ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/పరీక్షావిజయము

వికీసోర్స్ నుండి

28. పరీక్షావిజయము

1889, 91 వ సంవత్సరములమధ్య నా జీవితమునఁ గలిగినంత గొప్పపరిణామము, అంతకుఁ బూర్వమునఁ గాని, పిమ్మటఁగాని యింతస్వల్పకాలమున సంభవింపలేదని చెప్పవచ్చును ! ఇష్టవిహారము, నియమానుగుణ్యజీవితము, ఆస్తికమతావలంబనము, సంస్కరణాభిరతి, మొదలగు దోహదవిశేషములచే నావ్యక్తిలతిక వర్ధిల్లి వికసించెను. ఆయాపరిస్థితుల ననుసరించి నాశరీరమనశ్శక్తులు, ఒకప్పుడు కష్టములఁ గ్రుంగుచు, ఒకప్పుడు సంతోషమునఁ బొంగుచుచును, మెల్ల మెల్లఁగ నభ్యున్నతి గాంచుచుండెను. నా శీలప్రవర్తనములు వివిధశోధనలకుఁ దావలమై, క్రమక్రమముగ క్రమమార్గానుసరణమున ప్రవర్ధమాన మగు చుండెను. ఇపుడు నా మతవిశ్వాసములందు సుస్థిరతాదృఢత్వములు, ప్రవర్తనమున నిశ్చిత నీతిపథానుసరణమును, స్పష్టముగఁ గానవచ్చెను. ఈ నూతనవత్సరమున విద్యాభివృద్ధి, దేశాటనము, గృహస్థాశ్రమారంభము, వార్తాపత్రికాస్థాపనముల మూలమున నా లోకానుభవమునకు విశాలత సమకూడి, నా సంస్కరణాభినివేశము నవీనములును క్రియా పూర్వకములు నగుదారులు త్రొక్కుట కవకాశము గలిగెను.

1891 వ జనవరి 1 వ తేదీని, నూతనవత్సరప్రార్థనసమయ మందు నే నిట్లు తలపోసితిని : - "భగవానుఁడా ! నిరు డీనాఁడు నే జేసికొనిన నియమముల నేఁడాదిపొడుగునను నే నంతగ ననుసరింపనందుకు వగచుచున్నాను. ఈ క్రొత్త సంవత్సరమున నీ యీ నిబంధనల నవలంబింతు నని ప్రగల్భములు పలుకక, నీ పాదకమలసేవయె చేతునని నేను నిర్ధారించుకొనుచున్నాను." అంత నూతన సంవత్సరకార్యవిధాన మిట్లు సూచించితిని : -

"1. పరీక్షలో జయమందినచో పట్టపరీక్షకును, లేనిచో మరల నీ పరీక్షకును, జదివెదను.

2. విజయము చేకూరునట్టుగ క్రమపద్ధతిని జదువు సాగింతును.

3. ఆరోగ్యమును గుఱించియు, ముఖ్యముగ నేత్రముల గుఱించియు శ్రద్ధఁ బూనెదను.

4. నా యుద్యమసాఫల్య విషయమై, సమత్వకార్యవాదిత్వములతోఁ గృషి చేసెదను."

అంత నే నిట్లు ప్రార్థన సలిపితిని : - "అనంతా ! ఈ దుర్బలశరీరముతో, నీకును, నీ సంతతయగు మానవకోటికిని నా వివిధవిధుల నెట్లు నెరవేర్పఁ గలను ? పరిశ్రమ యనఁగనే దుర్బలతచే నామేను కంపించుచున్నది ! ఐనను, ఒడలు దాచుకొనుట భావ్యము కాదు. నీ వొసఁగినగడువు మీఱక మున్నె, నావిధులు చెల్లించి, నీదయకుఁ బాత్రుఁడ నయ్యెదనుగాక !"

పరీక్షలు జరిగినపిమ్మట, నాసహపాఠి మిత్రులు తమ సెలవులకు వెడలిపోయిరి. అందుచేత రాజమంద్రిలో నే నేకాకిగ నుండవలసి వచ్చెను. జనవరి మొదటితేదీని వెంకటరావు బసకుఁ బోయి, యాతనిఁ జూచితిని. తండ్రి తనమీఁద గోపించె నని యతఁడు ఖిన్నుఁ డయ్యును, నన్నుఁ జూచి కొంత సేదదేఱెను. రాత్రివఱకు నే నచటనే నిలిచి, యూరట గలిగించితిని.

నేఁడు మే మొక వింతసాటింపు వింటిమి. కొందఱు దుష్టులు శిశువులను దొంగిలించి, యిపుడు బెజవాడదగ్గఱఁ గట్టెడి యేటివంతె నపని జయప్రదముగ జరుగుటకై కృష్ణానదీదేవతకు బలి యిచ్చుటకు వారి నచటి కెగుమతి చేయుచున్నా రని వదంతులు ప్రబలెను ! కావున జనులు తమపిల్లల నింటియొద్ద జాగ్రత్తపెట్టుకొనవలె నని సర్కారు వా రిపుడు సాటింపించిరి. మా కుటుంబ స్థితిగతు లిపుడు విషాదకరముగ నుండెను. 1300 రూపాయలయప్పు పెరిఁగెను. పాపము, నిరుద్యోగి యగు మాతండ్రి యిది యెట్లు తీర్పఁగలఁడు ? నే నన్ననో, ముక్కుచు మూలుగుచు నున్నాఁడను. కనులకుఁగూడ నేదియో మూఁడినది ! ఇంక పరీక్షలో నపజయ మాపాదించెనేని, నాయదృష్టము పరిపూర్తి యగును ! తమ్ముఁడు వెంకటరామయ్య ప్రవేశపరీక్షకుఁ బోయియుండెను. అతఁడు క్రమక్రమముగ బుద్ధిమంతుఁ డయ్యెను. కాని, కృష్ణమూర్తి యింట నవిధేయతఁ గనఁబఱుచుచు, చదువునందు శ్రద్ధ లేకయుండువాఁడు. అతనిని, తక్కిన పిల్లలలోఁ గొందఱిని నదుపులో నుంచుట మాకుఁ గష్టముగ నుండెను ! విషమపరిస్థితులలో నేను ధైర్యము విడువక, ఈశ్వరపాదకమల స్మరణమే సర్వానర్థ హర మని నమ్మియుంటిని.

జనవరి 5 వ తేదీని లక్ష్మీనారాయణగారితో నేను షికారు బయలుదేఱి, మండలవై ద్యాధికారియగు కరూధర్సు డాక్టరును జూడఁ బోయితిని. కచేరిగదియందుఁగాక, నేను లోపలిగదియొద్దకుఁ బోయి తనను జూచినందు కాయన నామీఁద మండిపడెను ! యూరోపువారి యాచారపద్ధతులు నాకుఁ దెలియమియే దీనికిఁ గారణ మని నే జెప్పుటచేత, ఆయన నాతప్పు సైరించి, మఱునాఁడు నాకనులు పరీక్షించెను. రెండుకన్నులలోను చిన్న చుక్క లున్న వనియు, ముం దవి యెట్లు పరిణమించునో తెలియ దనియు, అవి పువ్వులక్రింద నేర్పడి నేత్రదృష్టి పూర్తిగఁ దొలఁగినపుడు శస్త్రము చేయవచ్చు నని యును, ఆయన చెప్పెను. అంతవఱకును నేను సులోచనములు పెట్టుకొనవలెనఁట ! చెన్నపురి వెళ్లి, సర్కారునేత్రవైద్యాలయమందలి నిపుణులచే వైద్యము చేయించుకొనుట మంచిదని స్నేహితులు చెప్పిరి. ఈసంవత్సరము జరుగనున్న జనాభాపనులలో నేను స్వచ్ఛంద సేవకునిగఁ బని చేతు నని పురపాలకసంఘమువారికి మాట యిచ్చి యుంటిని. నాబదు లెవరును పనిచేయ నొప్పకుండినందున, వెను వెంటనే నేను చెన్నపురి పోవుటకు వలనుగాకుండెను. నా నేత్ర రోగమును గుఱించి తలిదండ్రులు సోదరులును మిగుల ఖిన్నులైరి.

ప్రతియేఁడును జనవరిలోనే ప్రథమశాస్త్ర పరీక్షాఫలితములు తెలియుచుండెను. స్నేహితుఁడు కాంతయ్యగా రిపుడు తమ పట్టపరీక్షార్థమై చెన్నపురికిఁ బోయియుండిరి. ముందుగనే నాసంగతి తెలియఁబఱతు నని యాయన నన్ను నమ్మించినను, అట్లు జరుగనందున నాయలజడి హెచ్చెను. మద్రాసులో పరీక్షాపర్యవసానము ప్రచురమయ్యె నని విని నేను రెండవ ఫిబ్రవరిని రిజిష్ట్రారునకు తంతి నంపితిని. జవాబు లేదు ! మఱునాఁడు నే నింట వ్రాసికొనుచుండఁగా, వెంకటరత్నము వచ్చి నా విజయవార్త వెలుఁగెత్తి చెప్పెను. ఆనాఁడెల్లనూ యానందమునకు మేర లేకుండెను ! మిత్రులు పరిచితులును నన్నభినందనములలో ముంచివైచిరి ! కనకరాజు గంగరాజు లపజయ మందుటవలన నాముఖ మంత తేటగ లేకుండెను.

రాజమంద్రి కళాశాలలో నేను జేరి పట్టపరీక్షకుఁ జదువవలె నని మా తలిదండ్రులయుద్దేశము. కాని, నే నొకసంవత్సరము విద్య విరమించినచో, నేత్రదృష్టియు దేహారోగ్యమును చక్కపడు నని వెంకటరావు మున్నగు మిత్రుల యభిప్రాయము. రాజమంద్రిలోనె చదువుటకును, రాఁబోవు వేసవిలో చెన్నపురి పోయి నేత్రవైద్యము చేయిం చుకొనుటకును, నే నంతట నిశ్చయించుకొంటిని. పరీక్షలో తిరిగి యపజయమందిన మిత్రులగు కనకరాజును గంగరాజును పరామర్శ చేయుటకు నేను నర్సాపురము పోయి వచ్చితిని. మార్గమధ్యమున వేలివెన్నులో నే నొకదినము నిలిచియుండఁగా, అచటి బంధువులు నా పరీక్షావిజయవార్త తెలిసి యానందమందిరి. నే నిఁక జదువు చాలించి యుద్యోగము చేతు నని కొందఱును, న్యాయవాది నయ్యెద నని కొందఱును, అచటఁ జెప్పుకొనిరి. వారికి నాయూహలతోను, ఆశయములతోను బ్రసక్తియె లేదు !

కొలఁది రోజులలో ప్రవేశపరీక్షా ఫలితములును దెలిసినవి. తమ్ముఁడు వెంకటరామయ్య జయమందెను. కొండయ్యశాస్త్రి మరల తప్పెను. సోదరుల మిరువురము పరీక్షల నిచ్చి, కళాశాలలో నున్నతవిద్య నభ్యసింప నున్నందుకు నే నానందనిమగ్నుఁడ నైతిని. మా విద్యాపరిపోషణము చేయవలసిన జననీజనకుల బాధ్యతాభారము మాత్ర మతిశయించుచుండెను !

నేను వెంకటరావును జూచుటకు 13 వ తేదీని పోయినప్పుడు, పాపము, అతఁ డవసానదశయం దుండెను ! అపుడును న న్నాతఁ డానవాలు పట్టెను. వెంటనే వైద్యుని బిలువు మనియు, తనదేహమున నిముసనిముసమును ఉబుకుచుండెడి నీటియూటను దోడివేయించి తన జీవములను గావు మనియును, రోగి యాత్రమున నన్ను వేఁడుకొనెను ! నే నచట నిలువలేక పోయితిని. వైద్యుఁడు శక్తివంచనలేక పని చేయుచుండినను, నీటిపొంగు సరికట్టుట దుస్సాద్య మని యచట నుండువారు నాకుఁ జెప్పి వేసిరి ! దైన్యమున నే నింటికి వెడలి పోయితిని. మఱునాఁడు నాతఁ డట్లె యుండెను. అంతకంతకు రోగికి దాహ మతిశయించెను. ఆ మఱుసటి దినమున వెంకటరావు మృత్యుగర్భము సొచ్చెను ! ఆ బాల్యస్నేహితుని యకాలమరణము నాహృదయనౌకను దు:ఖజలధిని ముంచివైచెను. ఓ మరణదేవతా ! నీచేష్టల నిరోధించు సాధనకలాప మీభూలోకమున నెచటను లేనేలేదా ?

29. చెన్నపురిప్రయాణము

రాజమంద్రికళాశాలలో పట్టపరీక్షతరగతిలో నేనును, ప్రథమశాస్త్రపరీక్షతరగతిలో మాతమ్ముఁడును జేరి చదువుచుంటిమి. మా స్నేహితులు కనకరాజు గంగరాజులు తిరిగి రాజమంద్రి వచ్చి ప్రథమ శాస్త్రపరీక్షకును, కొండయ్యశాస్త్రి ప్రవేశపరీక్షకును మరలఁ జదువుచుండిరి. అంతకంతకు సంఘసంస్కారప్రియుల సావాసము మరిగి. శాస్త్రి మున్నగు పూర్వాచారపరులతోడి సంసర్గము నేను విరమించు కొంటిని.

సంఘసంస్కరణసమాజము వెనుకటివలెనే పనిచేయుచున్నను, క్రమక్రమముగ దానిప్రాశస్త్య మణఁగిపోయి, ప్రార్థనసమాజప్రాముఖ్యము హెచ్చెను. నిజమునకు రెండుసమాజముల సభ్యులు నొకకూటము వారే. చర్చనీయాంశముల విషయనవీనత నానాటికి వన్నెవాసి, చేయుపని యంతగఁ జేతులకు లేకపోవుటచే, సంస్కరణసమాజ వ్యాపనము ప్రార్థనసమాజకార్యక్రమమున నంతర్లీనమై, కాలక్రమమున నేతత్సమాజము ప్రత్యేకవ్యక్తిత్వమును గోలుపోయెను ! ఇట్లనుటవలన, సంస్కరణాభిమానము సభ్యుల మనస్సీమనుండి వీసమంతయుఁ దొలఁగె నని తలంపఁగూడదు. ప్రార్థనసమాజసభ్యత్వము సంస్కరణాభిమానమునకుఁ బర్యాయపద మగుటచేత, ఏకోద్దేశమున రెండుసభలు జరుపుట యనగత్యమై, ప్రార్థనసమాజము పేరిటనే