ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/రేలంగి

వికీసోర్స్ నుండి

మా తాతగారు వేలివెన్నులో నివాస మేర్పఱచుకొని, క్రోశ దూరమందలి సత్యవాఁడ కనుదినమును కరిణీకఁపుఁ బనులమీఁదఁ బోవుచుండెడివారు. ఆయనకు చాప లల్లుట, విసనకఱ్ఱలు కట్టుట మొదలగు చిన్న పనులయం దాసక్తి. ఈ పనులు నెరవేర్చుచు, ఆయన నాకును మా పిన్నికిని పద్యపాఠములు చెప్పుచుండువాఁడు. పసివాఁ డగు మా తమ్ముఁడు వెంకటరామయ్యకును ఆయన దాశరధీశతకములోని పద్యములు నేర్పెను. ఇట్టి ప్రియబాంధవుని వియోగము మాకు కడు దుస్సహముగ నుండెను.

4. రేలంగి

నా యెనిమిదవయేట అనఁగా 1878 వ సంవత్సరమున, మా తండ్రి యుద్యోగము చాలించుకొని స్వస్థలమగు రేలంగి చేరెను. రేలంగి రెండేండ్లక్రితమువఱకును మేము నివసించిన గ్రామమైనను, ఇపు డది నాకన్నులకుఁ గ్రొత్తగ గానిపించెను. అచట మాపెద్ద పెత్తండ్రి గంగన్న గారిపుత్రికలు, పుత్రుఁడు వీరభద్రుఁడును నా కిపుడు సావాసు లైరి. వీరిలో పెద్దది యగు రత్నమ్మ నాకంటె పదియేండ్లు పెద్దదియై, తాను నేర్చిన "లంకాయాగము" రాత్రిపూట శ్రావ్యముగఁ బాడి, నా కానందము గలిపించుచుండును. నా కీరీతిని రామాయణ కథ విపులముగఁ దెలిసి, నా మనోవీథిని గొప్పయాశయములు పొడమెను. రెండవది యగు చిట్టెమ్మ నాకంటె కొంచెము పెద్దది యై, గ్రామమందలి మాయీడు బాలబాలికలతోడి యాటపాటలకు నన్నుఁ గొనిపోవుచు వచ్చెడిది. వీరభద్రుఁడు నా పెద్దతమ్మునికంటె కొంచెము పెద్దవాఁడై, వాని కీడుజోడై యుండెను. రాత్రి భోజనానంతరమున నొక్కకప్పుడు, మా పెదతండ్రిగారి కుటుంబమును మేమును నొకచోటఁ జేరి, తంపట పెట్టినతేగలో, ఆనపకాయలో తినుచు, ఉబుసుపోకకు లోకాభిరామాయణము చెప్పుకొనుచుందుము. మా పెత్తండ్రి మిగుల పొట్టిగను చూచుటకుఁ గొంత భయంకరముగను నుండినను, కుటుంబసంభాషణములం దమితచతురతను బ్రదర్శించుచుండువాఁడు. ఆయన హాస్యోక్తులు పిల్లలకు పెద్దలకును మిక్కిలి నవ్వు పుట్టించెడివి. మా కుటుంబపూర్వచరిత్ర మాయన కన్నులార చూచినట్టుగ వర్ణించి చెప్పుచుండువాఁడు. మా తండ్రి, తాను ఉద్యోగకార్యములలోఁ దిరిగిన వివిధాంధ్రమండలముల యాచారసమాచారములును, అచటి తన యనుభవములును వివరింపుచుండువాఁడు. పిల్లల మగు మాకుఁ దోఁచిన వ్యాఖ్యలు మేమును జేయుచుండెడివారము. సత్యకాలపు ముతైదువయగు మాపెత్తల్లి యచ్చమ్మ, ఏ వెఱ్ఱిమొఱ్ఱి ప్రశ్న వేసియో, చేతకాని పని చేయఁజూచియో, అందఱి పరియాచకములకుఁ బాత్ర యగుచుండును.

ఒకటి రెండు సంవత్సరములలో మా రెండవపెత్తండ్రి, మూడవపెత్తండ్రియు రేలంగి చేరిరి. వీరిలో మొదటివారగు వెంకటరత్నముగారు మాపూర్వుల నివాసస్థల మగు గోటేరులో నింతకాలము నుండి, యిపు డచట నొంటరిగ నుండలేక రేలంగి వచ్చిరి. ఉపాధ్యాయుఁడుగ నుండిన పద్మరాజుగారు తాను జిరకాలము నివసించిన దేవరపల్లి విడిచి, సోదరులతోఁ గలసి యుండుటకై రేలంగి ప్రవేశించెను. అందువలన పూర్వపుపెంకుటిల్లు మూఁడు చీలికలై మా మువ్వురు పెత్తండ్రులకు నిపుడు నివాసస్థల మయ్యెను. మా జనకుఁడు నిర్మించిన పర్ణకుటీరమున మేము కాపుర ముంటిమి. మా పెత్తండ్రులలో జ్యేష్ఠులగు గంగన్న గారితో పాఠకుల కిదివఱకే కొంత పరిచితి కలిగినది. ఆయన లౌక్యవ్యాపారములందును ముఖ్యముగ న్యాయసభలందలి వ్యాజ్యెములందును, ఎంతయో యభిరుచి గలిగి, వానియం దమితానుభవము నలవఱుచుకొని యుండెను. ఆప్రాంతమందలి మొఖాసాదారులగు క్షత్రియప్రముఖు లాయన యనుచరులు. ఆయన మంచి ధనార్జనపరుఁడు వెంకటరత్నముగారు గోటేరు మున్నగు గ్రామములందు రాజులపక్షమున కరణీకము చేయుచువచ్చెను గాని, ఆయన యభిమానవిద్య యాంధ్రసాహిత్యము. పద్మరాజుగారు చిరకాలము ఉపాధ్యాయుఁ డై యుండినను, ధన సంపాదనమున తన రెండవయన్నవలెనే కొంత వెనుకఁబడి, ఆయన వలెనే సాహిత్యవిషయములం దభిరుచి గలిగి యుండెను. మా తండ్రి పెద్దయన్నకుఁ గల లౌకిక కార్యదక్షతకును, ద్వితీయ తృతీయసోదరుల సాహితీపాండిత్యమునకును నోఁచుకొనక, బాల్యముననే సర్వేశాఖలో నుద్యోగము సంపాదించి, మధ్యమధ్య పని విరమించుకొని యిలు సేరుచుండినను, ఆశాఖలోనే మరలమరల నుద్యోగము చేయుచువచ్చెను. ఇట్లు వివిధమండలములం దాయన సంచారము చేసి సంపాదించిన సొమ్మును సమష్టికుటుంబ పోషణమునకై పెద్దయన్నకుఁ బంపించుచు వచ్చెను. గంగన్నగా రాద్రవ్యమును జాగ్రతపఱచుచు తణుకు తాలూకాలోని కొన్ని గ్రామములలో మంచిభూములు కుటుంబోపయోగార్థమై కొనఁగలిగిరి.

నా పదియవ సంవత్సరమున నేను రేలంగిలోని పాఠశాలలో నాంగ్లేయభాషాభ్యాస మారంభించితి నని జ్ఞప్తి. మా ప్రథానోపాధ్యాయుఁడు చామర్తి అన్నమరాజుగారు. ఆయన ప్రవేశపరీక్షవఱకును జదివినవారు. వేలుపూరులో నివాసమేర్పఱచుకొని, అనుదినమును వేకువనే రేలంగి నడిచి వచ్చి, పాఠశాల నడుపుచుండెడివారు. పెద్దతరగతులపాఠములు, ముఖ్యముగ నింగ్లీషుభాషయు, ఈయన బోధించుచుండెడివారు. రేలంగినివాసులగు కందిమళ్ల సుబ్బారాయుఁడుగారు సహాయోపాధ్యాయులు. వీరు ఖచితముగ నాంధ్రము గఱపుట యందును, శిష్యుల నదుపులో నుంచుటయందును ప్రసిద్ధి నొందిరి. ఉపాధ్యాయు లిరువురును సామాన్యముగ నొకరితో నొకరు సంప్రదించి సంభాషింప కుండెడి సఖ్యవిశేషమున నొప్పుచుండువారలు. ఆప్రదేశమందలి నా సహాధ్యాయులను గూర్చియు వారి చర్యలనుగుఱించియు కొంత చెప్పవలయును. దేశమున నింగ్లీషువిద్య యంత ప్రాచుర్యము కాని యాకాలమున, పాఠశాలలో నాంగ్లేయభాష నేర్చుచుండుటకే మిడిసిపడుచుండెడివారము. ఐనను, వేషభాషలందును, అభిరుచులందును మేము వట్టి జానపదులవలెనే సంచరించెడివారము. ఆటపాటలవిషయమున పట్టణములఁగల సౌకర్యములు మాకు లేకపోవుటవలన, ఉప్పట్లు, చెడుగుడి, దూళిబంతి, గూటీబిళ్ల మొదలగు ప్రాఁతయాటలనే మే మంటిపెట్టుకొని యుంటిమి. సెలవుదినములలో మే మొకచోటఁ జేరి, యుద్యోగస్థులవేషములు వేసి నాటకము లాడి, వినోదింతుము. ఒక్కొకతఱి పొలములోనికిఁ బోయి నేరెడుచెట్లెక్కి, నల్లనిపండ్లు కోసి, యింటినుండి తెచ్చినయుప్పు కారములపొడిలో నవి యద్ది భుజింతుము. మే మెంత జాగ్రతపడినను, నాలుక నల్లబడి గొంతుకు బొంగుపోయి, కొన్ని దినములవఱకును దగ్గుపడిసెములకు లోనై, మేము తలిదండ్రుల తిట్లకు తల లొగ్గుచుందుము. అప్పుడప్పుడు వీథులలో నాడెడి భాగవతము, జలక్రీడలు, తోలుబొమ్మలును, మా కమితాహ్లాదకరములుగ నుండి, కొన్నాళ్లవఱకును మా చిన్ని యాటల కొరవడు లగుచుండును. మా రెండవ పెదతండ్రికుమారుఁడు కృష్ణమూర్తి, తాటియాకులతో చిన్న బొమ్మలు చేసి, గుడ్డతెర మీఁద వాని నాడించుట మా చిన్నికన్నులకుఁ గడుచోద్యముగ నుండెను!

ఇపుడు నాకు 11 సంవత్సరముల వయస్సు. విద్యాభిరతియు స్నేహాభిలాషయు నాకు మిక్కుటముగ నున్నను, గృహకృత్యనిర్వహణ మనిన నేను బెడమొగము పెట్టువాఁడను కాను. మాతల్లి కడు బలహీనురాలు. కని పెంచెడి పిల్లల సంఖ్య పెరిఁగి కుటుంబభార మధికమైనకొలఁది, ఆమె నిస్సహాయత యినుమడించెను. శైశవదశలో నే నెంత వ్యాధిపీడితుఁడనై జననీజనకుల నలజడిపాలు చేసినను, నాలుగైదేండ్లు వచ్చినప్పటినుండియు శరీరసౌష్ఠవ మేర్పడి, నాయంతట నే నాఁడుకొనుచు వచ్చితి ననియు, తన కమిత సాహాయ్యము చేయుచు వచ్చితి ననియును మా యమ్మ మురియుచుండెడిది. ఆయిల్లా లంతగ గడుసుఁదన మెఱుఁగని పూర్వకాలపు స్త్రీ. కుటుంబనిర్వాహకమునందు తగిన జాగ్రత' లేకుండె నని మొదటిదినములలో మాతండ్రి యామెను బాధించుచుండెడివాఁడట. కాని, నాకు ప్రాజ్ఞత వచ్చినది మొద లాయన యిట్టికార్యములు కట్టిపెట్టవలసివచ్చెను. మా తల్లిని దూషణోక్తు లాడి హింసింపఁబూనునపుడు, నే నాయన తలకెగఁబ్రాకి, జుట్టుపట్టి వంచి, వీపుమీఁదఁ గొట్టుచుండెడి బాల్య దినములు నాకు బాగుగ జ్ఞాపకము. రేలంగి కాపురఁపు తుది దినములలో మాతల్లి సంతానము నలుగురు కుమారులు నొకకొమార్తెయు. మా జనని యొక్కతెయె యింటిపనులు జరుపుకొనవలసివచ్చెడిది. తల్లి కష్టము లూరక చూచుచుండనొల్లక, నే నామెకుఁ దోడుపడెడివాఁడను. పాఠశాలనుండి వచ్చినతోడనే, పుస్తకము లొకమూల వైచి, కాలు సేతులు గడిగికొని, ఏడ్చెడి శిశువు నెత్తికొని యాడించుచు, నే నామెకు సాయము చేయుచుండువాఁడను. ఆమె యింట లేనపుడు నేనే మడిగట్టి, నా వచ్చియురాని వంటతో సోదరులకు భోజనము సమకూర్చుచుందును. రాజమంద్రి వెళ్లనపిమ్మట పాఠశాలలోని చదువునకు నే నెక్కువ శ్రద్ధ వహింపవలసిన కాలమందును, ఇంటఁ దల్లికిఁ దోడుపడుట నా కార్యక్రమమున నంతర్భాగ మయ్యెను. దీనికి బంధువులు సహచరులు నన్నొక్కొకమాఱు గేలి చేసినను, జననీ సేవయు సోదరపరిపోషణమును నవమానకరమని తలంపక, విద్యా నిరతికిని గృహకృత్యనిర్వహణమునకును ఆవంతయు విరోధము లేదని బాగుగ గుర్తెఱిఁగి మెలఁగితిని.

5. దుష్కార్యము.

నేను 11 వ యేటఁ జేసిన యొక దుష్కార్యమువలన నామనస్సు మెరమెరలాడు చుండును. నాలుగవతరగతి పఠనీయపుస్తకములలోని "ఆసియాభూగోళము" నాకు లేదు. ఎన్ని సారులు కొను మని వేడినను మాతండ్రి యాపుస్తకము నాకుఁ గొనిపెట్టలేదు. మాసహపాఠులలో అచ్యుతరామయ్య యనువాఁడు కారణాంతరములచేతఁ జదువు మానివేసి, నాకుఁ దనపుస్తక మమ్మఁజూపెను. దానివెల నాలుగణాలు. తరువాత డబ్బిచ్చెద ననఁగా, నా కాతఁడు పుస్తక మిచ్చివేసెను.

ఆతఁ డెన్నిసారులు తన డబ్బడిగినను, నే నేదో మిష చెప్పి తప్పించుకొనువాఁడను. ఒకనాఁడతఁడు పాఠశాలకు వచ్చి, సొమ్మీయుమని గట్టిగ నడిగి, "నా పావులా యిచ్చువఱకును నీపుస్తకము లీయ" నని చెప్పి, నాపుస్తకములబొత్తి లాగివైచెను. పుస్తకములకై మే మిద్దఱము పెనఁగులాడినప్పుడు, అవి క్రిందఁ బడిపోయెను. అందఱిలో న న్నీతఁ డవమానము చేయుటకు నేను గోపించి, వాని మీఁదఁ గసి తీర్చుకొన