ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/సత్యసంవర్థని

వికీసోర్స్ నుండి

36. సత్యసంవర్థని

ఏ వార్తాపత్రికనైన నెలకొల్పుటకుఁ బూర్వమే సంస్థాపకునికి స్వేచ్ఛ యుండును గాని, పిమ్మట కాదు. అది యారంభ మైనప్పటినుండియు క్రమము తప్పక నడుచుచుండవలసినదే. పత్రికాధిపతి వట్టి కీలుబొమ్మవలెను, గడియారపు యంత్రమువలెను, విసుగు విరామము లేక పని చేయవలె ననియే పాఠకజనులయుద్దేశము ! సత్యసంవర్థని మాసమున కొకతూరి ప్రచుర మగు చిన్న పత్రిక యైనను, చేయవలసినపనిమాత్ర మెక్కువగ నుండెను. సాయము చేతునని మొదట వాగ్దానముచేసిన సమాజమిత్రులు, ఏదో యొకమిష పెట్టి, సాకు చెప్పి, తప్పించుకొనుచువచ్చిరి. వ్యాసరచన తమ కభ్యాసము లే దని కొందఱును, తమరచనములు ప్రచురము కాలేదని కొందఱును. వానియందు మార్పులు చేసి రని కొందఱును, మొఱవెట్టి, యీవ్యాజమునఁ దమ వాగ్దానములను తుదముట్టించుచువచ్చిరి ! వీరేశలింగముపంతులు కనకరాజుగార్లు ప్రతినెలయును పత్రికకు వ్రాయుచునేయుండిరి. పెద్దవారగు పంతులుగారికిఁ గాని, పరీక్షకుఁ జదువు కనకరాజునకుఁ గాని, పత్రికను గూర్చిన కనులకుఁ గానఁబడని యెన్నియో చిన్నపను లప్పగించుట యనుచితముగదా. కావున మిగిలిన వ్యాసములువ్రాసి, చిత్తులు దిద్ది, పత్రికను ముద్రింపించి, చందాదారులతో నుత్తరప్రత్యుత్తరములు నేనే జరుపవలసివచ్చెను. అందువలన నా కనులబాధ విస్తరిల్లెను.

పూర్వాచారపరులగు మా కళాశాలాధ్యాపకు లొకరు, పాపఁపుప్రార్థనసమాజములోఁ జేరినకారణమున నాకనులు పోవుచుండె నని పలికిరి ! సత్యసంవర్థనీ కార్యభారముననే నా నేత్రదృష్టి ధ్వంస మగు చుండె నని నుడివియుండినచో, ఆయనమాటలు సత్యవాక్యములుగ నుండెడివి. వ్రాఁతపని యెక్కువ యై నాకనులకు మాంద్యము గలుగు చుండెను. ఏతత్కారణముననే నాదేహారోగ్యమును జెడుచుండెనని రంగనాయకులునాయుఁడుగారు పలికి, కొంతకాలము నేను పరిపూర్ణవిశ్రాంతి నొందవలె నని హితవు చెప్పిరి. నే నందువలన సహపాఠులు చదువుచుండఁగ విని యెటులో కళాశాలలోని నిత్యవిధులు నిర్వహించుచువచ్చితిని గాని, పత్రికపని యట్లు జరుగదయ్యెను. చెన్నపురిలో పరిచితులైన శ్రీరఘుపతి వెంకటరత్నమునాయుఁడు గారి సాయము కోరఁగా, వారు రెండువ్యాసములు వ్రాసిరి. ఇట్లు నేను 1891 ఆగష్టుమాసములో వ్రాసిన "అసహనము"నకు వారు అక్టోబరులోను, నేను నవంబరులో వ్రాసిన "ప్రేమక్షమలు" అనుదానికి వారు డిశంబరులోను అనుబంధవ్యాసములు వ్రాసి పంపిరి. ఈయిరువురు రచయితలవ్యాసములకును చాల యంతరము గలదు. నావ్యాసములు భావమునను భాషావిషయమునను మిగులఁ గొఱవడియుండెను. నాయుఁడుగారివ్యాసము లన్ననో, విశాలభావములతోను విశిష్టభాషా నైపుణ్యముతోను విరాజిల్లుచుండెను.

వ్యాసమునకు వ్యాసమునకును, సంచికకు సంచికకును, ఇట్టి వ్యత్యాసము లుండుట సత్యసంవర్థని సంప్రదాయ మయ్యెను ! వెనుకటిప్రకరణములలో నొకదానియందు, మొదటిసంచికలోని వ్యాసభాగములు మచ్చునకుఁ జూపఁబడినవి. ప్రతిసంచికలోను ఆంగ్లమున నొకవ్యాసమును, తెలుఁగున రెండు మూఁడును నుండెడివి. అందుచేత నింగ్లీషువ్యాసములలోకంటె నాంధ్రవ్యాసములందే యిట్టితారతమ్యములు స్ఫుటముగఁ గానఁబడియెడివి. విఖ్యాతరచయితలగు వీరేశలింగముగారి వ్యాసరాజములకును, నాబోటి విద్యార్థి ప్రయాసమునఁ జెక్కినవానికిని గలభేదములు, కనులు గలవారి కెవరికి గోచరింపవు? రెండవసంచికలో పంతులుగారు "ఈశ్వరచంద్రవిద్యాసాగరు" లను గూర్చియు, నేను "పరోపకారము"నుగుఱించియు వ్రాసితిమి. మూఁడవ సంచికయందు పంతులుగారి "సౌదామినిరాయి"యు, నావిరచితమగు "సత్యము"ను గానవచ్చెను. ఇవిగాక, ఆసంపుటమున నిఁక రెండుమాఱులే తెలుఁగువ్యాసములు నేను వ్రాసితిని. అవి 5 వ సంచిక యందలి "శరత్కాలము", 7 వ సంచికలోని "మిత్రత్వము"ను. వీనియన్నిటిని బరిశీలించినచో, నే నెట్లు ఇంగ్లీషువ్యాసముల యొరవడిని గైకొని, భావముననే కాక, భాషావిషయమునఁగూడ, ఆంగ్ల సంప్రదాయముల ననుకరించుచుంటినో తెలియఁగలదు. 'మీఁగాళ్లవాఁపు మొగమే తెలుపు' ననునట్టుగ, నావ్యాసముల మొదటివాక్యములే వాని యన్యభాషాసంప్రదాయాను సరణమును వెల్లడించుచున్నవి !

ఏదో యొకయింగ్లీషుమాతృకను గైకొనియో, కల్పన చేసికొనియో, ఆంగ్ల భావములను, ఆభాషాసంప్రదాయముల ననుసరించి యాంధ్రవ్యాసము లల్లుటకంటె, తోఁచినవిషయము చేకొని, యిచ్చవచ్చినచొప్పున తెలుఁగు వ్రాసియుండినచో, నా కలము బాగుగ సాగి పోయెడిది. 3 వ సంచికలో "సత్యవాది" పేరు పెట్టిన జాబు నే వ్రాసినదియే. అది పంచమజాతిసమస్యను గుఱించినది. లేకరి గ్రామాంతరము పోయి తిరిగి వచ్చు నపుడు, ఒకబ్రాహ్మణుని యింట భోజనము చేసెను. భోజనసమయమందు, ఇంటియజమానునికొఱ కెవరో వచ్చి వీథిలో నిలుచుండి రని తెలిసెను. వాఁడు చెప్పరానివాఁ డనిగృహిణి పలికెను. అపు డా చెప్పరానివాని గుఱించి యజమానుఁడు లేకరితో ప్రస్తావించుచు, అతఁడు తమ పాలేరనియు, విశ్వసనీయుఁ డనియుఁ బలికెను. ఈసంభాషణసమయుమునందు, ఇరువురు శ్రోతలు చెప్ప రానివాఁ డనఁగఁ దెలియక తల్లడిల్లుచుండిరి. యజమానుని చిన్న కొమరితకు, ఆపదమున కర్థము తెలియకుండెను. భోజనసమయమునఁ జెప్పరానివానినిగుఱించి విప్పిచెప్పుట తప్పిద మని దానిని తండ్రి వారించెను. యజమానుని మాటలనుబట్టి యా చెప్పరానివాఁడు "చెప్పఁదగువాఁడే" యని లేకరి తలంచినను, తా నాయనతో వాదమునకు డీకొనినచో కృతఘ్నుఁడ నయ్యెద నను భయమునను, సందియము లొకటికి రెండై బాలిక రొదచేయు ననువెఱపునను, ఆతఁ డూరకుండెను ! భూత దయాదిసుగుణముల కాకరమగు నగ్రకులమువారు హీనవర్ణజులను భోజనసమయమునఁ దలపెట్టనేకాడదా ? పేరు పెట్టినను లేకున్నను, మనోనేత్రమునెదుటఁ గానిపించునది వ్యక్తియొక్క యాకారమేకదా ! జాతికంటె నీతియే ప్రధాన మైనచో, గుణవంతుఁడైన యీచెప్పరానివాఁడు చెప్పఁదగువాఁడే కదా? - ఇదియే యా లేఖాసారము.

"చిత్తము శివునిమీఁదను భక్తి చెప్పులమీఁదను" అను నట్టుగ, ఆకాలమున నా యాంధ్రవ్యాసరచనము విచిత్రద్వంద్వవిధానము నను సరించుచుండెడిది ! భావకల్పనము ఆంగ్లమునను, వాగ్విధానము ఆంధ్రమునను జరుగుచుండెడిది. కాని, యింగ్లీషులో వ్రాయునపుడు, నా కీకష్ట మెంతమాత్రమును గనిపించెడిదికాదు. ఆంగ్ల సాహిత్యము ప్రథమమునుండియు నా యభిమానవిద్యా విషయము. మొదట కొంత భీతి జనించినను, నా గురువర్యులగు స్కాట్ దొరగారు నా వ్యాసములు దిద్దుచుండుటవలన, నా కచిరకాలముననే బెదరు తీఱి, ఆంగ్లమున బాహాటముగఁ గలము సాగుచువచ్చెను. పూర్వోదాహృతములగు నాంగ్ల వ్యాసములు గాక నేను ప్రథమసంపుటమున, "మత మననేమి" "విశ్వాసహీనత" "పవిత్రప్రేమము" "బహుత్వముననేకత్వము" "భక్తిమాధుర్యము" అను మకుటములుగల వ్యాసములు వ్రాసితిని. వీనిలోఁ గల భావసౌమ్యతా రచనాసౌష్ఠవములలో వీసమంత యైన నాయాంధ్రవ్యాసములందుఁ గనుపడకుండెడిది !

అంతకంతకు నాకలమునకు సంపూర్ణ స్వేచ్ఛానువర్తనము వాంఛనీయ మయ్యెను. స్కాటుదొర సజ్జనులలో సజ్జనుఁడు. కాని, ఆయనకు విరోధములగు విషయములను గుఱించిన నా యింగ్లీషురచన లాయన సవరించునా ? నైల్సు అను నొకక్రైస్తవుఁడు మాపత్రిక కొకయాంగ్లేయలేఖ వ్రాసెను. అది పత్రికలోఁ బ్రకటింపవలదా ? ప్రకటించినచో, క్రైస్తవాభిప్రాయములు సమర్థించెడి యాజాబునకుఁ దగుప్రత్యుత్తర మీయవలదా ? అంత నే నాలేఖను బ్రచురించి, దానికి సమాధానముగ నొక పెద్దయాంగ్ల వ్యాసము వ్రాసి, యది నేనే దిద్దుకొని, ఆసంచికయందే ప్రకటించితిని. సంకుచితాదర్శ యుతమగు క్రైస్తవమత మెన్నఁటికిని ఏకేశ్వరారాధన ప్రబోధకమగు బ్రాహ్మధర్మము కానేర దనియు, క్రైస్తవమతము సిద్ధాంతమున విగ్రహారాధనమును నిరసించుచున్నను ఆచరణమున నాదరించుచున్నదనియును, నిరాకారుఁడగు పరమాత్ముని ధ్యానించుటకు హిందువునకు పాంచ భౌతిక విగ్రహము కావలసినట్టే క్రైస్తవునికి క్రీస్తుజీవితము ఉపాధిగ నుపకరించుచున్నది. గావున రెండు మతములవారును విగ్రహారాధకు లనియును, బ్రాహ్మమతస్థు లిట్టి బాహ్యసాధనముల నపేక్షింపక, పరమాత్ముని మనసున ప్రత్యక్షముగ ధ్యానింపనేర్తు రనియును, నేను సమాధానము చెప్పితిని. నావాదన, నావాక్కులు, నావైఖరియును, ప్రార్థనసామాజికులకు హృదయరంజక ముగ నుండెను.

37. చెన్నపురిస్నేహితులు

నేను కొన్ని నెలలు పూర్తిగఁ జదువు విరమించినను, నాకనులు నెమ్మదిపడలేదు. మరల నేను చెన్నపురి పోయి కన్నులు పరీక్షింపించు