ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/ఉపాధ్యాయవృత్తి

వికీసోర్స్ నుండి

భయులమును సైదాపేట పోయితిమి. యల్. టి. తరగతి కిటకిట మను చుండెను. పెద్దగుమాస్తాను జూచితిమి. మాయిద్దఱికి నచట ప్రవేశము దొరకఁగల దని యాయన యాశ కలిగించెను. అధ్యక్షుఁడు నాఁడు కళాశాలకు రాకుండినందున, ఆయనను జూచి, తరగతిలోఁ జేరుటకై 30 వ తేదీ సోమవారము తిరిగి వచ్చెద మని మద్రాసు వెడలి పోయితిమి.

కళాశాలలోఁ జేర్చుకొనుటకు అధ్యక్షుఁ డిష్టపడినచో, మమ్మొకవైద్యుఁడు పరీక్షింపవలెను. ఆవిషయమై మాకు సాయము చేయుదు నని వైద్యుఁడు నారాయణస్వామినాయఁడుగారు చెప్పిరి. ఆదివారమునాఁడు సత్యసంవర్థని క్రొత్తసంచికకుఁ గొన్ని వ్యాసములు వార్తలును వ్రాసి, ఇపుడు రాజమంద్రి వెడలిపోవుచుండు స్నేహితులచేత కవి యిచ్చి పంపితిని.

సోమవారము మరల మృత్యుంజయరావు నేనును సైదాపేట పోయితిమి. అచట మమ్ముఁజేర్చుకొనుట కధ్యక్షుఁ డంగీకరించి, మమ్ముఁ బరీక్షింపు మని రాయపేట వైద్యాధికారికి జాబు వ్రాసెను. మఱునాఁడు వైద్యాధికారియొద్ద కేగితిమి. మే మెంత భయపడినను, మే మారోగ్యవంతులమనియె వైద్తుఁడు వ్రాసివేసెను. ఆదినమె మేము సైదాపేట పోయి, అచట కొన్ని పాఠములు బోధించితిమి. జీవితకాల మంతయు విద్యావృత్తిలో నుందు నని నిశ్చయించుకొనియె నే నాకళాశాలలోఁ జేరితిని.

44. ఉపాధ్యాయవృత్తి

రాజమంద్రికళాశాలలోఁ జదువుకాలమున నపుడపుడు భావి కాలమున నే నవలంబింపవలసిన వృత్తినిగుఱించి యాలోచించుచుండె డివాఁడను. సంస్కరణావేశమునకు లోనగునప్పటినుండియు నా కీ విషయమునఁ గొన్ని నిశ్చితాభిప్రాయములు గలిగెను. న్యాయవాదివి కమ్మని మాతల్లిదండ్రులు హితవు చెప్పుచువచ్చిరి. నే నావృత్తి చేకొనినచో, మిక్కటముగ ధనయశస్సంపాదనము చేయుదు నని మాజనకుని తలంపు. కాని, కీర్తిధనాదులమీఁద నాదృష్టి లేదనియు, న్యాయమార్గమున నడచుటకు న్యాయవాది కవకాశము లేదనియు నేను వాదించుచుండువాఁడను. అటు లైనచో నేను కలెక్టరుకచేరిలోఁ గాని మఱియే కచేరీలోఁగాని యుద్యోగము సంపాదించుట మంచి దని మాతండ్రి చెప్పుచుండువాఁడు. దొరతనమువారికొలువున లంచములు పుచ్చుకొనవలసివచ్చును గాన నా కది బొత్తిగ నిష్టము లే దని నే జెప్పివేయుచుండువాఁడను. సర్కారుకొలువున నన్యాయముల కొడి గట్టకయె వ్యవహరింపవచ్చుననియు, శ్రమపడినంతకాలము చాలినంత జీతమును, వార్ధకమున పింఛనును బడయవచ్చుననియు, మాతండ్రి పలుకుచుండువాఁడు. కాని, మతసంఘసంస్కరణోద్యమములఁ బనిచేయుటకు న్యాయవాదుల కవకాశమును, సర్కారు ఉద్యోగులకు స్వాతంత్ర్యమును లభింప దని నేను దలంచి, ఈరెండువృత్తులనుండియు పెడమొగము పెట్టివేసితిని. నాస్నేహితుఁడు కాంతయ్యగారు, రిజిష్ట్రేషను శాఖలో కావలసినంత తీఱికయు స్వతంత్రతయు నుండుట చేతఁ దా నందుఁ బ్రవేశించి, అందు లభించు కొంచెముజీతముతోనే తృప్తినొందెద నని చెప్పుచుండువాఁడు. దొరతనమువారికొలు వనఁగనే యన్యాయమున కెడము గలుగు నని నానమ్మిక. కావున నెవ్విధమునఁ జూచినను, ఉపాధ్యాయత్వమె యుత్తమవృత్తిగ నాకుఁ దోఁచెను. ఈవృత్తిని నాగురువర్యులగు వీరేశలింగముగారును స్వీకరించి ధన్యజీవితు లగుచుండిరికదా ! సంఘసంస్కరణాది విషయములందు వారి పాదముద్రలనే యడుగులు వేయఁజూచునాకును ఉపాధ్యాయత్వమె యుక్త మైనదిగఁ గానఁబడెను. చిన్న నాఁడు ధవళేశ్వరమున నేనొక నెల యుపాధ్యాయునిగ నుంటిని. అపుడు విద్యా బోధనకార్యము నా కానందదాయకముగ నుండెను. నా తత్త్వమునకు సరిపడిన వృత్తి యిదియె యని నేను నిశ్చయించుకొంటిని.

మతసంఘసంస్కరణములలో బాగుగఁ గృషిచేయుటకై స్నేహితులము కొందఱము "ఆస్తికపాఠశాల" నొకటి రాజమంద్రిలో స్థాపించి, అందు నుపాధ్యాయుల మైనచో, "ఏక క్రియా ద్వ్యర్థకరీ" అనునట్టుగ నొకమూల జీవనసంపాదనము, ఇంకొకమూల జీవితాదర్శ సాఫల్యమును, బొందఁగల మని మేము తలపోసితిమి. ఇదివఱకె మండపేటలో నుపాధ్యాయుఁడుగ నుండిన మృత్యుంజయరావు, ముందు కూడ నదేవృత్తిలో నుండ నిశ్చయించి, యీసంవత్సరము రాజమంద్రి కళాశాలలో పట్టపరీక్షఁ బూర్తిచేసి, రాఁబోవుసంవత్సరమందు సైదాపేట బోధనాభ్యసనకళాశాలలోఁ బ్రవేశించి, యల్. టీ. పరీక్షలో జయ మందఁగోరెను. నేనును ఉపాధ్యాయునిగ నుండుటకే నిశ్చయించు కొంటిని. వీరేశలింగము వెంకటరత్నము నాయుఁడు గార్లు మున్నగు స్నేహితులు దీనికామోదించిరి. మాతోఁబాటుగ "ఆస్తికపాఠశాల"లో బనిచేయునుద్దేశముతో, రాఁబోవువత్సరమున సైదా పేట కళాశాలలోఁ జేరుట కింక నిద్దఱు ముగ్గురు స్నేహితులు సిద్ధముగ నుండిరి. కావున నేను పట్టపరీక్ష యైనతోడనే కాలయాపనముచేయక, బోధనాభ్యసన కళాశాలఁ జేరుట కర్తవ్య మని తోఁచెను. పిమ్మట నెటులైనను, మొట్టమొదటి రోజులలో నెక్కువజీతము విద్యాధికుల కనులఁ కగఁబడెడి వృత్తి యాకాలమున నుపాధ్యాయత్వమె. ముందు వెనువెంటనే కుటుంబభారము వహింపవలసిన నాకు, సర్వవిధములను ఉపాధ్యాయ వృత్తి నవలంబించుటయె కర్తవ్యముగఁ దోఁచెను.

స్వతంత్రబుద్ధియు, మనోనిశ్చయమును గలిగి కార్యసాధనము చేయుట విద్యాధికులధర్మ మనుట నిజమె. కాని, నిన్నటి వఱకును తలిదండ్రుల పరిపోషణముననుండి, తన విద్యావిషయమై వారిని మితిలేని వ్యయప్రయాసములపాలు చేసి, ఈనాఁడు విద్యాపరిపూర్తిచేసి, స్వతంత్రజీవనసంపాద్యము చేయుటకు శక్తి వచ్చినతోడనె, వారికి తన యూహాపోహలు సవిస్తరముగఁ దెలుపక, వారి యాలోచనలు సాకల్యముగ నాకర్ణింపక, బాధ్యతాయుతమగు వృత్తిసమస్యను తా నొకఁడె వేవేగముగఁ బరిష్కరింపఁబూనుట, ఏయువకునికిని సాహసకృత్యమె !

ఇంకొక కారణమువలనఁగూడ నా వృత్తినిర్ణయకార్యము, అసమగ్రము, అసంతృప్తికరము నయ్యెను. నే నిపుడు స్నేహితులతోఁ గలసి ఆస్తికపాఠశాలాసంస్థలోఁ బని చేయ నుద్యమించితినిగదా. అందలి యుపాధ్యాయు లందఱితోఁబాటుగ నాకు నచట నీయఁబడెడి స్వల్ప గౌరవవేతనముతో మా పెద్దకుటుంబమునకుఁ బోషణ మెట్లు జరుగఁ గలదు ? నేనుదక్క మాయిల్లు చక్క పెట్టఁగలవా రెవరు నీసమయమున లేరుకదా ? పోనిండు, స్వార్థచింతనము విడిచి, పారమార్థిక బుద్ధితోనె నే నీపాఠశాలానిర్వహణ మను గుండములో దుముక సిద్ధపడితి ననుకొన్నను, నన్నుఁ బెంచి పెద్దవానినిఁ జేసి నా శ్రేయస్సుగోరి, నామీఁద నాధారపడిన తలిదండ్రుల కీసంగతి ధారాళముగ నెఱిఁగించి, ముందు వారిదారి వారు చూచుకొనుఁడని చెప్పి వేయుట న్యాయ్యముగదా ! ఇవ్విథమున ముందలి సాధకబాధకములు బాగుగ నాలోచించుకొనక, పట్టపరీక్షాఫలితములు తెలియకమున్నె, వేవేగముగ నేను బోధానాభ్యసనకళాశాలకుఁ బరుగిడితిని !

45. సైదాపేట

1893 వ సంవత్సరము ఫిబ్రవరి 1 వ తేదీని సైదాపేట బోధనాభ్యసనకళాశాలలో మృత్యుంజయరావు నేనును జేరితిమి. ఆ విద్యాలయములో జ్ఞానకాండమునకంటె కర్మకాండమునకే ప్రాముఖ్య మీయఁబడుచుండెను. ఒక్కొక్కప్పుడు, జ్ఞానసంపాదనమున కచట బొత్తిగ నవకాశము గలిగెడిదియెకాదు ! అచ్చటి నిరంతరకర్మకలాపము విద్యార్థులను వట్టి కీలుబొమ్మలగఁ జేయుచుండెను ! వేకువనె డ్రిల్లు, పిమ్మట డ్రాయింగు. ఈరెండును పూర్తియగునప్పటికి తొమ్మిదిగంటలు. పదిమొదలు నాలుగు నాలుగున్నరవఱకును బడి. పిమ్మట కసరతుగాని, సభగాని, సాయంత్రమువఱకును. మొత్తముమీఁద విద్యార్థి చదువుకొనుట కేమియు వ్యవధి లేకుండెడిది. కసరతు అయినను, శరీరమున కేమియు వ్యాయామ మొసంగని వట్టి డ్రిల్లు. ఇందు సరిగా కీలుబొమ్మలవలెనే సాధకులు వికృతాంగ వైఖరులతో నటునిటుఁ దిరుగుచు కాలక్షేపము చేయుదురు !

ఒకపూట ఉపాధ్యాయులు మాకు బోధింతురు. ఈబదులు తీర్చివేయుటకా యనునట్టుగ మే మింకొకపూట మావిద్యార్థులకు బోధింతుము ! కళాశాలనుండి మేము గ్రహించినది విద్యావిశేషమేమియు నందు లేదనియె ! ఇచటి బోధనాప్రభావ మింతటితో నిలువక, జ్ఞానబోధకపుస్తకములు మేము చదువ నవకాశముకూడ లేకుండఁ జేసెను ! సహాయాధ్యక్షుఁడగు డెన్హాముదొర ప్రవీణుఁడు. ఆయన