ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/వైరివర్గము

వికీసోర్స్ నుండి

ఇపుడు నా దేహమునిండ చెమ్మటలు పట్టెను. నిదానముగల యావైద్యుఁడు నాచేయి చూచి, నాడిలో దోషము లేకుండుట గ్రహించెను. జ్వరము విడుచుటచేత ముచ్చెమటలు పట్టి నాకు నిస్సత్తువ గలిగె నని నిశ్చయించి, నా కాయన, పేలాలజావ పోయించెను. నేను తెప్పిఱిల్లితిని. ఆవైద్యునియౌషధమువలన నొకవారమునకు నాకు నింపాందించెను.

41. వైరివర్గము

మహమ్మదీయ సంపాదకునిచే నడుపఁబడుచుండెడి "సత్యాన్వేషిణీ" పత్రిక, హిందూసంఘ దురాచార నిరసనము నెఱపుచుండెడి మా "సత్యసంవర్థని" యెడ సానుభూతి చూపు నని లోకు లనుకొనవచ్చును కాని, అట్లు జరుగలేదు. జనన మొందినది మొదలు, "సత్యాన్వేషిణి" ప్రార్థన సామాజికులను, "సత్యసంవర్థని"ని దూషించుటతోనే కాలము గడపెను. ఈదూషణ మైనను, సిద్ధాంతములలోను విధానములందును గల యభిప్రాయభేదము లాధారముగఁ జేసికొనిన ధారాళవిమర్శన మైనచోఁ గొంత సారస్యముగ నుండెడిది. అట్లు గాక, "సత్యాన్వేషిణి" వ్యక్తిగత దూషణములు చేయఁ జొచ్చెను. ప్రార్థన సామాజికులకు లేనిపోని యవగుణము లారోపించి, వారి యాదర్శములను వెక్కిఱింపఁ జొచ్చెను. మా సమాజమువా రెంత యోపికతో నూరకుండినను, సత్యాన్వేషిణి నోరు కట్టువడలేదు. అంతట వీరేశలింగముపంతులు, మహమ్మదీయసంపాదకునిచేతను, బ్రాహ్మణకార్యనిర్వాహకునిచేతను బ్రకటింపఁబడెడి యాపత్రికకుఁ దగుసమాధాన మీయఁదొడంగెను. సెప్టంబరు "సత్యసంవర్థని" లో "సాభిప్రాయవిషయ వ్యాసము" వ్రాసినది వీరె. దీనిలో "సత్యాన్వేషిణి" వ్రాఁతలలోని వంకరలను, వేశ్యాజనాభిమానము, పూర్వాచార పరాయణత్వము, స్మార్తకర్మలు, స్త్రీ గౌరవము, సత్యము, అను శీర్షికలతో పంతులుగారు ఖండించివైచిరి. ఇంతటితోఁ దనివి చెందక, పంతులు హిందూ మతోన్మాదములను, దురాచారములను సమర్థింపఁజూచెడి పండితాభాసులవాదనలను చర్యలను గర్హించుచు, ఆగస్టు నెలనుండియే ప్రహసనములు వ్రాయఁజొచ్చెను. ఆనెలలోఁ బ్రచురింపఁబడిన "హిందూమతసభ" వీరి ప్రహసనములలో నెల్ల కఱకుఁదనమునకుఁ బ్రసిద్ధి కెక్కియున్న వానిలో నొకటి. అది చదివి వినోదించుటకై యనేకు లాపత్రిక సంచికలను గొనిరి. ఇట్టి ప్రహసనము లుండుటవలన "సత్యసంవర్థని" జనరంజక మగు చుండుట విని, పంతులుగారు అప్పటినుండియు కొంతకాలము పత్రిక కొక్కొక చిన్నప్రహసనము వ్రాయఁజొచ్చిరి. ఇట్లీ సమయమున మాపత్రికలో పంతులుగారు వ్రాసిన ప్రహసనములలో "యోగాభ్యాసము," "కలిపురుషశనైశ్చర విలాసము"ను ముఖ్యములు.

ఆ నవంబరునెల తుదివారములో, రాజమంద్రికి కోటయ్య సెట్టిగా రను దివ్యజ్ఞానసమాజోద్యోగి యొకరు వచ్చి, అక్కడ కొన్ని యుపన్యాసము లిచ్చి, విద్యార్థులతో సంభాషణములు జరిపిరి. మిత్రులతోఁ గూడి నే నాసభకుఁ బోయి, సెట్టిగారి యభిప్రాయములను గ్రహించి, వానిని గుఱించి విపులమగు విమర్శనము ఆంగ్లమున వ్రాసి మాపత్రిక నవంబరు డిసెంబరు సంచికలలోఁ బ్రచురించితిని. ప్రకృతమున "దివ్యజ్ఞాన సమాజము" వారు సంఘసంస్కారమునకు సుముఖులుగ నున్నను, ఆకాలమున వారు హిందూమతమును, హిందూసాంఘికాచారములను ఆమూలాగ్రముగ సమర్థించుటయె తమ ధర్మమని విశ్వసించెడివారు ! కావున సంఘ సంస్కారములకును, దివ్యజ్ఞాన సామా జికులకును పూర్వకాలమున పోరు ఘోరముగఁ జెలరేగుచుండెడిది. సెట్టిగారి యభిప్రాయములందుఁ గానిపించిన లోపములను నేను గర్హించి, ఖండించి, ఆ సమాజ సిద్ధాంతములమీఁద నాకుఁగల కసి తీర్చుకొంటిని.

ఆకాలమునందు ప్రహసనరూపమున, వాదప్రతివాదములు జరుపుట యాచారమయ్యెను. ప్రహసనమెంత వ్యక్తిగత మైనను సరే, అది తగినంత కఱకుగను, చమత్కారముగను నుండినచో, పాఠకుల కుల్లాసము గలుగుచుండెడిది !

1 వ అక్టోబరున మా కందిన "ఆంధ్రప్రకాశిక" సంచికలో నొక ప్రహసన ముండెను. అందు వీరేశలింగముగారిని, కనకరాజు సాంబశివగార్లను, మాఱు పేరులు పెట్టి, మాప్రతికక్షులు వెక్కిఱించి వినోదించిరి.

ప్రతికక్షులగు భిన్నకూటస్థు లొకరి నొక రిట్లు నిరసించుకొనుట స్వాభావికమే. కాని, మా సమాజసభ్యులు రానురాను తగినంత పరస్పర ప్రేమానురాగములు లేక, ఒకరియం దొకరు ఈర్ష్యా ద్వేషములు వహించి భిన్నభిన్న కక్షలక్రింద నేర్పడిరి. సత్యసంవర్థనీ పత్రిక నాధారము చేసికొని, నేను ప్రార్థన సమాజ వ్యవహారము లన్నిటిలో నిరంకుశ ప్రభుత్వమును నెఱపుచున్నా నని మామిత్రుల యపోహము ! నాస్నేహితుఁడు కనకరాజు రెండుమూఁడు సారులు నాయందు మిత్రుల కేర్పడిన యీ ద్వేషభావమును గూర్చి నాయొద్ద ప్రస్తావించెను. కాని, యాతఁడు వేగిరపాటుచేత మిత్రులమీఁద ననగత్యమగు ననుమానములు పడుచుండెనని నేను దలంచుచుండెడి వాఁడను. సమాజాభివృద్ధికై యెంతయో కృషి సల్పుచు, సమాజ పత్రిక విషయమై నా చదువు నాకాలము నాయారోగ్యమును ధారవోయు నన్ను గుఱించియె మిత్రులు సందియము లందుచుండుటకు విస్మయ మందితిని. సత్యసంవర్థనికి మాఱుగా వచ్చెడి పత్రికలు సభ్యుల కందఱికిని బంపుచు వచ్చినచో వారి మనస్సులు కొంత శాంతించు నని కనకరాజు ఆలోచన చెప్పుటచేత, అట్లు పంపుచువచ్చితిమి. కాని, పత్రిక పనులు చేయుటకు నెలకు రెండుమూఁడు రూపాయిల జీతముమీఁద నేర్పడిన యొకపిల్లవాఁ డొకఁడె యీపనిని నిర్వహింపవలసివచ్చుటచేత, క్రమముగ పత్రిక లందఱికిని నందకుండెడివి. సమాజము యొక్క నౌకరుచేత నే నింటి చాకిరి చేయించు కొనుచు, వాని నితర సభ్యుల పరిచర్యలకు వదలకుంటి నని సభ్యుల మొఱ ! దీనిలోఁ గొంత సత్యము లేకపోలేదు. ఏయుద్యోగ సంబంధ మైన జవానుగాని పరిచారకుఁడు గాని యా యుద్యోగి యింటఁ గనఁబడుటయె తడవుగా, ఆడంగుల నియామకమున నాతఁడు ఇంటి నౌకరుగఁ బరిణమించుచున్నాఁడు ! ఇట్టిపనులు వానికి నియమించుట కూడని పనియె యైనను, ఏయుద్యోగి తనభార్యమీఁదను బిడ్డలమీఁదను అహర్నిశమును ఈచిన్న సంగతిని గూర్చి యుద్ధము సలుపఁగలఁడు? ఇది కారణముగ, ఆకాలమున నేను స్నేహితుల సుముఖత్వమును గోలుపోయితిని. సహనబుద్ధియు కార్యవాదిత్వమును బూని, పరిస్థితుల కెటులో సరిపెట్టుకొని, స్నేహసఖ్యములె యన్నిటికంటె ప్రధాన మని గ్రహించి, సమభావమున మెలంగుటకు, మే మెవరము గాని వయసు మీఱిన యనుభవ శాలులము గాము. స్వల్పవిషయము లందె గొప్ప పట్టుదలలు గల బాల్యావస్థయందె మే మెల్లరము నుండుటచేత, మా సమాజసభ్యులలో నిట్టి ద్వేషభావములు క్రమముగఁ బెరుఁగజొచ్చెను. మేము పరీక్ష నిమిత్తమై చెన్నపురి బయలుదేఱవలసిన దినములు వచ్చెను. ఆ సమయమునందు, నామీఁద గల వైరభావము స్నేహితులు వెలిపుచ్చ నారంభించిరి. వీరలలో నగ్రేసరుఁడు నా మిత్రుఁడు మృత్యుంజయరావె యగుటకు నే నెంతయు వగచితిని. ఇట్టి స్వభావము గలవారితోఁ జెలిమి చేసి, యేల నే నీసమాజమునఁ బని చేసితినని విచారించితిని. నేను చెన్నపురికిఁ బోవునపుడు సెలవు గైకొనుటకు వీరేశలింగముగారియొద్ద కేగఁగా, ఆయన మా యంత: కలహముల సంగతి విని, స్నేహితు లందఱిని సమావేశపఱచి, మాలో మరల మిత్రభావము నెలకొల్పఁ బ్రయత్నించిరి. వారిమాటలు శిరసావహించి మే మందఱమును వారి హితవచనముల చొప్పున మెలఁగ వాగ్దానము చేసితిమి. ఇపు డందఱము కూడి ప్రయాణము చేయ సమ్మతించుటయె యీ స్నేహ పునరుద్ధరణమునకు సూచన.

42. సౌఖ్య దినములు

రోగములు, మనస్పర్థలు, మున్నగు శోధనల కెంత లోనైనను, 1892 వ సంవత్సరమున తుదియాఱు నెలలును నాకు నా స్నేహితులకును విద్యార్థిదశలో నెల్ల సుఖతమదినము లని చెప్పవచ్చును. మిత్రుల మందఱమును గలసియుండెడి యా యిల్లపుడు రాజభవనము వలె నాకును నా స్నేహితులకును గానఁబడియెడిది ! ముఖ్యముగ సంఘసంస్కరణాభి మానుల కది యాటపట్టయ్యెను. అచటినుండి వీచుగాలియె సంస్కరణాభిమానబీజములను నలుదెసలకును వెదచల్లు నటు లుండెను. సంస్కరణమును గూర్చి చర్చలు, ప్రసంగములు, సంభాషణములును, ఎల్ల సమయములందును, అచట వినవచ్చు చుండెను. సంస్కరణమును గూర్చిన పత్రిక లచటఁ జదువరులకు లభ్య మగు