ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/అల్లరిచేష్టలు

వికీసోర్స్ నుండి

కాహ్వానము చేయుఁ డని యామె చెప్పి, చదువుకొనుటకు మాకు సదుపాయములు గల్పించును. వారిమాటలు చేష్టలును బరిశీలించి, సుగుణ దుర్గుణములు గనిపెట్టి, దుస్సహవాసుల బారినుండి మమ్మామె తొలఁగించుచుండును.

ఎల్లకాలము మావిద్యాసౌశీల్య పరిపోషణకార్యమందు మా యమ్మ మఱు పెఱుంగని యిట్టితీక్ష్ణ జాగరూకతను జూపఁగలిగెనని నే జెప్పఁజాలను. సంతానము పెరిఁగి యోపిక తగ్గినకొలఁది, పిల్లల చదువుసాముల పెంపునుగూర్చి యామె వెనుకవలె శ్రద్ధ వహించుటకు సాధ్యపడలేదు. అద్దాని యావశ్యకమును పిమ్మట లేదయ్యెను. 1887 వ సంవత్సరమునుండి మాతండ్రి యుద్యోగము చాలించుకొని, సామాన్యముగ నింటనే విడిసియుండెను. నేనును నాతరువాతి వాఁడగు వెంకటరామయ్యయును, పెద్దతరగతులకు వచ్చు వఱకును మాయమ్మ మమ్ముఁ గనిపెట్టి కాపాడెను. చిరకాలాభ్యాసమున సోదరుల మిరువురమును సాధువర్తనము వీడక, విద్యయం దభివృద్ధి నొందుటయే, తక్కినవారికి మార్గప్రదర్శకమయ్యెను. బాల్యదశలో జనని యాజ్ఞానుసరణమువలెనే, యౌవనమున జనకుని ప్రేమానుభవమే మమ్ము న్యాయమార్గమును వీడకుండునట్లు చేసెను.

7. అల్లరిచేష్టలు

మాధ్యమికపరీక్షలో జయమంది నేను 1885 వ సంవత్సరరాంభమున నైదవ తరగతిలోఁ జేరితిని. నావలెనే యా పరీక్షలోఁ గృతార్థులై సంతోషమున మిన్నందు మిత్రబృందముతోఁ గలసి నేను వినోదించుచుండువాఁడను. మాకు గణిత ప్రకృతిశాస్త్ర ములు బోధించుటకు శర్మగారను నొక నూతనోపాధ్యాయుఁడు చెన్నపురినుండి వచ్చెను. ఆయన యెంతో బుద్ధికుశలతయు నుత్సాహమును గలవాఁడె కాని, శిష్యులయెడ కాఠిన్యముఁ బూనుచుండెడివాఁడు. మా చిన్న లోపములకుఁ బెద్దశిక్షల నొసఁగుచుండును. పాఠశాలలో నింకేయుపాధ్యాయుఁడు నిట్లు మమ్ముఁ బీడించువాఁడు కాఁడు. పట్టణమునుండి యేతెంచిన తాను తక్కిన యుపాధ్యాయులకంటె ప్రజ్ఞావంతుఁడ ననియు, పెద్దజీతకాడ ననియు శర్మ విఱ్ఱవీగుచుండువాఁడు. ఈతని తలబిరుసుతనమెటు లణఁగునా యని తక్కిన యుపాధ్యాయులు తలపోయుచుండిరి.

పదిమంది సహపాఠుల మంతఁ గూడి, పాఠశాలాధికారి కొక విజ్ఞాపనము వ్రాసికొంటిమి. శర్మచర్యలు శర్మచేష్టలును బేర్కొని, యీ నిరంకుశాధికారి యుపాధ్యాయత్వమునుండి మమ్ముఁ దప్పించి, పాఠశాల మంచిపేరు నిలుపుకొనుఁ డని మేము ప్రార్థించితిమి. కాని, యెన్నిదినములకును మామొఱ లాలకింపఁబడలేదు. మా 'యర్జీ బుట్టదాఖ' లయిన దని మే మంత తలపోసి, అధికారులకు మా సంగతి నచ్చఁజెప్పుటకై పాఠశాలకుఁ బోకుండ మేము సమ్మె గట్టితిమి ! పుస్తకములు చేతఁబట్టుకొని పాఠశాలకుఁ జేరువనుండు నొక సావాసునిగదిలో మేము చేరి, మాసమ్మెను గూర్చినమాటలతో దినమంతయుఁ గడపి, సాయంకాలమం దింటికిఁ బోవుచుండుట చేత, పెద్దవారలకు మాసమ్మెనుగూర్చి యంతగఁ దెలియలేదు. సహపాఠులంత మాగదిలోనికి వచ్చి, మమ్మునుగూర్చి శర్మ తరగతిలో బలికెడి కటువుపదములు, తక్కినయుపాధ్యాయుల సానుభూతివాక్యములును, మాకుఁ దెలుపుచుండువారు. మాసమ్మెమూలమున పట్టణమందలి విద్యార్థిలోకమున నెంతయో కలవరము గలిగెను. అందఱికంటె నా కెక్కువగా భావోద్రేకము గలిగెను. కొంతకాలముక్రిందట రాజమహేంద్రవరమునొద్ద గోదావరిలో పడవయొకటి మునిఁగిపోయి, జనులనేకులు చనిపోయిరి. ఆ విపత్తును గుఱించి యాంగ్లమున నే నొకపద్యమాల రచియించితిని. ఇపుడీ పాఠశాలలోని యుదంతమునుగుఱించికూడ నింగ్లీషున నొకగీతమాల కల్పించితిని. మాయాగ్రహమునకుఁ బాత్రుఁడైన యుపాధ్యాయుని చేష్టలు గుణములును బేర్కొని, పేరు మార్చి, దుర్గుణములు పెంచి, కథానాయకుని వర్ణించితిని !

ఎట్టకేలకు మావిజ్ఞాపనవిషయమును విమర్శించుటకై పాఠశాలాధికారి పార్షి శ్రీనివాసరావుగారు విద్యాశాలకు వచ్చిరి. పిలుపు రాఁగా, సమ్మెదారుల మందఱమును తరగతిలోఁ బ్రవేశించితిమి. మావృత్తాంతము వా రడుగఁగా, ఎవరికిఁ దోఁచినమాటలు వారము చెప్పివేసితిమి. నావాదమున నుత్ప్రేక్ష లుండుట నాకుఁ దెలియును. మా గురువు క్రూరుఁ డనియు, కఠినచిత్తుఁ డనియు, స్థిరపఱచుటయే నాయుద్దేశ్యము !

మాసాక్ష్యము విని, విజ్ఞాపనవిషయములు విమర్శించుచు, విద్యార్థు లిట్టిఫిర్యాదులలోను, తిరుగుబాటులలోను నుండుట కడు విచారకర మని యధికారి తలంచి, అర్జీ దారులనే దోషు లని నిర్ధారణ చేసిరి. మావాదమును బట్టి మాలో మిగుల పొడుగుగా నుండెడి వాఁడును, మిగుల పొట్టివాఁడును, మొనగాండ్రని యాయన పలికెను. పొడుగాటివాఁడు తణుకు చలపతి; పొట్టివాఁడను నేను. అంతట మే మాఱేసి బెత్తపు దెబ్బలు తింటిమి. కాని, యనతికాలములోనే శర్మగారు మదరాసు పయనము గట్టిరి ! ఇది జరిగిన చిరకాలమునకుఁ బిమ్మట శర్మగారును నేనును రైలులోఁగలసికొంటిమి. అపు డాయన మద్రాసులో న్యాయవాదిగను, నేను బెజవాడలో నుపాధ్యాయునిగను నుంటిమి. "మీప్రస్తుతానుభవమునుబట్టి మీచిన్న నాఁటిచర్య వట్టి యల్లరిచేష్ట యని మీరం గీకరింపరా?" యని యాయన యడిగినప్పుడు, మే మిరువురమును నవ్వుకొని లోకవిశేషములు మాటాడుకొంటిమి !

8. స్నేహ సహవాసములు

మేము రాజమంద్రి చేరిన కొంతకాలమునుండి 1887 వ సంవత్సరమువఱకును, అప్పుడప్పుడు ఏకొలఁదిమాసములో తప్ప తక్కినకాలమంతయును, మాతండ్రి యుద్యోగఁపుఁబనుల మీఁద విదేశమున నుండుచువచ్చెను. మా రెండవమేనమామ తఱచుగ రాజమంద్రి వచ్చి, బజారునుండి వస్తువులు కొని తెచ్చి మా కిచ్చి స్వగ్రామము వెడలిపోవుచుండువాఁడు. కావున సంసారము నడిపి మా చదువుసాములు సాగించు భార మంతయు మాతల్లిమీఁదనే పడెను. పిల్లలలో నెవరికైన జబ్బు చేసినయెడల, ఆమె రాత్రి నిద్దుర మాని కూర్చుండును. ఇరుగుపొరుగున దొంగలు పడినయెడల, రాత్రు లామెకు కునుకు పట్టనేపట్టదు ! ఇట్టిబాధలు 1884 వ సంవత్సరము వేసవికాలమున మిక్కుటమయ్యెను. రాజమంద్రి వేసవిగడుపుట కనువగు ప్రదేశము కానేకాదు. దీనికిఁ దోడుగ, ఆయేఁట నెండ లతిశయించి యుండెను. పట్టణమున మశూచి ప్రబలెను. మేము భయపడినట్టుగనే, స్ఫోటకదేవత శీఘ్రమే మాయింట పీఠము వేసికొనెను. నాకుఁ జిన్న నాఁటనే మశూచకము గానిపించెనఁట. వెంకటరామయ్య తప్ప తక్కినపిల్ల లందఱికి నిపుడు స్ఫోటకము సోఁకెను. పాటెక్కువయై కొందఱు మిగుల