ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/సంఘసంస్కరణసమాజము

వికీసోర్స్ నుండి

మాత్రమే, హిందూసంఘవృక్షమునకు వేరుపురుగులగు దురాచారముల సంగతి వారికి మనము సూచింపవలె ననియు శాస్త్రి నాకు బోధించెను. వేగిరపాటు నైజగుణముగఁగల నాకీ సామపద్ధతి సంకెలవలెఁ దోఁచెను ! సంఘసంస్కర్త సమష్టికుటుంబజీవితమును త్యజించినఁగాని, అతనికి సతికిని బొత్తు గలియ దనియు, భార్యాభర్తలకు బాహాటముగా సంభాషణములు జరుగుట కవకాశ మేర్పడినఁగాని సంస్కరణవిషయము లందు పత్ని కామోదము గలుగ దనియు, నానిశ్చితాభిప్రాయము. ఐనను, మిత్రులయాలోచనలలోఁగల యమూల్యసత్యముములనుమాత్రము నేను గ్రహించుచుండువాఁడను.

19. సంఘసంస్కరణసమాజము

1900 మార్చిమాసారంభమునుండి సంఘసంస్కరణ విషయమున నా యుత్సాహము కడు తీవ్రముగ నుండెను. సహపాఠియగు చెన్నాప్రగడ నరసింహము నేనును ఆనెల మొదటితేదీని మాటాడుకొనుచు, సంస్కరణోద్యమవిధుల ననుసరించి నడువఁగోరితిమేని హిందూసంఘ దురాచారముల కెల్ల మూలకందమగు సమష్టికుటుంబ జీవితమున కొడంబడక, భార్య కాపురమునకు వచ్చినది మొదలు వేరుగ నుండుట ప్రథమకర్తవ్య మని మేము నిర్ధారించుకొంటిమి. ఆమఱునాఁడు వెంకటరావు, ఇంకొకస్నేహితుఁడు నేనును సంస్కరణవిషయమై ప్రసంగించితిమి ఉద్రిక్తచేతస్కుఁడనగు నాకుఁ గల కార్యతీవ్రత తనకు లేమింజేసి, జీవితమున నా నాయకత్వ మనుసరించి, నిరతము నా యడుగుజాడల నడచుచు, నా యుద్వేగమును తగ్గింపవలసినపు డెల్ల నన్ను దా వెనుకకు లాగుచుందు నని వెంకటరావు చెప్పినప్పుడు, అహంభావమున నేను మిన్ను ముట్టితిని. ఆ యేడవతేది రాత్రి కనకరాజు వెంకటరావు నేనును గలసికొని, సంస్కరణోద్యమమును కార్యాచరణమునకుఁ గొనివచ్చుటనుగూర్చి ముచ్చటించితిమి. మా మువ్వురిలోను గృహస్థాశ్రమానుభవము గలవాఁడు కనకరా జొక్కఁడే. విద్యాగంథ మెఱుఁగని భార్యయు, పూర్వాచారపరాయణ యగు పినతల్లి యు, తన సంస్కరణనిరతికి విముఖలై తనకు గుదిబండలుగ నున్నా రని యాతనిమొఱ ! జనాభిప్రాయభీతిచే నామిత్రునిమనస్సు మిగుల తల్ల డిల్లుచుండెను.

ఆతని యూహలలోఁగల సత్యము మాకును నచ్చెను. బ్రాహ్మమతస్వీకారఫలితముగ హిందూసంఘమును పూర్తిగా త్యజించుటకుఁ బూర్వము, స్నేహితుల మందఱము నొకకూటముగ నేర్పడి, యేతన్మత గ్రంథములను జదివి, చిత్తబలిమిని సంపాదించుచుండుట కర్తవ్య మని మాకుఁ దోఁచెను. ఇంతలో మా స్నేహబృందమునఁ గొన్నిమార్పులు గలిగెను. వెంకటరావు చదువు మానుకొని, ఆరోగ్యాన్వేషణమునకై స్వగ్రామమునకు వెడలిపోయెను. 12 వ తేదీని కనకరాజు నాతో మాటాడుచు, మాకళాశాలలో పట్టపరీక్ష మొదటితరగతిలోఁ జదువు నొక యోఢ్రయువకుఁడు తనతీవ్రసంస్కారాపేక్షచే సంఘబహిష్కృతుఁ డయ్యె ననువార్త చెప్పెను. మా కిపుడు కావలసినదే యిట్టివారల సావాసము ! నాఁటిసాయంకాలమే గంగరాజు కనకరాజు నేనును, రాజగురు వనుపేరుగల యావిద్యార్థిని గలసికొని, మతసాంఘికవిషయములను గుఱించి మాటాడుకొంటిమి. నాఁడే వీరేశలింగముగారి యింటికిఁ బోయి, సంస్కరణోద్యమమును గుఱించి వారితో రాత్రి యెనిమిదిగంటలవఱకును చర్చ సలిపితిమి. విద్యాపరిపూర్తియై స్వతంత్రుల మైనపిమ్మట, మేము జాతిభేదములను త్యజించి యభీష్టమార్గ మవలంబింపవచ్చు ననియు, ఈమధ్యగ మే మందఱము నొకసంఘముగ నేర్పడి, సంస్కరణమునుగూర్చి జనులలో సంచలనముఁ గావింపవలె ననియును మేము నిర్ణ యించుకొంటిమి.

నా సంస్కారప్రియులగు మిత్రులలో మఱికొందఱినిగుఱించి యిచటఁ జెప్పవలయును. తాడినాడ గంగరాజు కళాశాలలో ప్రథమ వత్సరముననే నా సహపాఠి, నరసాపురనివాసి యగుటచే నితఁడు కనకరాజున కిదివఱకే స్నేహితుఁడు. ప్రప్రథమమున నీతఁడు మతవిశ్వాసము లేనివాఁ డైనను, సంఘసంస్కరణ మనిన నావలెనే చెవిగోసికొనువాఁడు. హిందూదేశమందలి ప్రస్తుత పరిస్థితులనుబట్టి, ఆస్తికులు గానివారు సంస్కరణోద్యమమును జనరంజకముగఁ జేయఁజాల రని మిత్రులము బోధించుటచేత, క్రమముగ నీతనికి బ్రాహ్మమత విశ్వాస మంకురించెను. పర్లాకిమిడి వాస్తవ్యుఁడగు రాజగురువు, బ్రాహ్మమతవిశ్వాసి యైనను గాకున్నను, దానియం దధికాభిమానము గలవాఁడు. సంఘసంస్కరణము నందు మా కెవరికిని దీసిపోని పట్టుదల గలిగి, వాక్కర్మలం దేమాత్రమును వేగిరపాటు లేక మెలఁగ నేర్చినవాఁడు. మంచి యొడ్డుపొడుగు కలిగి, వట్టి విద్యార్థివలెఁ గాక యేయుద్యోగివలెనో యితఁడు గానఁబడుటచేత, నిదానమున నీతఁడు చెప్పుమాటలు శాంతమూర్తి యగు ననుభవశాలినోటినుండి వెడలు హితవాక్కులవలె వినవచ్చుచుండెను. మితవాది యగు నిట్టివాఁడు మధ్యవర్తిగ నుండుట మంచి దని తలంచి, మాసభలకు దఱచుగ నీతని నగ్రాసనాధిపతిగ నెన్ను కొనుచుందుము.

సత్తిరాజు మృత్యుంజయరావు పట్టపరీక్షయం దొక శాఖలో గెలుపొంది, సంఘసంస్కరణముపట్ల నమితాభిమానము గలిగియుండువాఁడు. ఇతనిసోదరు లిరువురు నాకు సహపాఠు లైనను, వారలతో కంటె నీతనితోనే నాకు చన వెక్కువ. పఠితలకు ముత్తుస్వామిశాస్త్రి పరిచయ మిదివఱకే కలిగినది. ఇతఁడు మాయందఱివలెనే మతవిషయములందు పెక్కు మార్పులు చెందినను, వానిని వెనువెంటనే లోకమునకుఁ బ్రచురింప వేగిరపడు చుండుటవలన,నిలుకడ లేనివాఁడని పేరుపడెను. ఐనను, అప్పటి కప్పుడే యుద్యోగి గృహస్థుఁడు నైన సంస్కారప్రియుఁ డగుటంజేసి, ఈతఁడు వయోవిద్యాదులందు వెనుకఁబడియుండు మాయందఱకు నాదర్శప్రాయుఁడగు నాయకుఁడు గాకున్నను, అనుభవజ్ఞుఁడును ఆలోచనాపరుఁడునునగు సహాయకుఁ డయ్యెను. వట్టి విద్యార్థుల మగు మాకు సంస్కరణమహావిషయములందు దోఁపని యాలోచనలు చెప్పుచు, మాభావములకు దోహదములు గలిపించుటయం దాతఁడు చక్కని నైపుణ్యమును జూపుచుండువాఁడు.

ఇట్టి సంఘసంస్కారప్రియు లందఱికి నేకీభావము నొడఁగూర్చి, వారలను కార్యరంగమునకు దింపఁగల సాధనమునకై మే మిన్నాళ్లును యోజించితిమి. తుట్టతుదకు, సంఘసంస్కరణ సమాజ స్థాపనార్థమై 15 వ మార్చి తేదీని మేము సభ చేసితిమి. నూతన సమాజోద్దేశములనుగుఱించి ప్రసంగించుచు నేను, "తమ హృదయము లందు మతాభినివేశమును, ప్రజాక్షేమాభిలాషయుఁ గలిగి, స్వార్థ త్యాగమున కాయత్తు లగువారలే యీ సమాజసభ్యత్వమున కర్హు"లని యుద్రేకమునఁ బలికినపుడు, మొదటనే యిట్టి తీవ్రనియమాచరణమున కెవరును సమకట్ట రని కొందఱు చెప్పివేసిరి. ఎట్టకేలకు సంఘసంస్కరణసమాజము స్థాపిత మయ్యెను.

ఆనెల 21 వ తేది సంవత్సరాదిపండుగనాఁడు. ఏతత్సమాజ విధుల నేర్పఱుచుటకు బాలికాపాఠశాలలో సభ కూడెను. ముత్తుస్వామిశాస్త్రి అగ్రాసనాధిపుఁడు. "సంఘసంస్కరణసమాజ మను పెద్ద పేరు పెట్టుకొనుటవలన ముందుగనే మనము జనుల యసూయాగ్రహముల కనవసరముగ గుఱి కావలసివచ్చును. మన సమాజసభ్యులలోఁ బలువురు విద్యార్థులే. కావున నట్టివారు మున్ముందుగనే తమ తలిదండ్రులద్వేషమున కాహుతియై తమ చదువునకు స్వస్తి చెప్పవలసి వచ్చును. కావున మనము సాధువులగు నామవేషములు దాల్చి శాంతముగఁ బనులు చక్కపెట్టుకొనుట శ్రేయము." అని యాయన యోజన చెప్పెను. రాజగురువున కీ 'రాజీ' సూత్రము రుచింపక, "అయ్యా, మన కీవిషయములందు సరళ ప్రవర్తనమే శ్రేయోదాయకము. గూఢవర్తనము ముమ్మాటికిని బనికిరాదు !" అని యతఁడు చెప్పివేసెను. నే నంత లేచి, "ఈసమస్యకుఁగల రెండు దృక్పథములును మన కిపుడు గోచరించినవి. అతివాదులకు సంఘసంస్కరణసమాజమనుపేరు నిలుపుకొనవలె ననియు, మితవాదుల కందు మార్పు చేసి కొనవలె ననియు సంకల్పము. మన మిది పర్యాలోచింపవలెను. పేరు నందు మార్పు అగత్యమా ? ఉన్న పేరు తీసివేసి యింకొకటి గైకొని నంత మాత్రమున, విధాన మేమియు మారదుగదా ? కావున బొత్తిగ నంధప్రాయులు కానిచో, ఏదేని యొక సంస్థను జనులు దానిపేరునుబట్టి గాక, దాని గుణకర్మలనుబట్టియే విమర్శింతురు. కావున ప్రస్తుతనామము ప్రజల యాగ్రహమును బురికొల్పు ననుమాట వట్టిది. * * *" అని ప్రసంగించితిని.

అపుడు స్థాపితమైన మాసంఘసంస్కరణసమాజము వారము వారమును బాలికాపాఠశాలలోఁ గూడెడిది. ఆభవనమునందే ప్రార్థనసమాజసభయును ప్రతివారము జరుగుచుండెడిది. రెండు సమాజముల సభ్యులు సామాన్యముగ నొక్కరే యగుటచేత, ఒకరిచర్యల కొకరు బాధ్యత వహింపవలసివచ్చెడిది. ఇపు డీ ప్రార్థనసమాజకార్యక్రమ మున జరిగిన యొక యుదంతమునుగూర్చి చెప్పవలెను. ఆదినములలోనే ప్రార్థనసమాజవార్షికోత్సవము జరిగెను. ఉత్సవఁపుఁ గడపటినాఁడు, సభికులు పట్టణమున కనతి దూరమందలి సారంగధరపర్వతమునకుఁ బోయి, ఆ నిశ్శబ్దస్థలమున, ప్రార్థనానంతరమున, తమసమాజ సౌభ్రాతృత్వమునకు సూచకముగఁ గలసి ఫలాహారములు చేయుట యాచారమయ్యెను. ఇది గర్హ్యమని హిందూసంఘమువా రెంచి, యిట్టి సంఘసభ్యులను బహిష్కృతులను గావించుటకు గుసగుసలు సలుపుచువచ్చిరి. ఆనెల 22 వ తేదీని ప్రార్థనసామాజికులము సారంగధరుని మెట్టకుఁ బోయితిమి. ఫలాహారము చేసినవారికి సంఘబహిష్కార మగు నని మాకుఁ దెలిసెను. ఇట్టిబెదరింపులకు భయపడవల దనియును, కష్టనష్టము లాపాదించినచో సహనబుద్ధితో మెలంగుట సంస్కరణ పరాయణులకర్తవ్య మనియును నేను జెప్పితిని. కనకరాజున కీ మాటలు కోపము కలింగించెను. తనపొడ కిట్టనిచో, మాకు ప్రతిబంధకము గాక, తాను వెడలిపోయెద నని యాతఁడు చెప్పివేసెను ! ఎట్ట కేల కాతనిని శాంతింపఁజేసి కొండమీఁదికిఁ గొనిపోయితిమి. ప్రార్థన ఫలాహారము లైనపిమ్మట, పర్వతము దిగి, ముత్తుస్వామి శాస్త్రి బ్యాండుస్వరము పాడుచుండఁగ, మే మందఱము, సైనికనికాయము వలె పదతాడనము చేసి నడుచుచు, బాలికాపాఠశాలయొద్ద విడిపోయి, యెవరియిండ్లకు వారు వెడలిపోయితిమి.

20. జననీజనకులతోడి సంఘర్షణము

నేను సంఘసంస్కరణమును గుఱించి తీవ్రాభిప్రాయములు గలిగి, నిర్భయముగ వానిని వెల్లడి చేయుచుండుటచేత, నా కెల్లెడలను విరోధు లేర్పడిరి. ఇంటను, బయటను సంస్కరణమును గుఱించి నిరతము ప్రసంగించుటయె నా కపుడు ముక్తిమోక్షము లయ్యెను !