ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/ఆస్తికపాఠశాల

వికీసోర్స్ నుండి

లిచ్చి నా యారోగ్యము చక్కపఱతునని నన్నుఁ బ్రోత్సహించిరి. సత్యసంవర్థనికి వ్యాసములు వ్రాయుట, చందాదారులకుఁ బత్రికలంపుట, సమాజపుస్తకాగారము సరిచూచుట మున్నగుపనులతో దినములు గడపితిని. స్కాటు, షేక్‌స్పియర్ మున్నగు కవులరచనములు చదివి వినోదించుచుంటిని.

ఒక్కొక్కప్పుడు కడుపులోనిబాధ యుద్రేకించి నన్ను వేధించు చుండెను. రంగనాయకులునాయఁడుగారు ప్రీతిపూర్వకముగఁ జేసిన వైద్యమువలన, శరీరమునఁ గొంతస్వస్థత గలుగుచుండెను. పరిపూర్ణారోగ్యము లభించుటకు నే నిచ్చట నింకొకనెల యుండవలయునని స్నేహితు లనిరి కాని, సైదాపేటకళాశాలాధ్యక్షునికోరికమీఁద గాని, నా సెలవు పొడిగింప వీలుపడదని మండలవైద్యాధికారి చెప్పివేసెను. మరల సైదాపేట పోవుట తప్ప నాకు గత్యంతరము లేదు ! నే నంత ప్రయాణసన్నాహము చేసితిని. 10 వ సెప్టెంబరున చెన్నపురి సుఖముగఁ జేరి, కళాశాలలో మఱునాఁడు ప్రవేశించితిని.

48. ఆస్తికపాఠశాల

నేను తిరిగి సైదాపేట సేమముగ వచ్చినందుకు సహచరులు సంతోషించిరి. కళాశాలకుఁ బోయి, యథాప్రకారముగ నాపనులు చూచుకొనుచువచ్చితిని. ఐనను, నాశరీరమునుండి రోగాంకురములు పూర్తిగఁ దొలఁగిపోలేదు. అపుడపుడు నాకు జ్వరము, అజీర్ణమును గానిపించుచునేయుండెను. నాభార్యకుఁగూడ జబ్బుచేయుచునే వచ్చెను. సైదాపేట శీతలప్రదేశ మగుటచేత, తఱచుగ మా కస్వస్థత గలుగుచుండె నని మిత్రు లనుచువచ్చిరి. 26 న సెప్టెంబరు వీరేశలింగముగారు చెన్నపురి వచ్చిరి. వారిని జూచుటకు మేము పరశువాకము పోయితిమి. చెన్నపురి యందలి యితరమిత్రులు నచటి కేతెంచిరి. మఱునాఁడు, పంతులుగారికి మేము విందు చేసితిమి. ప్రార్థనసభలో పంతులుగారు ఉపన్యాసము చేసిరి. పట్టణము పోయి నేను స్నేహితులను జూచి వచ్చితిని. పంతులు గారికిని, మాకును స్నేహితులు విందులు చేసిరి. పంతులు గారి కంత మేము వీడ్కో లొసంగతిమి.

ఈవిందులు గుడిచిన నాకు మరల శరీరమునం దస్వస్థత యేర్పడెను. దీనికిఁ దోడుగ, మావిద్యాసంస్థను గుఱించి గంగరాజునకు నాకును భిన్నాభిప్రాయములు గలిగెను. మనశ్శరీరములు డస్సి నే నంతట సైదా పేట వెడలిపోయితిని.

ఆదినములలో నామనస్సు నమితముగఁ గలంచినవిషయము, "ఆస్తికపాఠశాల"నుగూర్చినదియె. ఆపాఠాశాలా స్థాపనముతోనే నాయుద్యోగసంపాదనాసమస్యయుఁ బెనఁగలసి యుండెను. పాఠశాల యేర్పడు నని యొకమాఱును, లే దని యొకమాఱును మాకుఁ దోఁచు చుండెను. "సంగీతముచేత బేరసారము లుడిగెన్" అనునట్లు, ఆస్తికపాఠశాల నెలకొల్పువిషయమున భిన్నాభిప్రాయము లేర్పడి, మా స్నేహితులలో వైషమ్యములు జనించెను. ఒకచోటనే చదువు సాగించు కొనుచుండెడి మృత్యుంజయరావునకు నాకును పూర్వసౌహార్దసామరస్యములు వేగముగ నెగిరిపోవుచుండెను !

కొలఁదికాలములోనె మే మిచట విద్యాపరిపూర్తి చేసి, యుద్యోగసంపాదనము చేయవలెను. రాజమంద్రిలో "ఆస్తికపాఠశాల"స్థాపిత మైనచో, మిత్రులతోఁ గలసి నే నందు పని చేసెదను. లేనిచో, కుటుంబపోషణమునకై నేను వెంటనే మఱియొక పాఠశాలలో నుద్యోగమును సంపాదింపవలెను. ఈ ద్వంద్వరాహిత్య మైనఁగాని, నాకు ముక్తిగానఁబడదు !

నవంబరు నాలుగవతేదీని మృత్యుంజయరావుతోఁ గలసి నేను పట్టణము పోయితిని. దుగ్గిరాల రామమూర్తిగారుఁ వెంకటరత్నమునాయఁడుగారు, మే మిరువురము నంత పెరంబూరుపోయి, డైరక్టరుగారి యాంతరంగికకార్యదర్శి యగు శేషాద్రిఅయ్యంగారిని గలసికొని, ఆయనతో రాజమంద్రిలో బోధనాభ్యసనకళాశాల యేర్పడుటను గూర్చి సవిస్తరముగ మాటాడితిమి. రాఁబోవుసంవత్సరమునుండియు, రాజమంద్రిలో దొరతనమువారు బోధనాభ్యసనకళాశాల నెలకొల్ప నిశ్చయించి రనియు, దాని కనుబంధముగ నుండు నున్నతపాఠశాలకు పోటీగా నింకొకపాఠశాల నాప్రదేశమున వారు స్థాపింపనీయరనియును, ఆయన నిష్కర్షగఁ జెప్పివేసెను. మేమంత సైదా పేట వచ్చివేసితిమి. నేను నాముందలిప్రణాళిక నేర్పఱుచుకొంటిని. రాజమంద్రిలో "ఆస్తికపాఠశాల" స్థాపించుట కవకాశము లేదు గావున, నే నింకొకయుద్యోగమునకై ప్రయత్నము చేయుటకు నిశ్చయించు కొంటిని. ఈసంగతులు తెలియఁబఱచుచు, వీరేశలింగముగారికి నాసోదరునికిని 17 వ నవంబరున నేను రాజమంద్రికి జాబులు వ్రాసితిని.

వీరేశలింగముగా రంత నింకొక యాలోచన చేసిరి. ఉన్నతపాఠశాల నెలకొల్పుట యసంభవ మైనచో, మాథ్యమికపాఠశాల స్థాపింపఁ గూడదా ? పరిస్థితు లనుకూల మైనపిమ్మట, ఆచిన్న పాఠశాల పెద్దది కావచ్చును. ఈ మాథ్యమిక పాఠశాలాస్థాపననిమిత్తమై పంతులుగారు రెండుమూఁడువేల రూపాయలు విరాళ మిచ్చెదరు - ఈమాఱు నాయుద్దేశ మేమి ? 26 వ నవంబరున నేను మృత్యుంజయరావుతోఁ బరశువాక మేగితిని. అక్కడకు పట్టపరీక్షనిమిత్తమై కనకరాజు వచ్చియుండెను. గంగరాజును కనకరాజును మే మిరువురమును నూతనపాఠశాలను గుఱించి సవిస్తరముగ మాటాడుకొంటిమి. మాధ్యమికపాఠశాలలో నేను బని చేయ నని చెప్పివేసితిని. అంతట కనకరాజు నరసింహరాయఁడు, మృత్యుంజయరావుగార్లు ముగ్గురును గలసి, మాధ్యమికపాఠశాల నెలకొల్పెద మనియు, "సత్యసంవర్థని" ని వారపత్రికగాఁ జేయుదు మనియుఁ జెప్పిరి. సత్యసంవర్థనితో వివేకవర్థనిని జేర్చుట నా కిష్టమా యని వీరేశలింగముగారు నాకు వ్రాసిరి. "ఆస్తికపాఠశాల"లో నా కిఁక జోక్యము లే దనియు, "సత్యసంవర్థని" నెటులైన మార్పవచ్చు ననియు, నేను పంతులుగారికి వ్రాసివేసితిని. రాజమంద్రిలో నొంకొక మాధ్యమిక పాఠశాలనైన దొరతనమువా రంగీకరింప నట్లు తెలిసికొంటి నని మృత్యుంజయరావువార్త గొనివచ్చెను.

నే నంతట వేఱు ఉద్యోగమునకై ప్రయత్నించితిని. రాజమంద్రిలో దొరతనమువారు స్థాపింపనున్న బోధనాభ్యసన కళాశాలలో నాకుఁ బని దొరకవచ్చును. కాని, దొరతనమువారి కొలువులో నేను జేరఁదలఁచుకొనలేదు. రాజమంద్రిక్రైస్తవపాఠశాలలో ప్రథమోపాధ్యాయపదవిసంగతికూడ నింకను స్థిరపడలేదు. యలమంచలి, అమలాపురము పాఠశాలలలో ఖాళీ లున్న వని తెలిసి, నేను దరఖాస్తుల నంపితిని. ఏదేని యొకయుద్యోగములోఁ బ్రవేశించి, కుటుంబపోషణముఁ జేసికొనఁగోరితిని. సైదాపేటకళాశాలలోని నాచదు వంతట ముగిసెను. నేను భార్యయు పరశువాకము వచ్చి, బుచ్చయ్యపంతులు గారియింట విడిసియుంటిమి. అపుడపుడు వ్యాధిపీడితుఁడ నగుచుండియు, నేను బరీక్షకు శ్రద్ధతోఁ జదివితిని. 1894 సం. 22 వ జనవరిని మా యల్. టి. పరీక్షలు జరిగెను. మే మంతట బయలుదేఱి, రాజమంద్రి వచ్చివేసితిమి.

మృత్యుంజయరావున కంతట బెజవాడక్రైస్తవపాఠశాలలో నుద్యోగమై, యతఁడు వెడలిపోయెను. ఇంతలో మే మిరువురమును యల్. టీ. పరీక్ష మొదటిభాగమున జయ మందితి మనువార్త వచ్చెను. అంత మేము రెండవభాగమందలి పరీక్షకుఁ బోయితిమి. మార్చినెలలో పరీక్షా ఫలితములు తెలిసెను. మిత్రుఁడు జయ మందెను ; నేను దప్పి పోయితిని. అంతట, మృత్యుంజయరావు బెజవాడలోని యుద్యోగము వదలి, ప్రథమోపాధ్యాయుఁడుగ యలమంచిలి వెడలిపోయెను. తన పాఠశాలలోనే నా కీయఁబడిన రెండవయుపాధ్యాయపదవి స్వీకరింపుమని యతఁడు నాకు బోధించెను. మనసు గలియని మేమిరువురము నొకచోట నుద్యోగముఁ జేయుట మంచిది గాదని నాకుఁ దోఁచెను. ఈప్రాంతములందు నా కుద్యోగము లభింపనిచో, హైదరాబాదు వెడలిపోవఁదలచితిని. నాయవస్థనుగుఱించి నేను మిగుల విచారపడితిని. అంతట, మార్చి 8 వ తేదీని బందరునుండి నాకు తంతి వచ్చెను. బెజవాడక్రైస్తవపాఠశాలలో డెబ్బదిరూపాయలు వేతనముగల యుద్యోగము నా కీయఁబడెను. దైవమునకు నామీఁద నెట్ట కేలకు దయ కలుగుటకు నేను ముదమందితిని.

9 వ మార్చితేదీని ప్రొద్దున నేను రాజమంద్రినుండి బయలుదేఱి, మధ్యాహ్నమునకు బెజవాడ చేరి, పాఠశాలా ప్రథానోపాధ్యాయులగు శ్రీధన్వాడ అనంతముగారినిఁ జూచితిని. ఆయన సజ్జనులు. నాకెంతో దయ గనఁబఱిచిరి. నేను ఉద్యోగమునఁ జేరితిని. నాకుఁ జూపినకృపావిశేషమునకు దేవదేవునికి హృదయపూర్వక నమస్కృతు లొనర్చితిని.

49. సైదాపేట చదువు

విద్యార్థిదశయంతటిలోను ఈతుదివత్సరమే నా యారోగ్య విషయమున నధమకాలము. సైదాపేటలో నే నుండినయేఁడాది పొడుగునను, నేను రోగపీడితుఁడ నగుచునేయుంటిని. దీనివలన నావిద్య కెంతో భంగము కలిగెను. రెండవ యర్ధసంవత్సరమున కుటుంబముతో నుండిన లాభము నే నంతగఁ బొందలేదు. నా వ్యాధిగ్రస్తతఁ జూచి, నామీఁద జాలిగొని, నాచదువుచెప్పుపని తేలికచేసినప్రథమోపాధ్యాయునిసాయమే నాకు విషమించెను ! ఆంధ్రవిద్యార్థుల కావిద్యాలయమున చదువు చెప్పుట కొప్పగింపఁబడు తెలుఁగుబాలురతరగతులు చిన్నవిగ నుండెను. ఇంగ్లీషు చెప్పుటకు నా కీయఁబడిన మూఁడవతరగతిలో నైదారుగురే విద్యార్థు లుండిరి. పిమ్మట నాకు పని కలిగిన చిన్న పాఠశాలలో నిద్దఱు విద్యార్థులే కలరు. ఆవేసవియెండలకో, నాబోధనమహిమముననో, వీరిద్దఱును తరగతిలో నిద్దురపోయెడివారు ! రెండవ యర్ధసంవత్సరమున వ్యాధి ముదురుటచేత నొకవిద్యార్థి మాత్రమే కల తెలుఁగుతరగతి నా కీయఁబడెను. ఆరోగ్యము చేకూరినపిమ్మటఁ గూడ, నాకు కొలఁదిమందిగల చిన్న తరగతులే సంప్రాప్త మయ్యెను. ఇట్లు నే నాకళాశాలలోఁ గడిపిన యేఁడాదియు తగినంత విద్యాబోధనానుభవమును సమకూర్చుకొన లేకపోయితిని. బోధించుటకు అధిక సంఖ్యగల పెద్దతరగతులు తమ కీయుఁ డని తోడిబోధకవిద్యార్థులు గురువులను బీడించుచుండఁగా, నాకోరిక యెపుడును స్వల్పసంఖ్యగల తరగతులు గావలయు ననియే !

ఈకారణములవలన నేను విద్యాబోధన కౌశలమునందు వెనుకఁ బడియుంటిని. కావుననే సంవత్సరమునందు రెండుమూఁడు సారులు