ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/సహవాసులు

వికీసోర్స్ నుండి

13. సహవాసులు

ఆ సంవత్సరము జూన్ 29 వ తేదీని మద్రాసునుండి రాజమంద్రి వచ్చెడి వీరేశలింగముగారిని వారిభార్యను గలసికొనుటకై, రామమూర్తిగారు నేనును రెయిలుస్టేషనుకుఁ బోయితిమి. మేము నలువురము నంత బుచ్చయ్యపంతులుగారి వసతిగృహమున కేగి యచట విందారగించితిమి. రాజ్యలక్ష్మమ్మగారి నొకదినము బెజవాడలో నిలుపఁగోరిన గురువమ్మగారు, వీరేశలింగముగారి ప్రతికూల వికటవచనములకు నిరుత్సాహులై యూరకుండిరి !

ఆరోజులలో రామమూర్తి నాకు గుండెకాయయే ! అనవరతమును చదువుసాములు సరససల్లాపములు నా కాతనితోడనే ! పలు విషయములం దిరువురము నేకాభిప్రాయలము. జులై 5 వ తేదీని పాఠశాలలో "విద్యార్థిసాహితీసమాజ" సభలో మే మిరువురమును ప్రసంగించితిమి. నా వాక్యము లేమియు సారస్యముగ లేవని నేను మొఱవెట్టఁగా, అట్లు కాదనియు, నా పలుకులింపుగను సొంపుగను నుండెననియు పలికి, మిత్రుఁడు నాకుత్సాహము గలిగించెను. మే మిరువురము తఱచుగ నుపన్యాసము లొసంగ నుద్యమించితిమి.

జూలై 25 వ తేదీని రామమూర్తిగారి పుత్రునికి జబ్బుచేసి, కొన్ని గంటలలోనే వానికి మృత్యువు సంభవించెను. మా కెంతో మనస్తాపము కలిగెను. ఈపిల్లవాని యన్నప్రాశనశుభకార్యము కొలఁది కాలముక్రిందటనే యతివైభవముగ జరిగెను ! మనుష్యజీవిత మింత యస్థిరమగుటకు మే మాశ్చర్య మందితిమి.

ఆగష్టునెలనుండి "జనానాపత్రిక"లో ప్రకటించుటకై "గృహనిర్వాహకత్వ"మను పుస్తకమును వ్రాయఁదొడంగితిని. కీలీదొరసాని వ్రాసిన చిన్న పుస్తకము నారచనకు మాతృక, అప్పటినుండియు నెల నెలయును నేనా పుస్తక ప్రకరణములను జనానాపత్రికలోఁ బ్రకటించుచుంటిని. కమలాంబచరిత్ర తర్జుమా బాగుగ లేదని వెంకటరత్నముగారు చెప్పుటచేత నేనా పుస్తకమును మరల తెలుఁగు చేసితిని. 11 వ ఆగష్టు ఆదివారమురోజున రామమూర్తియు, నేనును, బెజవాడలో "ప్రార్థనసమాజ" స్థాపనముఁ జేసితిమి. నేను ప్రార్థన సలిపి, దైవభక్తిని గుఱించి ప్రసంగించితిని. నామిత్రుఁడు సమాజోద్దేశముల విషయమై యుపన్యాస మొసంగెను.

ఆకాలమున చెన్నపురి రాజధానిలోని ఆంధ్రమండలముల ప్రతినిధులు శాసననిర్మాణ సమాజసభ్యుల నేర్పఱుచుటకై బెజవాడలోఁ గూడుచువచ్చిరి. ఈమాఱు 15 వ ఆగష్టున నీ సభ బెజవాడలో జరిగెను. పురపాలక సంఘముల పక్షమున శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగా రెన్నుకొనఁబడిరి. ఇది మా కందఱకును సంతోషకరముగ నుండెను.

ఈ సంవత్సరపు పరీక్షాఫలితములైన బాగుగలేనిచో, తానీ పాఠశాల వదలివేయుదు నని అనంతముగారు చెప్పివేసిరి. అందువలన నా కెంతో యలజడి గలిగెను. నేనిపుడు ప్రథమసహాయోపాధ్యాయుఁడనై, ఆటలు పాఠక్రమపట్టిక మున్నగు పనులయం దాయనకుఁ దోడ్పడుచుండుటచేత, నా కాయన పలుకులు కొంత భీతిని జనింపఁ జేసెను. పాఠశాలాభివృద్ధికొఱ కెంతో పాటుపడితిమి.

16 వ ఆగష్టున మాపెద్దపెత్తండ్రి చనిపోయె నని తెలిసి తమ్ముఁడు నేనును మిగుల విషాదమందితిని. 22 వ ఆగష్టున బాలికా పాఠశాలాధికారిణి యగు బ్రాండరుదొరసాని దగ్గఱనుండి నా కొక జాబువచ్చెను. "జనానాపత్రిక" వ్యాసశైలి కఠినపాకమున నున్నదను మొఱ విని, నే నాశ్చర్యవిషాదముల నందితిని !

24 వ సెప్టెంబరున అనంతముగారు, రామమూర్తిగారు నేనును సకుటుంబముగ విద్యార్థులు కొందఱితోఁ గలసి, కొండపల్లి కొండను జూచుటకై రెయిలుమీఁద బయలుదేఱి, అచటి సత్రములో రాత్రి విడిసితిమి. మఱునాఁడు వేకువనే చలిదియన్నము తిని, అందఱము కొండయెక్క నారంభించితిమి. విద్యార్థులు మాముందు దుముకుచు కోఁతులవలె కొండ కెగఁబ్రాకిరి. ముందు పురుషులము, వెనుక స్త్రీలు నంత బారుగ నేర్పడి, నడువసాగితిమి. అచటి దృశ్యము లత్యంతరమణీయములుగ నుండెను. దారి కిరుకెలంకులను చెట్లు, పొదలును గలవు. వానిమీఁదఁగూర్చుని పక్షులు మధురరుతములు చేయుచుండెను. సుందరలతలు, కమ్మఁదావుల వెదజల్లువృక్షములు, వృక్షములఁ దల దాల్చిన పర్వతశిఖరములును, కనుల పండువు సేయుచుండెను. సృష్టిలో ప్రస్ఫుటమైన సర్వేశ్వరుని సుందరాకారము మాకు చక్షుగోచర మయ్యెను. కొండమీఁద "కిల్లా" మా కపుడు కానవచ్చెను. పాడుపడిన ప్రాచీనపుకోటగోడలు చూచి పూర్వకాలపుసంగతులు నాకు స్ఫురణకు వచ్చెను. ఈదృశ్యము లాధారముగఁ గైకొని ముందు నేనొక చిత్రకథ గల్పింప సంకల్పించుకొంటిని ! కొనకొండమీఁదికి మే మంత వేవేగమే ప్రాఁకిపోయితిమి. అచట గీతములు పాడి వినోదమునఁ గాలక్షేపము చేసితిమి. రాత్రి యగుసరికి మేము కొండ దిగి, సత్రమున కేగి, మరల నచట వంటచేసికొని సుఖభోజనము చేసితిమి. మఱునాఁడు చలిదియన్నము తిని రెయిలుస్టేషనుకు వెడలిపోయితిమి. కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి కెక్కినది. బోగముమేళములు, కలెక్టరుకచేరి, తాడిదానిమ్మలు, ఆవులు, పాములు మొదలగు జంతువులు, మున్నగు వానియాకారములు చిన్నచిన్న కొయ్యబొమ్మలరూపమునఁ జెక్కఁబడి, కొద్దినెలల కమ్మఁబడుచుండెను. ఈబొమ్మలు కొన్ని కొని మేము రెయిలులోఁ గూర్చుండి, మధ్యాహ్నమునకు బెజవాడఁ జేరితిమి.

ఆ దసరా సెలవులలో "జనానాపత్రిక"కుఁ గ్రొత్తచందాదారులను సమకూర్చుటకై 27 వ సెప్టెంబరున బుచ్చయ్యపంతులు గారితోఁ గలసి నేను గుంటూరు వచ్చితిని. ఆయనద్వారా నాకు కళాశాలలో నుపన్యాసకులగు పసుపులేటి వెంకటకృష్ణమ్మనాయఁడు గారు పరిచితులైరి. ఆయన సజ్జనులు, విశాలహృదయలును, గుంటూరు పురపాలక సంఘాధ్యక్షులగు నాయఁడుగారి కచట మిగుల పలుకుబడి కలదు. ఆయన నన్నుఁ దమస్నేహితులయిండ్లకుఁ గొనిపోయి, నా పత్రికకుఁ జందాదారులై స్త్రీవిద్యకుఁ బ్రోత్సాహము గలిగింపుఁ డని వారితో నొక్కి చెప్పిరి. ఈకారణమున గుంటూరులో నాపత్రికకుఁ గొందఱు చందాదారు లేర్పడిరి. ఈలాభమునకంటె నెన్ని మడంగులో విలువగల సహృదయులగు నాయఁడుగారి పరిచయలాభము నాకీ సందర్భమునఁ జేకూరెను.

రాజమంద్రిలో వ్యాధిగ్రస్తులైన తమ యన్న రంగనాయకులునాయఁడుగారిని సందర్శించుటకై చెన్నపురినుండి డాక్టరు నారాయణస్వామినాయుఁడుగారు అక్టోబరు 2 వ తేదీని బెజవాడ వచ్చిరి. బెజవాడ పరిసరములనుండు బుడమేరునది అంతకుఁ గొన్నిదినముల క్రిందటనె కురిసిన యధికవర్ష ములవలన నకస్మాత్తుగఁ బొంగుటచేత, రెయిలుకట్ట కాలువగట్టులును తెగిపోయెను. ఆకారణమున రెయిలు బెజవాడనుండి యేలూరునకు సరిగా నడచుచుండుట లేదు. పడవల రాకపోకలు కూడ క్రమముగ లేవు. నారాయణస్వామి నాయఁడుగారికి నే నంత ననంతముగారి పరిచయము గలుగఁజేసితిని. నాయఁడుగారు వారి యింట భోజనము చేసి, మేము కుదిర్చిన పడవలో నేలూరు వెళ్లిరి. మిత్రుఁడు రంగనాయకులునాయఁడుగారు సన్నిపాతజ్వరము వాతఁబడి మరణించిరని కొలది రోజులలోనే మాకుఁ దెలిసెను. ఆ దు:ఖవార్త విని నేను మిక్కిలి విలపించితిని. అక్టోబరు 10 వ తేదీని నారాయణస్వామినాయఁడుగారు తనసోదరిని, తమ్ముని పిల్లలను, రాజమంద్రినుండి తీసికొనివచ్చిరి. పిల్లలందఱు మాయింట భోజనము చేసిరి. క్రైస్తవులగు నాయఁడుగారు వారి సోదరియును అనంతముగారి యతిథులైరి. ఆ సాయంత్రము వారందఱును మద్రాసు రెయిలెక్కి పోయిరి.

13 వ అక్టోబరున మా బకింగుహాముపేట పఠనాలయ వార్షికోత్సవము జరిగెను. మిత్రుఁడు రామమూర్తి యాతరుణమున చక్కని యుపన్యాస మొసంగినను, రామారావుగారు దానిమీఁది వికటవ్యాఖ్యానములతోఁ దమ యధ్యక్షోపన్యాసమును ముగించిరి !

"శీలము" అను పేరితో నేనొక దీర్ఘోపన్యాసము వ్రాసి, 11 వ నవంబరు సోమవారము జరిగిన "విద్యార్థిసాహితీసమాజ" వార్షికసభలోఁ జదివితిని.

డిసెంబరు 8 వ తేదీని నేను స్నేహితులకొఱకు రెయిలుస్టేషనులో కనిపెట్టుకొని యుంటిని. మద్రాసునుండి వీరేశలింగముపంతులు గారు వచ్చి, వెంటనే రాజమంద్రి వెడలిపోయిరి. కాని, మిత్రులు కనకరాజు, గంగరాజుగార్లు ఆరోజున మాయింట నిలిచియుండిరి. శీతకాలపు సెలవులకు పాఠశాల మూయఁబడుట చేత, డిసెంబరు 9 వ తేదీని సతీపతు లిరువురమును స్నేహితులతో బెజవాడనుండి బయలుదేఱి రాజమంద్రి వెడలిపోయితిమి. ఈ యిద్దఱు మిత్రులు నేనును గలసి మృత్యుంజయరావును మఱునాఁడు చూచి వచ్చితిమి. అతని కిపుడు వ్యాధి ప్రబలియుండెను. సాయంకాలము వీరేశలింగముగారినిఁ జూచివచ్చితిమి. స్నేహితు లంత నరసాపురము వెడలిపోయిరి.

రాజమంద్రిలో నున్న రోజులలో నేను మా నాయనతోను, పెద్దతమ్మునితోను కుటుంబఋణముల తీరుమానమును గుఱించి మాటాడితిని. మిత్రుఁడు రామమూర్తి తాను బూర్తిచేయవలసిన బి. యే. పరీక్షకుఁ జదువుటకై రాజమంద్రి యిపుడు వచ్చెను కాని, యాయన చదువు చాలించుకొని కొలఁదిదినములలోనే స్వగ్రామ మగు నేలూరు వెడలిపోయెను. పాపము, మృత్యుంజయరావున కంత్యదినములు సమీపించుచుండెను. ఇపు డాతఁడు తీవ్రజ్వరపీడితుఁ డయ్యెను. ఆతని స్థితినిగూర్చి మిగుల వగచితిని. ఇట్టి నిరపరాధి నేల వేధించెద వని దేవదేవుని సంప్రశ్నించితిని. మానవులు మొఱపెట్టక, తమ విధికృత్యములు నెరవేర్చు చుండుటయే కర్తవ్యముకదా !

వ్యాధిగ్రస్తుఁడగు మృత్యుంజయరావు సెలవు పొడిగించుఁ డని మెట్కాపుదొర నడుగుటకై, పాపయ్యగారు నేనును ఆ క్రిస్మసుదినములలో దొరగారిని సందర్శించితిమి. మృత్యుంజయరావునకు సెలవిచ్చెదమని దొరగారు ధైర్యము చెప్పిరి.

29 వ తేదీని నేను కోటిలింగక్షేత్రమున కేగి, యీమధ్య చనిపోయిన స్నేహితుఁడు రంగనాయకులునాయఁడుగారి సమాధిచూచి వచ్చితిని. కాలగతి నొందిన మిత్రుఁడగు నాయఁడుగారిని గుఱించి విచారమందితిని. నెచ్చెలుని సుగుణగుణవర్ణనము చేయుచు నొక పద్యమాల రచింప నూహించితిని. ఒకటిరెండు రోజులలో పరీక్ష నిమిత్తమై వెంకటరామయ్య మద్రాసు వెడలిపోయెను. మేము బెజవాడకు మరలివచ్చితిమి.

14. ప్రాఁతక్రొత్తలు

కడచిన సంవత్సరమున నేను జేసిన పనులను విమర్శించుకొనుచు, 1896 వ సంవత్సరము జనవరి మొదటితేదీని నేనొక పట్టికను వ్రాసికొంటిని. అందులో గత సంవత్సరమున పరీక్షకొఱకును వినోదార్థమును జదివిన పుస్తకములఁ బేర్కొని, ముందు సంవత్సరమునఁ జదువఁ బూనిన ముఖ్యగ్రంథముల నామముల నుదాహరించితిని. గతసంవత్సరము నేను జదివిన యుద్గ్రంథములలో ముఖ్యములైనవి, మిల్లువిరచితమగు "మతవిషయికవ్యాసత్రయము", కార్లయిలుని "సార్టారు రిసార్టను", ఇమర్సునుని "మానుష ప్రతినిధులు", రీననుని "క్రీస్తుజీవితము"ను, మిత్రుఁడు రామమూర్తిగారి సహవాసమహిమముననే నా మనస్తత్త్వమున కిపుడు ఇమర్సను, కార్లయిలులు సరిపడుట చేత, ఈసంవత్సరము కార్లయిలుని "శూరులు" "భూతవర్తమానములు" అను పుస్తకములు చదువ నేర్పఱుచుకొంటిని. తమ్ముఁడు కృష్ణమూర్తి రాజమంద్రిలో నున్నప్పటికంటె జ్ఞానశీలాదులంయం దభ్యున్నతి నొందుచుండెను. ఈ సంవత్సర మాతని గుఱించి నే నెక్కువగ శ్రద్ధ వహించి, ప్రవేశపరీక్షలో నాతఁడు జయమందునట్లు చేయ నుద్యమించితిని. భార్య విద్యావిషయమైకూడ మిగుల పాటుపడి, మత సంఘ సంస్కరణములయం దామె కభిరుచి కలిగింప నుద్యమించితిని.

ఆ కాలమున నా దేహమును బీడించు పెనుభూతమగు మలబద్ధమును నిర్జించుటకై, నిద్రాభోజనాదులందు మితత్వముఁ గలిగి, నిత్య