళాశాలలో మిత్రులు నేనును మతసంస్కరణమునుగుఱించి ప్రసంగించితిమి. ఆసాయంకాలము రాజా కృష్ణారావుగారియింట మేము మరల కలసికొని యీవిషయమునుగుఱించి చర్చించితిమి. హిందూమతదౌర్బల్యమునకు ముఖ్య హేతువు, హిందూసంఘము శాఖోపశాఖలుగఁ జీలిపోవుటయే. కావున ప్రప్రథమమున చాతుర్వర్ణములలోఁగల యుపజాతులు తమతమ యంతర్భేదములను బాపుకొని యేకీభవించినచో, వేగమే దేశమున కైకమత్య మేర్పడఁగలదు. ఈసంగతిని మఱునాఁడు కళాశాలలోఁ జర్చింప మేము నిశ్చయించు కొంటిమి.

6 వ తేదీని రంగాచార్యులుగారు కర్మనుగుఱించి చేసినప్రసంగధోరణి నా కింపుగ లేదు. మఱునాఁడు మాతరగతిలోని విద్యార్థుల మందఱము కళాశాలలో సభ చేసి, చాతుర్వర్ణ్యములోని యుపశాఖల సమ్మేళన మెట్లొనఁగూడునా యని యాలోచించితిమి. మనలో నీసంఘీభావ మేర్పడెనేని, భారతీయు లందఱును సోదరబృందముగఁ బరిణమించి పరమేశ్వరుని పరమపితగఁ జేకొందు రని రాజాగారు నేనును నొక్కి చెప్పితిమి. అగ్రాసనాధిపతియగు వెంకటరావు తన యుపన్యాసమున నిట్లు నుడివెను : - "మన మొనరింపఁబూనిన యీ సంస్కరణ మత్యంతలాభప్రద మైనదియే. కాని, మున్ముందుగ మనము మతగ్రంథములను పఠియించి, తోడిమతములగు క్రైస్తవమహమ్మదీయ మతములను బరిశోధించి, సమన్వయమునఁ దేలిన సత్యసిద్ధాంతములను జనులకు బోధింప నుపదేశికులను దేశమున పల్లెపల్లెకును, పట్టణపట్టణమునకును బంపినచో, హిందూమతపునరుద్ధరణము లెస్సగ జరుగఁగలదు." ఈమతప్రచారకార్యము తాను నేనును ప్రారంభింప విధిచోదిత మని యాతఁడు చెప్పినప్పుడు, నేనానందపరవశుఁడ నైతిని !

ఇట్లు రాజమహేంద్రవరమున రంగాచార్యులవారి యుపన్యాసముల ఫలితముగ, విద్యార్థులమగు మామనస్సులు అత్యంతోద్రేకపూరితము లయ్యెను. కృష్ణారావు, వెంకటరావు నేనును మతసంస్కరణాభినివేశ మను సుడిగుండమున నిపుడు పడిపోయితిమి. మా కిపుడు రేయింబవళ్లు సంస్కరణమునుగూర్చిన యాలోచనలతోనే కాలము గడచిపోయెను. 6 వ తేదీని మేము మువ్వురమును పాఠశాలకుఁ బోవుట మానివైచి, పోలవరము జమీందారుగారిమేడలోఁ గూడి, సంస్కరణ సంగతులు చర్చింతిమి. "మేము ప్రథమమున వేదములు మొదలగు హిందూమతగ్రంథములును, ముఖ్యపరమతగ్రంథములును నాలుగైదేండ్లు చదివి, మతవిషయములందు నిపుణులమై, అంతట రాజమంద్రి నివాసుల కేకీభావము గలిగించి, యచట సత్యమతమునకు శంకుస్థాపన మొనరించెదము. ఇచటనుండి చుట్టుపట్టులనుండు ప్రదేశముల కంత దేవునిసువార్త వెదజల్లి దేశోద్ధరణముఁ గావించెదము !" అని మేము నిర్ధారణ చేసికొంటిమి. మా సహపాఠి బజులుల్లాసాహేబు, మామువ్వురికిని మనసు గలిసినమిత్రుఁ డయ్యును, అన్యమతకూటస్థుఁ డగుటచేత, తగిన సానుభూతి చూపింపనేరక, మామనస్తాప మంతయు వట్టితాత్కాలికోద్రేక మని భావించి, మమ్ము పరిహసించుచు నొకచిన్న యాంగ్లేయ ప్రహసన మాదినములలోఁ గలిపించెను. భూమినుండి చంద్రునివఱకు నొకపెద్దవంతెన కట్టవలె నని యోజించెడి మువ్వురు ఉన్మత్తులతో మమ్మతఁడు పోల్చెను. పిచ్చియాలోచనలు చేయుచుండె నని రాజా కృష్ణారావునకు సత్యకాలప్రభు వనియు, చలచిత్తుఁ డని వెంకటరావునకు గాలిచక్ర మనియు, ఆవేశపూరితుఁడ నని నాకు భావోద్రేకమనియుఁ బేరులు పెట్టి, మామువ్వురిని తనప్రహసనమునఁ బాత్రలుగఁ జేసి యతఁడు వినోదించెను !

నా కీసమయమున సంఘసంస్కరణాభిమానులగు మిత్రు లిఁకఁ గొందఱు లభించిరి. వీరిలో నొకఁడు గోటేటి కనకరాజు. ఇతఁ డా సంవత్సరము ప్రథమశాస్త్రపరీక్షకుఁ బోయెడి విద్యార్థి. రాఁబోవుసంవత్సరమునందు ఉపాధ్యాయవృత్తిలోఁ బ్రవేశించి, తనహృదయమున కానందదాయకమగు ప్రార్థనసమాజాదేశముల చొప్పున ఋజువర్తనమున జీవితము నడపుకొనుట కీతఁ డుద్దేశించెను. ఇతనికంటె నదికాశాపరుఁ డగు వాఁడు ముత్తుస్వామిశాస్త్రి. ఈయన పట్టపరీక్షనిచ్చి, మహారాష్ట్రపాఠశాలను నడుపుచుండెడి విద్యాధికుఁడు. పెక్కుగ్రంథములను జదివి కొంత లోకానుభవము సమకూర్చుకొనిన ప్రజ్ఞావంతుఁడు. కాని, తాత్కాలికభావోద్రేకమునఁ గార్యరంగమునకు దుమికెడి వేగిరపాటువాఁ డనియు, చీటికి మాటికి మతము మార్చుకొను చుండెడి చంచలచిత్తుఁ డనియు, నీతనిని జనుల పరిహసించుచుండిరి. ఇందుఁ జాల సత్యము గల దని నాకును ద్యోతక మయ్యెను. ఆ దినములలో నేను క్రైస్తవమత ప్రచారసంఘమువారి ప్రచురణమగు "మతసంస్కరణము"నుగూర్చిన పుస్తకములు అత్యంతతమకమునఁ జదివితిని. క్రైస్తవుఁ డగుగ్రంథకర్త పక్షపాతబుద్ధి పుస్తకములలోని పత్రపత్రమునను నుబుకుచున్నను, హిందూమతమును గూర్చియు, సంస్కరణసంస్థలగు నార్యబ్రాహ్మమతములను గుఱించియు నా కిపుడు కొన్నియమూల్యాంశములు బోధపడినవి. అన్నిటికంటెను బ్రాహ్మమతధర్మమువలె నాకు యోగ్యములుఁగ గానఁబడినవి. నవంబరు 29 వ తేదీని నేను కళాశాలలో వీరేశలింగముగారితో బ్రాహ్మసమాజమునుగూర్చి ప్రసంగించితిని. ఆయన నాయభిప్రాయములను దృఢపఱిచెను. కావున నే నిపుడు పరిశుద్ధాస్తికమత మవలంబనీయ మని విశ్వసించి, స్నేహితుల కది ప్రబోధింప మొదలిడితిని. కనకరాజు, జగన్నాధరావుల కిది ప్రీతికరమె గాని, కొండయ్యశాస్త్రి మున్నగు వారలకుఁ గంటకసదృశముగ నుండెను. !

కొంతకాలమునుండి రేలంగిలో శరీరస్వాస్థ్యము తప్పియుండి యిపుడు నెమ్మదిపడిన మాతండ్రిని, డిశెంబరు రెండవవారమున మా తల్లియు తమ్ములును రాజమంద్రి తీసికొనివచ్చిరి. నాప్రకృతవిపరీత చర్యలు కనిపెట్టి యాయన యుగ్రుఁ డయ్యెను. ఇటీవల నే నవలంబించిన సంస్కరణపద్ధతులకథన మాయన కపుడు వినవచ్చెను. రాజమంద్రిలో సకుటుంబముగ నివసించుచుండెడి నా మామగారు మఱి కొందఱును నా వికారపుచేష్టలను మాజనకుని కెఱిఁగించిరి. నేను క్రైస్తవునివలె జుట్టు పెంచితి ననియు, బొట్టు పెట్టక, మడి గట్టక, భుజించుచుంటి ననియు, జందెము తీసివైచి నాస్తికుల సావాసము చేయుచుంటి ననియు, నామీఁద నేరారోపణములు చేయఁబడెను ! కాని, నేను శాంతము వహింపవలె ననియు, పూర్వాచారపరాయణులగు తలిదండ్రులపోషణమున నుండెడి యీ విద్యాభ్యాసకాలమున, బొట్టు జుట్టు మొదలగు బాహ్యవిషయములను గుఱించి యనగత్యముగ నేటి కెదురీదవల దనియు, సంస్కారప్రియులగు స్నేహితులు నాకు హితోపదేశము చేసిరి. అంతటినుండి యీవిషయములందు నే నెంతో జాగ్రతతో మెలంగితిని. కాని, నాకుఁ బ్రియతరములగు మతవిషయిక గ్రంథములు మనసార పఠించి, నాయభిప్రాయముల నితరులకు బాహాటముగఁ దెలుపుటకు పరిపూర్ణావకాశ ముండుటవలన, నేను వెనుకటికంటె నధికోత్సాహమున బ్రాహ్మమతగ్రంథములు చదివితిని. ఇంతియ కాదు. మిత్రులు కనకరాజు జగన్నాధరావు నేనును బ్రాహ్మ సమాజ ముఖ్యసూత్రములు విశ్వసించితి మని ప్రతిజ్ఞ చేసికొంటిమి. మావలెనే యింకఁ గొందఱు మిత్రులును మమ్ముఁ జేరినచో, మేము రాజమంద్రిలో బ్రాహ్మసమాజము నెలకొలుప నుద్యమించితిమి !

17. సోదరీనిర్యాణము

చిన్నితమ్ములను చెల్లెండ్రను ఎత్తికొని యాడించుట చిన్ననాఁటనుండియు నా కెంతో ముచ్చట. ఏడ్చుచుండెడి నెలగ్రుడ్డులను సైతము శమింపఁజేయురహస్యము బాల్యముననే నాకుఁ బట్టువడినటు లుండెను. శిశువులను శాంతింపఁజేయ నేను బడెడి శ్రమను జూచి, మాపెద్దపెదతల్లి నన్ను "పెంపుడుతల్లీ !"యని నవ్వుల కనుచుండెడిది. పాలు ద్రావునపుడును భుజించునపుడును దక్క మిగతకాలము, చిన్ని తమ్ములు చెల్లెండ్రును సామాన్యముగ నాచెంతనే గడపెడివారు. వారి నెటుల లాలింపవలయునో బుజ్జగింపవలయునో, మాయమ్మకు వలెనే నాకును దెలిసియుండెను. బాల్యమందు వారలకు నే నిడిన