ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/సమష్టికుటుంబ కష్టములు

వికీసోర్స్ నుండి

కృతమె కావున, దీనికీర్తి యంతయువారిదె. వీరిశీలమువలెనే, వచనశైలియు, స్వచ్ఛత, మృదుత్వము, బలిమియును దాల్చియున్నది.

మొదటి యాంధ్రకవులవలెనే యీప్రథమాంధ్ర వచనరచయితయు, భాషాంతర గ్రంథరచనముతోనె కాలము గడపవలసి వచ్చెను. అన్యభాషలోఁగల సొంపులను మాతృభాషలోనికిఁ గొనిరావలసిన భార మాయన వహింప వలసివచ్చెను. ఆయన సొంతకావ్యము లల్లుట కిదియె వ్యాఘాత మయ్యెను. ఇదిగాక, బంగాళీసారస్వతమున ప్రథమవచన రచయితలగు రామమోహన విద్యాసాగరులవలె, వీరేశలింగము పంతులు కూడ సంఘసంస్కరణమునకె వచనగ్రంథముల నధికముగ రచియించెను. సత్యమును విస్పష్టముగను, విపులముగను, మోమోటములేకయు నాయనఁ జెప్పవలెను గావున, ఆయన శైలియు స్వచ్ఛముగను స్పష్టముగను సూటిగను నుండెను ! ఇంతియకాదు. ఈ గుణములతోను, సంస్కరణాభిలాషతోడను విలసిల్లెడి వచన శైలిని మనయాంధ్రమునకుఁ గల్పించి కానుకగనొసంగిన కీర్తిని శాశ్వతముగ నీమహామహుఁడు సంపాదించెను !

40. సమష్టికుటుంబ కష్టములు

1900 సంవత్సరము 19 వ వ యేప్రియలున నాకష్టములను దలపోయుచు, ఎచటఁ జూచిన నప్పులు, ఇంటిలోనిపోరు, చెడుతలంపులు, కార్యగతముకాని సంకల్పములు, - ఇవియె నాముఖ్య శోధనములని గుర్తెఱిఁగితిని. 21 వ తేదీని జరిగిన 'నియోగి సహాయక సభ'కు నేనగ్రాసనాధిపతిని. నారెండవ పెదతండ్రికుమారుఁడగు పట్టాభిరామయ్యకు ముప్పదిరూపాయిలు వేతన మపుడీయఁబడెను. 23 వ అక్టోబరున ఆదిపూడి సోమనాధరావుగారు వచ్చిరి. సంఘ బహిష్కృతులగు నాయనకు మాయింటనే యాతిధ్యమిడితిని. రోజంతయు వారితోనే సంభాషణమున నుంటిని. ఆయన సాయంకాలమందొక చక్కని యుపన్యాస మిచ్చిరి.

28 వ తేదీని దివ్యజ్ఞానప్రచురణము నొకటి చదివి, మూఢత్వ మను గాఢాంధకారమున దివ్యజ్ఞానసామాజికులు చెరలాడుచుండి రని నే నెంచితిని. పశ్చిమఖండవాసుల విజ్ఞానమునకంటె ప్రాగ్దేశీయుల మూఢత్వమే యీ సమాజమువారికి ప్రియతరముగఁ గానవచ్చుచున్నది !

6 వ మేయి ఆదివారము తెల్లవాఱుజామున వైద్యాలయాధికారియగు డాక్టరు వెంకటసుబ్బయ్యగారి జవాను వచ్చి నన్నుఁ బిలిచెను. వారములు చేసికొని మాపాఠశాలలోఁ జదువుచు కాలిబంతి యాటలోఁ గడు నేర్పరియైన పి పులిపాక వెంకయ్య మిగుల జబ్బుగా నుండినట్లు వానివలన విని, నేను వైద్యునింటికేగితిని. పాపము వెంకయ్య వెనువెంటనే మరణించెను ! హృద్రోగమువలన నాతఁ డింత త్వరగ మృత్యువునోటఁ బడెనని వైద్యులు వెంకటసుబ్బయ్యగారి యభిప్రాయము. కొలఁదికాలముక్రిందటనే యాతనికి పెండ్లి యయ్యెను ! వెంకయ్య కిచట బంధువులు లేకుండుటవలన మేమే యాతనిశవమును శ్మశానవాటికకుఁ గొనిపోయి దహనాదిక్రియలు జరిపించితిమి. నిన్నటి వఱకును మందహాసమున బంతులాడెడి యీయువకుఁడు మరణించె ననుట మా కెవరికిని విశ్వసనీయము గాకుండెను! ఆహా ! జీవిత మెంత యస్థిరము !

7 వ మేయి పాఠశాల కీయర్ధసంవత్సరమున తుదిదినము. దాసు గారి కీపాఠశాలతోడిసంబంధ మీనాఁటితోఁ దీఱెను. చివరవఱకును సుగుణదుర్గుణములు మనుజుని వీడకుండునుగదా ! విద్యార్థు లాసాయంకాలమున విజ్ఞాపనపత్ర మాయన కర్పించిరి. ఆసమయమున మాబోటిప్రత్యర్థి బోధకులను బరిహసింప నొకసంభాషణముకూడ సిద్ధపఱచిరి ! కాని యది పిమ్మట విరమింపఁబడెను. పాటలు, విజ్ఞాపనము, వక్తలలో నొకరగు గోపయ్యగారు చేసిన ప్రసంగమును, సహాయోపాధ్యాయులగు మమ్మునుగుఱించిన యెత్తి పొడుపుమాటలతో నిండియుండెను. ఎంత శ్లాఘింపఁబడినను, చెడుగు మంచిగఁ బరిణమింపఁగలదా ?

ఈసమయమున మాతల్లియు, చిన్న చెల్లెలును మాతో బెజవాడలోనే యుండిరి. మాయమ్మకు వెనుకటి జబ్బు అప్పుడప్పుడు కానబడుచునే యుండెను. వైద్యుని బిలిచి, నేను మందు తెచ్చి యిప్పించితిని. తమ్ముఁడు కృష్ణయ్య తంత్రీశాఖాపరీక్షకు విశాఘపట్టణము వెళ్లి యుండుటచే, నేను రాత్రులు నిద్ర మాని వ్యాధిగ్రస్తయగు మా యమ్మకుఁ బరిచర్యలు చేసితిని.

10 వ మేయి తేదీని నే నొక దివ్యజ్ఞానసమాజ సభ్యునితోఁ బ్రసంగించితిని. తత్త్వశాస్త్రసంబంధ మగు నద్భుత విషయములు నాకును హర్ష దాయకము లయ్యును, వానిని విమర్శించునపుడు దివ్యజ్ఞాన సమాజమువారి పద్ధతిగాక, "లండను మనశ్శాస్త్ర పరిశోధక సమాజము" వారివిధానమె నాకు యుక్తముగఁ దోఁచెను. అంధప్రాయమగు విశ్వాసమునకంటె శాస్త్రబద్ధవిమర్శనమే నాకుఁ బ్రియము.

మే మంత, వేసవిసెలవులకు బెజవాడనుండి వెడలిపోయితిమి. తనతమ్ముఁడు శేషగిరిరావుగా రిటీవల చేసికొనిన వితంతువివాహ మశాస్త్రీయ మని దానిని రద్దుపఱిపింప సుబ్బారావుపంతులు గారు ప్రయత్నించుచుండి రని సాంబశివరావుగారివలన విని మేము విచార పడితిమి. చిరకాలస్నేహితులగు వీరేశలింగముగారు తనతోఁ జెప్పక తనతమ్ముని కిట్టిపెండ్లి చేయించిరని సుబ్బారావుగారు వీరేశలింగము గారియెడ నాగ్రహముఁ బూనియుండిరని వింటిమి.

23 వ మేయి దినచర్యలో నిటు లున్నది : - "మరల మాయమ్మ, మామఱఁదలితో వైరము సాగించుచున్నది. ఇదివఱకే నా భార్యకు మాతల్లియం దనుగ్రహముగదా! కర్తవ్య మేమి? ఆరోజులలో రాజమంద్రిలో విశూచిజాడ్యములు వ్యాపించియుండెను. 28 వ మేయిని మాపొరుగుననుండు వేపా లక్ష్మీనరసింహముగారికి విశూచి సోఁకెను. ఆయన కిచట భార్యయు, బిడ్డయు మాత్రము గలరు. అంత మే మాయనను వైద్యాలయమునకుఁ గొనిపోయి యచట విడిచివచ్చి, భార్యను పిల్ల వానిని మాయిల్లు చేర్చితిమి. మొదట మే మాయనను గుఱించి భీతిల్లితిమి గాని, కొలఁదిరోజులలోనే యాయనకు నెమ్మది కలిగెను.

మా కెచటనైన పెద్దయప్పు లభించినచో, చిల్లరబాకీలన్నియును దీర్చివేయుద మనుకొంటిమి. రాజమంద్రిన్యాయవాదులు మోచర్ల రామచంద్రరావుగారు తమ బావమఱఁదితో బాగుగ నాలోచించుకొని, నూటికి 12 అణాలు వడ్డీచొప్పున నొక వేయిరూపాయిలు మా నివేశన స్థలముల తనఖామీఁద మా కప్పిచ్చుటకు సమ్మతించిరి. 31 వ మేయి తేదీని మే మంత రామచంద్రరావుగారికి దస్తావేజు వ్రాసి రిజిస్టరు చేయించి, సొమ్ము పుచ్చుకొని, చిన్న యప్పులు తీర్చి, పెద్దఋణదాతలకుఁ గొంచెము కొంచెముగఁ జెల్లించితిమి.

17 వ జూను తేదీ దినచర్యయందు నే నిట్లు లిఖించితిని : - "తమ్మునితో పెద్దబజారు వెళ్లి, అతనిభార్య కీనాఁడు రెండుచీరలు కొంటిని. ఆమె యిదివఱకు రెండుకోకలతోనే గడపుకొనుచుండెనఁట! మాయమ్మకు నన్ను గుఱించి దురభిప్రాయములు గలవు. సంసార వ్యవహారములు నాకు నచ్చుచుండలే దని యామె యపోహము ! సత్యము సర్వజ్ఞునికే యెఱుక!"

జూను 18, 19 తేదీలలో నేను వెంకటరామయ్యయును కొక్కొండ వేంకటరత్నము పంతులుగారి బసకుఁ బోయి, ఆయనతో దీర్ఘసంభాషణము చేసితిమి. అరుంధతినిగుఱించి యాయన కొన్ని వినోదకరములగు నంశములను మాకుఁ జెప్పెను. మే మచట నుండునపుడు, మొదటినాఁడు వారి పసిబిడ్డ యుయ్యెలనుండి క్రిందఁ బడి పోయెను. వేగమే వచ్చి బిడ్డను దీయు మని యాత్రమున భార్యను బిలుచునపుడైనను పంతులుగారు గ్రామ్యభాషాప్రయోగము చేయకుండుట మా కాశ్చర్యమును గొలిపెను. !

ఓరియంటలు భీమాసంఘమువారు, మాతమ్ముఁడు వెంకటరామయ్యవలనఁ గొంచె మదనముగ సొమ్ము పుచ్చుకొని, భీమా కంగీకరించుటకు సంతోషించితిమి.

20 వ జూను తేదీని వస్తుఇవులను సరదికొని, భార్యతో నేను బెజవాడ బయలుదేఱితిమి. మాతల్లి మితభాషిణిగ నుండి, మేము ప్రయాణము చేయుటకుఁ గోపించెను ! రాత్రికి బెజవాడ చేరితిమి. పూర్వపు ప్రధానోపాధ్యాయుఁడు వెడలిపోవుటచేత, నాకుఁ బిమ్మటి సహాయాధ్యాపకులగు జాను కల్యాణరామయ్యగారు క్రైస్తవు లగుటచేత నిపుడు అగ్రస్థాన మలంకరించిరి.

22 వ తేది దినచర్యయం దిట్లున్నది : - "క్లార్కుదొర పాఠశాలకు వచ్చెను. 'నాతో మాట్లాడుటకు మీ కవకాశ మిచ్చెదనుఁ అని నా కభయహస్త మిచ్చినటు లాయన సెలవిచ్చిరి ! ఈశ్వరసేవకుల మని చెప్పుకొనువారివైఖరి యిట్టిది. ఈ పాఠశాలలో లెక్కలే నన్ని లోపములు కష్టములు నున్నవి ! దీని కీయన యజమాని. ఇట్లయ్యును, పాఠశాలలోఁగల చిన్నలోపములను గుఱించియైన నడుగుట కీమహనీయునికిఁ దోఁచదు, తీఱదు ! దైవమా యేమని చెప్పను !"

41. క్రొత్త హరికథలు

ఇదివఱకు నేను "హిందూసుందరీమణు" లను పేరుతో సీత సావిత్రి మున్నగు నేడుగురు సుదతుల కథలు వ్రాసితిని. ఇంకను ప్రాచీనకాలసుందరు లనేకులు కలరు. కొలఁదిదినములక్రిందట నేను రాజమంద్రిలో నుండునపుడు వెంకటరత్నముపంతులుగారు అరుంధతి మున్నగు స్త్రీలనుగుఱించి నాకుఁ జెప్పిరి. నామిత్రు కామశాస్త్రిగారిటీవల "కాదంబరీసారసంగ్రహము"ను రచియించి, అందలి మహాశ్వేతనుగుఱించి సూచించిరి. కావున నేను "జనానాపత్రిక" లో "హిందూసుందరీమణుల" రెండవభాగమును వ్రాయ నారంభించితిని.

ఆకాలమున బెజవాడలో కొంచెముసేపు రెయిళ్లు ఆఁగుచు వచ్చుటచేత, తమకుఁ గొంచెము అన్నము పంపు మని స్నేహితులు తఱచుగ నాకు వ్రాయుచు వచ్చిరి. 3 వ జూలయిని వీరేశలింగముగారు వచ్చుచుంటినని వ్రాసిరి. కాని, యానాఁడు బండి యాలస్యముగ వచ్చుటచేత నేను పాఠశాలకు వెళ్లి పోయితిని. స్నేహితులు వారిని గలసికొనిరి. మఱునాఁడు ప్రణతార్తిహర అయ్యరుగారు మద్రాసు నుండి రాజమంద్రి వైపునకుఁ బోవుచు, ఐదుగురికి అన్నము పంపుఁడని నాకు వ్రాయఁగా, ఒక బ్రాహ్మణవిద్యార్థిచే నన్నము పంపితిని. కాని యతఁ డాలస్యముగ వెళ్లుటచేత, వారు నిరాహారులై